12, మే 2020, మంగళవారం

నూటికి నూరుపాళ్ళు జనం మనిషి


“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపొయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

నిజంగా నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. 


నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు


“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి  చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.

10, మే 2020, ఆదివారం

చాలా దిగులనిపించింది


అమ్మానాన్నల అబ్దీకాలు ఏటా పెట్టే బాధ్యత నా భుజాల మీదకు ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. బహుశా మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చనిపోయిన తర్వాత అనుకుంటా. రెండో అన్నయ్య రామచంద్రరావు గారు దత్తు. మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు మా పెద్దన్నయ్య కంటే ముందే పోయాడు.
బుద్ది ఎరిగిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో నాది ఎప్పుడూ తద్దినం పెట్టేవాడి  తమ్ముడి పాత్రే. చాలా పరిమితం. పిండాలు చేయడం, అయ్యగారు  చెప్పినప్పుడల్లా జంధ్యాన్ని సవ్యం, అపసవ్యం చేసుకుంటూ  కుడి ఎడమ భుజాలకు మార్చుకోవడం, మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత పిండాలను అగ్నిహోత్రంలో వేయడం ఇలాటి చిన్న చిన్న పనులేవో చేస్తుండేవాడిని.
మా నాన్నగారి తద్దినం డిసెంబరులో, అమ్మగారి ఆబ్దీకం ఆగస్టులో. నాకు ఏడెనిమిదేళ్ళ వయసులో నాన్న పోయాడు కాబట్టి, తద్దినం అనే ఎరుకతో నేను పెట్టినవి అరవై అయిదు పైనే వుంటాయి. మా అమ్మగారు 1993 లో కన్నుమూసారు. ఇన్నేళ్ళుగా మా ఇంట్లో తద్దినాలు పెట్టే బ్రాహ్మణులు, భోక్తలకు ఏటా గుర్తుచేసే అవసరం లేకుండా వారికి తిధులు, మా పేర్లు, గోత్రాలు బాగా గుర్తుండిపోయాయి.
ఏటా జరిగే ఈ క్రతువులో మా ఇంటి కోడళ్ళ పాత్ర ఎక్కువ. నిష్టగా మడి కట్టుకుని తడి బట్టలతో కావాల్సిన సంభారాలు అందిస్తుండేవారు. దాదాపు ఓ మూడు దశాబ్దాల పాటు మా నాన్నగారి తద్దినం మా ఊళ్లోనే పెట్టేవారు. మూడో అన్నయ్య ఈ ఏర్పాట్లు చూసేవాడు. ఏడుగురు అక్కయ్యలు బావగార్లు, వాళ్ళ పిల్లలు అంతా బండ్లు కట్టుకుని కొందరూ, బస్సుల్లో మరికొందరు, రైళ్ళలో ఇంకొందరూ మా వూరు చేరుకునేవారు. తద్దినం పెట్టే ఇంటికి పెళ్లి కళ వచ్చిందనే వారు ఊళ్లోవాళ్ళు.
క్రమంగా ఇదంతా గతంలోకి వెళ్ళిపోయింది. మా మూడో అన్నయ్య, పెద్దన్నయ్య మరణంతో ఈ కార్యక్రమం హైదరాబాదులోని మా ఇంటికి పరిమితం అయింది. రావాల్సిన వాళ్ళలో చాలామంది హైదరాబదులో సెటిల్ అయ్యారు. ఖమ్మం నుంచీ, బెజవాడ నుంచీ కొన్నేళ్ళు అక్కయ్యలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏడుగురిలో ఇద్దరు వున్నారు. అయిదుగురు పైలోకాల్లో ఉన్న అమ్మానాన్నల వద్దకు వెళ్ళిపోయారు.
తద్దినం తేదీ దగ్గర పడుతుండగానే మా ఆవిడ ఫోను పెట్టుకుని మా అక్కయ్యల నెంబర్లు, ఊళ్లోవున్న చుట్టాల నెంబర్లు  కలిపి ఇచ్చేది, పలానా రోజు తద్దినం మీరు తప్పకుండా రమ్మనమని నాచేత చెప్పించడానికి. ఇలా ఒకరోజల్లా ఆమె ఈ డ్యూటీ వేసుకునేది.  నిజానికి ఇది నేను చేయాల్సిన పని.
మే తొమ్మిదో తేదీ మా ఆవిడ పదో  మాసికం. చిన్నవాడు సంతోష్ తల్లికి నల్ల నువ్వులు తర్పణం వదులుతుంటే చాలా దిగులుగా  అనిపించింది.    

