6, అక్టోబర్ 2013, ఆదివారం

నా గురించి నలుగురూ ..... 4

నా గురించి శ్రీ డి. వెంకట్రామయ్య గారు  
“కలిసి తిరగడం, కులాసా కాలక్షేపాలు చేయడంలో మాత్రమే కాదు నాకు అన్నివిధాల ఆప్తమిత్రుడుగానే వుంటూ వచ్చారు భండారు శ్రీనివాసరావు.  ‘A friend in need …’ అన్న ఆంగ్ల సూక్తి మాదిరిగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఆయన సర్వదా సిద్ధం. హైదరాబాదులో న్యూస్ రీడర్ గా వున్న నన్ను ఢిల్లీ అధికారులు ఎవరికో సాయం చేయాలనుకుని నన్ను అన్యాయంగా ఢిల్లీ బదిలీ చేశారు. ఇలా రెండు సార్లు జరిగింది. రెండోసారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించడంలో ప్రధానపాత్ర  శ్రీనివాసరావుదే.


(శ్రీ డి.వెంకట్రామయ్య)

అప్పట్లో కేంద్ర సమాచార శాఖ ఉప మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ వుండేవారు. కాంగ్రెస్ ఎం ఎల్ ఏ డీ కే  సమరసింహారెడ్డి మాట సాయంతో నేనూ శ్రీనివాసరావు కలిసి ఢిల్లీ వెళ్ళి వారం రోజులు అక్కడ వున్నాం. మంత్రి మల్లికార్జున్ నీ,  ఇతర అధికారులను కలిసి శాయంగల విన్నపాలు చేసాము. నెలలు గడిచిపోయాయి కాని పని కాలేదు. అలాటి తరుణంలో శ్రీనివాసరావు మల్లికార్జున్ గారిని కలిసి నా సమస్య మళ్ళీ చెప్పారు. చివరిసారి వెళ్ళినప్పుడు మంత్రితో చివాట్లు కూడా తిన్నారు. ‘ఎందుకిలా మాటిమాటికీ వచ్చి డిస్టర్బ్ చేస్తావ్.. నువ్వేమైనా అయన ఏజెంటువా ....’అన్న ధోరణిలో ఆగ్రహం వెలిబుచ్చారట. (ఇక్కడ వో విషయం వివరించాలి. అసలు జరిగినదేమంటే మంత్రిగారికి నా మీద కోపం వచ్చిన మాట నిజం. ఇలా విసిగించావంటే సస్పెండ్ చేస్తా అన్న మాట కూడా వాడారు. అయితే అప్పుడు నేను చెప్పిన జవాబు ఆయన్ని కదిలించింది. నన్ను సస్పెండ్ చేస్తే చేయండి. వెంకట్రామయ్య గారికి మాత్రం న్యాయం చేయండి అనేశాను. అంతకుముందు విలేకరిగా పరిచయం బాగా వున్నవాడినే కావడంతో ఆయన కూడా ఏమీ అనలేకపోయారు. మొత్తం మీద కధ సుఖాంతం అయింది. వెంకట్రామయ్య గారి బదిలీ రద్దయింది.)”

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

5, అక్టోబర్ 2013, శనివారం

నా గురించి నలుగురూ ......3

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి.వెంకట్రామయ్య)

