15, మే 2020, శుక్రవారం

మంచి నీళ్ళ కరెంటు – భండారు శ్రీనివాసరావు


“We cannot afford this sort of luxury there”
యూకే, అమెరికా వంటి సంపన్న దేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపేవాళ్ళు కూడా ఇండియాలోని తమ చుట్టపక్కాలను చూడడానికి వచ్చినప్పుడు చెప్పే మాట ఇది.
మన ఇళ్ళను చూసి, మన ఇంట్లో ఫర్నిచర్ ని చూసి కాదు వాళ్ళు ఈ మాట చెప్పేది. మనం విచ్చలవిడిగా వాడుతున్న విద్యుచ్చక్తిని చూసి.
“ఆ గదిలో ఎవ్వరూ లేరు, అయినా  పంకా తిరుగుతోంది, ఆపేయవచ్చు కదా!’
“అందరం ఇక్కడే కూర్చున్నాం కదా! ఆ గదిలో ఏసీ ఎందుకు”
ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాదు, కాస్త చనువు వున్నవాళ్ళు లేచి వెళ్లి ఆ పంకాని, ఆ ఏసీని ఆపేసి వస్తారు కూడా.
ఎందుకంటే ఆ దేశాల్లో కరెంటు చార్జీలు ముట్టుకోకుండానే కాలిపోయే రకం.
మన దగ్గర వంటింట్లో ఇల్లాలు వంట చేస్తుంటుంది. కొరియర్ వాడు వచ్చి బెల్ కొడతాడు. వెంటనే ఆవిడ ముందు గ్యాస్ ఆఫ్ చేసి వెళ్లి తలుపు తీస్తుంది. అంతేకాని అదే గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేయదు. అంతేకాదు, వంట చేస్తున్నంత సేపు డ్రాయింగు రూములో టీవీ మోగుతూనే వుంటుంది. కావాలంటే గమనించి చూడండి.
సాధారణ కుటుంబాల్లో కరెంటు వాడకం గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. ఎందుకంటే బిల్లు చూసిన తర్వాత కానీ చార్జీల సంగతి గుర్తుకు రాదు. నేనూ ఈ బాపతే. కానీ చార్జీల విషయంలో నా వాదన వేరు.
గతంలో ఎన్నో వ్యాసాలు రాసాను. ప్రతివాళ్ళం ఇళ్ళల్లో ఇంత హాయిగా వుంటున్నామంటే ఈ కరెంటు వల్లే. బయట ఎండ దంచుతున్నా ఫ్యాను గాలికి సేద తీరవచ్చు. రాత్రి వేళ గాలి బిగించి ఉబ్బతీసినా ఏసీ చల్లదనంతో హాయిగా కునుకు తీయవచ్చు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పెద్దపెద్ద టీవీలతో ఇంటినే ఒక థియేటర్ గా మార్చుకుని చక్కగా కాలక్షేపం చేయవచ్చు.
కానీ కరెంటు చార్జీలు మాత్రం పెంచరాదు. నేను రాస్తున్నది బీదాబిక్కీ విషయం కాదు, తీరి కూర్చుని సాంఘిక మాధ్యమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళ గురించి. వాడుకున్న దానికి చార్జి కట్టి తీరాలి. చేసిన పనికి తగిన వేతనం ఇచ్చి తీరాలి. ఏదీ ఉచితం కాదు.  ఈనాటి కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సూత్రాలు.
ఇదేదో కరెంటు చార్జీల పెంపుగురించి సాగుతున్న వివాదంలో ఎవరినో సమర్ధించడానికి ఇది రాయడం లేదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేరుగా ఆయనతోనే చెప్పాను, కరెంటు చార్జీలు పెంచితే పరవాలేదని. సందర్భం గుర్తు లేదు, ముఖ్యమంత్రి ఆ రోజు జూబిలీ హాల్ లాన్స్ లో విందు ఏర్పాటు చేసారు. నేను అప్పుడే మాస్కో నుంచి వచ్చాను. అయిదేళ్ళ పాటు కన్ను కొట్టని కరెంటు దీపాలు చూసివచ్చిన మత్తులో వున్నాను.
ఆ రోజుల్లోనే కరెంటు చార్జీల గొడవ ఊపందుకుంటోంది. మాటలమధ్యలో ఏమిటి రష్యా సంగతులు అంటే నేను చెప్పాను. మంచి నాణ్యత కలిగిన కరెంటు ఇవ్వండి. చార్జీలు పెంచినా జనం ఏమీ అనుకోరు. అలా కాకుండా ఇలా వచ్చి అలా పోయే కరెంటుకు ఎక్కువ చార్జీలు వేస్తేనే జనంతో  చిక్కొస్తుంది’ అనేది నా జవాబు.
చివరికి షాక్ ఆయనకు కొట్టింది. నేను బాగానే వున్నాను. కానీ నా అభిప్రాయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా మారకుండానే  వుంది.
అయినా నేనేమైనా రాజకీయాల్లో వున్నానా ఏమిటి తరచూ అభిప్రాయాలు మార్చుకోవడానికి.
''అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేస్తుంటే కానీ పొలిటీషియన్‌ కానేరడు''  - కన్యాశుల్కం లో గిరీశం     

