14, ఏప్రిల్ 2020, మంగళవారం

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం


రెండు సంఘటనలు చెప్పుకుందాం.
2018 ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ  డాక్టరు తన పేషెంటుతో   చెబుతున్నాడు.
‘మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’
‘సరే కానీ డాక్టర్! ఐ వాంట్ టు డై ఎట్ మై హోమ్. ప్లీజ్ డిశ్చార్జ్’
ఆ పేషెంటు కూడా డాక్టరే. మా అక్కయ్య కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు.
పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.
ఇక రెండోది.
మా దగ్గరి బంధువును హైదరాబాదులోని ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. వారిది ఈ ఊరు కాదు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. రెండు రోజులు గడిస్తే కాని చెప్పలేమన్నారు. ‘ఒక టెస్ట్ చేయించాలి, అదిక్కడ లేదు, బయట వాళ్ళు చేస్తారు, ఏడు వేలు అవుతుంది, ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన వాడికి ఏడు వేలు ఇవ్వండి’ అని చెప్పారు ఆసుపత్రివాళ్ళు. ఆ టెస్ట్ చేయించారు. డబ్బు చెల్లించారు. గంటలు గడవక ముందే ఆ పేషెంటు కన్ను మూసింది. ఆసుపత్రి ఫీజులన్నీ ముందే కట్టేశారు కనుక డిశ్చార్జ్ కి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంతలో వాళ్లకు అంతకు ఒక రోజు ముందు చేయించిన టెస్ట్ జ్ఞాపకం వచ్చి అడిగారు. ఆ రిజల్ట్ అయిదు రోజులకు వస్తుంది అని జవాబు.
‘రెండు రోజులు గడవటం కష్టం’ అని చెప్పిన వాళ్ళు అయిదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చే టెస్ట్, అదీ ఆసుపత్రి వెలుపల వాళ్ళ చేత చేయించడం ఏమిటో అర్ధం కాని స్తితిలోనే వాళ్ళు పేషెంటు బాడీ తీసుకుని  ఊరికి వెళ్ళిపోయారు.   
చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే ఇటువంటి వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.
ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.
రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదుఅన్నది ఆ పాఠం.
నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’  ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.
అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ  పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి,  ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.

ఏప్రిల్ పదిహేను ఆయన వర్ధంతి.   



(డాక్టర్  ఏపీ రంగారావుతో నేను)
   


2 కామెంట్‌లు:

బుచికి చెప్పారు...

Noble soul sir 🙏

శరత్ కాలమ్ చెప్పారు...

చక్కటి వ్యక్తి గురించి చెప్పారు - ధన్యవాదాలు.