12, నవంబర్ 2024, మంగళవారం

పిడకల వేట – భండారు శ్రీనివాసరావు

 నా మానాన నేను పాత పాటలు వింటూ, పాత సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి వెలక్కాయ పడి, అప్పుడు వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే, మళ్ళీ ఫోన్ మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది. కాదంటారేమిటి అని డుబాయిస్తుంది. ఇలా  రోజుకు ఒకసారి కాదు, అనేకసార్లు. ఆరు నెలల నుంచి ఇదే తంతు. గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు.  పోనీలే అనుకుంటే పోనుకదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం  నడుస్తుంది.  ఇంతలోనే మరో ఫోన్. హెచ్ పీ గ్యాసా! నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.

ఈరోజు మళ్ళీ అలా ఇప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.

‘చూడండి. నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్ బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి నొక్కితే...’

నా మాట పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం పడింది.

‘ఇవన్నీ మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్, కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్ సెర్చ్ లో నెంబరు చూసి చేసేది ఇందుకే

నాకు కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్ చేశాను.

నాలోని తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ కంప్యూటర్ లో తల దూర్చాను.

ఈసారి ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ గ్యాసా!’

నేనూ ఈ సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్ సెర్చ్ లో దొరికింది అంటున్నారు. ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు పంపిస్తారా శ్రమ అనుకోకుండా

ఇంత మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో సరిపుచ్చకుండా పంపాడు.

అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా లేకుండా అది,  పాతికేళ్ళుగా నా పేరు మీద బిల్లులు కడుతూ నేను  వాడుతున్న  నా నెంబరే!

ఏమిసేతురా లింగా!

12-11-2024  

కింద అతడు పంపిన స్క్రీన్ షాట్   


    

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 2) - భండారు శ్రీనివాసరావు

 

“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

 

రుక్మిణీ కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరు పదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీదేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అయిదో అక్కయ్య అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో దిండుకు ఆనుకుని కూర్చుని  చేతిలో తావళంతో మా బామ్మ రుక్మిణమ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరోశ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ వెంకట్రావమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.

ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళ క్రితం కట్టిన ఆ పెంకుటిల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీవినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై డెబ్బై  ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.

నేను ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ కాలేజీలో పీయూసీ చదివాను. అప్పుడు ఆ జిల్లాకు పౌరసంబంధాల అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింట్లో ఉండేవాడిని. జిల్లా పౌర గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చేవాడు. ఒక రోజు ఏనుగుల వీరాస్వామి గారు రాసిన కాశీ యాత్ర పుస్తకం తెచ్చి ఇచ్చారు. అది చదువుతుంటే ఎప్పుడో దశాబ్దాల కిందటి ఊళ్లు, ప్రదేశాలు, మనుషులు, వారి నడవడికలు, ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయాలు, ఆహార విహారాలు అన్నీ  కళ్ళకు కట్టినట్టు ఉండేవి.   ఏదైనా రాస్తే, అలా రాయాలి అనేది మా అన్నగారి కవి హృదయం. పైకి చెప్పకపోయినా ఆ విషయం నా మనసులో నాటుకు పోయింది.

మాది కృష్ణా జిల్లా, (ఇప్పుడు ఈ జిల్లాకు ఇంటి పేరు వచ్చింది, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా) నందిగామ తాలూకా, కంభంపాడు గ్రామం.   ఇప్పుడు ఇది కూడా మారి వత్సవాయి మండలం కిందికి వచ్చింది.  అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువుగట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగు వైపులా ఇనుప  గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు  కషాయం. స్నానాలకుఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మమా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళేవాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీబాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ వుండేవాడిని. బండి చక్రాలువాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారుచేసేవాడు.

ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోవతులు నేసేవాళ్ళు.

చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలులౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లుచిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో, గొట్టం లాంటి సాధనం వుంచి  పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ,  చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సత్యమూర్తి అని నా చిన్ననాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి  బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే  వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలోతెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన  జంధ్యాల హరి నారాయణ  కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లుఅప్పయ్య మాస్టారుభద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలకసుద్ద బలపంఅవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో కృష్ణ శతకంలోని పద్యాలు ఆలపించేవారు.