14, మే 2020, గురువారం

టీటీడీ వారికి శాయంగల విన్నపాలు – భండారు శ్రీనివాసరావు

కొండకు వెళ్ళే భక్తులకు పరిమిత సంఖ్యలో ఆ దేవదేవుడి దర్శనభాగ్యం కలిగించాలని టీటీడీ పాలకమండలి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా కొంచెం అటూఇటూ రెండు మాసాలపాటు భక్తులకు స్వామి దర్శనాలు నిలిచిపోయాయి. ఇలా భక్తులకు దర్శనాలు నిలిపివేయడం అనేది తమకు తెలిసినంతవరకూ ఎప్పుడూ జరిగిన దాఖలా లేదని తిరుమల చరిత్ర సాకల్యంగా తెలిసినవారు చెబుతున్న మాట.
ఏదైతేనేం రేపోమాపో మళ్ళీ దర్శనాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ సందర్భంగా నూతన పాలకమండలికి కొన్ని సూచనలు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులకు ప్రోటోకాల్ దర్శనాలు ఎటూ తప్పవు. ఇక మిగిలిన వీఐపీ, వీవీఐపి దర్శనాలనుకట్టడి చేయడానికి ఇదొక మంచి అవకాశం. వృద్ధులు,వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఎలాగూ వున్నాయి. పొతే, సంపన్నులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అధికారులు, అనధికారుల వత్తిడే టీటీడీ అధికారులకు ఎక్కువ. అలాంటివారు మహా వుంటే రోజుకు ఓ వేయి రెండువేల మంది వుంటారు. వారిని కనిపెట్టి చూసుకుని దర్శనాలు చేయిస్తే వాళ్ళు తమని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటారని అక్కడి అధికారుల భరోసా. కానీ వేల సంఖ్యలో క్యూ లైన్లలో పడిగాపులు పడే సామాన్య భక్తుల సంగతేమిటి? వారు నమ్ముకున్న ఆ వెంకన్నే వారి సంగతి చూసుకుంటాడన్న భ్రమలో వున్నారేమో తెలియదు. సరే ఇదలా ఉంచుదాం.
ఉదయం సాయంత్రం ఓ నిర్ణీత సమయాల్లో ఈ వీఐపీ దర్శనాలకు ముందు మంగళం పాడాలి. ఈ రెండువేల మంది కోసం క్యూ లైన్లలో సామాన్య భక్తులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అంతగా అవసరం అనుకుంటే, సాధారణ క్యూ లైన్లను ఎలాంటి అంతరాయం లేకుండా ఓ పక్క నడుపుతూనే, ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా వచ్చిన వీఐపీని వచ్చినట్టు ప్రత్యేకమార్గం ద్వారా తీసుకువెళ్ళి గర్భగుడిలో కలిపేయాలి. ఇలా చేయడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి నిరీక్షణ అవసరం లేకుండా క్యూలో సాగిపోవడానికి వీలుపడుతుంది. ఎవరికోసమో తమని నిలిపివేశారనే భావన వారికి కలగదు. టీటీడీ వారికి సమయం కూడా కలిసివస్తుంది.
అయితే, చిక్కల్లా స్వామి సేవల విషయంలోనే. కొందరు సుప్రభాతం కోరుకుంటారు. మరికొందరు అభిషేకం. ఇంకొందరు కళ్యాణం. ఇలాంటి కోరికలు, లేదా మొక్కులు వున్న వారిని అత్యధిక రుసుములు వసూలు చేసి ఆయా దర్శనాలు కల్పించాలి. అది కూడా ముందు చెప్పిన పద్దతిలోనే సుమా.
మహాద్వారం నుంచి బయటకు వచ్చే వీవీఐపీలను టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేసే ప్రదేశాన్ని టీటీడీ తక్షణం అక్కడి నుంచి మార్చాలి. దేశం కోసం దేవుడ్ని ప్రార్ధించామని వాళ్ళు సిగ్గువిడిచి చెప్పే అబద్ధాలను జనం టీవీల్లో వినలేకపోతున్నారు. ఇదే పనిని వాళ్ళు తాము బస చేసిన అతిధి గృహంలోనో, కొండ దిగివచ్చిన తర్వాతనో చేసి వుంటే బాగుంటుంది.
ఇలాగే చేయాలని కాదు ఈ విన్నపం. ఇలా కూడా ఆలోచనలు చేస్తే ఓ మంచి మెరుగయిన మార్గం కనబడకపోదు అనేది ఓ చిరు ఆశ.




