7, మే 2021, శుక్రవారం
ఆంధ్రపత్రిక కధ
"పక్కవారికి చెప్పేటందుకే.....
ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయంపై
విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట
నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ
మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో
సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి)
మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం
చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే
అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న
రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే
ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల
నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ
ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా
పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ
ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి
ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న
భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు
తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా
లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం
ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ
స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.
ఆరోజుల్లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో
పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో
ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోనుతో పని పడినప్పుడు దగ్గరలో
వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు
ఆయనకు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను
కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ
అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు
కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్
యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో, ఇంట్లో ప్రభుత్వం సమకూర్చిన
ఫోనులోమాట్లాడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న చీరెల
రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ
ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని
తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు
మానేసి, ‘సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు
రమ్మ’న్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ
అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా
ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ
అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య
ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి
బయటపడ్డాను. ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక
నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే
విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ
చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.
'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని
పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ.
పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ
పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి
నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా
మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత
వుండదు.
'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే మాత్రం
వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే
పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో
పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి జాబితాలో నా పేరు కూడా కలిపేసి
మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని
అవినీతిపరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.
నీతికీ, అవినీతికీ
నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి
దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో
అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు
పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన
నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ
చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో
వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు
భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే).
జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని
రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ
అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ
ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి
ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.
ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి
ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!
6, మే 2021, గురువారం
రేపటి మనుషులు
‘మాతరం అన్ని విషయాలను పట్టించుకుంటుంది’ రాత్రి బీబీసీ తెలుగు న్యూస్ లో ఓ ఆఫ్రో అమెరికన్ అమ్మాయి కాబోలు చెబుతోంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
నాకు తెలుసు నాకే తెలుసు
“నాకు అంతా తెలుసు అనుకోవడంలోనే తెలుస్తోంది అంతగా ఏమీ తెలియదని. I am sure.” అని నా పాత్రికేయ మిత్రుడు శ్రీ బుద్ధవరపు రామకృష్ణ నిన్న ఒక చిన్న పోస్టు పెట్టాడు. నేను దానికి “'నాకూ తెలుసు', 'నాకే తెలుసు' ఈ రెంటికి తేడా తెలిస్తే అంతా తెలిసినట్టే!” అని కామెంటు పెట్టాను. నిజానికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ పోస్టుకు, రాజకీయ రంగులు ఏమాత్రం లేని కామెంటు.
5, మే 2021, బుధవారం
ఒక రకంగా యుద్ధమే!
పీఎం కేర్స్ (PMCARES) నిధులతో ఢిల్లీలోని AIMS, రాం మనోహర్ లోహియా ఆసుపత్రులలో రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన మొదలయిందని, రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. సంతోషం.
కాడి బరువు
సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో ప్రజలనుంచే వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి. ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.
ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?
అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా
హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి
పోయే మాట నిజమే కాని, నిషేధం
విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు
ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.
ఏదైనా రాజకీయ
పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే
పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో
ఎన్నికలు దగ్గర పడితే తప్ప.
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ
రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)
ఆంధ్రప్రదేశ్
(ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల
గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది.
విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.
వావిలాల వారు
ఏమన్నారంటే:
“మన జీవితమంతా
రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి
ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న
నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి
భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది
రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి
గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ
వుంది?
“....కాంగ్రెస్
ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు.
తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్
అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో
అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా
చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను
మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు
లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో
రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.
మోరల్స్ లేవు.
బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా
మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి
సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.
“... ఈ బిల్లును
పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”
ఆ కాలంలో మద్య
నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.
ఇక ప్రస్తుతానికి
వస్తే,
నిరుడు కేంద్రం
కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి
పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.
1. ఆంధ్రప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. పశ్చిమ బెంగాల్
4. మహారాష్ట్ర
5. ఛత్తీస్ గర్
6. కర్ణాటక
7. అసోం
8. హిమాచల్ ప్రదేశ్.
ఈ రాష్ట్రాలు ఏ
పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.
ఈ రాష్ట్రాల్లో
అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.
కాబట్టి అందరూ
అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.
ఒక్కముక్కలో
చెప్పాలంటే:
"మద్య
నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం
మద్యం
అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"
తోకటపా:
రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల
సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ
అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో
విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు
పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.
మళ్ళీ ఒక రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం
షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది
వాదిస్తూ.
(2021)