18, ఏప్రిల్ 2020, శనివారం

రజ్జుసర్ప భ్రాంతి – భండారు శ్రీనివాసరావు

తాడును చూసి పాము అని భ్రమించడం వల్ల చిక్కేమీ వుండదు కానీ పామును తాడు అనుకుని పట్టుకుంటేనే ప్రమాదం.
దేవరకొండ ప్రసాద్ ఆయన ఫేస్ బుక్ లో స్నేహితుడు మాత్రమే కాదు, విజయవాడ సీవీఆర్ స్కూల్లో క్లాస్ మేట్ కూడా. నాలాగే పదవీవిరమణ అనంతరం విశ్రాంత జీవనం గడుపుతూ, ఫేస్ బుక్ లో తన పోస్టింగులతో మంచి స్నేహబృందాన్ని తయారు చేసుకున్నారు. చేసింది బ్యాంకు ఉద్యోగం. అయినా సమకాలీన సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. వీరి తమ్ముడు దేవరకొండ మురళి కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు నా చిన్ననాటి స్నేహితుడు.
ఈ ప్రసాద్ దేవరకొండ ఈ రోజు మధ్యాన్నం రెండున్నర ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టారు. అదేమిటంటే:
“బీజేపీ లీడర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డిగారిని AP పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేసారు. ఎందుకు చేసారో తెలియదు. అయన పాపం చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సీఎం గారికి మద్దతుగా TV డిబేట్లలో మద్దతుగా మాట్లాడేవాడు. అలాగే సోము వీర్రాజుగారు, విష్ణు కుమార్రాజుగారు, కూడా మంచి మద్దతుదారులు. GVL గారయితే సీఎం గారికి ఏ చిన్నసమస్య వొచ్చిన AP లో వాలిపోయి TV ల్లో మద్దతుగా మాట్లాడేవారు. రాజధాని మార్పుకి మద్దతు ప్రకటించారు. CM గారు ఇవి దృష్టిలో ఉంచుకుని విష్ణువర్ధన్రెడ్డి గారిని విడుదల చేయగలరని ఆశిస్తున్నాను”
నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
విష్ణువర్ధన రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖుడు. ఆయనకు కేంద్రంలో డిప్యూటి మంత్రి హోదా కలిగిన నెహ్రూ యువక కేంద్రం ఉపాధ్యక్ష పదవి వుంది. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాదులో అరెస్టు చేయడం ఏమిటి అని.
విష్ణువర్ధనరెడ్డి గారికి ఫోన్ మెసేజ్ పెట్టాను. ఆయన తిరిగి కాల్ చేశారు. విషయం చెప్పి వివరణ అడిగితే ఆయన చిన్నగా నవ్వారు.
‘విష్ణువర్ధన రెడ్డి అరెస్టు నిజమే. కానీ ఆ విష్ణువర్ధనరెడ్డిని నేను కాదు’ అంటూ విషయం చెప్పుకొచ్చారు.
మెదక్ జిల్లాకు చెందిన ఒక విష్ణువర్ధన రెడ్డి మాజీ పైలట్. కాణిపాకం దేవాలయంలోకి చెప్పులతో జనాన్ని అనుమతిస్తున్నారని ఒక సెల్ఫీవీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
అయితే ఆయన పొరబాటు పడి అతిగా స్పందించారు. కాణిపాకం దేవాలయానికి చెందిన కొన్ని గదుల్లో కరొనా క్వారంటైన్ నడుపుతున్నారు. ఆయన కాణిపాకం దేవాలయంలోనే అదంతా జరుగుతోందని అర్ధం వచ్చేట్టు వీడియో పోస్ట్ చేసారు. దీనిపై ఏపీ పోలీసులు స్పందించి ఆయన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో విషయం ఏమిటంటే కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి బీజేవైఎం అద్యక్షులు రెడ్డి గారు అనంతపురంలోనే వుండిపోయారు.
ఇద్దరి పేర్లు ఒకటే కనుక ప్రసాద్ పొరపడి ఉండవచ్చు. కానీ ఆయన పోస్టు చదివిన వారికి వేరే భావన కూడా కలుగుతుంది. అక్కడ అరెస్టు కంటే ఏపీ ప్రభుత్వం పై తనకున్న వైమనస్య భావమే అందులో ద్యోతక మవుతుంది. అంతేకాకుండా ఏపీ బీజేపీ నాయకుల్లో కొందరి పేర్లను ఉదహరిస్తూ వారంతా జగన్ అనుకూలురు అనే అభిప్రాయం వచ్చేలా ఆ పోస్ట్ వుంది.
నిజానికి దీనిపై ఇంత వివరణ అవసరం లేదు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయింది నా క్లాస్మేట్. కాబట్టి ఇంతగా రాయాల్సి వచ్చింది.
రాజకీయ పరిస్తితులు ఉద్రిక్తంగా వున్నప్పుడు ప్రతిదీ వివాదాస్పదమే అవుతుంది. పెళ్లి పుస్తకం సినిమాలో ముళ్ళపూడి వారన్నట్టు, అపార్ధాలు ముసురుకున్నప్పుడు సీతా అన్నా బూతుగా వినిపిస్తుంది. అందుకే జాగ్రత్త అవసరం. నాకు ఇలాంటి వార్తలు తెలిసినా తొందరపడి పోస్ట్ చేయను. నా సోర్సుల ద్వారా నిర్ధారించుకుంటాను. ఈ వెసులుబాటు అందరికీ ఉండకపోవచ్చు. అటువంటప్పుడు తెలిసిన వాళ్ళను సంప్రదించాలి. ఈ లోగా కొంపలు మునిగేది ఏమీ వుండదు. రాజకీయ పార్టీల వాళ్ళంటే అది వేరే సంగతి. చిక్కుల్లో చిక్కుకోవడం వారికి తెలుసు. బయటకు రావడం వారికి తెలుసు.
ఈ విషయం నా స్నేహబృందంలోని ప్రసాద్ వంటి వాళ్ళు తెలుసుకోవాలి.

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



మీ ఈ పోస్టు ఆ ప్రసాద్ గారెవరో మురళీ గారెవరో తెలియని వారికి కూడా తెలియ చేసేటట్టయ్యింది :)



జిలేబి

Zilebi చెప్పారు...



BTW, the man belongs to siddipet


https://www.thehindu.com/news/national/andhra-pradesh/siddipet-man-held-on-charge-of-spreading-rumours-against-kanipakam-temple/article31350525.ece