7, మే 2021, శుక్రవారం

ఆంధ్రపత్రిక కధ

 

ఆంధ్రపత్రిక కధ అంటే ఓ మనసున్న మనిషి కధ. ఆయనే రాధాకృష్ణ.
రాధాకృష్ణ అంటే గుర్తు పట్టడం కష్టం. అదే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ అంటే తెలియనివాళ్ళు వుండరు.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన ఆంద్రపత్రిక దినపత్రిక తొలిరోజుల్లో బొంబాయి నుంచి ఆ తరువాత మద్రాసు నుంచి మొదలయి తదుపరి విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి ప్రచురణ సాగించింది. నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆధ్వర్యంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రపత్రిక చివరకు ఆయన కుమారుడు శివలెంక రాధాకృష్ణ చేతిలో కొన్నేళ్ళు నడిచి ఆగిపోయింది.

హైదరాబాదులో బషీర్ బాగ్ లో ఒక పెద్ద భవనంలో ఆంధ్రపత్రిక కార్యాలయం వుండేది. రాజగోపాల రావు గారు, ముక్కు శర్మ గారు, సుందరం, పాశం యాదగిరి, వేణుగోపాల్, విద్యారణ్య మొదలయిన వాళ్ళు బ్యూరోలో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఈవెనింగ్ ఎడిషన్ కు మంచి గిరాకీ వుండేది. పత్రికారంగంలో ఎదురయిన పోటీ తట్టుకోలేక అది మూతపడే సందర్భం వచ్చింది.

విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు పత్రికకు ఏదో సాయం చేయాలని సంకల్పించుకుని నామ మాత్రపు ధరకు ఆ భవనాన్ని వాళ్ళకే విక్రయించేలా ఏర్పాటు చేయమని తన కార్యదర్శి రాఘవేంద్ర రావు గారిని కోరారు. విషయం దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో రాధాకృష్ణ గారు ఇలా అన్నారు.
‘చిన్న పిల్లలకు మిఠాయిలు చూడగానే వాటినన్నిటినీ తినాలని అనిపిస్తుంది. అవన్నీ తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుంటారు. ఒకటి రెండు తినగానే నిద్ర వస్తుంది. ప్లేట్లో మిఠాయిలు అలాగే వుంటాయి. మనుషులమూ అంతే. ఎన్నెన్నో ఆస్తులు కూడబెట్టి అనుభవించాలని అనుకుంటాం. నానా అవస్థలు పడి ఆస్తులు పోగేస్తాం. ఏం లాభం! అనుభవించే వ్యవధానం లేక శాశ్వత నిద్రలోకి జారుకుంటాం’

ఇలాంటి వేదాంతంతో ఎంతో విలువైన ఆస్తిని ఆనాడు ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు.
ఆ భవనమే వుంటే, పంతులుగారు స్థాపించిన ఆంధ్రపత్రిక బతికేదేమో!
ఏం యాదగిరీ! అంతేనంటావా!

ఇప్పుడూ అంధ్రపత్రిక వస్తోంది దినపత్రికగానే. యాజమాన్యం మారినట్టుంది.

"పక్కవారికి చెప్పేటందుకే.....

 

ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.

సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.

అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.

 

ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.

ఆరోజుల్లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోనుతో పని పడినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో, ఇంట్లో  ప్రభుత్వం సమకూర్చిన ఫోనులోమాట్లాడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి, ‘సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మ’న్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను. ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.

 

'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు.

 

'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే మాత్రం వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి జాబితాలో నా పేరు కూడా కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని అవినీతిపరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.

 

నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.

ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

 

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

 

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.

 

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!

6, మే 2021, గురువారం

రేపటి మనుషులు

‘మాతరం అన్ని విషయాలను పట్టించుకుంటుంది’ రాత్రి బీబీసీ తెలుగు న్యూస్ లో ఓ ఆఫ్రో అమెరికన్ అమ్మాయి కాబోలు చెబుతోంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.