9, మే 2020, శనివారం

ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?


రాజ్యాంగ బద్ధ వ్యవస్థలు అన్నింటికీ విధివిధానాలు వున్నాయి. విస్తృత అధికారాలు వున్నాయి. లేనిదల్లా వాటి మధ్య సమన్వయమే. సంక్షోభ సమయాల్లో వ్యవహరించాల్సిన పద్ధతే.
ఒకళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు. మరొకరు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామంటారు. పలానా తేదీ లోగా నివేదిక ఇవ్వాలంటారు.
చివరికి ఇవన్నీ నెత్తికెత్తుకుని చేయాల్సింది స్ధానిక అధికార యంత్రాంగమే. వాళ్ళేమో అనుకోకుండా వచ్చి పడిన ఉత్పాతంతో ఉడ్డుగుడుచుకుంటున్నారు. సహాయకార్యక్రమాలు చూడాలో తెలియదు. నివేదికలు సకాలంలో తయారు చేయాలో తెలియదు.
ఉపద్రవాలు జరగకుండా ఈ సంస్థలు, వ్యవస్ధలు ఇంతకాలంగా ఏంచేస్తున్నాయో తెలియదు.
ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?
విశాఖ దుర్ఘటన ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే దేశానికి కావాల్సింది ఏముంటుంది?

8, మే 2020, శుక్రవారం

ఇద్దరు ముఖ్యమంత్రులు - ఒక సీఎస్



రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ విశ్లేషణలు చేయగలగడం నిజంగా కత్తిమీద సామే. ఇంగ్లీషులో న్యూట్రాలిటి అని పిలుచుకుంటున్న ఈ పదానికి ఎవరి అర్ధం వారు చెప్పుకుంటున్నారు.  ఏపీ రాజకీయ యవనికపై ఎన్ని పాత్రలు కనిపిస్తున్నా ప్రస్పుటంగా కనిపించేది చంద్రబాబు, జగన్ మోహన రెడ్డి ఇద్దరు మాత్రమే. టీడీపీ, వైసీపీ పార్టీలు  కూడా కాదు, బాబు, జగన్ ఇద్దరు మాత్రమే. వారి చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోంది. గతంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి పోటీ చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నడుమ నడిచేది. పొతే,
ఐఏఎస్ కాకపోయినా జీవితంలో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొందరు వుంటారు. కాకుంటే, వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో వుంటారు. వారిలో ఒకరు మోహన్ కందా. ఐఏఎస్ అయిన తర్వాత కూడా తనలో  నిగూఢంగా పెంచుకున్న రచనా దాహాన్ని రిటైర్ అయిన తర్వాత తీర్చుకున్నారు.  అందుకే గొప్పవాడు అన్నది.
రాజకీయాలు, న్యూట్రాలిటీ అనే మొదలు పెట్టి మధ్యలో ఈ కందా గారి ప్రసక్తి ఏమిటంటారా!  ఒక అధికారిగా ఉంటూ, అదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ  ఉత్తర దక్షిణ ధృవాల వంటి ఇద్దరు రాజకీయ నేతలతో నెగ్గుకు రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సందర్భాలలో కూడా ఆయన తామరాకు మీది నీటిబొట్టువలే తన కర్తవ్యాన్ని నిర్వహించిన తీరు ఈ న్యూట్రాలిటీకి అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  మోహన్ కందా ప్రధాన కార్యదర్శి. నిజానికి సీఎస్ గా కందాగారిని ఆయనే ఏరికోరి తెచ్చుకున్నారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేత. కొంతకాలం తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. కందాగారు మాత్రం యధావిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాలని భావించేవారు. తనది వర్కింగ్ గవర్నమెంట్ అని చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆయన అధికారగణంపై అసహనాన్ని దాచుకునేవారు కాదు. ముఖ్యమంత్రి అలా కటువుగా మాట్లాడుతుంటే మోహన్ కందా ఒకసారి కలగచేసుకుని, “ఛీఫ్ సెక్రెటరీ అని నన్నిక్కడ కూర్చోబెట్టాక నేను చెప్పింది వినిపించుకోకపోతే ఎలా” అనేశారు. చంద్రబాబుకు కోపం వచ్చి, “నేను ఏ సిఎస్ ను మిమ్మల్ని చూసినట్టు చూసుకోలేదు” అన్నారు. కందా కూడా గట్టిగానే జవాబు ఇచ్చారు. “నాకు ఎటువంటి ట్రీట్ మెంట్ కావాలో నాకో అంచనా వుంది. మీరు మిగతా వాళ్ళ కంటే నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగుతో నేనెలా సర్దిపెట్టుకుంటాను చెప్పండి”
“మీరు చెప్పేవి సబబుగానే అనిపిస్తున్నాయి.  నాక్కూడా ఏడేళ్ళ నుంచి అలా అలవాటయిపోయింది. ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పటికిలా కానివ్వండి. వచ్చేసారికి ఇవన్నీ సర్దుకునే ప్రయత్నం చేద్దాం” అన్నారు చంద్రబాబు నవ్వుతూ.
ఇలాంటిదే వై.ఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా జరిగింది.
ఓసారి పెద్ద మీటింగు జరుగుతోంది. వై.ఎస్. కిందిస్థాయి  అధికారులను ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు నోరు తెరిచేలోగానే మోహన్ కందా జవాబు చెబుతున్నారు. వై.ఎస్ కాసేపు  చూసి ‘ఏమండీ నన్ను  అధికారులతో నేరుగా మాట్లాడనివ్వరా” అని మోహన్ కందాను అడిగారు.
“లేదండీ” అనేశారు కందా. ఎదురుచూడని ఆ జవాబుతో వైఎస్. నిర్ఘాంతపోయారు.