“హరియను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామమహత్యము

హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|

అంటూ కంచుకంఠంతో వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.

 ఊరంతటికీ అదే కోడికూత.

పంచాయతీ రేడియోలో  సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడనుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేదికానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు చాలా ఏళ్ళుగా కనిపెట్టి చూస్తున్న పూజారి కుటుంబానికే ఆ భూమిపై సర్వహక్కులు అప్పగించాము. మారిన పరిస్తితుల్లో ఇప్పుడు రాబడి పర్వాలేదు. 

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకుఅది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువురెండోది మునేటి కాలువ. ఈ రెండూ నేను పుట్టకముందు నుంచి వున్నాయి. నా ఎరుకలో కొత్తగా వచ్చింది సాగర్ ఎడమకాలువ తాలూకు బ్రాంచ్ కెనాల్.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవుజ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడుఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు  లేవు. ఎడ్లూ లేవు. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళుపదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవుబట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామానుఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.

లాంతర్లు లేవుఅందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవుప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.

పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!

స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.

 

కింది ఫొటో:

పదుల సంఖ్యలో పురుళ్లూ, పుణ్యావచనాలకు నిలయం అయిన ఒకనాటి మా ఇల్లు,



 

(ఇంకా వుంది)

11, నవంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో - భండారు శ్రీనివాసరావు

 రచనోద్ఘాతం

‘శ్రీనివాసరావ్! నీ గురించి ఏదో అనుకున్నాకానీ, నువ్వొక బిగ్ జీరోవి

ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్, ప్రముఖ రచయిత, ఇల్లాలి ముచ్చట్లు సృష్టికర్త పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేరుగా నాతోనే అన్నమాట ఇది.

నార్లగారి సంపాదకత్వంలో, నండూరి వారి సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రోజులవి. అంటే దాదాపు యాభయ్ అయిదేళ్ళ నాటి ముచ్చట.

పురాణం గారు అలా అనగానే, నాకు కాళ్ళకింది భూమి కదిలినట్టయింది. నిస్సత్తువ ఆవరించింది.

కానీ ఆయన వెంటనే మరో మాట అన్నారు.

‘నువ్వు జీరోవే! అయితే నువ్వు కుడి పక్కన వుంటే ఒకటి, రెండు,మూడు వంటి చిన్న అంకెల విలువ కూడా  పెద్దగా పెరుగుతుంది. అలాంటివాడివి నువ్వు

తటాలున అన్న మాటను వెనక్కి తీసుకోలేక, నన్ను సముదాయించడానికి అలా అని ఉంటారని నాకనిపించింది. ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ, పురాణం గారి మాట నాకు ఆస్కార్ తో సమానం. అందుకే డెబ్బయ్ తొమ్మిదో ఏట రాస్తున్న నా ఈ జీవన కధనానికి ఈ శీర్షిక ఎంచుకున్నాను. 

ఆ రోజుల్లో ఆయన ఏదో సినిమాకి కధో, మాటలో రాస్తున్నారు. ఆ సినిమా తాలూకు వాళ్ళు బెజవాడ బీసెంటురోడ్డులోని మోడరన్ కేప్ లో ఒక గది ఏర్పాటు చేశారు ఈ పనికోసం. సాయం రమ్మంటే సాయంత్రాలు ఆఫీసు పని కాగానే ఆయన దగ్గరకు వెళ్ళేవాడిని. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ  పురాణం గారు ఏదో చెప్పేవారు. ఆ చెప్పిన దాన్ని కాగితంపై పెట్టడం నా పని, నన్నయ భట్టారకుని వద్ద నారాయణ భట్టులా. నాకా షార్ట్ హ్యాండ్ తెలియదు. పురాణంగారి ఆలోచనల ఉరవడి వరద గోదారిలా వుంటుంది. అంచేత తప్పనిసరిగా నా రాతలో తప్పులు దొర్లేవి. సుదీర్ఘ కాలం ఎడిటర్ గా పనిచేసిన పురాణం గారికి నేను తప్పులతో సహా దొరికిపోయేవాడిని. సహజంగానే కోపం వస్తుంది. అలాగే వచ్చేది. ఇదిగో ఇలాంటి ఒక సందర్భంలో ఆయన అన్నమాట ఇది.

