18, జులై 2013, గురువారం

ఈవిడ ఎవరో కాదు ఆడది


చతుర్ముఖ బ్రహ్మ తన విధి నిర్వహణలో భాగంగా జీవరాశులను సృష్టించే క్రమంలో ఒక వినూత్న జీవానికి రూపకల్పన చేసేపనిలో పడ్డాడు. పక్కనే కూర్చుని వీణ వాయిస్తూ భర్త చేతిలో రూపం దిద్దుకుంటున్న స్త్రీ మూర్తిని చూసి అచ్చెరువు చెంది అడిగింది చదువుల తల్లి తన పతి దేవుడిని, ఆవిడ ఎవరని.
బ్రహ్మ తన నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తూ చెప్పాడు.


“ఈవిడ ఆడది. నేను సృష్టికర్తను అన్న పేరే కాని నిజానికి ఈవిడే ఈ సమస్త సృష్టికి కర్త కర్మా క్రియ.   
“అందరు మానవుల్లాగే ఈవిడకూ  రెండు చేతులే. కానీ ఆ రెండింటి తోనే తన సంసారాన్ని యావత్తు సంభాలిస్తుంది. ఆ రెండు చేతులతోనే ఇంటిల్లిపాదికీ వొండివారుస్తుంది. తను తిన్నా తినకపోయినా అందరూ తిన్నారా లేదా అన్న యావలోనే గడుపుతుంది. ఆ రెండు చేతులతోనే పిల్లల్ని లాలిస్తుంది. అత్తమామల్ని ఆదరిస్తుంది. భర్త ఆలనా పాలనా చూస్తుంది. ఇంటికివచ్చేవారిని కనుక్కుంటుంది.
“ఆమె వైద్యురాలు కాదు. కానయియితేనేం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అంతే! దానితో  శారీరక రుగ్మతలే కాదు  మానసిక రోగాలు కూడా మటుమాయం.
“ఆమె ఆర్ధిక శాస్త్రనిపుణురాలు కాదు, కానీ జీతానికీ జీవితానికీ పొంతనలేని సంసారాలు  కూడా సర్దుబాటు చేస్తుంది.
“ఆవులు గడ్డి తిని పాలిస్తే, ఈవిడ క్లేశాలను కడుపులో దాచుకుని ప్రేమను పంచి పెడుతుంది.
“మనసు వెన్న. మాట సున్నితం. అందం అమోఘం. ఆకర్షణ అనంతం.
“కానీ నా ఈ సృష్టిలో లోపం లేని జీవి అంటూ వుండదు. ఈవిడకీ ఓ లోపం వుంది. తన సమర్ధత ఏవిటో, తన శక్తి సామర్ధ్యాలు ఏపాటివో ఆవిడకు తెలియవు. అందుకే ‘ఆడదిగానే’ మిగిలిపోతుంది.” (18-07-2013)

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ముందు అంటే పైన అనికాదు, ఈ వ్యాసం శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది అన్న జ్ఞానోదయం అయింది.  దాంతో తెలివినపడి అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండా మునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ నిన్న సాయంత్రం బయట వర్షం పడుతుండగా లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేక  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన చెప్పాడు కూడా.  సాధారణంగా, పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు.  సాక్షాత్తు  ‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికీ  మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అనేసింది. అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ముఖ్యమంత్రితో పోల్చడం, కాదు కాదు ముఖ్యమంత్రిని నాతొ పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా అనుకున్నాను.
ఏవిటో అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“కిరణ్  కుమార్ రెడ్డి గారి లాగే  నేను మొండివాడ్ని. కాదు నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేరకం.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   
ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (18-07-2013)

16, జులై 2013, మంగళవారం

మళ్ళీ అలానే మొదలయింది



మా ఆవిడ అద్దం ముందు నానా వయ్యారాలు పోతోంది.
అద్దంలోకి అలా చూస్తూ ఇలా చూస్తూ ఒక్కసారి నావైపు చూసింది.
కొంప మునగబోతోందని ఆరో సెన్స్ హెచ్చరించింది.
“అదేవిటండి. ఆ కనబడేది నేనేనంటారా!  ఇంతలా వొళ్ళెలా వచ్చింది. మరీ ఇంత అసయ్యంగా వున్నానంటారా!”
“ఛా! అల్లా అని ఎవరనగలరు? కాకపొతే అద్దం నిజం చెబుతుందని అంటారు”
అంతే!
మా మధ్య తగువు మళ్ళీ అలానే మొదలయింది.