“సుమారు పాతికేళ్ళక్రితం సకుటుంబంగా సోవియట్ రష్యా వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలపాటు అక్కడ వుండి  రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివొచ్చారు భండారు శ్రీనివాసరావు.  అప్పుడాయన కాకుండా నేను మాస్కో వెళ్ళవలసింది. రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదవడం కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను ఒకరి తరువాత ఒకరిని తీసుకువెళ్ళి రెండేళ్లో మూడేళ్లో  అక్కడ  వుంచుకునేవారప్పట్లో. నాకంటే సీనియర్లయిన  తిరుమలశెట్టి శ్రీరాములుగారు, కందుకూరి సూర్యనారాయణగారు ఏడిద గోపాలరావుగారు (గోపాల్రావుగారు రేడియో సర్వీసులో నాకంటే జూనియర్ కాని న్యూస్ రీడర్ గా  కాస్త సీనియర్) లాంటి వాళ్ళంతా రష్యా వెళ్ళివచ్చాక నా వంతు వచ్చింది. వ్యక్తిగతమైన కొన్ని ఇబ్బందులవల్ల నేను వెళ్ళలేకపోగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని,  తాను న్యూస్ రీడర్ కాకపోయినా ఆకాశవాణి, రేడియో మాస్కో అధికారుల ఆమోదంతో రష్యా వెళ్లివచ్చారు శ్రీనివాసరావు. వెళ్ళడమేనా,  తనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే రెండేళ్లు ఎక్కువగానే అక్కడవుండి  మాస్కో మహానగరంలో తన జెండా ఎగరేసి మరీ వచ్చారు శ్రీనివాసరావు. రేడియో  మాస్కోలో తెలుగులో వార్తలు చదివిన చివరి వ్యక్తి శ్రీనివాసరావే. ఆ తరువాత ఆ రేడియోలో తెలుగు వార్తల  ప్రసారాన్ని నిలిపివేశారు.
“శ్రీనివాసరావు మాస్కోలో వున్నంతకాలమూ అక్కడా ఆయన ఇల్లు ధర్మసత్రంగానే వుండేదట. అక్కడ వుండి  చదువుకునే తెలుగు విద్యార్ధులు, ఒంటరి ఉద్యోగులు, యాత్రీకులూ అందరికీ అన్నివేళలా తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికేవారు భండారు  దంపతులు. తన సరసోక్తులతో, మధురసాలతో శ్రీనివాసరావు ఆతిధ్యం ఇస్తే, తెలుగు తిండికి మొహం వాచిపోయి వున్న వాళ్ళందరికీ కమ్మటి భోజనం వండి వార్చేవారు నిర్మల గారు. తానూ, తన భార్యాబిడ్డలూ ఆ నాలుగేళ్ళూ మాస్కోలో గడిపిన జీవిత విశేషాలతో ‘మార్పు చూసిన కళ్ళు’ అన్న పేరుతొ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఒక చిరు గ్రంధాన్ని కూడా గత సంవత్సరాంతంలో రచించారు భండారు శ్రీనివాసరావు “
ఇంకా వుంది .........

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

4, అక్టోబర్ 2013, శుక్రవారం

నా గురించి నలుగురు -2

నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు   
నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య)

“ఆకాశవాణి న్యూస్ రూమ్ లో పనిచేసే పద్ధతిలో భండారు శ్రీనివాసరావుకీ నాకూ పరస్పరవిరుద్ధమైన అభిప్రాయాలు వుండేవి. కాస్త పట్టూ విడుపూ వుండాలనేవారాయన. పట్టుండాలి కాని విడుపెందుకు అనే వాడ్ని నేను. (ఆయన పొరసంబంధాలమనిషి. అనేకమందితో సంబంధాలు వుంటేనే వార్తలు సేకరించడం సులువు అనేది ఆయన పాలసీ. కానీ వార్తల ఎంపిక విషయంలో నా ధోరణి నాదే) నన్ను ఆయనా మార్చలేకపోయారు. ఆయన్ని నేనూ ప్రభావితుడ్ని చేయలేకపోయాను. చివరి దాకా అంతే!
“విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆఫీసు విషయాల్లో ఏమాత్రం ఏకాభిప్రాయం లేని నేనూ శ్రీనివాసరావు ఆఫీసు ఆవరణ దాటి బయటకు రాగానే ఒక్కటై పోయేవాళ్ళం. ఎన్నో ఏళ్ళపాటు ఎన్నో సాయంత్రాలు ..ఎన్నెన్నో రాత్రులు...గంటలకొద్దీ కబుర్లు..సినిమాలు...షికార్లు...అంతేనా అంతకుమించిన అన్ని కాలక్షేపాలు... చతుర్ముఖ పారాయణాలు...  దూమపానాలు.... మధుపానాలు... ఏదో ఒక బార్...లేదా ప్రెస్ క్లబ్...అన్నింటికీ మించి చిక్కడపల్లిలో శ్రీనివాసరావు ఇల్లు. ఇవే మా ‘అడ్డాలు’.
“ఆయనా నేనూ దగ్గర దగ్గర ఇళ్ళల్లో వుండేవాళ్ళం. ఆయన అక్కడ వున్నంత కాలం దాదాపు కొన్నేళ్లపాటు నేనూ, వనం జ్వాలా నరసింహారావు వంటి మరికొందరం మిత్రులం కనీసం వారానికి రెండు మూడు రోజులయినా వారింటికి చేరేవాళ్ళం. గంటలకొద్దీ గడిపేవాళ్ళం. ఆరోజుల్లో ఆయన ఇల్లు ఓ ధర్మసత్రంలా వుండేది. అసలే ఆయన బంధు వర్గమే పెద్దది. దానికి తోడు స్నేహితులు. అందరూ బంధువులే....అందరూ స్నేహితులే... ఎప్పుడు ఏ వేళ చూసినా ఎవరో ఒకరు వచ్చిపోతుండేవారు. ఎప్పుడు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ అతిధి మర్యాదలు చేసి, ఆదరించి అన్నమ్పెట్టికాని పంపేవారు కాదు ఆయన శ్రీమతి నిర్మలాదేవి. ఆరోజుల్లో ఆవిడను చూసినప్పుడల్లా ‘వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...’ అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.”