“చీఫ్ సెక్రెటరీగా ఇక్కడ కూర్చున్నంతసేపు వాళ్ళ తరపున జవాబు చెప్పాల్సిన బాధ్యత నాదే. మీకు వాళ్ళే డైరెక్టుగా సమాధానం చెబితే ఇక నేనెందుకు. లీడర్ షిప్ అంటే ఇదే”
“బలేవారే మీరు” అన్నారు వై.ఎస్. కాసింత చిరాగ్గా, కాస్త నవ్వుకుంటూను.                      
చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకసభతో పాటు అసెంబ్లీకి కూడా కలిపి ఎన్నికలు జరపాలని కోరుతూ ప్రభుత్వం తరపున మోహన్ కందా కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. అప్పటి రాజకీయ పరిస్తితుల్లో అలా లేఖ రాయడం వై ఎస్ కి నచ్చలేదు. ఆయన మనసులో మాట దాచుకునే బాపతు కాదు.
రెండు ఎన్నికలు కలిపి నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సిఫారసు చేయడం తప్పని ఆయన పత్రికా ప్రకటన చేసారు.
అది చూడగానే కందా గారు వై.ఎస్. కి ఫోను చేసారు.
“ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు. మీకేమిటి సంబంధం” అన్నారు వై.ఎస్. గట్టిగా.
కందా ఇలా చెప్పారు. “ఇది క్యాబినెట్ నిర్ణయం. సీఎస్ గా సమర్ధించాను. ఎందుకంటారా. మీరు నా చోట్లోకి వచ్చి చూడండి. మీరు చీఫ్ సెక్రెటరీగా వున్నా ఇదే నిర్ణయం తీసుకుంటారు”   
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగాయి.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులు మారినప్పుడు చీఫ్ సెక్రెటరీ మారడం ఒక నిబంధన కాకపోయినా మారుతున్న రాజకీయ పరిస్తితుల్లో ఆనవాయితీగా మారింది.
మోహన్ కందా వెళ్లి వై.ఎస్. ని కలిసి చెప్పారు. ‘ప్రభుత్వం మారింది. కొనసాగడానికీ, అలాగే  తప్పుకోవడానికీ అభ్యంతరం లేదు అని. రెండ్రోజుల్లో చెబుతా అన్నారు వై.ఎస్.
రెండ్రోజుల్లో ఆయనే పిలిచి చెప్పారు, “ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యు టు కంటిన్యూ”
మొదట్లోనే వై.ఎస్. సీ.ఎస్. తో మరోమాట కూడా చెప్పారు “ యూ విల్ ఫైండ్ మీ ఎ వెరీ ఈజీ మాన్ టు గెట్ ఆన్ విత్”  
పదవీవిరమణ తరువాత శ్రీ మోహన్ కందా ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ అనే పేరుతొ ‘మోహన మకరందం’ రాశారు. అందులో ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వున్నాయి. అవి చదువుతుంటే మోహన్ కందా గారిలో మనకు మరో ముళ్ళపూడి కనిపిస్తారు.
పైన పేర్కొన్న అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు ఆయన మాటల్లోనే:
“వై.ఎస్. అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదనల  ఎస్టిమేట్స్, ప్రొజెక్షన్స్ చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ వేసారు. దాని నాయకత్వం  చీఫ్  సెక్రెటరీకి అప్పగించారు.
ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు. చీఫ్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు.
రాజశేఖరరెడ్డిగారి దగ్గరకు వెళ్లి “సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎబౌవ్ సస్పిషన్. నేను లీవులో వెళ్ళిపోతా” అని రాసిచ్చాను.
అది చదివి పక్కన పడేస్తూ, ‘మీకేమిటి సంబంధం. నిర్ణయం నాదే కదా!” అన్నారు వై.ఎస్.
“మొన్నటిదాకా టీడీపీకి పక్షపాతం చూపించానని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు వలపక్షం చూపిస్తున్నానని టీడీపీ వారు నిందలు వేస్తున్నారు” అన్నాను కారణం వివరిస్తూ.
“మీరే చెప్పారు కదా! చోటుమారి చూడమని” అని వై.ఎస్. గట్టిగా నవ్వేశారు.
(మోహన మకరందం, అనుభవాలూ – జ్ఞాపకాలూ  రచన: మోహన్ కందా, ప్రతులకు : నవోదయా బుక్ హౌస్, వెల: రెండు వందల రూపాయలు)               


