17, నవంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (8) - భండారు శ్రీనివాసరావు

 


ప్రతి ఇంటికి ఒక ఇలవేలుపు ఉంటాడు. నాకు సంబంధించినంతవరకు మా ఇంటి ఇలవేలుపులు  ఇద్దరు. ఒకరు మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు. రెండోవారు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు.

పొతే, మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు  గారంటే నాకెంత గౌరవం వుందో అంతకుమించి రెట్టించిన  కోపం కూడా వుంది. (శ్రీరాముడి మీద భక్త రామదాసుకు కోపం వచ్చినట్టు. అది సభక్తిక ఆగ్రహం)

గౌరవం ఎందుకంటే ఆయన్ని  మించి  గౌరవించతగిన గొప్పవ్యక్తి  ఈ సమస్త భూప్రపంచంలో  నాకు మరొకరు ఎవ్వరూ లేరు. ఇక కోపం ఎందుకంటే, ఆయన బతికి వున్నప్పుడు ‘చెన్నా టు అన్నా’ అనే పుస్తకం రాస్తుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడు. మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పీఆర్వో ఆయనే. ఆ రోజుల్లో పీఆర్వో, అన్నా,  సీపీఆర్వో అన్నా,  ప్రెస్ సెక్రెటరీ అన్నా సమస్తం ఆయనే. తరువాత  అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆ తదుపరి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నందమూరి తారక రామారావు, ఇలా ఏకంగా వరుసగా అయిదుగురు ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆ పుస్తకం పేరు అలా పెట్టాడు.  కానీ రాయకుండానే దాటిపోయాడు.  అదీ నాకు కోపం.  ఆయన ధారణశక్తి అపూర్వం. ఒక విషయం విన్నా, చదివినా ఎన్నేళ్ళు అయినా మరచిపోడు. తారీఖులతో సహా గుర్తు. ఇక విషయం వివరించడంలో,  మా అన్నయ్య అనికాదుకానీ,  ఆయనకు ఆయనే సాటి.  ఇంగ్లీష్, తెలుగు భాషలు కొట్టిన పిండి. రాసినా, మాట్లాడినా అదో అద్భుతమైన శైలి. అన్నింటికీ  మించి వెలకట్టలేని నిబద్ధత. అలాటివాడు  అలాటి పుస్తకం రాశాడు అంటే గొప్పగా వుండి తీరుతుందనే నమ్మకం అందరిదీ. ఒక విషయం,  తమ్ముడిని  కాకపోయుంటే ఇంకా గొప్పగా పొగిడేవాడిని.

ఎందుకో ఏమిటో కారణం తెలవదు. గొప్ప ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఒంటి చేత్తో రాశాడు కానీ,  రాజకీయాల జోలికి వెళ్ళలేదు. నేల మీద చాప వేసుకుని కూర్చుని, కాగితాల బొత్తి తొడమీద పెట్టుకుని వందల, వేల పేజీలు   రాస్తూ పోయాడు. పైగా రాసినవన్నీ  రిఫరెన్సుకు పనికి వచ్చే గ్రంధాలు. కంప్యూటరు లేదు, ఇంటర్ నెట్ లేదు. టైప్ చేసేవాళ్ళు లేరు. ప్రూఫులు దిద్దేవాళ్ళు లేరు, ఎందుకంటే రాసిన విషయాలు అటువంటివి, పేర్కొన్న శ్లోకాలు అటువంటివి. తభావతు రాకూడదు, స్ఖాలిత్యాలు  వుండకూడదు. ఒంటిచేత్తో అన్నదందుకే.  నరసింహస్వామి తత్వం గురించి అవగాహన చేసుకుని రాయడానికి దేశంలో ఎక్కడెక్కడో వున్న నరసింహ క్షేత్రాలు  సందర్శించాడు. కోల్కతా, చెన్నై వంటి నగరాలలోని  గ్రంధాలయాల చుట్టూ తిరిగి రాసుకున్న నోట్స్ తో అద్భుత గ్రంధాలు వెలువరించాడు. ఏ ఒక్క పుస్తకాన్నీ అమ్ముకోలేదు. అటువంటి వాటిపట్ల మక్కువ వున్నవారికి ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరకమైన ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు.  బహుశా మానసికంగా ఒక స్థాయికి చేరిన తరువాత ఆయనకు ఈ పారలౌకిక  విషయాలు అన్నీ పనికిమాలినవిగా అనిపించాయేమో తెలవదు.

