26, మే 2015, మంగళవారం

అది వార్త - ఇది వ్యాఖ్య


ఇది ఈ రోజు ఆంద్ర జ్యోతిలో పడ్డ వార్త:


మోదీ కోసం మూడు విమానాల దారి మళ్లింపు
ప్రధానమంత్రి మోదీ మధుర ర్యాలీలో పాల్గొని తిరిగి ఢిల్లీ వచ్చే సమయంలో ప్రధాని ప్రయాణం కోసం అధికారులు మూడు విమానాలను దారి మళ్ళించారని ఆ వార్త సారాంశం. మరి మనది ఇండియా కదా! ఇది చదివినప్పుడు ఓ పాత సంగతి గుర్తొచ్చింది. అదే వ్యాఖ్య
"ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ఎయిర్ ఫోర్స్ వన్విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం.
అది అమెరికా మరి. (26-05-2015)
(Photo Courtesy Andhra Jyothy)     


2 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

బాగుంది.

శ్యామలీయం చెప్పారు...

చాలా కాలం క్రిందటి సంగతి. అప్పట్లో ఇందిరాగాంధీగారు రాజ్యం చేస్తూ ఉండేవారు. వారు ఒక నాడు న్యూఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. విమానానికి కొంచెం సమయం ఉందేమో అని 'సూర్య' పత్రిక ఇమ్మని అడిగారు అధికారులని. ఆ పత్రిక కొత్తసంచిక ఇంకా విమానాశ్రయంలోని స్టాండ్లలో లేదు. అధికారులు నగరంలోనికి పరుగులు పెట్టారు. అదేమీ ప్రక్కవీధిలో ఉన్న విమానాశ్రయం కాదు కదా. నగరంలోనికి వెళ్ళటానికీ, మరల ఆ 'సూర్య' పత్రికతో ఇందిరమ్మగారి ముందు నిలవటానికి మధ్య గంటల సమయం పట్టింది. ఎన్ని గంటలో గుర్తులేదు. చదివి చాలా కాలం అయ్యింది కదా! విషయం ఏమిటంటే అమ్మగారు ఎక్కవలసిన విమానం బోలెడంత ఆలస్యంగా బయలు దేరక తప్పలేదు. ఎవరూ కిమ్మనలేదు - కిమ్మనలేరు కూడా.