ఏపని చేయాలన్నా కాస్త ముందు వెనుకలు చూసుకోవాలి అనే తరం పెంచిన తరం మాది. ఈ ముందు వెనుకల శషభిషలు ఏమాత్రం పట్టించుకోని నేటి తరాన్ని చూస్తూ ఒకింత భయపడే తత్వం కలిగిన నా వంటి వారికి ఆ అమ్మాయి ఓ స్పూర్తి. దీనికి ఓ సొంత నేపధ్యం వుంది.
నిరుడు కరోనా గురించి తెలిసిన తొలి రోజుల్లో ముఖ్యంగా ఐసొలేషన్, హాస్పటల్లో ఐసోలేషన్, మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనే ఉద్దేశ్యంతో కరోనా కేసులు వచ్చిన వాడల్లో కంటైన్ మెంటు ఆంక్షలు మొదలయిన విషయాలు, వివరాలు మొదటిసారి విన్నప్పుడు ఒకింత భయంతో కూడిన సందేహాలు మొలకెత్తిన మాట వాస్తవం.
‘భయపడే పనే లేదు’ అనేవారు మా అబ్బాయి సంతోష్, కోడలు నిష.
అనడమే కాదు అన్ని రకాల ఏర్పాట్లు మొదట్లోనే చేశారు. ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీమీటర్, లంగ్ ఎక్సర్ సైజ్ చేసే పరికరాలు, అవసరం పడతాయి అనుకున్న మందులు, శానిటైజర్లు అన్నీ తెచ్చి పెట్టారు. లిఫ్టులో ఆక్సిజన్ సిలిండర్ తెస్తున్నప్పుడు మా ఇంట్లో ఎవరికో ఈ కరోనా వచ్చిందని మా ఫ్లాట్లో కొందరు అనుమాన పడ్డారు కూడా. వంట మనిషి, పనిమనిషి రాకపోతే ఏమి చేయాలి అనే విషయాలు కూడా ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారు. అప్పటికి వాక్సినేషన్ ఊసే లేదు.
‘మీరు అధైర్య పడకండి. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోను ఆసుపత్రిలో చేర్చము. కరోనా రాకుండా చేయాల్సింది చేద్దాము. కర్మ కాలి వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేద్దాము. ఈ వ్యాధి గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలియక, టీవీలు చూసి జనం అనవసరంగా కంగారు పడుతున్నారు’
ఇదీ వాళ్ళ వాదన. నాకప్పుడు అనిపించేది వాళ్ళు ముందు చూపుతో ఆలోచించడం లేదని.
అదే ఇప్పుడు అనిపిస్తోంది నేనే అప్పుడు ముందు చూపు లేకుండా ఆలోచించలేదని.
ఈ మధ్య మా చుట్టాల ఇంట్లో పెద్దవాళ్లు ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. పిల్లలు వెంటనే వారికి ఇంట్లోనే ఐ సొలేషన్ ఏర్పాటు చేశారు. మొదటి అయిదు రోజులు ఇవాల్సిన మందులు, ఆహరం ఇచ్చారు. మరో పది రోజులు అలాగే ఉంచారు. ఏ మందుల అవసరం పడలేదు. ఇప్పుడు పిల్లలతో కలిసి హాయిగా వుంటున్నారు.
భయానికి ఓ స్వభావం వుంది. దాన్ని చూసి బెదిరితే మరింత బెదరగొడుతుంది. మనం అదరగొడితే అది తోక ముడుస్తుంది.
(06-05-2021)

నాకు తెలుసు నాకే తెలుసు

“నాకు అంతా తెలుసు అనుకోవడంలోనే తెలుస్తోంది అంతగా ఏమీ తెలియదని. I am sure.” అని నా పాత్రికేయ మిత్రుడు శ్రీ బుద్ధవరపు రామకృష్ణ నిన్న ఒక చిన్న పోస్టు పెట్టాడు. నేను దానికి “'నాకూ తెలుసు', 'నాకే తెలుసు' ఈ రెంటికి తేడా తెలిస్తే అంతా తెలిసినట్టే!” అని కామెంటు పెట్టాను. నిజానికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ పోస్టుకు, రాజకీయ రంగులు ఏమాత్రం లేని కామెంటు.