ఇప్పుడు ఇన్నాళ్ళకు అనిపిస్తోంది ఆయన చేసిన పని సబబేనని. ఏవుంది ఈ రాజకీయాల్లో. రాసింది ఒకళ్ళు మెచ్చుతారా, ఒకళ్ళు నచ్చుతారా! అందరూ గిరిగీసుకుని కూర్చున్నారు. ఒకరు మెచ్చింది మరొకరు నచ్చరు. తమ మనసులో వున్నదే రాయాలంటే ఇక రాయడం ఎందుకు? అసలు  ఇంత అసహనం ఎందుకో అర్ధం కాదు. ఈ స్థాయిలో రాజకీయ నాయకుల పట్ల, సినీ హీరోల మాదిరిగా అభిమాన దురభిమాన ప్రదర్శనలు ఎందుకోసం? రవ్వంత వ్యతిరేకత ధ్వనించినా సహించలేని పరిస్తితి. చరిత్ర తెలియాలంటే జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళు వుండాలి. వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు వుండాలి. అప్పుడే చరిత్ర, చరిత్రగా రికార్డు  అవుతుంది. కానీ ఈ ముక్కలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు. 

ఇవన్నీ చూస్తున్న తరువాత మళ్ళీ  మళ్ళీ అనిపిస్తోంది ఆయన రాజకీయం రాయకపోవడం రైటే అని.

అయితే, నేను ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు కొందరు ఇదే విషయం అడిగారు. నీ వృత్తి జీవితంలో పూర్ణభాగం రాజకీయులతో గడిచింది కదా! మరి నువ్వయితే ఏం చేస్తావ్ అని. ఓ పది, పదిహేనేళ్ల క్రితం ఇది మొదలు పెట్టి వుంటే, నిస్సంకోచంగా వున్నది వున్నట్టు రాసేవాడిని. ఈనాడు, మారిన పరిస్థితుల్లో నేనే కాదు, నిజాయితీతో పనిచేసే ఏ జర్నలిస్టుకు ఈ అవకాశం లేదు. విరుచుకుపడడానికి అన్ని పక్షాల వారు ఎప్పుడు కాచుకునే వుంటారు. వారి నుంచి కాచుకోవడం ఎలా అన్నదే పెద్ద టాస్క్.  తెలుగు రాజకీయాలను గురించి అన్ టోల్డ్ స్టోరీస్ నా దగ్గర వంద వరకు వున్నాయి. అవన్నీ ఎవరికో ఒకరికి మనస్తాపం కలిగించేవే. ఆ సంగతి నాకు తెలుసు. వెయిట్ చేయండి. నేనూ రాస్తాను, ఎలా రాస్తానో చూద్దురు కానీ అని కాస్త విసురుగానే జవాబు చెప్పాను.  అలా రాసే ఓపిక వుంది. కానీ ఆ మాత్రం వ్యవధానం నాకు ఆ పైవాడు ఇవ్వాలి.  

ఇక విషయానికి వస్తే,  మా పెద్దన్నయ్య ఎన్నో రాస్తూ, మరెన్నో చెబుతుండేవారు. ఏ ఒక్కరికోసమో కాకుండా, జనాంతికంగా. నిజంగా అవన్నీ శ్రద్ధగా విని రాసుకుని అక్షరబద్ధం చేస్తే  దాన్ని మించిన రచన మరొకటి వుండదు. ఆయన ఏది చెప్పినా నేను మనసు పెట్టి వినేవాడిని. కానీ ఏం లాభం?  ఏనుగుని సృష్టించిన ఆ సృష్టికర్త ఆ పెద్ద జంతువుని శాకాహారిని చేశాడు. లేకపోతే ఈ ప్రపంచం ఏమై వుండేది. అలాగే నా విషయంలో.  నాకు మతిమరపు అనే శాపాన్ని ప్రసాదించాడు. రాయడం అనే శక్తి వుంది కానీ అన్నీ  గుర్తు వుండాలి కదా! అదే నాలోని పెద్ద లోపం. నార్ల గారు చెప్పేవారు. తెలియనిది, గుర్తు లేనిది ఊహించి రాయకు అని.