12, మే 2020, మంగళవారం

నూటికి నూరుపాళ్ళు జనం మనిషి


“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపొయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

నిజంగా నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. 


నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు


“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి  చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.

10, మే 2020, ఆదివారం

చాలా దిగులనిపించింది


అమ్మానాన్నల అబ్దీకాలు ఏటా పెట్టే బాధ్యత నా భుజాల మీదకు ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. బహుశా మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చనిపోయిన తర్వాత అనుకుంటా. రెండో అన్నయ్య రామచంద్రరావు గారు దత్తు. మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు మా పెద్దన్నయ్య కంటే ముందే పోయాడు.
బుద్ది ఎరిగిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో నాది ఎప్పుడూ తద్దినం పెట్టేవాడి  తమ్ముడి పాత్రే. చాలా పరిమితం. పిండాలు చేయడం, అయ్యగారు  చెప్పినప్పుడల్లా జంధ్యాన్ని సవ్యం, అపసవ్యం చేసుకుంటూ  కుడి ఎడమ భుజాలకు మార్చుకోవడం, మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత పిండాలను అగ్నిహోత్రంలో వేయడం ఇలాటి చిన్న చిన్న పనులేవో చేస్తుండేవాడిని.
మా నాన్నగారి తద్దినం డిసెంబరులో, అమ్మగారి ఆబ్దీకం ఆగస్టులో. నాకు ఏడెనిమిదేళ్ళ వయసులో నాన్న పోయాడు కాబట్టి, తద్దినం అనే ఎరుకతో నేను పెట్టినవి అరవై అయిదు పైనే వుంటాయి. మా అమ్మగారు 1993 లో కన్నుమూసారు. ఇన్నేళ్ళుగా మా ఇంట్లో తద్దినాలు పెట్టే బ్రాహ్మణులు, భోక్తలకు ఏటా గుర్తుచేసే అవసరం లేకుండా వారికి తిధులు, మా పేర్లు, గోత్రాలు బాగా గుర్తుండిపోయాయి.
ఏటా జరిగే ఈ క్రతువులో మా ఇంటి కోడళ్ళ పాత్ర ఎక్కువ. నిష్టగా మడి కట్టుకుని తడి బట్టలతో కావాల్సిన సంభారాలు అందిస్తుండేవారు. దాదాపు ఓ మూడు దశాబ్దాల పాటు మా నాన్నగారి తద్దినం మా ఊళ్లోనే పెట్టేవారు. మూడో అన్నయ్య ఈ ఏర్పాట్లు చూసేవాడు. ఏడుగురు అక్కయ్యలు బావగార్లు, వాళ్ళ పిల్లలు అంతా బండ్లు కట్టుకుని కొందరూ, బస్సుల్లో మరికొందరు, రైళ్ళలో ఇంకొందరూ మా వూరు చేరుకునేవారు. తద్దినం పెట్టే ఇంటికి పెళ్లి కళ వచ్చిందనే వారు ఊళ్లోవాళ్ళు.
క్రమంగా ఇదంతా గతంలోకి వెళ్ళిపోయింది. మా మూడో అన్నయ్య, పెద్దన్నయ్య మరణంతో ఈ కార్యక్రమం హైదరాబాదులోని మా ఇంటికి పరిమితం అయింది. రావాల్సిన వాళ్ళలో చాలామంది హైదరాబదులో సెటిల్ అయ్యారు. ఖమ్మం నుంచీ, బెజవాడ నుంచీ కొన్నేళ్ళు అక్కయ్యలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏడుగురిలో ఇద్దరు వున్నారు. అయిదుగురు పైలోకాల్లో ఉన్న అమ్మానాన్నల వద్దకు వెళ్ళిపోయారు.
తద్దినం తేదీ దగ్గర పడుతుండగానే మా ఆవిడ ఫోను పెట్టుకుని మా అక్కయ్యల నెంబర్లు, ఊళ్లోవున్న చుట్టాల నెంబర్లు  కలిపి ఇచ్చేది, పలానా రోజు తద్దినం మీరు తప్పకుండా రమ్మనమని నాచేత చెప్పించడానికి. ఇలా ఒకరోజల్లా ఆమె ఈ డ్యూటీ వేసుకునేది.  నిజానికి ఇది నేను చేయాల్సిన పని.
మే తొమ్మిదో తేదీ మా ఆవిడ పదో  మాసికం. చిన్నవాడు సంతోష్ తల్లికి నల్ల నువ్వులు తర్పణం వదులుతుంటే చాలా దిగులుగా  అనిపించింది.    