దురదృష్టం ఏమిటంటే కొందరికి అవే కనిపించాయి. తప్పు లేదు, సహజం కూడా. వాటికి జవాబుగా అనికాదు కానీ ఎందుకో ఈ పోస్టు పెట్టాలని అనిపించింది.
ఇప్పుడు యాభయ్యవ పడిలో ఉన్న టీడీపీ అభిమానులను ఆ పార్టీకి ఎవరు శ్రీరామరక్ష అని అడిగితే యన్టీ రామారావు, చంద్రబాబునాయుడు అని చెబుతారు. అదే ప్రశ్నను ముప్పయ్యేళ్ళ వయస్సులో ఉన్న ఆ పార్టీ అభిమానులను అడిగితే ప్రాధాన్యతలు మారి, చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ అని వరస మార్చి చెబుతారు. కాలగతిలో వచ్చే మార్పు ఇది.
నా యాభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగగలిగే అరుదైన అవకాశాన్ని నా వృత్తి నాకు అందించింది. ఇది నా గొప్ప కాదు, నేను చేసిన ఉద్యోగం మరెవరు చేసినా వారికీ ఈ అవకాశం లభించి వుండేది.
ఆ అవకాశం ఇచ్చిన అనుభవంతో చెప్పగలను, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటారు. వాటిపై పత్రికల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు చివరికి ప్రకటిస్తారు. నిజానికి ఇది ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియే. దానికి విరుద్ధం కాదు. కానీ ఆ నిర్ణయానికి ప్రజామోదం వున్నట్టు తెలిసేలా జాగ్రత్త పడతారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేయక తప్పని పరిస్తితులు ఏర్పడ్డప్పుడు కూడా ఆయన ఇదే విధానాన్ని పాటించారు. పత్రికల్లో ప్రచారం ద్వారా ప్రజలను మానసికంగా అందుకు సంసిద్ధులను చేసిన తర్వాతనే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచారు. అందువల్లనే మద్యనిషేధం తొలగించినా ప్రజల్లో వ్యతిరేకత కానరాలేదు.
ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ మహానాడు జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ పార్టీ అభిమానులు పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు. వాటి గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ కటౌట్లు, బ్యానర్లు తొలగించాలని ఆగ్రహంతో ఆదేశించినట్టు కూడా మళ్ళీ పత్రికల్లో వచ్చింది. మధ్యాన్న భోజన సమయంలో కాబోలు నేను ఆయన్ని కలిసి సూటిగానే అడిగాను, ఇంత తంతు అవసరమా అని. ఆయన తనదైన శైలిలో నవ్వి ఊరుకున్నారు. అదే విలేకరుల సమావేశంలో ఇలా ఇబ్బంది పెట్టె ప్రశ్న వేస్తె ‘ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు అని గద్దించేవారు. విడిగా అడిగితే సౌమ్యంగా నవ్వి ఊరుకునేవారు. అది ఆయన స్వభావం.
ప్రతి దానికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఆయన కొత్తగా చేసుకున్న అలవాటు కాదు.
1978 లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఆయన చిత్తూరు జిల్లాలో పులిచర్ల సమితికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ ఎన్నికల్లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బెడద లేదు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్ధులు వున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఏర్పడ్డ ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)కి అభ్యర్ధులే కరువయ్యారు. చంద్రబాబుకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అదే మొదటిసారి. అందువల్ల ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అసలే కొత్త పార్టీ. ప్రత్యర్ధులు బలమైన వాళ్ళు. అంచేత ఆయన ముందు జాగ్రత్తగా ఆలోచించి తన విజయావకాశాలు ఎలా వుంటాయి అనే విషయం మీద ఒక అవగాహన కోసం చంద్రగిరి అసెంబ్లీలో ఒక సర్వే జరిపించారు. ఒకరకంగా అదే మొదటి పోల్ సర్వే అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది.
(ఈ సర్వే సంగతి శ్రీ కే. లక్ష్మినారాయణ వల్ల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసారు. సమర్దుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనతికాలంలోనే చక్కటి పేరు రావడానికి శ్రీ లక్ష్మీనారాయణ వంటి అధికారుల పాత్ర చాలా వుంది. ప్రముఖ సంపాదకులు శ్రీ ఇనగంటి వెంకట్రావు చంద్రబాబును గురించి రాసిన “ఒక్కడు- The Leader” అనే పుస్తకంలో ఈసర్వే సంగతి ఉదహరించారు)
(06-05-2021)

5, మే 2021, బుధవారం

ఒక రకంగా యుద్ధమే!

 పీఎం కేర్స్ (PMCARES) నిధులతో ఢిల్లీలోని AIMS, రాం మనోహర్ లోహియా ఆసుపత్రులలో రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన మొదలయిందని, రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. సంతోషం.