అందుకే, అన్నయ్య రాసిన వాటిని, అముద్రితాలను సయితం సేకరించడం, ఎవరి నోటి నుంచయినా, వాళ్ళు నాకంటే చిన్నవాళ్లు అయినా సరే,  ఆయన మాటలు  వినబడితే, మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను.  ఆయన చెప్పిన మాటలు, రాసిన రాతలు  నా ప్రతి రచనలో కనపడతాయి. కాబట్టి నా పేరుతో వచ్చిన రచనలకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు అంటూ వస్తే, నేను గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నాను, వాటిల్లో సింహభాగం మా అన్నయ్యకే చెందుతుంది.

మా అన్నయ్య మంచి గుణాలు ఏవీ నాలో లేవు. కానీ, నిజాయితీగా రాయడం మాత్రం ఆయన నుంచే నేర్చుకున్నాను.

చాలా సంవత్సరాలక్రితం ఆయన ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

 

ఒకానొక గర్భదరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.

“దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు.”

 

మా అన్నయ్య చిన్న కుమార్తె చిరంజీవి వాణి ఎప్పుడూ  గుర్తు చేసుకుంటూ వుంటుందిలా.

చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. ఒకటి ఆత్మస్తుతి, రెండోది  పరనింద.”

ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.

సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింట రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు. సీనియర్ అధికారి హోదాలో పెద్ద మొత్తాన్ని పించనుగా పొందే అవకాశాన్ని వదులుకున్నాడు. (ఆయన చనిపోయిన తరువాత ఎప్పుడో రెండు దశాబ్దాల పిదప జ్వాలా నరసింహారావు పూనికతో, మా వదిన గారికి ఫ్యామిలీ పెన్షన్ పునరుద్ధరించారు)

రిటైర్  అయిన తర్వాత, పెన్షన్ కూడా లేని స్థితిలో తన  శేషజీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది. ఆయన్ని చూడడానికి హైదరాబాదు నుంచి ఒకసారి  పుట్టపర్తి వెళ్ళాము.

ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను. ఊరంతా ఎక్కడ చూసినా బాబా ఫోటోలు. చిత్రం! ఆయన గదిలో ఒక్కటి కూడా లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు పరమహంస గారు పరిచయం. వారు బాబా గారికి  సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు. ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు. ఇలా అవసరాలు తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి. సాయంకాలం ఆశ్రమంలో భజనకు వెళ్ళేవాళ్ళు.  ముందు వరసలో కూచునే వీలు వున్నా, కావాలని వెళ్లి  చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. భజన సమయం మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద  కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని  అనేక ఆధ్యాత్మిక పత్రికలకు  వ్యాసాలు రాస్తుండేవాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండేవాడు. ఒకసారి ఆ షాపువాడు ఎవరితోనూ అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.

ఎవరండీ ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”

పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య రాసిన అనేక రచనల్లో సాయిగీత  ఇదొకటి. దీనికి కొంత పూర్వరంగం వుంది. భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన అనేకానేక  అనుగ్రహ భాషణల్లో జాలువారిన హితోక్తులను, సూక్తులను  అంశాల వారీగా వడపోసి, ఒక్క చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట)తో సహా తయారు చేసిన బృహత్ గ్రంధం అది. అదొక బృహత్తర కార్యక్రమం. బాబాగారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి. ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు వున్నాయి.

బాబా గురించి లేదా ఇతరులు ఆయన గురించి  రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే వాటికి బాబా గారి ఆమోదం వుండాలి.

అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ పుస్తకాన్ని డీటీపీ  చేయించి, కవర్ పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి మందిరంలోకి వెళ్ళే సమయంలో, ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా  దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!

మళ్ళీ బాబా తనంత తానుగా ఆ ప్రసక్తి తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని నిరుత్సాహ పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస గారికి ఇచ్చి, వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్ చేద్దాం అన్నారు. ఆ విధంగా సాయిగీత పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు.  సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస గారు చెప్పారు. ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది కూడా.

విషాదం ఏమిటంటే భౌతికపరమైన సంపదలను ఆయన కూడబెట్టలేదు, దాచుకోలేదు. ఆలాగే ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎన్నో చేసి  వాటిని కూడా దాచుకోలేదు.

భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.

కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:

శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు! ‘సాయి’జ్య  సాయుజ్య ప్రాప్తిరస్తు!

చివరికి తన జీవనయానాన్ని పుట్టపర్తిలోనే ముగించాడు. దానికి ముందు సినిమాల్లో క్లైమాక్స్ మాదిరిగా ఒక సంఘటన చోటు చేసుకుంది. బహుశా అదే ఆయన ఆకస్మిక మరణానికి కారణమేమో!

 

2006 సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం

తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి మా అన్నయ్య ఒక్కరే  హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.

కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.

మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.

గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, బంధువు, అడ్వొకేట్ రావులపాటి శ్రీనివాసరావు  అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.

మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.

ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.

సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.

కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది.

మా పెద్దన్నయ్యకు అనేకరంగాల వారితో సన్నిహిత పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ చాలామంది తెలుసు. కానీ, ఆయన ఈ లోకంలో లేరన్న సంగతి వారిలో చాలామందికి తెలవదు. ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు, మీ అన్నగారు ఎలావున్నారని? అంటే అంత నిశ్శబ్దంగా ఆయన దాటిపోయారన్నమాట. ఆయన లేరన్న భావం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం చెప్పలేకా, అబద్ధం ఆడలేకా ఒక నవ్వు నవ్వి తప్పుకుంటూ వుంటాను.

భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా, అనాయాస మరణం మాత్రం ప్రసాదించాడు.

 

కింది ఫోటో:

మా అన్నయ్యలు భండారు పర్వతాలరావు, భండారు రామచంద్రరావు వారి నడుమ మా మేనకోడలు శారద భర్త, మాజీ ఐపిఎస్ అధికారి, ప్రసిద్ధ రచయిత రావులపాటి  సీతారాంరావు, కుడిపక్కన చెవి ఒగ్గి వింటున్న నేను .



 

ఇంకావుంది

16, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (7 ) - భండారు శ్రీనివాసరావు

 ‘ఏవేవో పాత సంగతులు రాస్తున్నారు, ఇంతకీ మీ కధ ఎప్పుడు మొదలవుతుంది?‘  ఫోన్ చేసి ఓ పెద్ద మనిషి అడిగారు.

‘ముందు నన్ను పుట్టనివ్వండి. పుట్టి పెరిగిన తర్వాత కదా నా కధ మొదలయ్యేది ‘ అన్నాను నేను.

‘భలే వాళ్ళే!‘ అంటూ పెట్టేశారు ఫోను.

ముందు మాటలో చెప్పినట్టు, ఇది నా కధే కానీ, నా ఒక్కడి కధ కాదు. నా చుట్టూ అల్లుకున్న ఒకనాటి సమాజపు తీరుతెన్నులు, నాటి రోజులు గురించి ఏ మాత్రం తెలియని నేటి తరానికి చెప్పాలనే తాపత్రయంతో  మొదలు పెట్టిన కధ ఇది. నిజానికి మా కుటుంబంలోనే ఆరో తరం నడుస్తోంది. వారిలో చాలామందికి కూడా తమ పూర్వీకుల జీవన విధానాల పట్ల అవగాహన లేదు.  నాకు సయితం తెలియని కొన్ని విషయాలను మా అన్నయ్యలు, మా అక్కయ్యల ద్వారా నాకు తెలిసిన  సంగతులను నలుగురితో పంచుకోవడం ఈ రచనలోని ప్రధాన  ఉద్దేశ్యం. ఇందులో హెచ్చు భాగానికి నేను కేవలం రాయసకాడిని (Amanuensis) మాత్రమే.  

