23, జులై 2021, శుక్రవారం

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు

 

(మూడేళ్ల క్రితం వారాలబ్బాయి మాదిరిగా ప్రతి రోజూ ఒక టీవీ చర్చకు పోయివచ్చే రోజుల్లోని ముచ్చట)

AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం ((23-07-2018)

 Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగేఅని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. వాళ్ళూ వీళ్ళూ కాదు,  స్వయంగా నాయకులే ఆ మాటలు  చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.

“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్నాయం చూస్తాము’ అని చెప్పి వుంటే, ప్రజలకు నచ్చచెప్పి  వుంటే, ఎవరెన్ని చెప్పినా ప్రజలు  వారి మాటనే నమ్మేవారు. ప్రజల్ని మీరు  విశ్వాసం లోకి తీసుకుంటే  వాళ్ళు  మిమ్మల్ని నమ్ముతారు.  అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. 

“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్నపాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పుడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని తెలియగానే అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”

“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు తప్పదు. కానీ, కనీసం కొంతయినా ప్రజలకోసం చేయండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

23-07-2021

Below File Photo



1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒకప్పుడు “బోఫోర్స్” “బోఫోర్స్” (Bofors) అంటూ ఎన్నికలల మంత్రం చదివేవారు కదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. ఏదో ఒక జపం చేసి ఎన్నికలలో గెలిస్తే చాలు అన్నట్లు తయారయింది పరిస్థితి.