“ఈసారి వెడ్డింగ్ యానివర్సరీకి ఎక్కడికి వెడదామంటావు?”
నా ఈ ఆఫరు మా ఆవిడ మోహంలో వెయ్యి మతాబులు వెలిగిస్తుందని తెలుసు.
అనుకున్నట్టే ఎంతో సంతోషపడింది.
“ఎక్కడికయినా సరే! ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని చోటయితే బాగుంటుంది.”
ఆవిడ కోరుకున్నట్టే  తీసుకువెళ్లాను.
వొంటింటిని  చూడగానే  ఇంతెత్తున  ఎగిరిపడింది.
ఇక చెప్పేదేముంది?

సిగపట్ల యుద్ధం మళ్ళీ అలానే మొదలయింది.

NOTE: Courtesy Cartoonist 

అలా మొదలయింది .....




తిని కూర్చుని తీరిగ్గా టీవీ చూస్తూ రిమోట్ తో చానల్స్ మారుస్తుంటే పక్కన కూర్చుని పకోడీలు నవులుతున్న మా ఆవిడ అడిగింది. “ఏం చూస్తున్నారు?”
టైం బాగా లేక అన్నాను “టీవీ మీద దుమ్ముని”
అంతే!
రగడ మొదలయింది. 



వచ్చే నెలలో మా మ్యారేజి  యానివర్సరి.  ఏం కొంటారన్న విషయాన్ని మా ఆవిడ మాటల్లో పెట్టి ఆరా తీస్తోంది. అది నాకు తెలుస్తూనే వుంది.
“మూడే సెకన్లలో జీరో నుంచి వందకు ఎగబాకేది కొంటే ఎలావుంటుంది?” మా ఆవిడ కొస్చెన్.  అంటే కొత్త కారన్న మాట. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని వెర్రి వెధవని కాదుకదా!
కానీ అనేసాను. “ఏవిటి వెయింగ్ మిషన్ కావాలా!”
అంతే! లడాయి మొదలయింది.

రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చాను.
మా ఆవిడ ఏదయినా ఖరీదయిన చోటుకు తీసుకువెళ్లమంది.
తప్పుతుందా! తీసుకువెళ్లాను, పెట్రోలు బంకుకి.
అంతే! పోట్లాట మొదలయింది. 

13, జులై 2013, శనివారం

‘శ్రీరామ’భగవద్గీత



అనగనగా ఓ రాముడు. ఆయనకో బంటుపేరు హనుమంతు. ఆ రాముడికో కోరిక కలిగింది. నాడు లంకలో  రావణుడి చెరలో వున్న సీతను తిరిగి తెచ్చుకునే నిమిత్తం   సముద్రం దాటేందుకు వీలుగా వానర సేన సాయంతో నిర్మించిన వారధి రామసేతు ఎలావుందో చూద్దామని.  యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తరువాత రామ బంటును  వెంటబెట్టుకుని రాముడు  భూలోకానికి  వచ్చాడు. తాము  వనవాసంలో వుండగా  రావణుడు అపహరించుకు పోయిన సీతను   మళ్ళీ తన  కళ్లబడేలా చేసిన ఆ వారధి అంటే ఆయనకు ఎంతో మక్కువ. దాన్ని చూడగానే దానిపట్ల  ఆయన పెంచుకున్న ఇష్టం ఆయన  మాటల్లో మరో సారి బయట పడింది.

