26, ఏప్రిల్ 2020, ఆదివారం

మార్పు చూడని కళ్ళు (రెండో భాగం)



చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్

నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్నప్పుడు సోవియట్ అధినాయకుడిగా  గోర్భచేవ్ ఒక వెలుగు వెలిగారు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆ రోజుల్లో  టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికలలో వచ్చేది. సోవియట్ యూనియన్ లో ఆయన ప్రారంభించిన ఆర్ధిక, రాజకీయ ప్రయోగాలతో పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగుతుండేది. మీడియాలో అనుదినం కనబడాలనే చాపల్యం ఆయనకున్న బలహీనతల్లో ఒకటని చెవులు కొరుక్కునేవారు.
అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని  ఆయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన  బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర  ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన  వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి  బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా  నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్యం ముఠాలుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు.  గోర్భచెవ్  ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి  పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో  ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు  అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం,  అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం  చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా  జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి  అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి  వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“పత్రికను ఎలా నడపాలి? నడపడానికి ఏం చెయ్యాలి” అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి  ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం  ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల  డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి  వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా  ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోను వుంది.
“అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతో. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యంఎప్పటికీ  మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో భద్రంగా వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారంటే  కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆసుపత్రిలో వుంటే యాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
(ఇంకా వుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీడియాలో అనుదినం కనబడాలనే చాపల్యం ఆయనకున్న బలహీనతల్లో ఒకటి - ఎవరో వారెవరో.