‘ఒపీనియన్స్ చేంజ్’ అన్నాడు గిరీశం. అంటే
అభిప్రాయాలు మారుతుంటాయి అనో, మారేవే అభిప్రాయలనో అర్ధం చెప్పుకోవచ్చు.
అలాగే ఇప్పుడు ఈ రాత్రి పదకొండు గంటల వేళ నా
అభిప్రాయం కొంత మార్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఓ ఫేస్ బుక్ మిత్రుడు
దీపావళికి, వినాయక చతుర్ధికి హైదరాబాదులో వుండబుద్ది కావడం లేదనీ, ధ్వని కాలుష్యం
భరించరానిదిగా తయారవుతోందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో ఏకీవభించకుండా వుండడానికి
కారణం ఏదీ కనబడలేదు.
‘లైక్’ కొట్టి ఆయనకు సంఘీభావం తెలపాలనుకున్న
సమయంలో కరెంటు పోవడం, కాసేపు నెట్ విరామం ప్రకటించడం జరిగింది.
ఈలోగా పక్కింటి చిన్నారి అలేజా గబగబా లోపలకి
వచ్చి వచ్చీరాని భాషలో ‘గనేస్ గనేస్’ అనడం
మొదలు పెట్టింది. వాళ్ల నాన్న తాజుద్దీన్
అనుకుంటాను (మా ఫ్లాట్లో నా పీఆర్ అలా తగలడింది. పక్కవాళ్ళ పేర్లే తెలియవు) వచ్చి ఆ
పిల్లను తీసుకువెళ్ళాడు. ఆ తరువాత మా ఆవిడ నాకు చెప్పిన విషయం ఏమిటంటే టాంక్ బండ్
దగ్గర గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పిల్లలకు చూపించడానికి ఆ కుటుంబం అంతా కలసి వెళ్లారట.
అలా వెళ్ళిన వాళ్ళలో ఏడుపదులు దాటిన వాళ్ల అమ్మ కూడా వుందట.
ఇంకా నయం. తొందరపడ్డాను కాదు.
ప్రతిదాంట్లో కూడా ఏదో కనబడని మంచిదాగేవుంటుంది. ఏమంటారు?
(18-09-2013, 11 PM)