హనుమా! ఈ వారధి నిర్మాణానికి నువ్వూ, నీ  సహచర వానరులు పడ్డ శ్రమను నేనారోజుల్లో కళ్ళారా చూసాను. మొబిలైజేషన్ అడ్వాన్సులు సరే కనీసం హీనపక్షం రోజు కూలీ కూడా అడగకుండా ఇంత బ్రహ్మాండమయిన వంతెనను నాకోసం ఎంతో కష్టపడి కట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో యుగాలు  గడిచిపోయాయి. ఎన్నెన్నో  ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడ్డాయి.  మరెన్నో  సునామీలు సంభవించాయి. అయినా కానీ, ఆనాటి  రామసేతు ఆనవాళ్ళు మాత్రం  వీటన్నిటినీ తట్టుకుని నిలిచాయి. అంటే ఈ వంతెన నిర్మాణంలో  మీరు ఉపయోగించిన ఇంజినీరింగ్ పనితనం అంత గొప్పదన్న మాట. నిన్న గాక మొన్న హైదరాబాదులో గామన్ కంపెనీ  అధునాతన టెక్నాలజీ సాయంతో  కట్టిన ఫ్లై వోవర్ కధ ఏమయిందో  తెలుసుకదా. కాళ్ళ పారాణి కూడా ఆరకముందేఅన్న సామెతను నిజం చేస్తూ  ఆ వంతెన ఫిల్లర్లపై సినిమా పోస్టర్లు   అంటించేంతవరకయినా ఆగిందా అంటే  ఆగలేదు. సరికదా ఓపక్క  కడుతుండగానే మరో పక్క  డమాలున  కూలిపోయిందిఅంటూ  రాముడు కాసేపు  ఆగాడు.
సమయం కోసం ఎదురు చూస్తున్న హనుమ వెంటనే అందుకున్నాడు.

జై శ్రీరాం!  రామ సేతు నిర్మాణంలో మాగొప్పదనం ఇసుమంత కూడా లేదు. మేము చేసిందల్లా ఆ రాళ్ళపై  నీ పేరు రాయడం వరకే. వంతెనకోసం టిస్కో కంపెనీ  ఉక్కు దిమ్మలు  వాడలేదు. అంబుజా సిమెంటో, ఏసీసీ సిమెంటో ఉపయోగించలేదు. అయినా కానీ,  నీ దయవల్ల అది గట్టిగా నిలబడింది. అయినా రామయ్యా! ఆ పాత సంగతి ఇప్పుడెందుకయ్యా!

రాముడన్నాడు.
కలియుగం వచ్చేసింది ఆంజనేయా! మన రోజులు కావివి. ఇప్పుడు రామసేతును పడగొట్టి దాని  స్తానంలో కాలువ లాటిదేదో  నిర్మించాలని కొందరు అనుకుంటున్నట్టు ఈ మధ్య టీవీ స్క్రోలింగులలో చూసాను. కాలువ నిర్మిస్తారో లేదో  కానీ మనం కట్టిన సేతువుని తొలగించడం ఖచ్చితమనిపిస్తోంది. ఎందుకంటె,  ఈ కాలువ కాంట్రాక్ట్ లో కోట్ల డబ్బు కొందరి చేతుల్లోకి  చేరుతుంది.  వాళ్లు మరికొందరి చేతులు తడిపయినా సరే ఆ  కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం ఖాయంగా కనబడుతోంది. మాల్తూసియన్ అనే ఒక ఆర్ధిక వేత్త  ఏనాడో చెప్పాడు కదా. జనాలకు ఉపాధి కల్పించాలంటే  ‘Dig a pit and cover itఅని. అంటే ఏమిటి?  ముందు ఒక గొయ్యి తవ్వించు. మళ్ళీ దానిని పూడ్పించు.   గొయ్యి తవ్విన వాడికో పని. దాన్ని పూడ్చినవాడికి మరో  మరో పని. అసలా గొయ్యి ఎందుకు తవ్వాలో ఎందుకు పూడ్చాలో అడిగే నాధుడు వుండడు. అలాగే ఇప్పుడు రామసేతు వ్యవహారం. పడగొట్టినందుకు డబ్బులు. మళ్ళీ కాలవ నిర్మించినందుకు  డబ్బులే డబ్బులు.