9, మే 2020, శనివారం

ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?


రాజ్యాంగ బద్ధ వ్యవస్థలు అన్నింటికీ విధివిధానాలు వున్నాయి. విస్తృత అధికారాలు వున్నాయి. లేనిదల్లా వాటి మధ్య సమన్వయమే. సంక్షోభ సమయాల్లో వ్యవహరించాల్సిన పద్ధతే.
ఒకళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు. మరొకరు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామంటారు. పలానా తేదీ లోగా నివేదిక ఇవ్వాలంటారు.
చివరికి ఇవన్నీ నెత్తికెత్తుకుని చేయాల్సింది స్ధానిక అధికార యంత్రాంగమే. వాళ్ళేమో అనుకోకుండా వచ్చి పడిన ఉత్పాతంతో ఉడ్డుగుడుచుకుంటున్నారు. సహాయకార్యక్రమాలు చూడాలో తెలియదు. నివేదికలు సకాలంలో తయారు చేయాలో తెలియదు.
ఉపద్రవాలు జరగకుండా ఈ సంస్థలు, వ్యవస్ధలు ఇంతకాలంగా ఏంచేస్తున్నాయో తెలియదు.
ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?
విశాఖ దుర్ఘటన ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే దేశానికి కావాల్సింది ఏముంటుంది?

