8, సెప్టెంబర్ 2016, గురువారం

నవ్వుకుందాం రండి



“నేనొక లక్ష రూపాయలు కన్నయ్య లాల్ కి ఇద్దామని అనుకుంటున్నాను. మరి మీ సంగతి ఏమిటి”
అంటూ భార్యాబిడ్డల వైపు చూశాడు ఏకాంబరం.
అతగాడు ఏమంటున్నాడో వాళ్లకు ఓ పట్టాన అర్ధం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఈనెల ఇంటి అద్దే ఇంకా కట్టలేదు. లక్ష రూపాయలుట,  ఎవడో ముక్కూ మొహం తెలియని వాడికి ఇస్తాను అంటున్నాడు అంటే అర్ధం ఏమిటి? పైగా మీ సంగతేమిటి అంటూ నొక్కుళ్ళు కూడా.
భార్యాపిల్లలకు తాను  చెబుతున్నది అర్ధం కాకపోగా ఏవేవో ఊహించుకుంటూ అపార్ధాల సీనులోకి వెళ్లి పోతున్నారని అర్ధం చేసుకున్న ఏకాంబరం విలాసంగా ఓ నవ్వు నవ్వి అప్పటివరకు చదువుతున్న దిన పత్రికను వారి వైపు విసిరాడు.

అందులో ఇలా వుంది.
“రూ. 15 లక్షల హామీపై సమాధానమివ్వనున్న పీఎంవో. ఈనాడు,దిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. లక్షల చొప్పున జమచేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానంపై సమాధానం ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సన్నద్దమవుతోంది. రాజస్థాన్  కు చెందిన కన్నయ్య లాల్ అనే దరఖాస్తుదారుడు పెట్టుకున్న అర్జీపై కేంద్ర సమాచార కమీషన్ స్పందించింది. మోదీ ప్రధాన మంత్రి అయి రెండేళ్ళు గడిచినందువల్ల ఆ హామీకి ఏమయిందో తెలపాలనీ, తన ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో చెప్పాలనీ కన్నయ్య లాల్  కోరాడు”

ఆ వార్తలో ఇంకా ఏదేదో రాశారు కానీ, ఏకాంబరం వున్నట్టుండి కన్నయ్య లాల్  ప్రసక్తి ఎందుకు  తెచ్చాడో అర్ధం అయి హాయిగా నవ్వుకున్నారు.               

4 కామెంట్‌లు:

sarma చెప్పారు...

:)

Zilebi చెప్పారు...



మస్తుగ వస్తుంది జబ
ర్దస్తుగ డబ్బులు జిలేబి రయ్యన వాటా
బిస్తరు పరిచెన్ స్విస్సుల
కుస్తీ లెక్ఖలను నమ్మి కోకను వదిలెన్ :)


జిలేబి

అజ్ఞాత చెప్పారు...

ఆయనికి ప్రజా ధనంతో దేశాలు తిరగడానికే టైం లేదు పాపం. ఇంకా నల్ల ధనం, రేప్ లూ, ఆంధ్రా ప్రత్యేక పేకేజీ అని అడిగి ఇరుకున బెడితే ఎలా? అయిదేళ్ళు పోయాక గద్దె దింపితే నేను ఇన్ని దేశాలు చూసానోయ్ అని చెప్పుకోవద్దూ? అదీగాక తన స్వంత ఊరులోనే నిర్భయలూ, ఈరోజు వార్త ప్రకారం ఆఖరికి వైద్యులు కూడా రేప్ లు చేయబడుతూ/చేస్తూంటే చూడ్డానికి సమయం లేదు అయ్యగారికి. ఉత్తినే కంగారు పెట్టేయకండి. వీలు చూసుకుని అన్ని పనులూ చక్కబెడతారు. అయినా భారద్దేశం అంత త్వరగా మారుతుందా మీ వెర్రిగానీ, ముందు ముందు రాబోయే మహా యుగానికి స్వఛ్ఛ భారత్తూ, ఆ పై మన్వంతరంలో నల్ల ధనం సంగతీ, ఆ తర్వాత బలి చక్రవర్తి ఇంద్రుడయ్యాక రేప్ లూ అవీ చూస్తారు. అప్పటి వరకూ ఆగలేకపోతే మీకే నష్టం. కోర్టులో కేసు వేస్తానంటే వేసుకోండి. అది తెమిలే సరికి అన్నీ సర్దుకుంటాయి.

అజ్ఞాత చెప్పారు...

మోడి మీద సెటైర్ లేసినంతవరకు చాల్లే శ్రీనివాసరావు గారు. ఇందిరా గాంధీ గరీబీ హటావో అనే ప్రామిస్ చేసింది. దేశం నుంచి పేదరికం పోగొట్టేసిందా? ఇంధిర గాంధి, ఆమే కుటుంబ సభ్యులు సోనియా దగ్గర లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఇన్నేళ్ళ మీ జర్నలిస్ట్ కెరీర్ లో కాంగ్రెస్ పార్టి అధికారం లో ఉన్నపుడు సోనియా గాంధీ నల్లధనం గురించి మీరొక్క రోజైనా మాట్లాడారా? రష్యా లో పని చేశారే, ఇంధిరకి,కమ్యునిస్ట్ పార్టి వాళ్ళకి రష్యా ప్రభుత్వం ఇచ్చిన కోట్ల సొమ్ము గురించి ఒక్క ఆర్టికల్ రాసారా?

సెటైర్లు ఎవరైయ్యాలో వాళ్ళేయ్యాలి. వాళ్ళకు దానికొక స్థాయి ఉండాలి. గాంధి కుటుంబ సుబ్రమణ్య స్వామి సెటైర్ వేస్తే ప్రజలు రెస్పాండ్ అవుతారు. మీరు మోడి మీద సెటైర్ వేస్తే వెనకచూపించి నవ్వుకొంటారు.