ఆ మాటలు వింటూనే  హనుమంతుడిలా అన్నాడు.
ఆ రోజుల్లో వంతెన నిర్మాణానికి మేము కూలీ డబ్బులు తీసుకోకుండా పని చేసిన  మాట వాస్తవమే. అటు రాజ్యలక్ష్మిని,ఇటు  గృహలక్ష్మిని పోగొట్టుకుని వుసూరుమంటూ అడవుల్లో తిరుగుతూ వున్న  మీనుంచి  డబ్బు డిమాండ్ చేయడం కూడా మాకు  సబబు అనిపించలేదు. అదీకాక పళ్ళూ కాయలు తిని పొట్ట నింపుకునే మా వానరులకు విత్తముతో పని ఏముంటుంది?   కాకపొతే,  ఈ మానవులున్నారే వాళ్లు మామూలు వాళ్లు కాదు. క్షమించాలి తొందర్లో మీదీ అదే జాతి అని మరచిపోయి మాట తూలాను. అయినా కానీ,  ఈ కలియుగం మానవులకూ, మన కాలం నాటి మానవులకూ పోలికెక్కడ ప్రభూ. మీరు మీరే వాళ్లు వాళ్ళే. వాళ్లు  బాగా వొళ్ళు బలిసి పోయి  వ్యవహరిస్తున్నారు. అలాటి వారినుంచి డబ్బు పిండినా తప్పులేదు. ఆ విషయం ఆలోచిద్దాం. అసలా  వంతెన కట్టింది మేము. దాని ఆనుపానులన్నీ తెలిసింది మాకు. అలాటప్పుడు దాన్ని  కూలగొట్టడం ఎలాగో మాకు తెలిసినంతగా వేరేవారెవ్వరికీ  తెలిసే వీలు లేదు. కాబట్టి  మనమే వెళ్లి మన  సంగతి ఆ మూఢ మానవులతో చెప్పుకుని  ఆ పనేదో నెత్తికెత్తుకోవడం మంచిదేమో ప్రభూ