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)  
(04-10-2013)

నా గురించి నలుగురు ........


నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య) 

“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీని వాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
“మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫేసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం  అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”  
(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 
(04-10-2013)


2, అక్టోబర్ 2013, బుధవారం

ఇడ్లీ వడ చేత్తో తిన్న ఇందిరా గాంధి


ఖమ్మం జిల్లా ఏర్పడి నిన్నటికి అరవై ఏళ్ళు నిండాయి. నిన్న మొదలయిన ఈ అరవై వసంతాల ఉత్సవాలను వచ్చే జనవరి ఇరవై ఆరువరకు జరపాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనాడు ఖమ్మం ఎడిషన్ లో చాలా ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలతో సహా ప్రచురించారు.
రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా. భద్రాచలం చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బంది కూడా లేకుండా తిరిగినప్పుడు ఆయన వెంట వున్నవారిలో ఆకాశవాణి విలేకరిగా నేను కూడా వున్నాను. ఓ మారుమూల గిరిజ పల్లెకు వెళ్ళి, ఒక స్థానికుడి ఇంట్లోకి వెళ్ళి పోయ్యిమీది చట్టిలోని అన్నం మెతుకులను రుచి చూసి, బయటి ప్రపంచానికి దూరంగా వున్న వారి బీద బతుకులకు సర్కారు భరోసాగా వుందన్న నమ్మకాన్ని ఆ పేదవారిలో కలిగించారు.

  

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చేత్తోనే తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.


ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే సభ జరగాల్సిన పెవిలియన్ మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి ‘హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.
కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

(02-10-2013)

సలాం రేడియో


తెలుగు రేడియో వార్తలకు డెబ్బయ్ అయిదేళ్ళు. ఇందులో ముప్పయ్యేళ్లకు పైగా నేను ఆ వార్తావిభాగంలో  పనిచేసాను. నిజంగా నన్ను నేను అభినందించుకోవాల్సిన విషయమే! సెహభాష్ శ్రీనివాసరావు.


(దేవులపల్లి అమర్)


ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్లో షరా మామూలు రాజకీయ చర్చలు ప్రారంభించడానికి  ముందు, కార్యక్రమ సమర్పకులయిన శ్రీ దేవులపల్లి అమర్,  ప్రజాశక్తి పత్రికలో ప్రచురించిన  ఈ విషయాన్ని ప్రస్తావించి రేడియో వార్తలు గురించి రెండు ముక్కలు మాట్లాడానికి అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం అనిపించింది. థాంక్స్ అమర్.
75 వసంతోత్సవాన్ని న్యూ ఢిల్లీ లో ఆకాశవాణి వారు నిన్న నిర్వహించారు.  1938 లో తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఆలిండియా రేడియో వార్తాప్రసారాలు మొదలు పెట్టింది. ఈ భారతీయ భాషల్లో చిరకాలం వార్తలు చదివిన 14 మంది  సీనియర్ న్యూస్ రీడర్లను ప్రసార భారతి సీ.ఈ.ఓ. జవహర్ సర్కార్ ఘనంగా సత్కరించారు. తెలుగులో వార్తల ఘనాపాఠీలుగా పేరుతెచ్చుకున్న శ్రీయుతులు కందుకూరి సూర్యనారాయణ, డి.వెంకట్రామయ్య, ఏడిద గోపాలరావులను సన్మానించారు. వయోభారం కారణంగా శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.


