11, ఏప్రిల్ 2023, మంగళవారం

సినిమా రివ్యూ కాదు – భండారు శ్రీనివాసరావు

 

ఈ మధ్య ఒక లాయరు మిత్రుడు నాతొ మాట్లాడుతూ విశాఖ కేసు విషయం ప్రస్తావించాడు. విశాఖ అంటే విశాఖపట్నం కాదు. ఒక స్వచ్చంద వేదిక. నేపధ్యం రాజస్తాన్. కధాకాలం 1992. అంటే మూడు దశాబ్దాల పైమాట. ఒక బాల్య వివాహం ఆపడానికి ప్రయత్నించిన భన్వరీదేవి అనే ఒక రాజస్థానీ మహిళను స్థానిక అగ్ర కులస్తులు పగబట్టి ఆమెను మూకుమ్మడి మానభంగం చేస్తారు. షరా మామూలుగానే ఆ కేసు కింది కోర్టుల్లో తిరస్కరణకు గురవుతుంది. విశాఖ అనే స్వచ్చంద వేదిక నేతృత్వంలో అనేక మహిళా సంఘాలు ఏకమై న్యాయ పోరాటం సాగిస్తాయి. చివరకు 1997 ఆగస్టు 13 వ తేదీన దేశపు అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ప్రకటిస్తుంది. పని ప్రదేశాల్లో ఆడవారిపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శిక సూత్రాలను ఆ తీర్పులో వెలువరించింది. చారిత్రాత్మక తీర్పు అనడానికి ఒక కారణం వుంది. విషయంలోని తీవ్రతను గుర్తించిన న్యాయమూర్తులు తీర్పు చివర ఒక ఆదేశాన్ని జారీ చేశారు. సాధారణంగా కోర్టులు తీర్పులు ఇస్తూ అందుకు తగిన శాసనాలను రూపొందించాలని ప్రభుత్వాలకు సూచిస్తాయి. ఈ కేసులో సుప్రీం విభిన్నమైన ఆదేశాన్ని జారీచేసింది. తగిన చట్టం రూపొందించేవరకు సుప్రీం జారీ చేసిన ఈ మార్గదర్శిక సూత్రాలకు చట్ట బద్ధత ఉంటుందని, చట్టాన్ని అమలుచేసినట్టుగానే వాటిని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేయాలని ఉత్తర్వు ఇస్తుంది. ఇది ఒక పెద్ద విశేషం.

అయితే, కేంద్రం మాత్రం తనకు సరిపడా సమయం తీసుకుని సుప్రీం సూచనలకు అనుగుణమైన చట్టాన్ని ఆ తరువాత నాలుగేళ్ళకు (2013) రూపొందించి అమల్లోకి తెచ్చింది.

చాలా పకడ్బందీగా తయారుచేసిన ఈ చట్టం కనుక తుచ తప్పకుండా అమలుకు నోచుకుని వుంటే దేశంలో అసహాయులైన మహిళల పరిస్తితి మరింత మెరుగుపడి వుండేదేమో!

(11-04-2023)

కామెంట్‌లు లేవు: