మంచికోసం అయితే మార్పు మంచిదే! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచికోసం అయితే మార్పు మంచిదే! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2016, బుధవారం

మంచికోసం అయితే మార్పు మంచిదే!


స్వాతంత్రం  వచ్చిన  పదేళ్లకు 1957 లో దేశంలో డెసిమల్ పద్దతిలో కొత్త నాణేలను ప్రవేశ పెట్టారు. మా చిన్న తనంలో తళతళ మెరిసే నయా పైసాలు వచ్చాయి. జనాలకు కొత్త నాణేలు  అలవాటు అయ్యేవరకూ అప్పటివరకు చెలామణీ లో వున్న అర్ధరూపాయలు, పావలాలు, బేడలు, అణాలు,అర్ధణాలు, కాణీలు, చిల్లు కాణీలను కూడా చెలామణీ లోనే ఉంచారు. కాలక్రమంలో అవి కనుమరుగయిపోయాయి. అలాగే తూకాలకు వాడే  వీసెలు, తులాల  స్థానంలో కిలోగ్రాములు, శేర్లు, గిద్దెల స్థానంలో లీటర్లు రంగప్రవేశం చేసాయి. దూరాలకు వాడే మైలురాళ్ళ కొలమానాన్ని కిలోమీటర్లు ఆక్రమించాయి. అప్పటికి దేశంలో నూటికి తొంభయి శాతం జనాభా అంగుష్ఠ మాత్రులు. అంటే నిశానీదారులు. వేలి ముద్ర తప్ప సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులు. అయినా మార్పును సంతోషంగా ఆహ్వానించారు. ఎలాటి ఇబ్బందీ లేకుండా అలవాటు పడ్డారు.
స్వతంత్ర భారతంలో వచ్చిన మరో గొప్ప మార్పు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడడం. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. మొదట్లో పోటీలో వున్న ప్రతి పార్టీకీ (అభ్యర్ధికీ) ఒక్కో గుర్తు కేటాయించేవారు. కాంగ్రెస్ పార్టీకి  కాడి జోడెడ్లు, కమ్యూనిష్టులకు కంకీ కొడవలి, సుత్తీ కొడవలి ఇలా. ప్రతి గుర్తుకూ విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఖాళీ కిరోసిన్ డబ్బాలకు కాగితం అంటించి దానిపై పార్టీ గుర్తు అతికించే వారు. తరువాత ప్రతి డబ్బాను తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఫలితం ప్రకటించేవాళ్ళు. దరిమిలా బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. అభ్యర్దులందరి పేర్లు ఒకే బ్యాలెట్ పై వుండేవి. తరువాత పేర్లు కూడా తీసేసి కేవలం గుర్తులు మాత్రమే ఉంచేవాళ్ళు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటువేసిన తరువాత దాన్ని బ్యాలెట్ పెట్టెలో వేసేవాళ్ళు. ఆ తరువాత ఎలక్ట్రానిక్  ఓటింగ్ మిషన్లు వచ్చాయి. ఓటర్లలో అధిక శాతం నిరక్షరాస్యులు అయినప్పటికీ కాలం తెస్తున్న మార్పులకు బాగా అలవాటుపడ్డారు. కొత్త విషయాలను సులువుగా గ్రహించడానికి చదువు అక్కరలేదని నిరక్షర భారతం పలుపర్యాయాలు నిరూపించి చూపింది.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
పూర్వం టూరింగు టాకీసుల్లోనే కాకుండా, మంచి సినిమా థియేటర్లలో కూడా జనాలు చుట్టలు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్లు. పొగతాగరాదు అని స్లయిడ్లు వేసేవాళ్ళు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. తరువాత ఎయిర్ కండిషన్  ధియేటర్లు వచ్చాక సినిమా హాల్లో పొగతాగ కూడదు అనే సంగతిని సామాన్య జనం ఒకరిని చూసి మరొకరు నేర్చుకున్నారు. జరిమానాలు, శిక్షల బెదిరింపుల వల్లకాదు. అంటే ఏమిటి? మార్పును ఆహ్వానించే తత్వం జనంలోనే  వుంది. వాళ్ళు మార్పుకు ఏనాడు వ్యతిరేకులు కాదు.
ఇప్పుడు డబ్బు మార్పిడికి సెల్ ఫోన్లు వాడమంటున్నారు. తప్పకుండా వాడుతారు. అయితే ఇంతకు  ముందు చెప్పిన వాటికీ దీనికీ ఓ స్థూలమైన తేడా వుంది. అవి జనం చేతులో వున్నాయి. ఇదలా కాదు. ఇంటర్నెట్ అవసరం. అదీ ఎలాంటి అవాంతరాలు లేకుండా.
నెట్ ఉపయోగించడానికి జనం సిద్ధంగానే వున్నారు. అయితే నెట్ అందరికీ అందుబాటులో ఉందా అనేదే అసలు ప్రశ్న.     

ఏలికలు సమాధానం చెప్పాలి.