9, సెప్టెంబర్ 2013, సోమవారం

రేడియో రోజులు - 3


“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు – ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి”
ఉదయం  ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ,  అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ  తెలుసు. అయితే,  రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని  ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో  ట్రాన్స్ మిటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.
ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి  ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా  చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే  ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)


(కీర్తిశేషులు తిరుమలశెట్టి శ్రీరాములు - ఫోటో కర్టెసీ శ్రీ సుధామ) 


శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు – ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.

మరో గదిలో తిరుమలశెట్టి  శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే  ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్  పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం  నింపాదిగా నడుస్తూ  మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే  తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు. 
(09-09-2013)  

వినాయక చవితి శుభాకాంక్షలు







" వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభనిర్విఘ్నమ్ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.."

వినాయక చవితి శుభాకాంక్షలు

నిర్మలాదేవి-భండారు శ్రీనివాసరావు


8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కలల్లో కూడా కళలు, కళాకారులు గురించి ఆలోచించే ఆర్వీ రమణమూర్తి ఇక లేరు.


డెబ్బయ్యవ దశకం పూర్వార్ధం.
డాక్టర్ సీ.హెచ్. దేవానందరావు గారు వెంగళరావుగారి మంత్రివర్గంలో సభ్యులు. విలేకరులతో చాలా కలుపుగోలుగా వుండేవారు. ఓ సారి శాసనమండలి విరామ సమయంలో బయట లాన్ లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వేళ, తెల్లటి ప్యాంటు షర్టు ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆయన్ని చూస్తూనే మంత్రిగారు “ఏం కింగ్ మేకర్! ఏమిటి సంగతులు” అని పలకరించారు. రమణమూర్తిగారిని కలుసుకున్నది అదే మొదటిసారి. ఆ తరువాత అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇక సరేసరి. ‘(అంజయ్య)ఇంట్లో ఇంద్రసేనారెడ్డి,  రూంలో రమణ మూర్తి’ అని ఈనాడులో కార్టూన్లు కూడా వచ్చాయి. పోతే రోశయ్యగారు మంత్రిగా వున్నా, ముఖ్యమంత్రిగా వున్నా ఇప్పుడు గవర్నర్ గా వున్నా ఏదో ఒక సమయంలో  ఆయన పక్కన రమణమూర్తి వుండాల్సిందే. ఇంతమంది పెద్దవాళ్ళు తెలిసివున్నా ఆయన బావుకుంది ఏమీ లేదు. చివర చివర్లో రోశయ్య గారు ఇచ్చిన ఓ పదవి (రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు) తప్పిస్తే. రమణమూర్తి అనగానే చాలామంది సభలు సన్మానాలు అంటారు కాని కళాకారులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించడానికి ఆయన పడ్డ పాట్లు వారికి తెలవవు. ఎంతోమంది సినిమా వాళ్ళతో సన్నిహిత పరిచయం వున్నప్పటికీ  రమణమూర్తి తీసిన సినిమాలు చాలా తక్కువే, కాని, వాసిలో మాత్రం చాలా చాలా ఎక్కువ.


కీర్తిశేషులు ఆర్వీ రమణమూర్తి 

రమణమూర్తి స్వతహాగా కళాకారుడేమీ కాదు. కాకపోతే వాళ్లని అభిమానించడం, గౌరవించడం ఆయనకు స్వతహాగా అబ్బిన గుణం. ఆయన లేని లోటు ఆయన కుటుంబానిదే కాదు యావత్ కళాకారుల కుటుంబానిది.
స్వర్గంలో కూడా ఆయన చేసేది కళా పోషణే. సందేహం లేదు.

మిత్రుడిగా ఆయనకు నా నివాళి.  (08-09-2013)    

అమెరికాలో గణేష్ నిమజ్జనం


మూడేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు మధ్యలో  వినాయక చవితి పర్వదినం వచ్చింది. కొబ్బరికాయలతో సహా పూజా సామగ్రి యావత్తు ఇండియన్ స్టోర్ లో దొరుకుతాయి కానీ మట్టి వినాయకుడు యెట్లా. మా వాడు సందీప్ కొనుక్కున్న ఇంటి పెరట్లో చక్కటి బంక మన్ను కనబడింది. అంతే ! దాంతో వినాయకుడి  ప్రతిమను కాస్త అటూ ఇటూగా గుర్తుపట్టే విధంగా తయారు చేసాను. ఇందులో మా మనుమరాళ్ళు సఖి, సృష్టి బాగా సహకరించారు. పూజ పూర్తి అయింది. వుండ్రాళ్ళు తయారు చేయడం,  ఆ సాయంత్రం ఇళ్ళ కప్పుపై విసరడం అంతా సజావుగా సాగిపోయింది. కానీ అసలు చిక్కల్లా గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం ఎల్లా అన్నదే. సియాటిల్ నీటి  వనరులకు ప్రసిద్ధి. కనుచూపు మేరలో  ఎటు చూసినా పెద్ద పెద్ద సరస్సులే.  కానీ గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం అంత తేలిక కాదు. అక్కడి చట్టాలు వొప్పుకోవు. అందుకని కారేసుకుని లాంగ్ డ్రైవ్ లో వూరు దాటి వెళ్ళి అనేక మైళ్ల దూరంలో నిర్జన ప్రదేశంలో కనబడిన ఓ సరస్సులో, ఒక రకంగా చెప్పాలంటే, ఎవ్వరికంటా పడకుండా   నిమజ్జనం చేసివచ్చాము.  











(08-09-2013)






    

7, సెప్టెంబర్ 2013, శనివారం

రేడియో రోజులు - 2


వెనుకటి రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా వుండేది. బేగం పేట ఏరోడ్రోం (విమానాశ్రయం అనే వాళ్ళు కాదు  ఏరోడ్రోం అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా వుండేది. ఆరోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా  విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల మాదిరిగా రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి.  అందుకని స్కూలు పిల్లల్ని తీసుకువచ్చిన మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో  నుంచి విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు), అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్ గార్డెన్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి వచ్చి చేరాయి.
ఇంతకుముందే చెప్పినట్టు గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే,  పన్యాల రంగనాధ రావు గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ గొప్పవారిపట్ల పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను. జర్నలిజం వృత్తిలో చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే పెద్దరికాలను పక్కనబెట్టాలని నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’ కారు, నేను ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను. ఆచరించాను. 

(07-09-2013)

తప్పులున్న క్షమించగలరు




పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా తప్పులున్న క్షమించగలరుఅనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీ  సారీఅనే పదాన్ని  ఉదారంగా ఎక్కువసార్లు  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీచెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.

చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడంఅని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖః డం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.

మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.

దుఖః డం అంటే  దుష్క్రు త్యాలు.  చేసిన చెడ్డ పనులు అని అర్ధం.


జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  నేను చేసిన తప్పులను మన్నించండిఅని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.  (07-09-2013)

ఎద్దు పుండు కాకికి రుచి

ఎక్కడో దూరాన కూర్చున్నావు 
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు 
తమాష చూస్తున్నావు