8, మే 2020, శుక్రవారం

ఇద్దరు ముఖ్యమంత్రులు - ఒక సీఎస్



రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ విశ్లేషణలు చేయగలగడం నిజంగా కత్తిమీద సామే. ఇంగ్లీషులో న్యూట్రాలిటి అని పిలుచుకుంటున్న ఈ పదానికి ఎవరి అర్ధం వారు చెప్పుకుంటున్నారు.  ఏపీ రాజకీయ యవనికపై ఎన్ని పాత్రలు కనిపిస్తున్నా ప్రస్పుటంగా కనిపించేది చంద్రబాబు, జగన్ మోహన రెడ్డి ఇద్దరు మాత్రమే. టీడీపీ, వైసీపీ పార్టీలు  కూడా కాదు, బాబు, జగన్ ఇద్దరు మాత్రమే. వారి చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోంది. గతంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి పోటీ చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నడుమ నడిచేది. పొతే,
ఐఏఎస్ కాకపోయినా జీవితంలో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొందరు వుంటారు. కాకుంటే, వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో వుంటారు. వారిలో ఒకరు మోహన్ కందా. ఐఏఎస్ అయిన తర్వాత కూడా తనలో  నిగూఢంగా పెంచుకున్న రచనా దాహాన్ని రిటైర్ అయిన తర్వాత తీర్చుకున్నారు.  అందుకే గొప్పవాడు అన్నది.
రాజకీయాలు, న్యూట్రాలిటీ అనే మొదలు పెట్టి మధ్యలో ఈ కందా గారి ప్రసక్తి ఏమిటంటారా!  ఒక అధికారిగా ఉంటూ, అదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ  ఉత్తర దక్షిణ ధృవాల వంటి ఇద్దరు రాజకీయ నేతలతో నెగ్గుకు రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సందర్భాలలో కూడా ఆయన తామరాకు మీది నీటిబొట్టువలే తన కర్తవ్యాన్ని నిర్వహించిన తీరు ఈ న్యూట్రాలిటీకి అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  మోహన్ కందా ప్రధాన కార్యదర్శి. నిజానికి సీఎస్ గా కందాగారిని ఆయనే ఏరికోరి తెచ్చుకున్నారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేత. కొంతకాలం తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. కందాగారు మాత్రం యధావిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాలని భావించేవారు. తనది వర్కింగ్ గవర్నమెంట్ అని చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆయన అధికారగణంపై అసహనాన్ని దాచుకునేవారు కాదు. ముఖ్యమంత్రి అలా కటువుగా మాట్లాడుతుంటే మోహన్ కందా ఒకసారి కలగచేసుకుని, “ఛీఫ్ సెక్రెటరీ అని నన్నిక్కడ కూర్చోబెట్టాక నేను చెప్పింది వినిపించుకోకపోతే ఎలా” అనేశారు. చంద్రబాబుకు కోపం వచ్చి, “నేను ఏ సిఎస్ ను మిమ్మల్ని చూసినట్టు చూసుకోలేదు” అన్నారు. కందా కూడా గట్టిగానే జవాబు ఇచ్చారు. “నాకు ఎటువంటి ట్రీట్ మెంట్ కావాలో నాకో అంచనా వుంది. మీరు మిగతా వాళ్ళ కంటే నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగుతో నేనెలా సర్దిపెట్టుకుంటాను చెప్పండి”
“మీరు చెప్పేవి సబబుగానే అనిపిస్తున్నాయి.  నాక్కూడా ఏడేళ్ళ నుంచి అలా అలవాటయిపోయింది. ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పటికిలా కానివ్వండి. వచ్చేసారికి ఇవన్నీ సర్దుకునే ప్రయత్నం చేద్దాం” అన్నారు చంద్రబాబు నవ్వుతూ.
ఇలాంటిదే వై.ఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా జరిగింది.
ఓసారి పెద్ద మీటింగు జరుగుతోంది. వై.ఎస్. కిందిస్థాయి  అధికారులను ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు నోరు తెరిచేలోగానే మోహన్ కందా జవాబు చెబుతున్నారు. వై.ఎస్ కాసేపు  చూసి ‘ఏమండీ నన్ను  అధికారులతో నేరుగా మాట్లాడనివ్వరా” అని మోహన్ కందాను అడిగారు.