మా నాలుగో అక్కయ్య సావిత్రి, ఐదో అక్కయ్య అన్నపూర్ణల  పెళ్ళిళ్ళు మా నాన్న గారి హయాములోనే జరిగాయి.   

సావిత్రక్కయ్య పెళ్లి చూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు.

మా అమ్మ సంతానంలో సుదీర్ఘ కాలం జీవించినది ఈమె ఒక్కరే. తొంభయ్ ఏళ్ళు మీద పడిన తర్వాత కూడా తన పనులు తానే చేసుకునేది. ప్రతి పండగకి ఆమె నుంచి ఠంచనుగా ఫోన్ వచ్చేది.

‘ఒరేయ్! నీకు పండుగ శుభాకాంక్షలు. సంతోష్ కు సంతోష్ భార్యకు కూడా నా శుభాకాంక్షలు చెప్పు

గడగడా చెప్పేసి, మరో మాటలేకుండా ఫోన్ పెట్టేసేది. సావిత్రక్కయ్య ఎప్పుడూ ఇంతే! తను చెప్పదలచుకున్న రెండు మాటలు రెండు ముక్కల్లో చెప్పేస్తుంది.  

సంక్రాంతికే కాదుఏ పండుగ వచ్చినా, పుట్టిన రోజులకు సయితం  సావిత్రక్కయ్య ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది. నా ఒక్కరికే కాదుకుటుంబంలో ప్రతి ఒక్కరికీ. తొంభయ్ రెండేళ్ల వయస్సులో ఎంతటి  ఓపికోఎంతటి ఆపేక్షో! ఆ వయసులో కూడా ఎప్పటెప్పటి విషయాలో ఆమెకు గుర్తు. అవన్నీ ఆమె నోటంట చెప్పించాలని నాకో కోరిక.

కాగితం, కలం లేకుండా రేడియోకి ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. అది నా గొప్పతనం కాదు. రేడియోకి  వార్తలు పేరాలు పేరాలు ఇవ్వక్కరలేదు. చెప్పిన దాంట్లో  కీలకమైన అంశం దొరకబుచ్చుకుని మూడు ముక్కల్లో వార్త తయారు చేసే వెసులుబాటు వుండేది.

ఈ సోదంతా ఎందుకంటే  ఒకసారి ఖమ్మంలో మా అక్కయ్యను ఇంటర్వ్యూ చేసాను, ఇలాగే చేతిలో పెన్ను లేకుండా. కాగితం మీద రాసుకోకుండా. అప్పుడు తెలిసింది విషయాలను గుర్తుపెట్టుకుని సవిస్తరంగా రాయడం ఎంత కష్టమో.

 ఓసారి సంక్రాంతి పండక్కి కాబోలు నాలుగయిదు కార్లలో హైదరాబాదు నుంచి మా స్వగ్రామం బయలుదేరి, దారిలో ఖమ్మంలో సావిత్రక్కయ్య ఇంట్లో ఆగాము.

ఆమె వయసు అప్పటికే ఎనభయ్ తొమ్మిదేళ్ళు.  కుటుంబంలో పెద్దావిడ. పాత తరానికి చెందిన విషయాలు తెలుసుకోవడానికి మిగిలివున్న ఏకైక వారధి. అందుకే ఆమెతో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాను. ముందు ఏముంటాయిరా అంత గుర్తుంచుకునే విషయాలు అంటూనే దాదాపు రెండు గంటలు మాట్లాడింది. ఆమె ధారణ శక్తి చూసి ఆశ్చర్యపోవడం మా వంతయింది.

పుట్టి పెరిగిన కంభంపాడు గురించీ, ఎప్పుడో ఎనభై ఏళ్ళనాడు కాలిపోయిన మా ముత్తాతలు నిర్మించిన  మండువా లోగిలి గురించీ, ఆ తర్వాత  మా నాన్న హయాములో కట్టిన పెంకుటిల్లు గురించీ, చిన్ననాటి చదువుసంధ్యలు గురించీ, అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు గురించీ అనేక విషయాలు చెబుతూ పోయింది. మేమంతా వింటూపోయాము. ఈ ధ్యాసలో పడి అంశాల వారీగా గుర్తుపెట్టుకునే అసలు పని మరిచేపోయాను. నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు. ఆమె తనంతటతానుగా అభివ్యక్తీకరించిన ఆత్మావలోకనం.

