27, డిసెంబర్ 2014, శనివారం

కేసీయార్ విశ్వ నగర నిర్మాణం

(Published by 'SURYA'. telugu daily in its Edit Page on 28-12-2014, SUNDAY)

కొన్ని ముచ్చట్లు వింటుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఇలాటి ముచ్చటగొలిపే  ముచ్చట్లు చెప్పడంలో సిద్ధహస్తులు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు. బంగారు తెలంగాణ గురించి ఆయనకు ఎన్నో కలలు వున్నాయి. ఆ కలలను సాకారం చేయడం కోసం ఆయన నిరంతరం తపిస్తున్నట్టుగానే కానవస్తారు. వాటిని నిజం చేసుకోగల బంగారు అవకాశం కూడా ఆయనకు ముఖ్యమంత్రి  పదవి రూపంలో లభించింది. అందుకే కేసీయార్ ప్రతిరోజు ఎన్నెన్నో గంటలపాటు అధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతున్నట్టు అనుదినం పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. ముందే చెప్పినట్టు ఆయన చెబుతుంటే వినేవాళ్ళు మంత్రముగ్ధులు అవ్వడం అనేది తధ్యం. ఇది అతిశయోక్తి అనిపించినా అది పచ్చి నిజం. ముఖ్యంగా హైదరాబాదు గురించి  అయితే, ఆయన ఆలోచనలు అంబరాన్ని తాకుతుంటాయి. హుస్సేన్ సాగర్ లోని కాలుష్య  జలాలను తోడేసి, దాన్ని మంచి నీటి సరస్సుగా తయారుచేయడం వాటిల్లో ఒకటి. రెండు నగరాల నడుమ అంత పెద్ద తటాకం వున్న మరో మహా  నగరం మన దేశంలోనే లేదంటారు. భాగ్యనగరాన్ని విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి అందుబాటులో వున్న ప్రధాన ఆకర్షణ కూడా హుస్సేన్ సాగరే. తెలంగాణకు ఎట్లాగు సముద్ర తీరం లేదు. కాబట్టి సిద్ధంగా వున్న సాగర తీరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలన్నది టీ ఆర్ యస్ అధినేత అంతరంగం కావచ్చు. ఆ ప్రాంతంలో ప్రపంచంలో కెల్లా ఎత్తయిన వంద అంతస్తుల భవన నిర్మాణం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. రికార్డులకెక్కే ఇటువంటి బృహత్తర నిర్మాణాలను కళ్ళారా చూడాలనే పర్యాటకుల సంఖ్య అన్ని దేశాల్లో తక్కువేమీ కాదు. పర్యాటకం ద్వారా గుర్తింపు, అదే సమయంలో ఆర్ధిక పరమైన లబ్ది పొందడం ద్వారా దాన్ని ఉభయతారకం చేసుకోవడం తెలంగాణా ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు. కేసీయార్ ఇటువంటి ఆలోచనలను పంచుకునేటప్పుడు వాడే భాషా చమత్కారం కూడా బహు రంజకంగా ఉంటుందని విన్నవాళ్ళు చెప్పే మాట. అయితే,   ఆ మాయతెర తప్పుకున్న తరువాత ఆయన చెప్పినదంతా ఆచరణ  సాధ్యమయ్యే పనేనా అని కూడా అనిపించవచ్చు. కానీ ఆయన మాత్రం ఇటువంటి సందేహాత్ములను అస్సలు పట్టించుకోరు. లెక్కచెయ్యరు. తను అనుకున్న పద్దతిలోనే ముందుకు సాగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇస్తారు. అంతేకాదు,   బంగారు తెలంగాణా ఎలా వుండాలని తాను  కోరుకుంటున్నారో వాటిని గురించి కలలు కనడం కూడా  మానరు. వాటిల్లో కొన్నింటిని  సాకారం చేయగలిగితే మాత్రం బంగారు తెలంగాణా ఆవిష్కృతం కావడం తధ్యం. అందులో సందేహం లేదు. అలా జరిగిన నాడు  ఆయన్ని అపర భగీరధుడు అని పొగిడినా ఆశ్చర్యం లేదు.