“లేదండీ” అనేశారు కందా. ఎదురుచూడని ఆ జవాబుతో వైఎస్. నిర్ఘాంతపోయారు.
“చీఫ్ సెక్రెటరీగా ఇక్కడ కూర్చున్నంతసేపు వాళ్ళ తరపున జవాబు చెప్పాల్సిన బాధ్యత నాదే. మీకు వాళ్ళే డైరెక్టుగా సమాధానం చెబితే ఇక నేనెందుకు. లీడర్ షిప్ అంటే ఇదే”
“బలేవారే మీరు” అన్నారు వై.ఎస్. కాసింత చిరాగ్గా, కాస్త నవ్వుకుంటూను.                      
చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకసభతో పాటు అసెంబ్లీకి కూడా కలిపి ఎన్నికలు జరపాలని కోరుతూ ప్రభుత్వం తరపున మోహన్ కందా కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. అప్పటి రాజకీయ పరిస్తితుల్లో అలా లేఖ రాయడం వై ఎస్ కి నచ్చలేదు. ఆయన మనసులో మాట దాచుకునే బాపతు కాదు.
రెండు ఎన్నికలు కలిపి నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సిఫారసు చేయడం తప్పని ఆయన పత్రికా ప్రకటన చేసారు.
అది చూడగానే కందా గారు వై.ఎస్. కి ఫోను చేసారు.
“ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు. మీకేమిటి సంబంధం” అన్నారు వై.ఎస్. గట్టిగా.
కందా ఇలా చెప్పారు. “ఇది క్యాబినెట్ నిర్ణయం. సీఎస్ గా సమర్ధించాను. ఎందుకంటారా. మీరు నా చోట్లోకి వచ్చి చూడండి. మీరు చీఫ్ సెక్రెటరీగా వున్నా ఇదే నిర్ణయం తీసుకుంటారు”   
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగాయి.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులు మారినప్పుడు చీఫ్ సెక్రెటరీ మారడం ఒక నిబంధన కాకపోయినా మారుతున్న రాజకీయ పరిస్తితుల్లో ఆనవాయితీగా మారింది.
మోహన్ కందా వెళ్లి వై.ఎస్. ని కలిసి చెప్పారు. ‘ప్రభుత్వం మారింది. కొనసాగడానికీ, అలాగే  తప్పుకోవడానికీ అభ్యంతరం లేదు అని. రెండ్రోజుల్లో చెబుతా అన్నారు వై.ఎస్.
రెండ్రోజుల్లో ఆయనే పిలిచి చెప్పారు, “ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యు టు కంటిన్యూ”
మొదట్లోనే వై.ఎస్. సీ.ఎస్. తో మరోమాట కూడా చెప్పారు “ యూ విల్ ఫైండ్ మీ ఎ వెరీ ఈజీ మాన్ టు గెట్ ఆన్ విత్”  
పదవీవిరమణ తరువాత శ్రీ మోహన్ కందా ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ అనే పేరుతొ ‘మోహన మకరందం’ రాశారు. అందులో ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వున్నాయి. అవి చదువుతుంటే మోహన్ కందా గారిలో మనకు మరో ముళ్ళపూడి కనిపిస్తారు.
పైన పేర్కొన్న అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు ఆయన మాటల్లోనే:
“వై.ఎస్. అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదనల  ఎస్టిమేట్స్, ప్రొజెక్షన్స్ చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ వేసారు. దాని నాయకత్వం  చీఫ్  సెక్రెటరీకి అప్పగించారు.
ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు. చీఫ్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు.
రాజశేఖరరెడ్డిగారి దగ్గరకు వెళ్లి “సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎబౌవ్ సస్పిషన్. నేను లీవులో వెళ్ళిపోతా” అని రాసిచ్చాను.
అది చదివి పక్కన పడేస్తూ, ‘మీకేమిటి సంబంధం. నిర్ణయం నాదే కదా!” అన్నారు వై.ఎస్.
“మొన్నటిదాకా టీడీపీకి పక్షపాతం చూపించానని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు వలపక్షం చూపిస్తున్నానని టీడీపీ వారు నిందలు వేస్తున్నారు” అన్నాను కారణం వివరిస్తూ.
“మీరే చెప్పారు కదా! చోటుమారి చూడమని” అని వై.ఎస్. గట్టిగా నవ్వేశారు.
(మోహన మకరందం, అనుభవాలూ – జ్ఞాపకాలూ  రచన: మోహన్ కందా, ప్రతులకు : నవోదయా బుక్ హౌస్, వెల: రెండు వందల రూపాయలు)