ఊళ్ళో అప్పయ్యగారి వీధిబడి దగ్గర ఆమె  చదువు ఆగిపోయింది. కానీ మా చెల్లమ్మమ్ముమ్మ పక్కన కూర్చుని, ఆమె నుంచి  నేర్చుకున్న భారత, రామాయణాలు కంఠతా పట్టింది. పొద్దున్నే బామ్మ తోటకు వెడుతూ తననూ, అన్నపూర్ణక్కయ్యను వెంటబెట్టుకుని తోటకు వెళ్ళేది. ఇంటికి వస్తూ ఆ  రోజుకు కావాల్సిన కూరగాయలు కోసుకుని తెచ్చుకునేవారు.

సావిత్రక్కయ్య పెళ్లిచూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు. రాధక్కయ్య ఇంట్లో పెళ్లి కుదిరింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ ఖమ్మంలో రాధక్కయ్య ఇంటి పక్కనే వీళ్ళూ ఇల్లు కట్టుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణ బజారులో వుండేవాళ్ళు. అద్దె పది రూపాయలు.

“కాపురం కొత్తల్లో చాలా ఇబ్బందులు. కొత్త ఇంట్లో చేరిన తర్వాత కూడా అవి వెంటే వచ్చాయి. అయితే దేవుడి దయవల్ల మా వారి ప్రాక్టీసు, ఆయన రెక్కల కష్టం వృధా పోలేదు. పిల్లలు ఎదిగి వచ్చారు. ఆడపిల్లలకు, మగపిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయి. (పోలీసు ఐజీ గా రిటైర్ అయిన  ప్రముఖ రచయిత రావులపాటి సీతారాం రావు గారు ఈ ఇంటి అల్లుడే). ఇవ్వాళ ఈ స్తితిలో వున్నామంటే మా వారి చలువే.” అంది తృప్తిగా.

“మా వారి ప్రాక్టీసు అంతంత మాత్రంగా వున్నప్పుడు నేను ఎక్కువ  రోజులు పుట్టింట్లోనే వుండేదాన్ని. పెద్దమ్మాయి విమల, పెద్దపిల్లాడు దుర్గాప్రసాదు ఇద్దరూ  నేను పుట్టిన ఊరు కంభంపాడులోనే పుట్టారు. తర్వాత కాపురానికి ఖమ్మం వెళ్ళిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో మా అక్కచెల్లెళ్ళ పిల్లాజెల్లా అందరూ పొలోమని అమ్ముమ్మగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఒక్క నేనూమా పిల్లలూ తప్ప. అలాగే నాన్న తద్దినం నాడు కూడా నేను వెళ్ళలేకపోయేదాన్ని. మా వారికి పిల్లలు అంటే ప్రాణం. కోర్టు నుంచి ఇంటికి రాగానే పిల్లలు అందర్నీకంటినిండా చూసుకుంటే కాని ఆయనకు తృప్తిగా వుండేది కాదు. అన్నపూర్ణ మా వారిని ‘ ‘ఏం బావా సావిత్రిని, పిల్లల్నీ రెండు రోజులు కంభంపాడు పంపిస్తే,  నిన్ను  పిల్లులు ఎత్తుకుపోతాయా ఏమిటని’ ఆటలు పట్టిస్తుండేది. కానీ అయన మనసు నాకు తెలుసు. చెప్పాకదా పిల్లలు అంటే ప్రాణమని. ఆ పల్లెటూళ్ళో ఆడుకుంటూ కాలికి చేతికీ దెబ్బలు తగిలించుకుంటారేమో అని భయం. పెళ్ళికి ముందు, పెళ్ళయిన కొత్తల్లో పుట్టింట్లో ఎక్కువ రోజులు వున్నా కనక,  పుట్టింటికి  తరచూ వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అంతగా వుండేది కాదు. నాకు ఇల్లే వైకుంఠం’ చెప్పింది. ఆమె కళ్ళల్లో  నిండుగా సంతృప్తి.

