కొన్ని వీరోచిత గాధలు వింటుంటే
వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మన వీర సైనికుల సాహసాలను ఎత్తి చూపే ఒక
సందర్భాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టైమ్ మేగజైన్ ప్రచురించింది.
నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం.
హిమాలయాల్లో ఎన్నో వందల అడుగుల ఎత్తున రెజాంగ్ లా
కనుమలో ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ కాపుకాస్తోంది. మొత్తం నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనిక
దళానికి జోధ్పూర్ కు చెందిన రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా
వున్నాడు. నిజానికి దుర్భరమైన వాతావరణ పరిస్తితుల్లో ఆ సైనికులకు ఎన్నో అవసరాలు
తీర్చాల్సి వుంది. అయితే వారికి అవేవీ లేవు ఒక్క మనోధైర్యం, ఆత్మ విశ్వాసం
తప్ప - అని టైం మేగజైన్ రాసిందంటే అది వారి పట్టుదలకు చక్కటి కితాబు.
ఆ దళానికి పై అధికారులనుంచి ఒకే ఒక్క ఆదేశం.
'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా
చూడండి.'
శత్రు సైన్యం సమాయత్తంగా వచ్చింది. ఇటు
పక్క ఒక్క భారత సైనికుడు వుంటే అటుపక్క యాభై మంది చైనా సైనికులు.
సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునికమైనవి. పైగా
అన్నుదన్నుగా వారికి వెనుకనుంచి అందే సహాయం విషయంలో కూడా వాళ్లు ఎన్నో రెట్లు
మెరుగు.
నవంబర్ నెల. ఆదివారం. చైనా సైన్యం దాడికి దిగింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి
నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు అంతులేకుండా వస్తూనే వున్నారు. వారిని నిలవరించడం
భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. భారత సైన్యంలో ఒక్కొక్కడు
యాభైమంది చైనా సైనికులకు సమాధానం చెప్పాల్సిన పరిస్తితి. శత్రువులు మిడతల దండు
మాదిరిగా వస్తూనే వున్నారు. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటినుంచి
మరో చోటికి వేగంగా కదులుతూ తన సైనికులకు
తానే ఒక దన్నుగా నిలబడ్డాడు. కానీ ఇంతలో శత్రు సైన్యం అతడిపై నేరుగా కాల్పులు
జరిపింది. ఒక తూటా అతడి భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది.
అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. శత్రువులపై కాల్పులు జరుపుతూనే పోయాడు. గాయాలతో
రక్త స్రావం అధికం అయింది. మనిషి నీరసించిపోయాడు. ప్రాణాలతో మిగిలిన కొందరు భారత
జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని
ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్ పడనివ్వలేదు. ఒక పెద్ద కొండ రాతివెనుకకు వెళ్ళగలిగాడు.
అయితే అప్పటికే చాలా రక్తం పోయింది. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. భారత
ప్రభుత్వం ఆ వీరుడిని పరమ వీరచక్ర పురస్కారంతో గౌరవించింది.
అతడి దళంలోని అనేకమంది వీరోచితంగా
పోరాడి అసువులు బాసారు. అయితే ప్రాణాలు పోయేలోగా ఒక్కొక భారత సైనికుడు కనీసం
అయిదుమంది శత్రువులను మట్టుబెట్టాడు.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది
తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు చాలా దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన
మృత సైనికుల చేతుల్లో తుపాకులు గురిపెట్టి వున్నాయి. ప్రాణం పోతున్నా వారు
ఆయుధాన్ని ఒదలకుండా శత్రువులతో పోరాడారని అధికారులకు అవగతమైంది. కొందరి దేహాలు శత్రుసైనికుల
దాడికి ఖండఖండాలుగా మారిపోయినా, వారిచేతుల్లో తుపాకులు అలాగేవున్నాయి.
భారత సైనిక దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని
స్వయంగా ఆహ్వానించాడు. శత్రువుల దాడికి ఛిద్రమైన వారి శరీరాలు కందకాల్లో
కానవచ్చాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయి కనిపించాయి. ఒక సైనికుడి
చేతిలో విసరడానికి తయారుగా వుంచుకున్న బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం
మాత్రం లేదు. చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన భారత మెడికల్ ఆర్డర్లీ
చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ దళ సైనికుల శవాలు వారి
స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే శత్రు సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్ళారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్
హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు ఈ
గ్రామం ప్రత్యక్ష సాక్షి. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ వూరిలోని ప్రతికుటుంబం ఒకరిని
సైనికుడిగా యుద్ధ రంగానికి పంపింది. ఈ
చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన అనేకమంది అధికార్లు, జవాన్లు వున్నారంటే దీని ప్రత్యేకత అర్ధం అవుతుంది.