పురాణంగారి మాట చలవో ఏమో కానీ, ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరెందరో నాకు పక్కన బాసటగా నిలబడి, నేను జీరోగానే మిగిలిపోకుండా నన్ను పెద్దవాడిని చేశారు. నాకు లేని విలువని నాకు కట్టబెట్టారు. వారందరినీ ఒక మారు స్మరించుకోవడం కూడా ఈ రచన లక్ష్యం.

నేనో రచయితను కాను. నేనో సంపాదకుడిని కాను. పెద్ద అధికారినీ కాను. ఆ మాటకు వస్తే పెద్ద జీతగాడినీ కాను. స్వయంకృషితో ఎదిగిన వాడిని కాదు. నిజం చెప్పాలంటే గాలివాటం బాపతు.

ఇక నిజజీవితానికి వస్తే నాకు పాసు మార్కులు కూడా పడవు. రెండుసార్లు తప్పి, ముక్కుతూ మూల్గుతూ మూడోసారి బీకాం డిగ్రీ తెచ్చుకున్నవాడిని.  కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేనో బిగ్  ఫెయిల్యూర్. మరి ఏముంది నా గురించి రాసుకోవడానికి. ఒకవేళ రాసినా ఏముంటుంది ఎవరైనా చదవడానికి. అయితే ఇందుకు  నాకు తోచిన కారణం ఒకటి, నా అనుభవానికి వచ్చిన ఉదంతం రూపంలో  చెబుతాను.  ఏ జీవితమైనా అనుభవాల సమాహారమే కదా!

యాభయ్ ఏళ్ళ క్రితం  రేడియోలో  వార్తలు  చదివే  రెగ్యులర్ న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాము. లిఖిత పరీక్షలో నెగ్గినవారికి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి స్టూడియోలోనే రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన  నిర్ణేతల బృందానికి నేతృత్వం వహించిన  నాటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  వైస్ చాన్సలర్, ప్రసిద్ధ భాషావేత్త, భద్రిరాజు కృష్ణమూర్తి గారు, ఇంటర్వ్యూకు  వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్యపోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది  పనికొస్తుందన్నది  ఆయన మాటల  తాత్పర్యం.

అలాగే ఒక మనిషి ఎలా జీవించకూడదో తెలుసుకోవాలంటే, అప్పుడప్పుడు నా వంటివారి జీవన చిత్రాలను కూడా పరిశీలించడం అవసరం. అందుకోసమే ఈ రచనోద్ఘాతం.

తోకటపా: శారీరకంగా, మానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు  ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత. అలాగే ఒకప్పటి సంగతులను స్పురణకు తేవడంలో సహకరించిన  నా మేనల్లుళ్ళు  తుర్లపాటి సాంబశివరావు, కౌటూరి దుర్గాప్రసాద్, కొలిపాక రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఇప్పుడు లేరు. అలాగే కొందరు బాల్య స్నేహితులను కూడా పోగొట్టుకున్నాను. ఏతావాతా చెప్పేది ఏమిటంటే, అన్నీ గుర్తు తెచ్చుకుని, నాకుగా నేను తలకెత్తుకున్న  ఈ బాధ్యతను పూర్తిచేయాలనేది నా సంకల్పం. అయితే,  గుర్తు చేసుకునే క్రమంలో కొన్ని విరామాలు, గుర్తుకువచ్చినవి వెంటవెంటనే రాసే ప్రయత్నంలో  కొన్ని కప్పగంతులు,  పాత ఫోటోల వేటలో కొంత కాలయాపనలు, తప్పనిసరి.  

 నాకున్నది ఒక్కటే రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి. 


(ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే)

        

11-11-2024  (కార్తీక సోమవారం)

10, నవంబర్ 2024, ఆదివారం

ప్రభుత్వ ధనం



మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్  సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్  బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు.  హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చి నన్ను గుడికి  పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని కలెక్టర్ గారితో చెప్పారు. 
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి. 
మా అన్నయ్య తరవాత అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా  పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస మరణం పొందారు.  
(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు  చెప్పిన విశేషాలు ఆధారంగా)

8, నవంబర్ 2024, శుక్రవారం

తీరని సందేహం



 ఓరోజు,  ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష.  ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఇది జరిగి ఎనిమిదేళ్లుఅయింది. మెయిల్స్ డిలీట్ చేస్తుంటే కంటపడింది. ఇన్నేళ్లలో ఉబెర్ రేట్లు పెరిగాయి. అలాగే టాక్సులు కూడా. మరి దేశంలో ప్రతి ఒక్కరి నుంచి ప్రతి లావాదేవీ మీద మనం చెల్లిస్తున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయా? లేక మన నుంచి వసూలు చేసిన పన్ను మొత్తాలను ఆయా వ్యాపార సంస్థలు ఖజానాకు దఖలు పరుస్తున్నాయా? లేదా?
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు  చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా   అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి  ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా!  అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం, ప్రతి   నిమిషం, లక్షల కోట్ల విలువైన  లావాదేవీలు కోట్ల సంఖ్యలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’.
ఈ జవాబు విన్న తర్వాత
ఇక నా దగ్గర ప్రశ్నలు ఏముంటాయి?  లేవు.
కానీ అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

4, నవంబర్ 2024, సోమవారం

కాన్పుకయినా, కాటికయినా...



అమెరికాలో వుంటున్న ఫేస్ బుక్ మిత్రులు శ్రీనివాస్ సత్తిరాజు గారు, తమ అత్తగారి మరణం గురించి రాస్తూ, ఆమె పిల్లలు తల్లి చనిపోవడానికి ఆరేళ్ల ముందే అంత్యక్రియల కోసం అడ్వాన్సు గా పన్నెండు వేల డాలర్లు సంబంధిత సంస్థకు చెల్లించి వుంచారని, అదే ఇప్పుడయితే ఇరవై వేలు అయ్యేదని రాసుకొచ్చారు. ఇది చదివిన తర్వాత 
నా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది.
 

మా బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?
తెలుసుకోవాలని ఆత్రుత. 
ఒకరోజు ఆమెనే  అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.
‘దానిమీదపడ్డాయి ఏమిట్రా నీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’
‘రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు  పెట్టుకున్నట్టు’
నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది. 
‘రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్నాసీ. డబ్బులు’
‘డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’
‘ఇవి  వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’
‘కాటికా! అంటే ఏదైనా గుడా”
‘గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’
‘గుడికి ఇన్ని డబ్బులెందుకే’
‘నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా  చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర  వున్నా ఇవ్వరు.  దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే  ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’
బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్ధం బోధపడింది. కానీ బామ్మ ఆరోజుల్లో  ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది. 
ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.

3, నవంబర్ 2024, ఆదివారం

ప్రతిఫలాపేక్ష లేని పనివారు

ఆడవాళ్ళ శ్రమకు ఖరీదు కట్టే షరాబు వున్నాడా! - భండారు శ్రీనివాసరావు 
(నవంబరు 3, జాతీయ గృహిణుల దినోత్సవం)
 
దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అత్యధికంగా పనిచేసేవారు వున్నది ఇళ్ళల్లో, అదీ ఆడవాళ్ళు. నిజానికి ఆడవారివి దశావతారాలు. పని మనుషులు, వంటమనుషులు, పిల్లల్ని కనిపెట్టి చూసే ఆయాలు అన్నీ ఆడవాళ్లే. ఆడవారి శ్రమ కారణంగా మొత్తం ప్రపంచానికి సమకూరుతున్న సంపద వేల లక్షల కోట్లల్లో వుంటుంది. కానీ వారి శ్రమకు ప్రతిఫలం ఎక్కడ! ఏమాత్రం దక్కుతోంది!!

https://www.facebook.com/share/v/1EwCpPS6gH/