18, అక్టోబర్ 2021, సోమవారం

రావూరి భరద్వాజ అసలు పేరు - భండారు శ్రీనివాసరావు

(జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ వర్ధంతి ఈరోజు)





జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరి భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి
ఓ చిన్న జ్ఞాపకం:
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా చెప్పుకోవాలి.
రావూరి భరద్వాజ గారు ఇంత పొడవు గడ్డం పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల, అప్పుడు బెంగుళూరు నుంచి వెలువడే తెలుగు వారపత్రిక ‘ప్రజామత’లో సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను.

3 కామెంట్‌లు:

మార్గయ్య మాల్గుడి చెప్పారు...

అవార్డు ఆలస్యంగా వచ్చిందని ఒకింత దిగులు చెందారు మీరు.. ఇండియాలో అవార్డులకు అంతపాటి సిగ్నిఫికెన్స్ లేదన్నది నా అభిప్రాయం.. అది సాహిత్యమైనా మరోటైనా.. ఒక కొలమానమనేదే లేదు.. హిందీ లాబీయింగో.. పొలిటికల్ లాబీయింగో.. మరోటో (నిప్పు బాగా రాజుకుని పొగ కనపడ్డపుడు - అంటే అప్పటికే బాగా వెలుగులోకి వచ్చినపుడు.. ).. అనకూడదు కాని కాటికి కాళ్ళు చాచుకుని సమవర్తి పిలుపుకై ఎదురు చూసే సందర్భంలో ఇవ్వబడే అవార్డులు కూడా అవార్డులేనా.. అవేమైనా బిక్షలా లేక గుర్తింపు.. గౌరవాలా..
ఇన్ని విభిన్న భాషలున్న దేశంలో జాతీయ అవార్డులన్న పదమే కూడదు.. ఏ రాష్ట్రానికా రాష్ట్రమే జాతీయ అవార్డును అందజేసే సంప్రదాయం రావాలి.. లేదంటే లోకల్ ట్యాలెంటును గుర్తించడం వీలుకాని పని.. రంగారావు.. సావిత్రి.. జమున.. రమణారెడ్డి.. సిఎస్సారు.. వగైరాలెంతోమంది కనీస అవార్డుకు నోచుకోలేకపోయారు.. ఇక్కడి సంగతులు అక్కడివారికెలా తెలిసేది.. పివీయో మరొకరో ప్రత్యేకించి ప్రస్తావిస్తేనే అవార్డులా.. రామారావుకు పద్మశ్రీతోనే సరా.. మన తరానికంటే ఎవరు ఎవరో తెలుసు.. చరిత్రకు ఎలా తెలుస్తుంది.. తెలీనపుడెలా లిఖిస్తుంది.. అలా లిఖించనినాడు భావితరాలకు ఎలా తెలుస్తుంది ఎవరెవరో..
అందువల్ల నేషనల్ అవార్డులన్నవి వట్టి బూటకం.. అంతా హంబక్..
వాటిని పూర్తిగా ఆయా రాష్ట్రాల సబ్జెక్టుగా మార్చివేయడమో.. లేక రద్దు చేయడమో మంచిది..
ఇంత ఎందుకు వ్రాయవలసివచ్చిందంటే శ్రీ భరధ్వాజగారికి ఎప్పుడో జ్ఞానపీఠం రావాల్సిందని మీరు ఆవేదన వ్యక్తం చేయడం వల్ల..
పాకుడురాళ్ళు రచన ఓ అద్భుతం.. సామాజిక స్పృహతో వ్రాసినదది.. అదంటే ఎంతో ఇష్టం నాకు.. రావూరి వారిని తిరిగి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ మార్గయ్య మాల్గుడి : ".....ఏ రాష్ట్రానికా రాష్ట్రమే జాతీయ అవార్డును అందజేసే సంప్రదాయం రావాలి...." మీ ఈ సూచన బాగుంది

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు, “ఆకాశవాణి” ఆర్టిస్ట్ అయిన . అన్నవరపు రామస్వామి గారికి తన 95 యేళ్ళ వయసుకు గానీ పద్మ పురస్కారం రాలేదు - అది కూడా అట్టడుగు “పద్మశ్రీ” మాత్రమే.

చిత్రకారుడు “బాపు” గారికి వారి 80 వ యేట వచ్చింది …. అదిన్నూ “పద్మశ్రీ”. చనిపోవడానికి ఒక్క సంవత్సరం ముందు.
సరే, బాపు గారి జోడీ … దాదాపు 80 యేళ్ళు జీవించిన … ముళ్ళపూడి వెంకట రమణ గారికి అది కూడా రాలేదు.

గాయని ఎస్.జానకి గారికి తన 75వ యేట “పద్మభూషణ్” ఇస్తామంటే ఇంత లేటు గానా అంటూ ఆవిడ తిరస్కరించారు.

తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్య గాయని రావు బాలసరస్వతి దేవి గారికి 93 యేళ్ళ వయసు వచ్చినా ఇంత వరకు ఏ పద్మ అవార్డూ రాలేదు.

పైన మార్గయ్య మాల్గుడి గారు చెప్పినట్లు // “ కాటికి కాళ్ళు చాచుకుని సమవర్తి పిలుపుకై ఎదురు చూసే సందర్భంలో ఇవ్వబడే అవార్డులు కూడా అవార్డులేనా.. అవేమైనా బిక్షలా లేక గుర్తింపు.. గౌరవాలా.. “ // ?
వారన్నట్లే ఉత్తర భారతదేశ లాబీయింగ్ కే అధికశాతం దక్కుతుంది అనిపిస్తోంది.