సరే! హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భుజాలకెత్తుకున్నారు. అహరహం దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. నేర రహిత నగరంగా, ట్రాఫిక్ ఝంఝాటాలు లేని నగరంగా, చక్కని ఉద్యానవనాలు, పచ్చని ప్రకృతితో అలరారే నగరంగా మార్చాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మాఫియాలబారి నుంచి, భూకబ్జాదారుల కోరలనుంచి, దళారుల కబంధ హస్తాల నుంచి  నగరాన్ని విముక్తం చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇలాటి ఆలోచనలు చేసేవాళ్ళని ఎవ్వరూ తప్పుపట్టలేరు. ఇలాటి ప్రతి చర్యను ప్రతిఒక్కరు ఆహ్వానిస్తారు కూడా. కోడలు కంటాను అంటే వద్దనే అత్త ఉండదని సామెత.
ఇవన్నీ ఒకెత్తు. స్కై స్క్రేపర్లు (ఆకాశహర్మ్యాలు), స్కైవేలు (ఆకాశ వీధులు) ఇలా అత్యాధునిక నిర్మాణాలతో మరో ఇరవై ఏళ్ళ కాలానికి సరిపడే విధంగా ప్రణాళికలు తయారుచేయిస్తున్నారు.  
ఆయన చెప్పడానికి, ఇతరులు వినడానికి అంతా బాగానే వుంది. మరి ఇవన్నీ ఎలా సాధ్యం. ఇన్నిన్ని  ప్రాజక్టులు ఒకే పర్యాయం  అమలుచేయాలంటే ఎన్ని నిధులు కావాలి, అవి ఎక్కడినుంచి వస్తాయి అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం కూడా తధ్యం. ఎందుకంటె ఒకటీ అరా పనులకు  సరిపడే డబ్బును ఎల్లాగో అల్లా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని తలకెత్తుకోవాలంటే  తలకు మించిన భారమే అవుతుంది. అన్ని నిధులు ఎలా సమకూరుతాయి ? అన్ని వనరులు ఎక్కడ వున్నాయి?  అధికారులకి ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు మాత్రం ఇవన్నీ అనుకోకుండా అందివచ్చే  అస్త్రశస్త్రాలు.
మనసుండాలే కాని మార్గం అదే దొరుకుతుందని మామూలుగా రాజకీయ నాయకులు వల్లె వేసే మాట.
నిజమే. మాజీ రాష్ట్రపతి  కలాం గారు చెప్పినట్టు కనే కలలు పెద్దవిగానే  వుండాలి. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం కూడా అంతే  పెద్దగా వుండాలి. బహుశా  కేసీయార్ ప్రస్తుతం  చేస్తున్నది అదే కావచ్చు. ప్రజలిచ్చిన అయిదేళ్ళ వ్యవధానంలో ఆరునెలల కాలం  అప్పుడే గతంలోకి జారిపోయింది. మిగిలినకాలంలో  కొన్నయినా సాధించాలంటే కాలంతో  పరిగెత్తక తప్పదనుకున్నారేమో!
హైదరాబాదును విశ్వ నగరం చేయడం మంచి ఆలోచన. కానీ చాలామంది నగర ప్రేమికులు, నగర రూపురేఖలు మార్చినా పరవాలేదు కాని హైదరాబాదు నగరానికి వున్న సంస్కృతీ సంప్రదాయాల మూలాలు  ధ్వంసం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు. మొత్తం  దేశంలో  హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అభివృద్ధి పేరుతొ వాటిల్లో అనేకం ఇప్పటికే రూపుమాసి పోయాయి. పాత హైదరాబాదు మళ్ళీ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇది చేయడానికి నిధులు అక్కరలేదు. కొంచెం చిత్తశుద్ధి, మరి కొంచెం పట్టుదల వుంటే సరిపోతుంది.
మార్పు అనివార్యం. దానికి మోకాలడ్డడం వివేకం అనిపించుకోదు. మార్పును స్వాగతిస్తూ, మూలాలను పదిలం చేసుకుంటూ పధకాలు సమన్వయం చేసుకోగలిగితే ఫలితాలు ఫలవంతంగా వుంటాయి.  