భారత సైన్యంలో EME అనే ఒక విభాగం వుంది. దాని ప్రధాన కార్యాలయం సికిందరాబాదు. రేడియో విలేకరిగా కొన్ని డజన్ల సార్లు ఈ విభాగం చేసే కార్యకలాపాలు దగ్గర నుండి చూసే అవకాశం నాకు లభించింది. సైన్యంలో ముందు భాగాన వుండి పోరాడే సైనికులకు అవసరం అయ్యే సరఫరాలను ఈ విభాగం కంటికి రెప్పలా కనిపెట్టి అందిస్తుంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలు, వాటి నమూనాలు, అభివృద్ధి సమస్తం ఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. యుద్ధ రంగాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడే సైనికులకు ఇది వెనకనుండి మద్దతు ఇస్తుంది. యుద్ధ సమయాల్లో దీని ప్రాధాన్యత చాలా వుంటుంది.
ఇప్పుడు దేశం సాగిస్తున్న కరోనాపై యుద్ధంలో కూడా ముందుండి పోరాడే డాక్టర్లు, నర్సులు, ఇతర సాంకేతిక వైద్య సిబ్బంది, రోగులకు అవసరం అయ్యే సరఫరాలను సరిగా అందేటట్టు చూడడానికి ఇటువంటి ప్రత్యేక విభాగం ఆవశ్యకత చాలా వుందనిపిస్తోంది.
దేశంలో అనేక చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. వాక్సిన్ అందుతోంది. ఇతర వైద్య పరికరాలు, ఔషధాలు సరిపడా ప్రస్తుతం లేకున్నప్పటికీ ముందు ముందు పరిస్థితులు బాగుపడే అవకాశాలు వున్నాయి. అయితే దేశంలో వివిధ రాష్ట్రాలలో అన్నిచోట్లా పరిస్థితులు ఒకే రకంగా లేవు. అవసరాలు కూడా విభిన్నంగా వున్నాయి.
రోగుల్ని గుర్తించడం, రోగ స్థాయిని నిర్దారించడం, వారి వైద్య అవసరాలను అంచనావేయడం, కావాల్సిన మందులు, పరికరాల సంఖ్యను గణించడం, ఆవశ్యకతని బట్టి వాటిని కాలయాపన జరగకుండా గమ్యస్థానానికి చేర్చడం ఇవన్నీ కరోనాపై చేసే యుద్ధంలో ప్రాధాన్యత కలిగిన అంశాలు.
అలాగే, ఒక చోట ఆక్సిజన్ అవసరం అవుతుంది. మరో చోట రెండెసివిర్ వంటి ఇంజెక్షన్లు అవసరం పడతాయి. ఇంకోచోట మరోటి అవసరం. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఎక్కడ ఎవరికీ ఏ పరిమాణంలో అవసరమో అక్కడికి అవి సత్వరం చేరేలా చూడాలి. దేశంలో ఎక్కడా, ఎవరూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని బాధ పడే అవకాశం లేకుండా ఈ ఏర్పాట్లు పారదర్శకంగా వుండాలి. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ఇలాంటి విషయాల్లో మానవ సామర్ధ్యానికి సాంకేతిక వనరులు తోడయితే సత్వర ఫలితాలు సాధ్యం అవుతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సాంకేతిక దేశీయ దిగ్గజాలు తలచుకుంటే చిటికెలో పని.
యుద్ధ ప్రాతిపదికన అనే పద ప్రయోగానికి నిజమైన అర్ధం ఇదే!
ఇవన్నీ ఒక పక్కన చేస్తూ మరో పక్కన అవసరం అనుకుంటే కర్ఫ్యూలు, లాక్ డౌన్ వంటి ప్రత్యామ్నాయాలు గురించి కూడా ఆలోచన చేయవచ్చు.
ఇక్కడ కేంద్రం, రాష్ట్రాలు అనే విభజన అనవసరం. చేస్తున్నది కరోనాపై యుద్ధం. జాతి యావత్తూ ఒక్కటై సాగించాల్సిన సమరం. పైగా గెల్చి తీరాల్సిన పోరాటం. మరో ప్రత్యామ్నాయం లేదు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తరువాత పరిపాలన మాత్రమే అని రాజకీయ పార్టీల నాయకులు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు ఇక కొత్తగా పెట్టే ఎన్నికలు కూడా లేవు. రాజకీయ నాయకులు తమ మాటల్లోని చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం!
(05-05-2021)
కింది ఫోటో : ఢిల్లీలో నిర్మాణం పూర్తయిన ఆక్సిజన్ ప్లాంట్ ( కేంద్ర ఆరోగ్యశాఖ సౌజన్యం)



కాడి బరువు

 సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో  ప్రజలనుంచే  వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే  ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి.  ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.

ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?

అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి పోయే మాట నిజమే కాని, నిషేధం విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.

ఏదైనా రాజకీయ పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో ఎన్నికలు  దగ్గర పడితే తప్ప.

(ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)

 

ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.

వావిలాల వారు ఏమన్నారంటే:

 

మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?

“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.

మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.

“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”

ఆ కాలంలో మద్య నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.

 

ఇక ప్రస్తుతానికి వస్తే,

నిరుడు కేంద్రం కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.

1. ఆంధ్రప్రదేశ్

2. ఉత్తరప్రదేశ్

3. పశ్చిమ బెంగాల్

4. మహారాష్ట్ర

5. ఛత్తీస్ గర్

6. కర్ణాటక

7. అసోం

8. హిమాచల్ ప్రదేశ్.

ఈ రాష్ట్రాలు ఏ పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.

ఈ రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.

కాబట్టి అందరూ అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే:

"మద్య నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం

మద్యం అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"

తోకటపా:

రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.

మళ్ళీ ఒక  రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది వాదిస్తూ.

(2021)