12, జూన్ 2021, శనివారం

రాజీనామాలు, ఆమోదాలు - భండారు శ్రీనివాసరావు

 

వాయువేగంతో ఆమోదించబడిన రాజీనామాల్లో, నాకు తెలిసి,  నందమూరి హరికృష్ణదే మొదటిది అనుకుంటాను. రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెస్  అధిష్టానం నిర్ణయానికి  నిరసనగా హరికృష్ణ తన  రాజ్యసభ  సభ్యత్వానికి రాజీనామా లేఖను చైర్మన్ ఛాంబర్ లో ఇచ్చి బయటకు వస్తుండగానే పార్లమెంటులోని టీవీ చానళ్లలో రాజీనామా ఆమోదం వార్త స్క్రోలింగుల రూపంలో దర్శనం ఇచ్చింది.

ఇక ‘నా రాజీనామాను ఆమోదించండి బాబూ’ అని,   స్వాతిముత్యం  సినిమాలో కమల్ హసన్ ఉద్యోగం కోసం శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుపొందిన సోమయాజులు ధరించిన పాత్రను పదేపదే  వెంటపడే దృశ్యాన్ని గుర్తుకు తెచ్చిన ఉదంతం  డాక్టర్ జనార్ధన రెడ్డి  (మహబూబ్ నగర్)ది.  అప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్.  ప్రత్యేక తెలంగాణా వాదానికి మద్దతుగా  డాక్టర్  నాగం తన టీడీపీ  శాసన సభ్యత్వానికి  రాజీనామా చేశారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం  వరకు  ఆయన స్పీకర్ ని  కలుస్తూ తన రాజీనామా సంగతి ఏం చేశారు అంటూ  వారాల తరబడి వెంటపడేవారు. ఆయనే ఈ స్వాతిముత్యం సంగతి విలేకరుల చెవిన వేశారు. తన రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ తప్పించుకుని తిరుగుతున్నారు అని ఆరోపణ చేయడమే కాకుండా స్పీకర్ మిస్సింగ్ అంటూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఆఖరికి అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేశారు. చిట్టచివరికి, ఎట్టకేలకు ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.

రాజీనామాల పర్వంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2011 లో ఆనాటి పాలకపక్షం నుంచి విడిపోయిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు. సీబీఐ చార్జ్ షీట్ లో పూర్వ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. పేరు ప్రస్తావించడానికి నిరసనగా వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. శాసన  సభలో నిలబడి ‘మా రాజీనామాలను ఆమోదించండి’ అని నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని ఎన్నోసార్లు వేడుకున్నారు. ఫలితం పూజ్యం.

చివరికి చాలా కాలం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా ఊపిన పిదప ఆ రాజీనామాలకు మోక్షం లభించింది. 

ఆ తర్వాత ఎన్నాల్టికో ఉప ఎన్నికలు జరిగాయి. పదిహేడు అసెంబ్లీ సీట్లతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి సీటు, కాంగ్రెస్ లోక సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామా వల్ల ఏర్పడ్డ లోక్ సభ స్థానానికి కూడా  ఎన్నికలు జరిగాయి. పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో పదిహేను వైసేపీ గెలుచుకుంది. రెండు కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడ్డ  వైసీపీ  అభ్యర్ధి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి  టి. సుబ్బరామిరెడ్డి పై  రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉపఎన్నికల్లో అన్ని సీట్లుకోల్పోవడం  ఆ పార్టీ  భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేదానికి సంకేతంగా చెప్పుకున్నారు.  టీడీపికి ఆ ఉపఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ తర్వాత  అదే టీడీపీ, రాష్ట్ర విభజన అనంతరం, 2014 లో నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది.      

ఈ నేపధ్యాల నడుమ  తెలంగాణా  మాజీమంత్రి ఈటెల రాజేందర్ ఈ  ఉదయం ఇచ్చిన రాజీనామాను కొన్ని గంటల్లోనే స్పీకర్  పోచారం   శ్రీనివాసరెడ్డి ఆమోదించడం విశేషమే!    