సావిత్రక్కయ్య పెద్ద కుమారుడు  దుర్గాప్రసాద్ (ఈ మధ్యనే పోయాడు) ఒక మంచి పనిచేసాడు. అందర్నీ సంప్రదించి, ఒప్పించి పాత ఇంటిని పడగొట్టి కొడుకులు, కోడళ్ళు,  కూతుళ్లు, అల్లుళ్లు అంతా కలివిడిగా వుంటూనే విడివిడిగా ఉండేలా అందరికీ ఒకే చోట ఒకే భవనంలో అపార్ట్ మెంట్లు కట్టించాడు. కుటుంబం మొత్తం ఒకే గొడుగు కింద వుండే ఏర్పాటు అన్నమాట. వృద్ధాప్యంలో వున్న తల్లికి ఇంతకంటే ఏం కావాలి.

‘కన్నపిల్లలు కంటి ఎదుట కనబడేలా ఇప్పుడు ఏర్పాటు చేసారు. అల్లుళ్ళు, కోడళ్ళు మంచివాళ్ళు దొరికారు. చిన్నవాడు అచ్యుత లలిత అనే అమ్మాయిని  హమేషా నా దగ్గర ఉండేలా నాకు తోడుగా పెట్టాడు. రోజులు మంచిగా గడిచిపోతున్నాయి. ఎవరైనా అడిగితే కానీ, నేను తొంభయ్యవ పడిలో పడుతున్నాను అనే సంగతి గుర్తురావడం లేదు.” అన్నది ప్రశాంత చిత్తంతో.

అదే ప్రశాంత చిత్తంతో అనాయాస మరణం పొందింది. 

తోక టపా:

‘బయట తిరక్కండిరా!’

‘అలా ఎండలో తిరిగితే వడ దెబ్బ తగులుతుంది’

‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది’

‘చలిగాలిలో తిరగకండి వంటికి మంచిది కాదు’

ఇలా ఆరుగాలమూ ఆంక్షలే! అందుకే పెద్దవాళ్ళ కళ్లుగప్పి బజార్నపడే వాళ్ళం. వాళ్ళ కళ్ళబడితే ఇంతే సంగతులు! వీపు విమానం మోతే!

ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి సంగతులన్నీ  ఈ మోస్తరుగానే వుంటాయి.

ఆ రోజు పొద్దున్న ఖమ్మం నుంచి మా సావిత్రక్కయ్య ఫోను. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పడానికి మా ఇంట్లో ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. మా ఆవిడతోనే అన్నింటికీ కృష్ణార్పణం. ఆ సంగతి చటుక్కున గుర్తు వచ్చింది కాబోలు మాటమార్చి అంది.

“బయట తిరక్కురా! అసలే (కరోనా) రోజులు బాగా లేవు”

ఎనభయ్ తొమ్మిది నిండి తొంభయ్యవ పడిలో అడుగుపెట్టిన అక్కయ్య,  డెబ్బయి నాలుగేళ్ల తమ్ముడికి ఇలా సుద్దులు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కింది ఫోటో:



 

సావిత్రక్కయ్యతో మా కుటుంబం

 

15, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (6 ) - భండారు శ్రీనివాసరావు

 ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి మా మూడో అక్కయ్య   సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండో  అక్కయ్య శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేదిట.

మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.

సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.

సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. బ్రిటిష్ ఇండియాలో  వివాహాలకు కనీస వయసును నిర్ధారిస్తూ, స్వాతంత్రానికి పూర్వమే నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంచేసింది. హర్ బిలాస్ శార్దా ( Harbilas Sarda) అనే సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లు తదుపరి చట్టంగా మారింది. దీనికి శారదా చట్టం అనే పేరు స్థిరపడింది.  ఎవరైనా ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో, నైజాం సంస్థానంలో ఈ చట్టం లేదు కాబట్టి,  ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.

పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో చదువురాని పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.

మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడపిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.

పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు.

తరువాత సరస్వతక్కయ్యకు వేరే సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కతే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఎమ్మేనే కాకుండా లా పరీక్ష కూడా రాసి బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకుని బెజవాడ వచ్చి ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టారు.

గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు.          

తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది.

ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్యపిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.

‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు.

ఈ పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే అప్పటికి నేను పుట్టనే లేదు.

కింది ఫోటో:

మధ్యలో మా అమ్మ, మా అమ్మతో ఆమె కన్న ఆడపిల్లలు, వాళ్ళు కన్న ఆడపిల్లలు. కోడళ్ళు   ఫొటోకు చిక్కింది మా అమ్మ సంతానంలో ఒక చిన్న బృందం మాత్రమే.




(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (5) భండారు శ్రీనివాసరావు



ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి మా మూడో అక్కయ్య   సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండో  అక్కయ్య శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేదిట.
మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. బ్రిటిష్ ఇండియాలో  వివాహాలకు కనీస వయసును నిర్ధారిస్తూ, స్వాతంత్రానికి పూర్వమే నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంచేసింది. హర్ బిలాస్ శార్దా ( Harbilas Sarda) అనే సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లు తదుపరి చట్టంగా మారింది. దీనికి శారదా చట్టం అనే పేరు స్థిరపడింది.  ఎవరైనా ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో, నైజాం సంస్థానంలో ఈ చట్టం లేదు కాబట్టి,  ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో చదువురాని పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.
మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడపిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు. 
తరువాత సరస్వతక్కయ్యకు వేరే సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కతే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఎమ్మేనే కాకుండా లా పరీక్ష కూడా రాసి బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకుని బెజవాడ వచ్చి ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టారు. 
గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. 
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. 
ఈ పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే అప్పటికి నేను పుట్టనే లేదు.

కింది ఫోటో:
మధ్యలో మా అమ్మ, మా అమ్మతో ఆమె కన్న ఆడపిల్లలు, వాళ్ళు కన్న ఆడపిల్లలు. ఫొటోకు చిక్కింది మా అమ్మ సంతానంలో ఒక చిన్న బృందం మాత్రమే. 

(ఇంకా వుంది)

14, నవంబర్ 2024, గురువారం

నెహ్రూలో నెహ్రూను మాత్రమే చూడండి


(ఈరోజు జవహర్ జయంతి)

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే  అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు.  బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఇది ఎంతవరకు పోయిందంటే ఒకసారి గూగుల్  లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం  ఎన్టీఆర్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీఆర్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం. 
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి, మహాత్మా గాంధీకి ప్రియతముడు కాబట్టి నెహ్రూ స్వతంత్ర భారత దేశానికి ప్రధమ ప్రధాన మంత్రి కాగలిగాడనే భావన నవతరంలో మెండుగా వుంది. అది నిజం కూడా. ఐతే,  ప్రధాని కావడానికి అవే   ఆయన అర్హతలు అనుకుంటే సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగేవాడు కాదు. ఆయన్ని ప్రధాని పదవిలో ప్రతిష్టించిన మహాత్మా గాంధి, స్వతంత్రం వచ్చి  ఆరుమాసాలు కూడా తిరగకుండానే తుపాకీ గుళ్ళకు గురై కన్ను మూసాడు.  కేవలం మహాత్ముని ఆశీస్సులే నెహ్రూ పండితుడికి శ్రీరామ రక్ష అనుకుంటే 1964 లో నెహ్రూ తీవ్ర అస్వస్తతకు గురై కన్ను మూసేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగగలిగివుండేవా రు కాదు.

నెహ్రూ మరణించిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం వుంది. ఆ వార్త రేడియోలో వచ్చినప్పటినుంచి ఊరువూరంతటిలో పొయ్యి వెలిగించలేదు. ఆయన ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలవదు, తెలవడానికి ఇప్పట్లా టీవీలు లేవు. ఢిల్లీలో సాగుతున్న శవయాత్ర గురించి అదీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం  రేడియోలో  సాగుతుంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో ఎవ్వరికీ ఆయన ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి అనే స్పృహ లేదు.
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళలాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు,  ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి. 
దేశ ప్రగతికి  మన వంతు కృషి  ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు. 
నెహ్రూను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్శనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని  ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.