ఉదాహరణకు, ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు. ఇప్పటి హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు.  నిజామ్  కాలంనాటి నగర జీవనం ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్ ను అనుకునే వుంటుంది)  కనిపించినప్పుడు వొళ్ళు పులకరిస్తుంది. ఇటీవలి కాలంనాటి అంటే ఓ యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు నక్షత్రాల హోటళ్ళకో  పరిమితమయిపోయాయి.
హైదరాబాదు గురించి, దాని సంస్కృతీవైభవాలు గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు  రాసారు.
శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు నాడు నేడు' అనే పుస్తకంలో 1935 ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు. ఇలాటివి చదివినప్పుడు మళ్ళీ అలనాటి నగరాన్ని ఎవరయినా తెచ్చి ఇవ్వగలిగితే యెంత బాగుంటుంది అనిపిస్తుంది. వాటిల్లో కొన్ని ముచ్చట్లు.  
"బెజవాడ నుంచి సికిందరాబాదుకు నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
" దబీర్ పురావైపు మలక్ పేట రైల్వే  వంతెన కిందనుంచి వెడితే మూసీ నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం. చాలా అందంగా వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద పకీరు కూర్చుని 'అల్లా రహమ్ కరదే, మౌలా హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్ బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా',  తరువాత సాగర్ టాకీసు, జిందా తిలిస్మాత్ దుకాణం, ఆపైన  ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల  గురువు. ఏటా వారి పుట్టిన రోజున  ఊళ్ళోని మార్వాడీలు అందరూ  కలిసి వారి ఎత్తు బంగారం తూచి కానుకగా  ఇచ్చేవారట. నిజాం నవాబు  కన్నా వీరు ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు  ఒక రోల్స్ రాయిస్ కారు కొంటే, వీళ్ళు రెండు కొనేవారట.
"ఆబిడ్స్ లో 'కెఫే కరాచీ'. అందులో అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. మలై వాలా చాయ్ ఒక అణా. నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో వుండేది.  నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి నూటపదహారు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు.   
"ఆబిడ్స్ లో జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు.  ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి ముసునూరి సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి వారం రోజులపాటు  సంగీతసభ  జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో 'దీనామణీ వంశ - తిలక- లావణ్య - దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు. ఆ రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య హరిశ్చంద్ర' తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ  మరో  సినిమా హాలు వుండేది."
ఇలాటి జ్ఞాపకాలు ఎందరెందరి మనసుల్లోనో గూడుకట్టుకుని ఉండిపోయాయి. ఎవరో ఎందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఒక్కరు చాలు ఇటువంటి మధుర స్మృతులను గుర్తుచేయడానికి.
అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతోంది.
హైదరాబాదుని విశ్వ నగరం చేయండి! ఏమీ అభ్యంతరం లేదు.

అయితే, ఆ నగరానికి వున్న 'ఆత్మ'ను కాపాడండి. (27-12-2014)
NOTE: Photo Courtesy Image Owner

26, డిసెంబర్ 2014, శుక్రవారం

పాతైదరబాదు



వూరుమారిపోతోంది. అలా మారడం దాని ధర్మం. కాని ఆ మార్పుల ఆనవాళ్ళు దాచుకోకపోవడం ఆ వూరివాళ్ళ ఖర్మం.
ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు. ఇప్పటి హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు. పాత నిజామ్  కాలంనాటి నగర జీవనం ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్ అనుకునే వుంటుంది)  కనిపించినప్పుడు వొళ్ళు పులకరిస్తుంది. ఇటీవలి కాలం నాటి అంటే ఓ యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు నక్షత్రాల హోటళ్ళకో  పరిమితమయిపోయాయి.
హైదరాబాదు గురించి, దాని సంస్కృతీ వైభవాలు గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు  రాసారు. 'నమస్తే తెలంగాణా' వంటి  పత్రిక మళ్ళీ వాటిల్లో కొన్నింటిని అయినా సామాన్య పాఠకుల చెంతకు తెస్తే బాగుంటుంది.
వింటున్నారా కట్టా శేఖర రెడ్డి గారు. చాలా ఏళ్ళ క్రితం జర్నలిష్టు అనుభవాలను గ్రంధస్తం చేసే పనిలో, ఎన్నో సార్లు అనేకమంది జర్నలిష్టులకి ఫోన్లు చేసి, నావంటి సహజ బద్దకస్తుల చేత కూడా వ్యాసాలు రాయించిన పట్టుదల, కట్టా వారిది. ఇదంతా ఎందుకంటె,  శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన ఓ పుస్తకం చదివిన వేళా విశేషం.
శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు నాడు నేడు' అనే పుస్తకంలో 1935 ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు. వాటిల్లో కొన్ని ముచ్చట్లు.