రేదోయోకు, రేడియోలో పనిచేసిన, ఇంకా చేస్తున్నవారికి గుర్తింపు, గౌరవం క్రమంగా తగ్గిపోతున్న రోజుల్లో ఈ పేరుతొ అయినా గుర్తుచేసుకున్న ఆకాశవాణి వారు అభినందనీయులు.
సలాం రేడియో.
(02-10-2013)         


1, అక్టోబర్ 2013, మంగళవారం

చదివి వొదిలెయ్యండి మహా ప్రభూ!


అనగనగా ఓ అరబ్  షేక్. అతనిదగ్గర కుప్పలుకుప్పలుగా డబ్బుతో పాటు  పిడికెడు గుండె కూడా వుందని రుజువు చేస్తూ,  అదో రోజు చెప్పాపెట్టకుండా లబ్ డబ్ అని గబగబా కొట్టుకోవడం మానేసింది. షేకా మజాకా!  ఆయన్ని అమాంతం హెలికాప్టర్లో తీసుకువెళ్ళి ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. ఓ పెద్ద డాక్టర్ వచ్చి చూసి వెంటనే గుండెకు ఆపరేషన్ చేయాలన్నాడు. డాక్టర్ తలచుకుంటే ఆపరేషన్ కు అడ్డేముంది.
ఆయన అలాతప్పా షేక్ కాదు. అల్లాగే ఆయన రక్తం కూడా. ఆ గ్రూపు రక్తం ఇచ్చే దాతకోసం ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. చివరకు స్కాట్లాండ్ పెద్దమనిషి రక్తం, ఇతగాడి రక్తం సరిపోవడంతో ఆ రక్తం ఎక్కించి డాక్టర్లు పని పూర్తిచేశారు. అరబ్ షేకు గారు కోలుకుని ఇంటికెళ్ళి పోయారు. వెళ్ళీ వెళ్ళగానే తనకు రక్త దానం చేసిన స్కాట్లాండ్ పెద్దమనిషికి పెద్దమనసుతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వుత్త మాటలతో కాకుండా ఆ ఉత్తరంతో పాటు ఓ ఖరీదయిన బీ ఎం డబ్ల్యూ కారూ, ఓ బుట్టెడు వజ్రాలు, ఓ గంపెడు రత్నాలు కానుకగా పంపాడు. స్కాట్లాండ్ పెద్దమనిషికి మాట పడిపోయింది. ఓ రెండు సీసాలు రక్తం ఇస్తే ఇలా బదులు తీర్చుకున్న అరబ్ షేక్  ఔదార్యాన్ని తలచుకుని షేక్ అయిపోయాడు.
ఇంతలో అరబ్ షేక్ గారికి మళ్ళీ రోగం తిరగబెట్టింది. మళ్ళీ ఆసుపత్రిలో చేర్చారు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వబోయే సమయంలో వారికి స్కాట్లాండ్ పెద్దమనిషి గుర్తుకువచ్చి రక్తం కోసం కబురు చేశారు. అతడు పట్టరాని ఆనందంతో (విమానంలో) ఎగురుకుంటూ వచ్చి రక్తం ఇచ్చేసి తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిన దగ్గర నుంచీ ఒకటే యావ. కిందటి సారి పంపిన కానుకలే ఎంతో ఎక్కువ. మరి ఈసారి ఏం పంపుతాడో అని ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఆ  ఘడియ రానే వచ్చింది. కొరియర్ వాడు వచ్చి ఓ పెద్ద పార్సెల్ అప్పచెప్పి చక్కాపోయాడు.
తెరిచి చూస్తే అందులో కొన్ని ఎండు  ఖర్జూరాలు, ఒక ఉత్తరం వున్నాయి. అందులో ఇలావుంది.
‘రక్తదానం చేసి నా ప్రాణం నిలబెట్టినందుకు కృతజ్ఞతలు. ఏవిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది’
అది చదివిన స్కాట్లాండ్ వాడికి దిమ్మ తిరిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అని మధన పడుతుండగానే మరో రోజు అరబ్ షేక్ గారినుంచి మరో ఉత్తరం వచ్చింది.
‘అప్పుడలా ఏమిటి? ఇప్పుడిలా ఏమిటి? అని  బెంగ పడుతున్నావు కదూ. అవును మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు నాలో ప్రవహిస్తున్నది ఆరబ్ రక్తం. రెండోసారి నాలో వున్నది స్కాట్లాండ్ నెత్తురు’
(నెట్లో  డాక్టర్ భరత్ బాబు పోస్ట్ చేసిన ఓ ఇంగ్లీష్ కధ ఆధారంగా)

(01-10-2013)