హనుమా! నీకు శారీరక  బలం తప్ప మేధోపరమయిన తెలివితేటలు పూజ్యం. ఆ బలం కూడా ఎవరయినా గుర్తుచేస్తేనే నీకు గుర్తుకొచ్చి అక్కరకొస్తుంది. అదీ నీ పరిస్తితి. ఒక విషయం తెలుసుకో. మన  రోజులు కావివి. అప్పుడంటే నేను టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద మీకు పని వొప్ప చెప్పాను. మీరూ ఏమీ ఆశించకుండా పని పూర్తిచేశారు. అందుకే  మన మీద ఏ ఆరోపణలు రాలేదు. గిట్టనివారెవరూ  సీబీఐ  దర్యాప్తు డిమాండ్ చేయలేదు. కాని ఇప్పుడలా కాదు. ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం జరగాలి. లెక్కలన్నీ పక్కాగాలేకపోయినా వున్నట్టు చూపించగలగాలి. లేకపోతే ఏ కాగోపట్టుకుని విచారణ పేరుతొ మనల్ని కాగులో వేసి మరగ పెడుతుంది. దర్యాప్తుల పేరుతొ నిద్ర పట్టకుండా చేస్తారు. జైళ్ళంటారు. నార్కో పరీక్షలంటారు. ముందు ఏసీ కారులో  దిల్ కుశా గెస్ట్ హౌస్ కు పోదాం  అంటారు. అక్కడికెళ్ళాక అరెస్ట్ అంటారు. ఆ తరువాత  సీబీఐ కోర్టుకంటారు. ఆ కోర్టు న్యాయమూర్తి వున్నాడే నాగ మారుతీ శర్మ. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే  మన  రోజుల్లో కూడా ఇలాటి ఖరాఖండీ  న్యాయమూర్తిని చూడలేదు. నిజానికి  వాళ్ల నాన్న నా భక్తుడు. అసలు పేరు సుందర లాల్. నా పేరు అనుక్షణం ఆయన నాలుక మీద ఆడుతూ వుండేది. ఖమ్మంలోవుండగా  ఆయన పేరు రామాయణం మునసబు’.  రోజూ రామాయణ పారాయణం చేస్తేకాని ఆయనకు నిద్రపట్టేది కాదు. ఖమ్మంలోవుండగా  ఆయన్ని అందరూ  ‘రామాయణం మునసబుగారనేవారు. మామిళ్లగూడెంలో ఆయన  అద్దెకు వున్న ఇంట్లో క్రమం తప్పకుండ  సుందరాకాండ పారాయణం జరిగేది.   నా పేరు కలవరిస్తూనే ఆయన కళ్ళు మూశాడని చెప్పుకుంటారు. కాని ఆయన కొడుక్కు మన సంగతి తెలుసో లేదో తెలవదు. బెయిల్ ఇవ్వనన్నాడో చెంచల్ గూడా జెయిలే గతి. ఇక అన్నిటికంటే ఘోరం  టీవీల్లో మన గురించి జరిగే ప్రచారం. నామీద ఈ మానవులు గతంలో  ఎన్నో సినిమాలు తీసి డబ్బు చేసుకున్నారు.   మనల్ని జెయిల్లో తోయించే దృశ్యాలు వాళ్ళ చేతికి చిక్కాయో ఇంతే సంగతులు.  పొద్దస్తమానం మనల్ని జెయిల్లో రెక్కపట్టి నెడుతున్నట్టుగా పదేపదే  చూపిస్తారు. రాముడు మంచి బాలుడన్న సంగతి కాస్తా గంగలో  కలిసిపోతుంది. నన్ను నమ్ముకున్న రామదాసు లాటివాళ్ళు  బందిఖానాలో పడ్డ మాట నిజమే.  కాని, నాకు మాత్రం  జెయిళ్లు, బెయిళ్లు తెలియదు.  వనవాసంలో లక్ష్మణుడు తెచ్చిపెట్టిన కందమూలాలు తప్ప   జెయిల్లో పెట్టే చిప్ప కూడు ఏనాడూ తిని ఎరుగను. ఇప్పుడు పోయిపోయి  సీబీఐ వాళ్ళ  చేతుల్లో పడితే ఇక మన చేతిలో ఏమీ వుండదు. ఇంత బతుకూ బతికి మళ్ళీ ఆ ‘చేతి’ పార్టీ చేతులే పట్టుకోవాలి. వాళ్లు ఓ పట్టాన తేల్చరు. అయిదు రాష్ట్రాల ఎన్నికలంటారు. తిధులంటారు. పండగలంటారు. ఈ లోపల మనం మళ్ళీ అవతారం ఎత్తాల్సిన త్రేతా యుగం  రానే వస్తుంది. అది తప్పిపోయిందంటే మళ్ళీ మరో నాలుగు యుగాలు ఆగాలి.    రామరాజ్యంలో ఏదయినా కూడబెట్టుకున్నది వున్నదంటే అది లాయర్లకు చదివించు కోవడానికే సర్వం సరిపోతుంది. ఈ లోగా యుగాలు, మన్వంతరాల తరబడి కష్టపడి మనం  సంపాదించుకున్న మంచి తనం కాస్తా టీవీ చర్చల్లో మంట కలిసిపోతుంది. కలియుగం మనుషులంటావా తింటారు తినిపిస్తారు. దర్యాప్తులు, విచారణలు ఏళ్లతరబడి సాగిస్తారు. సాగదీస్తారు. ఈ లోపల వాళ్లకు వాళ్లకు లెక్కలు డొక్కలు కుదిరితే కేసులన్నీ  అటకెక్కుతాయి. ఆ టక్కుటమార విద్యలు నా గురువులు విశ్వామిత్రులవారు  నాకు నేర్పలేదు. పోనీ నేర్చుకుందామనుకున్నా  ఈ వయస్సులో వంటపట్టవు. ఏదో  నువ్వు చెబుతున్నావు కదా, పోతే పోయింది ఒక రాయి విసిరి చూద్దాం   అని వెళ్ళామే అనుకో. నిలబెట్టి   వెయ్యి ప్రశ్నలు అడుగుతారు. వంద సర్టిఫికెట్లు తెమ్మంటారు. వయస్సు సర్టిఫికేట్  ఏదంటే ఏం చెబుతాం. ఏం చదివారంటే మన దగ్గర  ఏం జవాబుంది? చదువు  చెప్పిన విశ్వామిత్రుడు తన దగ్గర నేను చదివినట్టు నాకు ఏ  సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతూ త్రిశంకు స్వర్గంలో  వుండిపోయాడు. ఆయన్ని ఇప్పుడు యెక్కడని వెతికి పట్టుకుంటాం. రోజులు బాగున్న రోజుల్లో  రధాల మీద తిరిగాము. కాలం ఖర్మం కలసిరానప్పుడు  కాలినడకన అడవుల్లో సంచరించాము. అలాగని ఆ   రధానికి  డ్రైవింగ్ లైసెన్సు తెమ్మంటే ఎక్కడ తెస్తాము చెప్పు. యెలా తెస్తాము చెప్పు.      
          