"బెజవాడ నుంచి సికిందరాబాదుకు నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
" దబీర్ పురావైపు మలక్ పేట రైల్వే  వంతెన కిందనుంచి వెడితే మూసీ నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం. చాలా అందంగా వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద పకీరు కూర్చుని 'అల్లా రహమ్ కరదే, మౌలా హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్ బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా',  తరువాత సాగర్ టాకీసు, జిందా తిలిస్మాత్ దుకాణం, ఆపైన  ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల  గురువు. ఏటా వారి పుట్టిన రోజున  ఊళ్ళోని మార్వాడీలు అందరూ  కలిసి వారి ఎత్తు బంగారం తూచి కానుకగా  ఇచ్చేవారట. నిజాం నవాబు  కన్నా వీరు ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు  ఒక రోల్స్ రాయిస్ కారు కొంటే, వీళ్ళు రెండు కొనేవారట.
"ఆబిడ్స్ లో 'కెఫే కరాచీ'. అందులో అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. ఒక అణా పెడితే  'మలై వాలా చాయ్' నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో వుండేది.  నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి నూటపదహారు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు.   
"ఆబిడ్స్ లో జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు.  ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి ముసునూరి సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి వారం రోజులపాటు  సంగీతసభ  జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో 'దీనామణీ వంశ - తిలక- లావణ్య - దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు. ఆ రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య హరిశ్చంద్ర' తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ  మరో  సినిమా హాలు వుండేది."

ఈ పుస్తకం రాసిన శాస్త్రి గారిది ప్రకాశం  జిల్లా అనమనమూరు గ్రామం. 1922 లో జన్మించిన శాస్త్రి గారు కేంద్ర ప్రభుత్వ సైనిక లేఖనియంత్రణ శాఖలో వివిద హోదాల్లో దేశ విదేశాల్లో అనేక చోట్ల పనిచేశారు. 'హైదరాబాదు నాడు నేడు' అనే పేరుతొ ఆయన రాసిన ఈ పుస్తకాన్ని 2008 లో మొదటి సారి ముద్రించారు. వెల యాభై రూపాయలు. నవోదయ బుక్ హౌస్ లో దొరికే అవకాశం వుంది.

24, డిసెంబర్ 2014, బుధవారం

'భారత రత్న' అటల్ బిహారీ వాజ్ పేయీ

మరవతగని మనిషి మరపున పడుతున్నారా!
(బీజేపీ అగ్రనాయకుడు శ్రీ వాజ్ పేయీ కి మోడీ ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారం ప్రకటించిన సందర్భంలో గుర్తుకు వచ్చిన 15-4-2014 నాటి పాత వ్యాసం)
యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.

వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)


23, డిసెంబర్ 2014, మంగళవారం

బీజేపీలో విజయోత్సాహం ఎటు దారి తీస్తుంది ?

PUBLISHED BY'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 25-12-14,THURSDAY  
 (Revised Copy after poll results)
జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు, దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా  రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్  అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివి. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని  ఎక్జిట్ పోల్ సర్వేలు ముందస్తుగానే వెల్లడించాయి. కొంచెం అటూ ఇటూగా అసలు ఫలితాలు కూడా ఆ ఊహాగానాలకు దగ్గరగానే వున్నాయి. కాశ్మీర్ లోని 'దాల్ సరస్సులో కమలాలు పూయించాలని' బీజేపీ  పెద్ద ప్రయత్నమే చేసింది. అనేక దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల సమయంలోనే కాదు, ప్రధాని పదవిని స్వీకరించిన తరువాత మోడీ ఎన్నిసార్లు కాశ్మీర్ లోయని సందర్శించింది అందరికీ తెలుసు. ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోయినా, కాశ్మీర్ లో కమల దళాలు విభ్రమం కలిగించే రీతిలోనే  విచ్చుకున్నాయని వొప్పుకోక తప్పదు. పీడీపీ అతిపెద్ద పార్టీగా, తరువాతి స్థానంలో రెండో అతిపెద్ద పార్టీగా  బీజేపీ అవతరించాయి కాబట్టి  సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే  ఈ రెంటి మధ్యనే పొత్తు కుదరాలి. ఎందుకంటె కాంగ్రెస్ ఎట్లాగు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, అల్లాగే, నేషనల్ కాంగ్రెస్ పీడీపీకి  కొమ్ముకాయదు.
ఫలితాలు ఓ పక్క వెలువడుతూ ఉండగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల కనీస సంఖ్యాబలం వుంది కాని కాశ్మీర్ లో ఏపార్టీకి సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే బలం సమకూరలేదు. పేరుకు బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిది కాని గెలుచుకున్న పాతిక సీట్లు అందుకు ఏమాత్రం సరిపోవు. అయినా ప్రభుత్వం ఏర్పాటుపై స్వయానా బీజేపీ అధ్యక్షుడే ప్రకటన చేయడం సంకీర్ణం పట్ల ఆశలు పెంచింది. పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలతో మొదటి స్థానంలో వుంది  కాని మేజిక్ సంఖ్య నలభై నాలుగుకు అది చాలా తక్కువ. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పొత్తుల విషయంలో బీజీపీదే సహజంగా పై చేయి అయ్యే అవకాశం ఎలాగూ వుంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో వోట్ల శాతం తో పాటు సీట్ల సంఖ్య  కూడా పెరగడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగించే విషయమే. 'ఏకే ఫార్టీ సెవెన్లు కాదు ప్రతి కాశ్మీరీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు చూడాలని ఉందంటూ' మోడీ చేసిన ప్రసంగాలు కొన్ని దశాబ్దాలుగా కాల్పులు, ప్రతి కాల్పులతో అట్టుడుకి పోతున్న అక్కడి ప్రజల్లో కొంత ఆలోచన కలిగించాయని అనుకోవచ్చు. పాతిక సీట్లు ఏపాటి అని ఇతర రాజకీయ పార్టీలు అనుకోవచ్చు కాని కాశ్మీర్ వంటి రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అది పెద్ద విజయమే. కాశ్మీర్ అసెంబ్లీ లో  కాలుమోపడం అనేది అంత విస్తృత స్థాయిలో జరగడం నిజంగా గొప్ప విషయమే.       
 ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన  నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా  ఇంకో  ఆసక్తికరమైన వ్యాఖ్యానం వినబడుతోంది.. దక్కిన అధికారం కలకాలం  నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ  తరువాత 2019 లో   జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం  ఎల్లాగా  అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే  దృష్టి పెట్టారన్నది బహిరంగ రహస్యం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు.  కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా  పార్టీలు అనుసరించిన విధానాలే  అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా  మారిపోవచ్చు కూడా. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన  రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన  కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా  చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
బీజేపీ ముందు దృష్టి పెట్టేది అసలే బలహీన పడిన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరచడం. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను, లేదా బలమైన ప్రాంతీయ నాయకులను దగ్గరకు తీసి తానూ క్రమేపీ బలాన్ని పెంచుకోవడం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది పెద్ద తప్పూ కాదు, తప్పు పట్టాల్సిందీ లేదు.   
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్  షా  ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019  లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.  ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ  పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ  ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి  వున్న నిబద్దతను  అంగీకరిస్తారు. మరి  అద్యతన భావిలో  విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని  ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా  ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు  రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి  ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
అందుకే చెప్పింది రెండు తెలుగు  ప్రాంతీయ  పార్టీలకి ఇవి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
అయితే వాటికి సమయం ఇంకా మించి పోలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ళ వ్యవధానం వుంది. కాలు కూడదీసుకోవడానికి సమయం వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం మంచి తురుపు ముక్క. రాజధాని నిర్మాణం అంతగా కలిసొస్తుందో తెలియని మరో  ట్రంప్ కార్డు. ఏదో ఒకటి చేసి,సర్వశక్తులు ధారపోసి ఎన్నికల ఘడియ దగ్గర పడేలోగా పోలవరం ప్రాజెక్టుకు ఒక స్వరూపం  ఇవ్వగలిగితే ఆయనకు రాజకీయంగా చాలా కలిసివస్తుంది. కానీ అదేం దురదృష్టమో తెలియదు కాని   ఆ ప్రాజెక్టు నత్త నడక నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా సముద్రంలోకి వృధాగా పోతున్న అపర గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసారు. అన్నింటికంటే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలిగితే అక్కడి రైతాంగం మెప్పుకోళ్ళు ఆయన ఖాతాలో జమపడతాయి.
అల్లాగే తెలంగాణాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం చేసారు. మామూలుగా బలహీన వర్గాలకు కట్టించే ఇళ్ళు కూడా అంతే బలహీనంగా వుంటాయి.
'ఒకే ఒక్క గది కడితేపెళ్ళీడుకొచ్చిన పిల్లలు ఎక్కడ పడుకుంటారుమేకలూ బర్రెలూ ఇంట్లోనే కట్టేసుకోవాలిఈ ఖర్మ ఇక ముందు వుండదు. చక్కగా రెండు గదుల ఇల్లువంటిల్లుమరుగుదొడ్డి,  ఇలా అన్ని సదుపాయాలతో ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల సమయంలో జనంలో ఎన్నో  ఆశలు రేకెత్తించారు.
'సేద్యానికి పనికి రాని బంజరు భూములు ఇవ్వడం ఏం గొప్పమంచి అనువయిన మూడెకరాల భూమిని ప్రభుత్వమే కొని ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తుందని భరోసాగా చెప్పారు. ఇటువంటి హామీలను వూరికి ఒకటి చొప్పున అన్నారానున్న కాలంలో  నెరవేరుస్తూ పొతేఎన్నికల నాటికి 'తెలంగాణా సెంటిమెంటుకు తోడుగా టీ.ఆర్.యస్. కు గ్రామీణ ప్రాంతాలలో గట్టి వోటు బ్యాంకు తయారవుతుంది. జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు ఇలాటి బలమయిన అస్త్ర శస్త్రాలు వుండి తీరాలి. ఆకాశ హర్మ్యాలుసింగపూరులు ఎన్నికల్లో అక్కరకు వచ్చే బాణాలు కావు. రెండు రాష్ట్రాలలోని  ప్రాంతీయ పార్టీల అధినేతలిద్దరు యెంత త్వరగా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే అంత మంచిది.
అందుకే చెప్పిందికాశ్మీర్జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు  ప్రాంతీయ  పార్టీలకి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(23-12-2014)            

