20, మే 2023, శనివారం

ఒకటోసారి..రెండోస్సారి.. మ్మూడోస్సారి... భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 20-05-2023, Saturday)

 

1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.

ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.

జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందనిఅందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనిఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.

ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులుప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.

అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.

భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.

సాధారణంగా అవినీతిఅక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం. పిచ్చి పిచ్చిగా డబ్బు పోగేసుకున్న  ఖామందులవాళ్ళు  నల్ల డబ్బు దాచుకునే మార్గాలు వేరే ఉంటాయని ఆయన మనోగతం కావచ్చు.

నల్ల డబ్బును సూట్ కేసుల్లోదిండ్లకవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.

ఇది జరిగి  45 ఏళ్ళు అవుతోంది.

2016, నవంబరు,8, న్యూ ఢిల్లీ

ఆ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్ ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీసరిహద్దులలో తీవ్రత గురించిన అంశం కానీ ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియోదూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు సయితం సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారనిఅప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. ఈ విషయంలో గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీచాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.

నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనిరిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడంఆమోదించడంఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.

ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనేదాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాముకష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.

గతంలో నాటి జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత పెద్ద నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.

ఇప్పుడు, అంటే తాజాగా కొద్ది సేపటి క్రితమే  మ్మూడో స్సారి.

రెండువేల రూపాయల నోట్లకు మంగళం!

కాకపొతే ప్రకటన బాధ్యత ఈసారి రిజర్వ్ బ్యాంక్ కు అప్పగించారు.

NOTE: Courtesy Image Owner)



19-05-2023

 

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

వద్దంట నోట్లు రెండ్వే
లద్దానికి నామమంట! లబలబ యంచున్
పెద్ద తలలింక బ్యాంకుల
వద్ద వరుస నిలబడుదురొ వడదెబ్బలతో :)

అజ్ఞాత చెప్పారు...

Demonetisation of 500 and 1000 notes was a failure. Introduction of 2000 note was a blunder.