(12-06-2021)   

పాత స్కేలు బద్దలం – భండారు శ్రీనివాసరావు

 చిన్నప్పుడు స్కూల్లో  చదువుకునే రోజుల్లో  చెక్కతో చేసిన స్కేలు వాడే వాళ్ళం. అందులో అంగుళం, అర అంగుళం,  పన్నెండు అంగుళాలు ఒక అడుగు ఇలా కొలతలు ఉండేవి. ఆ స్కేళ్ళ స్థానంలో ప్లాస్టిక్ స్కేళ్ళు వచ్చాయి. చూడముచ్చటగా వుండే వాటిని కొనుక్కోవాలని మనసు ముచ్చట పడేది. ఆ కోరిక తీరకుండానే స్కూలు చదువు ముగిసింది.

ఇప్పటి తరం పిల్లలు కూడా స్కేళ్ళు వాడుతున్నారు. కానీ వాటిల్లో కొలతలు మిల్లి మీటర్లు, సెంటి మీటర్లు. వీళ్ళకు అంగుళాల స్కేలు బద్దలు గురించి తెలియదు. అది సహజం. వాటిని వీళ్ళు ఎప్పుడూ చూసి కూడా వుండరు.

తరాల మధ్య అంతరం కూడా ఇంతే. ఈ వాస్తవాన్ని పాత తరం, అంటే నా బోటివాళ్ళు సదా గుర్తు పెట్టుకోవాలి.

‘మా కాలంలో అంటూ మొదలు పెడితే ఈ కాలంలో కుదరదు.

(12-06-2021)

రఘురామ రాజు లేఖలు


https://www.youtube.com/watch?v=jGwX3OKIKUA

బాల కృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్


సొంత పనుల కోసమా! రాష్ట్ర ప్రయోజనాల కోసమా! ఈ రచ్చ అవసరమా!


https://youtu.be/6cIGMJsKjIc

11, జూన్ 2021, శుక్రవారం

ఆర్బీఐ గవర్నరుకు అప్పిచ్చిన ఆసామి - భండారు శ్రీనివాసరావు

 ఆర్బీఐ గవర్నరుగా పనిచేసిన వ్యక్తికి అప్పివ్వడం మామూలు వ్యవహారమా!

