చాలా కాలం క్రితం నేను రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ (నా మాస్కో అనుభవాలపై పుస్తకం) ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరిగింది. అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు ఆవిష్కరించారు. పత్రికా సంపాదకులు కూడా కొందరు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒకతను వచ్చి పలానా పత్రిక విలేకరిని అని పరిచయం చేసుకున్నాడు. రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కవర్ చేయడానికి విలేకరుల బృందం తరపున వచ్చాననీ, ఫొటోకు అయితే ఇంత, వార్తకు అయితే ఇంత అని ఏదో చెప్పబోయాడు. నేను మిమ్మల్ని రమ్మని పిలిచానా అని అడిగాను. ‘లేదు, ‘మేమే నగరంలో నేడు’ అని పత్రికల్లో వచ్చే సమాచారం తెలుసుకుని వస్తాము’ అన్నాడు. అప్పుడతనితో చెప్పాను.
‘చూడు బాబూ, నేనూ ఇదే వృత్తిలో నాలుగు దశాబ్దాలు పనిచేసాను. నా పేరు పత్రికలో చూసుకోవాలనే దశ దాటిపోయాను. ఇక నీ ఇష్టం’ అని వచ్చేశాను.
మర్నాడు ‘తల్లి’ పత్రికలు చదివాను కానీ ‘పిల్ల’ పత్రికల వైపే చూడలేదు.