21, జులై 2020, మంగళవారం

నేను చదివిన పుస్తకం ‘నాలో...నాతో... YSR’ – భండారు శ్రీనివాసరావు

ఇది పుస్తక సమీక్ష కాదు. నేను చదివిన పుస్తకంలోని కొన్ని ముచ్చట్లు. అంతే!

ఆవల తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ రాజకీయమయమే. ప్రతి చిన్న విషయాన్ని కొందరు ఆ కోణం నుంచే చూడడం అలవాటు చేసుకున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక మహిళా జర్నలిస్టు ఎక్కడో ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చి, హైదరాబాదులో మకాము పెట్టి ఆయనతో పలుమార్లు భేటీలు జరిపి  ఆయన మీద ఇంగ్లీష్ లో ఒక పుస్తకం ( Plain Speaking అనే పేరుతొ కాబోలు) రాశారు. అలాగే, ప్రముఖ సంపాదకులు శ్రీ ఐ. వెంకట్రావు ‘ఒక్కడు’ అనే పేరుతో చంద్రబాబు గురించి ఓ గ్రంధం రచించారు. ఆ రోజుల్లో వాటి గురించి పత్రికల్లో సమీక్షలు వచ్చాయి. చంద్రబాబు అభిమానులు, బాబు వ్యతిరేకులు వాటిని తమ దృష్టితోనే స్వీకరించారు కానీ స్వేచ్చగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సోషల్ ప్లాటుఫారాలు, ఈ సాంఘిక మాధ్యమాలు అప్పట్లో ఉండేవి కావు. ఇప్పుడు  సమీక్షలు సరే, పుస్తకం విడుదల కాగానే అభిప్రాయాలు ఇబ్బడిముబ్బడిగా సాంఘిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. తన కొడుకు గురించీ, మొగుడు గురించీ ఒకావిడ రాసిన పుస్తకంలో ఏముంటాయి వాళ్ళని గురించిన పొగడ్తలు తప్ప అనే కామెంట్లు వినపడ్డాయి. అలాగే వారి ప్రత్యర్ధి పక్షం వాళ్ళు పుస్తకం చదవాలనే ఆకాంక్షతో పోస్టులు పెట్టారు.     

సమాజంలో ఏ వ్యక్తి గురించి అయినా ఆయన భార్యకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదు. అంచేత భార్యలు తమ భర్తల గురించి రాసే రచనల్లో అసమగ్రతకు అవకాశం తక్కువ. సాధికారతకు అవకాశం ఎక్కువ. ఆ రీత్యా చూస్తే శ్రీమతి వై.ఎస్. విజయమ్మ(వాస్తవానికి పుస్తకం ముఖచిత్రం మీద రచయిత్రి పేరు వైయస్ విజయ రాజశేఖరరెడ్డి అని ముద్రించారు. వారి వివాహ శుభలేఖలో విజయమ్మ పేరు రాజేశ్వరి అని వేశారు. జాతకాల్లో గణాలేవో సరిపోలేదని తమ పేరును రాజేశ్వరిగా మార్చారని, అందుకే వెడ్డింగ్ కార్డులో విజయలక్ష్మి అని ఉండదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఆ పేరుతొ నన్నెవ్వరూ, ఎప్పుడూ పిలవలేదని కూడా వెల్లడించారు) భర్త  వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురించి రాసిన ‘నాలో...నాతో... YSR’ అనే గ్రంధం అత్యంత సమగ్రంగా, వాస్తవాలకు అతి దగ్గరగా  వుంది.  రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా గమనించగలిగిన జీవన సహచరిగా శ్రీమతి విజయమ్మ ఆయన గురించి తన మనసులోని భావాలకు అందంగా, హృద్యంగా, ఒక్కోచోట హృదయం ద్రవించే విధంగా అక్షరరూపం ఇవ్వడంలో సఫలీకృతం అయ్యారు. దీనికి తగ్గట్టు ప్రచురించింది ఎమెస్కో కావడం మూలాన పుస్తక స్వరూపం కూడా వైభవంగా రూపుదిద్దుకుంది. (ఒక మాట చెప్పాలి. ఖరీదైన (నాలుగు వందల రూపాయలు) చాలా అందంగా ఆర్టు పేపరు మీద రంగురంగుల ఫొటోలతో బాగా ముద్రించారు. కాఫీ టేబుల్ బుక్  కావడం వల్ల డ్రాయింగు రూములో అందంగా అమర్చుకోవడానికి వీలుగా వుంది కానీ ఆసాంతం ఒక్కసారి చదవాలని అనిపించినా అది సాధ్యం కాని పని. ఈ పుస్తకంపట్ల రగిలిన ఆసక్తి గమనిస్తే ఎమెస్కో వారికి ఓ సూచన చేయాలనీ అనిపిస్తోంది. మామూలు సైజులో దీన్ని ఒక పుస్తకంగా తీసుకువస్తే చాలామంది కొనుక్కుని చదవడానికి (పేజీలు  తిరగేస్తూ చూడడానికి కాదు) వీలుంటుంది. ఎమెస్కో విజయ కుమార్ గారు తలచుకుంటే వాళ్ళకు ఇదో లెక్క కాదు.

పుస్తకం గురించి మరో పోస్టులో.  .

'నాలో.. నాతో.. వై.ఎస్.ఆర్.' పుస్తకం గురించి నా అభిప్రాయం సాక్షి టీవీలో నిన్నా, ఈరోజు ప్రసారం అయింది. కింది లింక్ ఈ ఉదయం ప్రసారం చేసింది. కొద్ది  సెకన్ల తర్వాత నా బైట్ మొదలవుతుంది

https://youtu.be/jSx1zUgVKpU
No photo description available.



కామెంట్‌లు లేవు: