26, అక్టోబర్ 2020, సోమవారం

రెండు రెళ్ళు యాభయ్ - భండారు శ్రీనివాసరావు

 ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి రచనా వ్యాసంగానికి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్నా, ఈరోజూ ప్రసారం అయిన సాక్షి టీవీ వారి కార్యక్రమాన్ని చాలా మంది చూసారు. నిజానికి మల్లాది  గారి గురించి అందులో వెల్లడించిన చాలా విషయాలు ఒకనాటి తరంలో చాలామందికి తెలిసినవే. కాకపొతే ఆయన ఎలా ఉంటారో చూద్దామనే ఆసక్తితో అనేకమంది ఆ కార్యక్రమం చూసారు. ఫేస్  బుక్ పాఠకులలో ఒకరి వ్యాఖ్య సందర్భోచితంగా వుంది. ‘పాండవులు లేని మాయాబజార్ సినిమాలా వుంద’ని ఆయన అన్నారు. నిజమే అనిపించింది.

ఈ యాభయ్ ఏళ్ళలో మల్లాది వారు అనేక సభల్లో పాల్గొని వుంటారు. కానీ ఆయన ఫోటో మాత్రం  ఏ పత్రికలోనూ రాలేదు. (అలా సకృత్తుగా నా కంట పడిన ఫోటో ఒకదాన్ని నేను నా బ్లాగులో ఒకసారి  పోస్టు చేస్తే అప్పుడు అమెరికాలో వున్న మల్లాది గారు  నాకు మెసేజ్ పెట్టారు, దాన్ని వెంటనే తొలగించమని)

అలాగే  ఒకమారు, ఏదో ఇంటర్వ్యూలో యండమూరి వారినీ ఆయననూ కలిపి చూపించాల్సి వస్తే యండమూరి ఫోటో పక్కన మల్లాది వెంకట కృష్ణ మూర్తి అని ఆయన పేరు  రాసి వున్న పుస్తకం కవర్ పేజీని  పెట్టి చూపించారు.

ఇక సాక్షి కార్యక్రమంలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే మల్లాది గారి గురించి  సముచిత గౌరవంతో వ్యక్తం చేసిన యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిప్రాయంతో  కూడిన  వీడియో బిట్ చూపించారు. ఆయన చెప్పిన పలుకులు కూడా సాటి రచయిత పట్ల ఆయనకున్న ఆప్యాయతను, సద్భావాన్ని ప్రతిఫలించాయి. అంతే కాదు, తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా హృదయం విప్పి చెప్పిన అనుభూతిని  మిగిలించాయి.

మల్లాది గారెని చూపిస్తారేమో అనే ఆశతో ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి నిరాశే మిగిలింది.

నిజానికి ఈ పోస్టు నిన్ననే రాశాను. కానీ ఈరోజు రిపీట్ టెలికాస్ట్ వున్న కారణంగా కొద్దిగా ఆలస్యంగా పోస్టు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కనబడరు అని ముందే తెలిస్తే  చూసేవారు తగ్గిపోతారు కాబట్టి. 



 (26-10-2020)

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “.... ముందే తెలిస్తే చూసేవారు తగ్గిపోతారు కాబట్టి” //

టీవీ ఛానెళ్ళ బాగోగులంటే మీకు చాలా అభిమానంలా ఉందే??🙂

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు గారు : నా ప్రేమ టీవీల మీద కాదు.కేవలం ఆయన్ని చూడడం కోసం ప్రోగ్రాం చూద్దామనుకునే వారి ఆసక్తి మీద నీళ్ళు చల్లడం ఇష్టం లేక.

SD చెప్పారు...

ఫోటో దాచిపెట్టి ఆయన ఏమి సాధించారో తెలియదు కానీ, చక్రపాణి గారు అన్న ఒక ముక్క గుర్తుకొస్తోంది.

"ఈ సినిమాలో ఎన్టీవోడికి భలే మేక్ అప్ జేసారు. అసలు ఎన్టీవోడు అంటేనే గుర్తు పట్టరు జనం."

దీనికి చక్రపాణిగారి సమాధానం. "ఎన్టీవోణ్ణి చూడ్డానికి, ఆడి సినినా చూడ్డానికీ జనం వస్తారు సినిమాకి. ఆణ్ణి గుర్తుపట్టలేకపోతే సినిమా తీయడం ఎందుకు?"

ఇన్నేళ్ళు ఆయన రాసిన పుస్తకాలు చదివాక మనిషిని చూడకపోతే ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే. అంత "మల్లాది వెంకట కృష్ణమూర్తి' అనే పేరు మానేసి మావే అని రాసినా వేమా అని రాసినా, అనామిక అని రాసినా ఒకటే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Well said, DG గారు.