అంతటితో అయిపోతుందా. అడ్రసు ప్రూఫ్ అడిగారనుకో  అదీ లేదు. నేను జన్మించిన  అయోధ్యనే ఈ  మానవులు ఏళ్లతరబడి కోర్టు  లిటిగేషనులో పెట్టి తమాషా చూస్తున్నారు. మనిద్దరం విల్లంబులు పట్టుకుని టెండర్ వేయడానికి వెడితే, పని ఇవ్వకపోగా ఎస్ టీ కోటా కింద  ఏదయినా ఆశ్రమ  పాఠశాలలో చేర్పించి చేతులు దులుపుకుంటారేమో కూడా. అంతటి ఘనులు వీళ్ళు. ఇంకో సమస్య ఏమిటంటే మనం భగవంతుడి అవతారం అన్న ట్యా గ్ లైన్ ఒకటి వుంది. అది పెట్టుకుని ఇప్పుడు కాలినడకన వెడితే ఏం బాగుంటుంది చెప్పు. మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరిగా త్రీ పీస్ సూట్ వేసుకువెళ్ళామంటే ఇంతే సంగతులు. మన భక్తులు కూడా మనల్ని  అనుమానిస్తారు. అదింకా ప్రమాదం. టెండరు దక్కక పోగా మనకే టెండరు పడుతుంది.
రాముడు చెప్పిన భగవద్గీత అంజనీకుమారుడి చెవికెక్కినట్టులేదు. అతడు తోకతో  ఓమారు వీపు గోక్కుని  దాంతోనే మరోమారు  తల  తడుముకుని ఇలా అన్నాడు.
రామసేతు వంతెనను నేనూ నా సహచర వానరులు స్వయంగా కట్టామని ఆ మానవాధములకు స్టాంపు పేపరు మీద రాసి ఇస్తాను. అదీ నమ్మరా. అలాటప్పుడు ఆ పేపర్లు ఎందుకు, డూప్లికేట్ స్టాంపు కాగితాలు తయారు చేసే తెల్గీ లాటి వాళ్లు బాగు పడడం కోసమా?’

ఓరి అమాయక వానర చక్రవర్తీ!రాముడు మళ్ళీ చెప్పాడు.   

అలాటి కాగితాలు వాళ్లకు చిత్తు  కాగితాలతో సమానం. వాళ్ళు ముందు నిన్ను రామసేతువు  లేఅవుట్ సబ్మిట్ చేయమంటారు. ప్రాజెక్ట్ వివరాలు అడుగుతారు. ఇన్ కం టాక్స్ రిటర్న్లు తెమ్మంటారు. అప్రూవ్  చేసిన ప్లాను అడుగుతారు. మునిసిపల్ పర్మిట్లు, ఎస్కవేషన్  పర్మిట్టు,  రామసేతు కట్టిన కంట్రాక్టర్ పేరు వివరాలు, అతడికి యెంత ఖర్చయింది, ఎన్నాళ్లలో కట్టాడు, దాన్ని సకాలంలో పూర్తిచేసిన సర్టిఫికేటు వుందా ఇలా   రకరకాల పత్రాలు అడుగుతారు.ప్రశ్నలు వేస్తారు. రామసేతు పూర్తయిన తరువాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు గట్రా పట్రా అంటారు. ఎందుకంటె ఈ కలియుగంలో మనిషి మాటకన్నా సర్టిఫికేట్లకే విలువెక్కువ. ప్రత్యేకించి పవిత్ర బారతంలో ఈ పత్రాల గోల మరీ ఎక్కువ. పెన్షన్  తీసుకునే వాడు స్వయంగా వెళ్ళినా అతడు బతికే వున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ఏదీ ఒప్పుకోరు. నువ్వు ఖల్లు ఖల్లున దగ్గుతున్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర వుంటేనే నీకు దగ్గు జబ్బు వున్నట్టు లెక్క.

