My article on YS Jagan Mohan Reddy completing four years as AP Opposition Leader published in Andhra Prabha today, 5th June, 2018)
నా నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో వినని మాట గత నాలుగేళ్ళలో తరచుగా వినబడుతోంది. అదేమిటంటే వైసీపీ నేత జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలం అయ్యారని. సాఫల్య వైఫల్యాలు లెక్కించడానికి ప్రతిపక్షం చేతిలో ఉన్న అధికారాలు ఏమిటన్నది, నాకు అర్ధం కాని విషయం. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి విఫలం అయ్యారు అనడానికి అధికార పీఠం ఎక్కనే లేదు. ఇక ప్రతిపక్షంగా విఫలం అవడం అంటే ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి దోహదపడకపొతే అప్పుడు వైఫల్యాలు గురించి మాట్లాడుకోవచ్చు. ‘సమస్యలే లేవు, ఒక వేళ వున్నా వాటిని ఒకరు చెప్పే పనిలేకుండా తక్షణమే పరిష్కరిస్తున్నాం’ అనే ధోరణితో పాలకపక్షం వున్నప్పుడు ప్రతిపక్ష నేత వైఫల్యాల ప్రసక్తి ఎందుకు తీసుకువస్తున్నట్టు? ఈ రకమైన విమర్శలు చేసేవాళ్ళు ఈ లాజిక్ ని ఎందుకు మరచిపోతున్నట్టు?
జగన్ మోహన రెడ్డి మీద మరో విమర్శ. ప్రజల పక్షం నుంచి కాదు, పాలక పక్షం నుంచి. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుని జగన్ మోహన రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం పాలు చేస్తున్నారన్నది ఆ విమర్శ. ప్రజాస్వామ్య ప్రియులెవ్వరూ ఇటువంటి నిర్ణయాన్ని హర్షించని మాట నిజమే. కానీ ఏ పరిస్తితుల్లో అటువంటి నిర్ణయం తీసుకున్నదీ ఆయనే పలుమార్లు బాహాటంగా చెప్పారు. గడచిన నాలుగేళ్ల కాలంలో పాలక పక్షంలోకి చేర్చుకోవడం మాత్రమే కాకుండా, వారిలో ఒకరిని మంత్రి పదవిలో కూర్చోబెట్టడం ద్వారా పాలక పక్షమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని, తాము అసెంబ్లీలో లేవనెత్తే ప్రజా సమస్యలకు, తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడే మంత్రి రూపంలో సమాధానం ఇచ్చే దుస్తితిని చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ చేసే వాదనలో వాస్తవం లేకపోలేదు. తమ ఎమ్మెల్యేలను గతంలో పాలకపక్షంలోకి తీసుకున్న రోజుల్లో కూడా తాము అసెంబ్లీకి హాజరయిన సంగతిని ఆ పార్టీ గుర్తుచేస్తోంది.
ఏది ఏమైనా నాలుగేళ్ల నవ్యాంధ్రలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన జరగడం లేదని జగన్ మోహన రెడ్డి తన సంకల్ప యాత్రలో అనుదినం చెబుతూ వస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఆయన చేసే ప్రసంగాలలో చంద్రబాబు నాయుడి ప్రసక్తే తరచుగా వినబడుతోంది. ఆయన పేరు పలుమార్లు ప్రస్తావిస్తూ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అందుకు ప్రతిగా చంద్రబాబు మంత్రివర్గంలోని మెజారిటీ సభ్యులు విడివిడిగా, కొండొకచో ఒక్కుమ్మడిగా జగన్ మోహన రెడ్డి పై మాటల దాడి చేస్తున్నారు. వీరికి పాలక పక్ష ఎమ్మెల్యేలు గొంతు కలుపుతున్నారు. ఏతావాతా జరుగుతున్నది ఏమిటంటే, ప్రజాసమస్యలకంటే వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే మీడియాలో విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. అలాగే, ఇదే సమయంలో తాము రాష్ట్రానికి చేసిన మంచి పనులని గురించి చెప్పుకోవడం కంటే జగన్ పార్టీని, ముఖ్యంగా జగన్ మోహన రెడ్డిని చెడుగా చిత్రించడానికే పాలక పక్షం ఎక్కువ శ్రమ పడుతున్నట్టు కానవస్తోంది. నిజానికి ఇవేమీ కొత్తవి కాదు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు చేసినవే. ప్రజలు వాటిని పట్టించుకోలేదన్న సంగతి వైఎస్ఆర్ సీపీకి లభించిన ఓట్ల శాతం తెలుపుతోంది.
ప్రజలు పట్టించుకోని ఈ అవినీతి అంశాన్ని ఈసారి ఎన్నికల్లో ఉభయ పక్షాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు వారి మాటల తీరు తెలుపుతోంది.
ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. అసెంబ్లీ వేదికపైనా, లేదా ఇతర వేదికలపైనా అనేది వేరే విషయం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన ప్రజా సంకల్ప యాత్రలో కొంత సమయాన్ని ఇందుకు కేటాయిస్తున్నమాట నిజమే అయినా, అత్యధికంగా చంద్రబాబుపైనే ఆయన తన విమర్సనాస్త్రాలను సంధిస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన అవినీతి మాయం అని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క పాలక పక్షం కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేదు. ఆఖరికి అధికారికంగా, ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలపై, ముఖ్యంగా, వైసీపీ నాయకుడిపై పేరు పెట్టి విరుచుకుపడుతూ, ఆ పార్టీని అవినీతి కూపంగా వర్ణిస్తూ, ఆ విషయాన్ని ప్రజలకు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, రానున్న ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది అని వారు ఉభయులూ బలంగా నమ్ముతున్న ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని సొంతం చేసుకునే దిశగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
అయితే, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటుచేసే సభల్లో ప్రతిపక్షనేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి చేసే ప్రసంగాలలో కొన్ని అతిశయోక్తులు, మాట జారడాలు వెలుగు చూస్తున్నాయి. జనాలను ఉత్తేజ పరిచే ప్రసంగాలలో ఇవి సహజం అని సర్ది చెప్పుకున్నా, ఏ పార్టీకి చెందని వారిని కొంత కలవర పరుస్తున్నాయి. పాలక పక్షం గతంలో ప్రతిపక్షంగా వున్నప్పుడు ఇదే విధంగా వ్యవహరించేది అనే విషయం గుర్తు చేసి తప్పించుకోవడం అంటే విలువలను పక్కన పెట్టడమే. అలాగే, విశ్వసనీయతకు తమ పార్టీ ప్రతిబింబం అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి ఆకాశమే హద్దుగా ప్రతి రోజూ చేసుకుంటూ పోతున్న హామీల ప్రకటనలు గమనిస్తుంటే ఇవన్నీ సాధ్యమయ్యే వ్యవహారాలేనా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో ఒక పర్యాయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో అలా హామీలు గుప్పించిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఎంతగా ఉడ్డుకుడుచుకున్నదీ తెలిసిన విషయమే. ఇస్తున్న ప్రతి హామీ అమలు ఎలా సాధ్యమో మరునాడే జగన్ ఒక ప్రకటన రూపంలో వెల్లడిస్తే విశ్వసనీయత మసక బారకుండా వుంటుంది.
రానున్నది ఎన్నికల కాలం. గత ఎన్నికల్లో చేతికి అందినట్టే అంది చేజారిన అదృష్టాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించడంలో అబ్బురం ఏమీ లేదు. అలాగే కొన్ని ఊహించని పరిస్తితుల్లో దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీడీపీ శాయశక్తులా కృషి చేయడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ ప్రయత్నాలు, ఈ కృషి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగితే జనం సంతోషిస్తారు.
ఎన్నికల కోయిల కూయక ముందే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతంగా ప్రారంభించాయి. నిజానికి నాలుగేళ్ల క్రితం కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరినప్పటించే ఇది మొదలయిందని చెప్పాలి. అప్పటినుంచీ, అక్కడ జరిగే అభివృద్ధి గురించి కంటే పాలక ప్రతిపక్షాల కుమ్ములాటలే మీడియాలో ప్రధానంగా చోటు చేసుకుంటూ రావడం ఓ విషాదం.
ఏదో ఒక పేరుతొ పాత పార్టీలు, కొత్తగా ఎన్నికల బరిలో దిగిన పాత పార్టీలు, ఇంకా పురుడు పోసుకోని సరికొత్త పార్టీలు లేదా వాటి నాయకులు ప్రజల మధ్యనే ఉంటున్నాయి. ఈ విషయంలో పాలక పక్షానిది వడ్డించిన విస్తరి. అన్నీ అమర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సదా సిద్ధంగా వుంటుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జగన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్రంలో తన పార్టీని రద్దుచేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఆ రోజుల్లో కొందరు ఆక్షేపించినా నిజానికి ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం.
అలాగే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి నాలుగేళ్లయినా ఒక అవతరణ దినం నిర్ణయించడంలో జరుగుతున్న జాప్యం కూడా ఒక ఎత్తుగడే అనే విషయాన్ని కూడా గుర్తించాలి. విభజన కారణంగా ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహం, అసంతృప్తి జ్వాలలు చల్లారి పోకుండా చూడాలనే అనుభవం పుష్కలంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు అయినా ఆలోచిస్తాడు.
రాష్ట్ర విభజన అనేది ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం. దానిని భావోద్వేగ అంశంగా మార్చి పబ్బం గడుపుకోవాలని చూడడం రాజకీయంగా పనికి రావచ్చేమో కాని భవిష్యత్తులో అది మానని, ఏ చికిత్సకు లొంగని వ్రణంగా మారే ప్రమాదం వుంది.
ప్రతిపక్షాన్ని నిలువరించడానికి పాలక పక్షం ఈ అంశాన్ని వాడుకోవాలని చూడడం విజ్ఞత అనిపించుకోదు. ఇది విశాల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయం. కానీ రాజకీయాల్లో ఇలాటి వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఎవరి ప్రయోజనాలు వారివి. విజయం ముందు ఏ విలువలు అయినా దిగదుడుపే.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595