ఆర్వీవీ గారు నేను రేడియోలో చాలాకాలం కలిసి పనిచేసాము. ఆయనిప్పుడు బహుముఖ వ్యాపకాలు పెట్టుకుని నెగ్గుకు వస్తున్నారు. వాటిల్లో చాలావరకు ఆధ్యాత్మిక కార్యకలాపాలే. ఆయన చెప్పిన కధ కాని కధ ఇది.
సీనియర్ ఐ.ఏ.ఎస్. దువ్వూరి సుబ్బారావు గారి పేరు వినని వారుండరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా చాలాకాలం పనిచేసారు. కానీ ఆయన్ని కొత్తవాళ్ళు ముఖతః చప్పున గుర్తు పట్టడం కష్టం. చేతిలో ఓ మామూలు సంచి పట్టుకుని రోడ్లమీద సాదా సీదాగా నడుచుకుంటూ వెడుతుంటారు. అప్పుడెప్పుడో జ్వాలా వాళ్ళ ఇంటికి సతీ సమేతంగా కలిసివచ్చినప్పుడు చూశాను, చాలా రోజుల తర్వాత. భార్య ఊర్మిళా సుబ్బారావు కూడా ఐఏఎస్సే. బెజవాడలో పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అంచేతే కాబోలు ఆ ఊళ్ళో పేద ప్రజలు ఊర్మిళా నగర్ కట్టుకున్నారు. సుబ్బారావు గారి గురించి చెప్పేదే లేదు. ఆలిండియా ఐఏఎస్ టాపర్. కొన్ని దశాబ్దాల తరువాత కానీ మరో తెలుగు తేజం ముత్యాల రాజు ఐఏఎస్ టాపరుగా నిలిచేంతవరకు సుబ్బారావు గారి రికార్డు పదిలంగానే వుంది. ఆ రోజుల్లో కాంపిటీషన్ సక్సెస్ మేగజైన్ వాళ్ళు సుబ్బారావు గారి ఫోటోను కవర్ పేజీగా వేస్తె విచిత్రంగా చెప్పుకున్నారు.
సరే! విషయానికి వస్తాను. సుబ్బారావు గారు, భారత్ టుడే ఛానల్ చీఫ్ ఎడిటర్ జి. వల్లీశ్వర్ బాల్య స్నేహితులు. చిన్ననాటి స్నేహం కాబట్టి ఆయన్ని చూడడానికి సుబ్బారావు గారు అప్పుడప్పుడూ ఆ టీవీ ఆఫీసుకు వెడుతుంటారు. ఆ అలవాటు చొప్పునే కొన్నేళ్ళ క్రితం భారత్ టుడే కార్యాలయానికి వెళ్ళారు. ఆ సమయంలో స్టాఫ్ మీటింగులో వున్న వల్లీశ్వర్ ఆయన్ని కాసేపు కృష్ణారావు గారి గదిలో కూర్చోబెట్టి వెళ్ళారు. వారిద్దరూ మాట్లాడుతుండగానే పని పూర్తి చేసుకుని వల్లీశ్వర్ తిరిగి వచ్చారు. సుబ్బారావు గారు వల్లీశ్వర్ ని మొహమాట పడుతూ ఏదో అడుగుతుండడం ఆర్వీవీ కంటపడింది. విచారిస్తే విషయం తెలిసింది. సుబ్బారావు గారికి అర్జంటుగా ఇరవై వేలు అవసరమయ్యాయి. ఎన్ని ఏటీఎం లు తిరిగినా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. బ్యాంకులకు కూడా సెలవు.
వల్లీశ్వర్ దగ్గర కూడా అంత డబ్బులేదు. కృష్ణారావు గారి వైపు చూశాడు. ఆయనకి విషయం అర్ధం అయింది. మూడు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పైకం వుంది. అది సుబ్బారావు గారి అక్కరకు పనికి వచ్చింది. మరునాడో, ఆ మర్నాడో సుబ్బారావు గారు ఆ బాకీ చెల్లువేశారు. అది అప్రస్తుతం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆయన దేశం మొత్తానికి కరెన్సీ సరఫరా చేసే ఆర్బీఐ కి అత్యున్నత అధికారిగా పనిచేసారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దువ్వూరి సుబ్బారావు గారు రాసిన ఆంగ్లగ్రంధం లోని కొన్ని పేరాలను ఉటంకించారు. ఈ ఉదంతం చాలు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణారావు గారి దగ్గర డబ్బు తీసుకుంటున్నప్పుడు సుబ్బారావు గారు ఓ కోరిక కోరారు, అన్నీ అయిదువందల నోట్లు కాకుండా కొన్ని వంద నోట్లు కావాలని. ఆర్వీవీ ఆయనకు కొన్ని వంద నోట్లు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్నింటి మీద ఆర్బీఐ గవర్నర్ గా సుబ్బారావు గారు సంతకం చేసిన నోట్లు కూడా వున్నాయి.
ఉపశ్రుతి:
“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని ఉద్యోగి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.
ఈ విషయం స్టేట్ బాంక్ సీ జీ ఎం గా పనిచేసిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి ద్వారా తెలిసింది.

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావు

 నూట యాభయ్ రూపాయలతో  అన్నీ  చూపిస్తాను  రండంటున్నారు రాజేష్ వేమూరి.

నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్.

కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు)

నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.

విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో బయటపడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!

పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.

కరోనా కాలంలో ఇలాంటి పుస్తక పఠనం అభిలషణీయం, ఆహ్లాదకరం. 

ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.



(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551)