పీవీ - ఓ జ్ఞాపకం :


(డిసెంబరు 23- పీవీ నరసింహారావు గారి వర్ధంతి)  
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులుఅనధికారులుమందీ మార్బలాలు, వందిమాగధులు ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమాఅన్నట్టు వుండేది.



మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండిఅన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా!అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఆయనా లేరు. కానీ ఈ చక్కని, అరిదయినా  జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  (23-12-2014)
NOTE - Image Courtesy Owner  


22, డిసెంబర్ 2014, సోమవారం

ప్రాంతీయ పార్టీలకు అలారం గంటలు


జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికలపై వెలువడిన ఎక్జిట్ పోల్ ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్  అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివని  ఢిల్లీ నుంచి వచ్చిన  ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితాలు ఓ ప్రమాద హెచ్చరిక అనేది ఆయన మనసులోని మాట. బీజేపీ నుంచి ఆ పార్టీలు గట్టి సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది మరో తాత్పర్యం.


ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన  నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా ఆయన ఇంకో  ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేసారు. దక్కిన అధికారం కలకాలం  నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ  తరువాత 2019 లో   జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం  ఎల్లాగా  అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే  దృష్టి పెట్టారన్నది ఆ విశ్లేషకుడి అభిప్రాయం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదని అయన ముక్తాయింపు. కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా  పార్టీలు అనుసరించిన విధానాలే  అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా  మారిపోతాయని ఆ విశ్లేషణ సారాంశం. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన ఢిల్లీ రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన  కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా  చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్  షా  ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019  లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.  ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ  పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ  ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి  వున్న నిబద్దతను  అంగీకరిస్తారు. మరి  అద్యతన భావిలో  విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని  ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా  ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు  రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి  ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
రెండు ప్రాంతీయ  పార్టీలకి ఇవి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(22-12-2014)

NOTE: Courtesy Image Owner 

మారుతున్న సూక్తులు



లవ్ ఎఫైర్ - 'ఎంతగా ప్రేమిస్తున్నానంటే కొరుక్కుతినేంతగా'


బుక్ ఫెయిర్ - 'పుస్తకాల్ని ఎంతగా ఇష్టపడతానంటే వాటిని కొనుక్కుని చదివేంతగా'



NOTE: Courtesy Image Owner