6, మే 2020, బుధవారం

తెలిసిన సంగతులు, తెలియని వాస్తవాలు


ఇప్పుడు యాభయ్యవ పడిలో ఉన్న టీడీపీ అభిమానులను ఆ పార్టీకి ఎవరు శ్రీరామరక్ష అని అడిగితే యన్టీ రామారావు, చంద్రబాబునాయుడు అని చెబుతారు. అదే ప్రశ్నను ముప్పయ్యేళ్ళ వయస్సులో ఉన్న ఆ పార్టీ అభిమానులను అడిగితే ప్రాధాన్యతలు మారి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ అని వరస మార్చి చెబుతారు. కాలగతిలో వచ్చే మార్పు ఇది.
నా  యాభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగగలిగే అరుదైన అవకాశాన్ని నా వృత్తి నాకు అందించింది. ఇది నా గొప్ప కాదు, నేను చేసిన ఉద్యోగం మరెవరు చేసినా వారికీ ఈ అవకాశం లభించి వుండేది.
ఈరోజు ఉదయం చంద్రబాబు గురించి ఒక వ్యాఖ్య పెడితే ఆయన అభిమానులకి నచ్చినట్టులేదు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటారు. వాటిపై పత్రికల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు చివరికి ప్రకటిస్తారు. నిజానికి ఇది ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియే. దానికి విరుద్ధం కాదు. కానీ ఆ నిర్ణయానికి ప్రజామోదం వున్నట్టు తెలిసేలా జాగ్రత్త పడతారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేయక తప్పని పరిస్తితులు ఏర్పడ్డప్పుడు కూడా ఆయన ఇదే విధానాన్ని పాటించారు. పత్రికల్లో ప్రచారం ద్వారా  ప్రజలను మానసికంగా అందుకు సంసిద్ధులను చేసిన తర్వాతనే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచారు. అందువల్లనే మద్యనిషేధం తొలగించినా  ప్రజల్లో వ్యతిరేకత కానరాలేదు.   
ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ మహానాడు జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ పార్టీ అభిమానులు పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు. వాటి గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ కటౌట్లు, బ్యానర్లు తొలగించాలని ఆగ్రహంతో ఆదేశించినట్టు కూడా మళ్ళీ పత్రికల్లో వచ్చింది. మధ్యాన్న భోజన సమయంలో కాబోలు నేను ఆయన్ని కలిసి  సూటిగానే అడిగాను, ఇంత తంతు అవసరమా అని. ఆయన తనదైన శైలిలో నవ్వి ఊరుకున్నారు. అదే విలేకరుల సమావేశంలో ఇలా ఇబ్బంది పెట్టె ప్రశ్న వేస్తె ‘ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు అని  గద్దించేవారు. విడిగా అడిగితే సౌమ్యంగా నవ్వి ఊరుకునేవారు. అది ఆయన స్వభావం.
ప్రతి దానికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కొత్తగా చేసుకున్న అలవాటు కాదు. 1978 లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఆయన చిత్తూరు జిల్లాలో పులిచర్ల సమితికి  యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ ఎన్నికల్లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బెడద లేదు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్ధులు వున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఏర్పడ్డ ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)కి అభ్యర్ధులే కరువయ్యారు. చంద్రబాబుకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అదే మొదటిసారి. అందువల్ల ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అసలే కొత్త పార్టీ. ప్రత్యర్ధులు బలమైన వాళ్ళు. అంచేత ఆయన ముందు జాగ్రత్తగా ఆలోచించి తన విజయావకాశాలు ఎలా వుంటాయి అనే విషయం మీద ఒక అవగాహన కోసం చంద్రగిరి అసెంబ్లీలో ఒక సర్వే జరిపించారు. ఒకరకంగా అదే మొదటి పోల్ సర్వే అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది.
(ఈ సర్వే సంగతి శ్రీ లక్ష్మినారాయణ వల్ల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసారు. సమర్దుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనతికాలంలోనే చక్కటి పేరు రావడానికి శ్రీ లక్ష్మీనారాయణ వంటి అధికారుల పాత్ర చాలా వుంది. ప్రముఖ సంపాదకులు  శ్రీ ఇనగంటి వెంకట్రావు చంద్రబాబును గురించి రాసిన “ఒక్కడు- The Leader” అనే పుస్తకంలో ఈసర్వే సంగతి ఉదహరించారు)            

మద్యనిషేధం పై అసెంబ్లీలో వావిలాల ప్రసంగం



తెలుగు మద్యం పోస్టుపై పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణారావు వ్యాఖ్యానిస్తూ నాటి శాసన సభలో జరిగిన చర్చలు గురించి తెలిస్తే రాయమని సూచించారు.
అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే  1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది.
ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించి పోస్టు చేస్తున్నాను.
“మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?
“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.మోరల్ ప్రిన్సిపుల్స్ వున్నాయని సంతోశిడ్డాము అంటే పర్మిషన్ ఇస్తుంటారు. గవర్నమెంటు డిస్టిలరీస్ నడపడానికి ప్రయత్నం చేస్తోంది. అవి మంత్రి గారు నడుపుతారా సెక్రెటరీలు నడుపుతారా కాంట్రాక్టర్లకు ఇస్తారు.
“విషం కలిపితే తాగి చనిపోతునట్టు వింటున్నాం. పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటోంది. నిజలింగప్ప గారు వ్హేప్పినట్టు దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అవుతోంది. మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము.  అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.
“బకాసురుడు బాధ పెట్టినట్టుగా రోజూ ఎస్ ఐ వెళ్లి ఈ ప్రొఫార్మా వుంది. మీరు ఈ గ్రామంలో నాలుగు దుకాణాలు పెట్టుకోండి, కానీ మాకు నెలకు రెండు కేసులు ఇవ్వండి అంటారు. స్టాటస్టిక్స్ చూడండి. పేదవాళ్ళు కాకుండా ధనవంతులు ఎవరైనా జైలుకు పోయారా. అటువంటప్పుడు ఈ యాక్టు ఎందుకు. 160 మంది కాంగ్రెస్ లేజిస్లేటర్లు రద్దు చేయడానికి సంతకం చేసారట. ప్రొహిబిషన్ కావాలి అంటున్నారు. గాంధీజీ సిద్దాంతం అంటున్నారు. త్రాగడానికి ఒప్పుకున్నారు.
“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”