శ్రీ రామ గీత వింటున్న పవన సుతుడుడికి మతి పోయినంత పనయింది.

స్వామీ ఇదెక్కడి మాయ లోకం. నువ్వు ప్రతి వందేళ్లకీ ఓ మాటు  సూరదాసు, తులసీదాసు, త్యాగరాజు, జయదేవుడు, భద్రాచల రామదాసు,  భక్త తుకారాం లాటివారికి నీ ఉనికినీ, మహిమలనూ  ప్రదర్శిస్తూనే వున్నావు. అయినా సరే ఇప్పటికీ  నువ్వున్నావా అసలున్నావా   అని సినిమా పాటలు రాస్తూనే వున్నారు. ఇక నీ ఉనికి గురించిన చర్చోప చర్చలు టీవీ తెరలపై అనంతంగా సాగి పోతూనే  వున్నాయి. రామాయణం పుక్కిటి పురాణమని, రామసేతు నిర్మాణం అసలు జరగనేలేదనీ వాదించేవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. ఈ స్తితిలో నాకు ఒకే దారి కనబడుతోంది. ఏమయినా సరే నువ్వు రాముడిగా మరో సారి అవతారం ఎత్తాలి. రామాయణం నిజంగా జరిగిందేనని నిరూపిస్తూ దాన్ని మరోసారి ఈ మానవులకు ప్రదర్శించి చూపాలి.అన్నాడు ఆంజనేయుడు ఆవేశంగా.

రాముడు తనదయిన రీతిలో మందహాసం చేసి  చెప్పాడు.

అదంత సులభం కాదు అంజనీ పుత్రా. ఈనాటి రాజకీయ నాయకులతో పోలిస్తే  రావణుడు లాటి విలన్  కూడా జనాలకు ఒక హీరో లాగానే అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఈ మధ్య మారీచుడు నాకు తారస పడితే అడిగాను. మారీచుడు ఎవరో  గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు. అరణ్యంలో బంగారు లేడిని వేటాడుతూ  వెడుతున్నప్పుడు అచ్చు  నా స్వరాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణాఅంటూ   లక్ష్మణుడిని ఎలుగెత్తి  పిలిచాడు చూడూ  ఆ మారీచుడే. ఏమన్నాడో తెలుసా! సల్మాన్ ఖాన్ వున్నంతవరకు మళ్ళీ భూమి మీద కాలు మోపే ఛాన్స్ తీసుకునేది  లేదని తెగేసి చెప్పాడు.

శ్రీరాముడు బోధించిన ఈ భగవద్గీతతో ఆంజనేయుడికి జ్ఞానోదయం అయింది.

స్వస్తి. (31-01-2012)

12, జులై 2013, శుక్రవారం

రామసేతు నిర్మాణం చూద్దాం రండి!


రామసేతు 



 An Engineering Marvel  of 5076 BC, 

 9 Min.  Video .
(Use below link)

https://www.youtube.com/watch?v=FgSINZO_VuI
  

This  film brings to light the layers of bridge construction, and the month and the
year, when the Rama Setu ( bridge ) was built .  Watch it, if you find time.
 


11, జులై 2013, గురువారం

స్వయంకృతాపరాధాలు



పురుషులందు పుణ్య పురుషులు వేరయాఅన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తితరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసేఅనడం - తండ్రిని ఒరేఅనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూఅని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతంచేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ‘ఒసే’ అనడం, నాన్నను ‘ఒరే’ అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాటి పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!