18, సెప్టెంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (219): భండారు శ్రీనివాసరావు

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా వృత్తి జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
అప్పటివరకు పదిమందిలో ప్రథముడిని కాకపోయినా, మొదటి వరసలో వుండేవాడిని, తరువాత మూడు దశాబ్దాలు ఇంగువకట్టిన గుడ్డ మాదిరి. పాత వాసనలతో వృత్తి జీవితం గడిచిపోయింది.
నిజానికి నిండు జీవితం నూరేళ్లు అంటారు కానీ మనిషి తన జీవితంలో గొప్పగా బతికే కాలం అన్నేళ్ళు వుండదు. నా విషయంలో అది పదేళ్లకు కుంచించుకుపోయింది.
విలేకరుల సమావేశాలు మొదలుపెట్టేముందు రేడియో శ్రీనివాసరావు వచ్చాడా లేదా అని ఆరాలు తీసిన రోజులు చూశాను. వచ్చే వుంటాడులే అనుకున్న రోజులు చూశాను. మీడియా విస్తృతి అంత వేగంగా పెరిగిపోయింది. గుర్తింపు కోసం చేసిన ఉద్యోగం కాదు కనుక ఈ పరిణామాలు నా మనసును తాకలేదు.
నా విషయంలోనే కాదు, ప్రతి వృత్తిలో ఇది సహజం. ఎన్నో చూశాను, ఎందరెందరినో చూశాను. ఒక ఉదాహరణ చెబుతాను.
పి. నరసారెడ్డి. అరవై ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా, అదీ అతి ప్రధానమైన రెవెన్యూ మంత్రిగా, ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది.
చాలా కాలం తరువాత మళ్ళీ అదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు. అయితే, గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.
నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.
నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (మధ్యలో ఎమ్మార్వో గా మారి మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు పూర్వ నామం వచ్చినట్టుంది) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గారికి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ సంతకం చేశారు. మర్నాడు నేను ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.
కొన్ని నెలల క్రితం క్రితం మళ్ళీ ఒక రెవెన్యూ మంత్రి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కలం కూలీ జి.కృష్ణ గారి గురించి నేను సభ్యుడిగా వున్నవయోధిక పాత్రికేయ సంఘం వారు ఒక పుస్తకం వేశారు. దాని ఆవిష్కరణ కోసం మంత్రిని కొందరం వెళ్లి కలిశాము. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచీ నాకు తెలుసు.
మంత్రి నివాసం సందర్శకులతో కిటకిట లాడుతోంది. వచ్చిన విషయం సంబంధిత సిబ్బందికి తెలియచేసి బయట ఆవరణలో తచ్చాడుతున్నాం. నేను ఎక్కువసేపు నిలబడ లేక, బయట ఫుట్ పాత్ పై కూలపడ్డాను. లోపలనుంచి కబురు లేదు. ఎందుకు వుంటుంది. అందరం రిటైర్డ్ హర్ట్ పాత్రికేయులం.
ఎట్టకేలకు కలిశాము.
మాజీ మంత్రి నరసారెడ్డి గారితో పోల్చుకుని నయమే అనుకున్నాను. మమ్మల్ని వెయిట్ చేయించినందుకు నొచ్చుకున్నారు. విషయం చెప్పాము. ఈ మధ్యకాలంలోనే పనిచేసిన సీనియర్ పాత్రికేయులతోనే ఆయనకు పరిచయం లేదు. ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి వంటి వారితో సన్నిహిత పరిచయం వున్న జీ కృష్ణ గారు తెలిసే అవకాశమే లేదు.
అయినా కలిసారు, మాట్లాడారు,. ‘మీరంతా పెద్దవాళ్లు, చల్లగా వుండండి’ అని చెప్పి పంపేశారు. జర్నలిస్టులు అందులో వయోధికులు, అల్ప సంతోషులు కదా! అంత మాత్రానికే సంతోషించి వెనక్కి వచ్చేశాము.
తోకటపా:
కృష్ణగారి పుస్తకావిష్కరణ ఇంతవరకు జరగలేదు. వ్యక్తిగత పరిచయాలు, వృత్తిగత పరిచయాలు కూడా ‘మనకేమిటి ఇందులో’ అనే దగ్గరే ఆగిపోతున్నాయి.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: