12, డిసెంబర్ 2019, గురువారం

రేడియోలో శ్రీ గొల్లపూడి


ఒకానొక కాలంలో ఇద్దరు రచయిత్రులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి తమ నవలలతో తెలుగు పాఠక లోకాన్ని ఉర్రూతలూగించారు. రంగనాయకమ్మ గారి బలిపీఠం నవలని రేడియోలో ధారావాహిక శ్రవ్యనాటికగా ప్రసారం చేసారు. రేడియో ఊర్వశిగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి శారదా శ్రీనివాసన్ ఇందులో నటించారు. సులోచనారాణి గారు రాసిన సెక్రెటరీ నవలను అలనాటి రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి గారి పూనికపై  రేడియో నాటికగా మార్చి ప్రసారం చేసారు.  సెక్రెటరీ నవలను రేడియో నాటకంగా మార్చి రాసిన వారు నిన్న ఈరోజు గురువారం చెన్నై లో కన్నుమూసిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారు, శ్రీ డి. వెంకట్రామయ్యగారు. (అప్పుడప్పుడే సినిమా అవకాశాలతో బిజీ అయిన మారుతీరావు గారు  ఈ మొత్తం భారాన్ని తనపైనే మోపినట్టు శ్రీ డి. వెంకట్రామయ్య గారు తన రేడియో అనుభవాల గ్రంధంలో పేర్కొన్నారు) వీరిద్దరూ ఇంచుమించు కొన్ని మాసాల తేడాతో 1963 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగాల్లో చేరారు. గొల్లపూడి వారు డ్యూటీ ఆఫీసర్ గా, ఎనౌన్సర్ గా వెంకట్రామయ్య గారు అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేసారు. రవీంద్రభారతి రంగస్థలంపై కలిసి నాటకాలు వేసారు. వాటిల్లో ఒకటి భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన ‘దంత వేదాంతం’ హాస్య నాటిక ఒకటి.
గొల్లపూడి మారుతీ రావు గారికి మంచి పేరు తెచ్చిన నాటిక ఆయనే రాసిన ‘రాగరాగిణి’ నాటకం.
శ్రీ కే. రామచంద్ర మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. ఛానల్ సీ.ఈ.ఓ. గా వున్నా రోజుల్లో గొల్లపూడి వారి చేత ‘వందేళ్ళ కధకు వందనం’ అనే పేరుతొ ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధప్రతిష్టులైన అనేకమంది కధకులను గొల్లపూడి మారుతీరావు గారు ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసారు.   

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నిన్న శ్రీ డి.వెంకట్రామయ్య గారు కూడా కాలం చేశారని ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చింది. అలనాటి ప్రముఖుల్లో మరొకరు మాయం. RIP 🙏.