7, ఫిబ్రవరి 2011, సోమవారం

ముగిసి మొదలయిన కధ – భండారు శ్రీనివాసరావు

ముగిసి మొదలయిన కధ – భండారు శ్రీనివాసరావు


‘రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే’ అన్న సామెత చందంలో ప్రాంతీయ పార్టీ ‘ప్రజారాజ్యం’, జాతీయ పార్టీ ‘కాంగ్రెస్’ లో కలగలిసిపోయింది. పొత్తా? విలీనమా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ, తమ్ముడు పవన్ ‘పంచ లూడగొడతాన’ని భీషణ ప్రతిజ్ఞలు చేసిన కాంగ్రెస్ నాయకుల పంచన చేరడానికి సాక్షాత్తూ పార్టీ అద్యక్షుడు చిరంజీవే ఢిల్లీలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం ముగిసీ ముగియగానే, ముందు ప్రకటించినట్టు ఏపీ భవన్ కు కూడా వెళ్ళకుండానే, 10 – జనపద్ ప్రధాన ద్వారం సాక్షిగా రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పగల ‘కీలక నిర్ణయం’ ప్రకటించి, వేచి చూస్తున్న విలేకరులకు కొంత సమయం ఆదాచేశారు. అయితే, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మొయిలీ తాను విలేకరులతో మాట్లాడిన తరవాతనే చిరంజీవికి మైకు ఇవ్వడాన్నిబట్టిచూస్తే, ఇకనుంచి పార్టీలో స్తానాన్నిబట్టి నడుచుకోవాల్సివుంటుందనే సూచనను మొయిలీ అన్యాపదేశంగా చిరంజీవికి అందించారని అనుకోవాలి.

చిరంజీవి పార్టీ సమేతంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం గురించి భయపడిన రీతిలో పెనువిమర్శలు ఎదురుకాకపోవడం ఆ పార్టీ పెద్దలను కొంతవరకు ఊరడిల్లచేసింది. క్రమశిక్షణ కలిగిన సైనికులమాదిరిగా అందరూ  అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కింది నుంచి పై దాకా ప్రకటనలు గుప్పించారు. చిరంజీవి ఆగమనం వల్ల రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్తాయిలో సయితం కాంగ్రెస్ బలోపేతం కాగలదని కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఉద్ఘాటించారు. ఏదోరకమయిన పదవులు అనుభవిస్తున్నవారే ఈ ‘ప్రకటన కర్తల్లో’ ఎక్కువమంది వుండడం గమనార్హం. పీ ఆర్ పీ లో కూడా ఇదేరకమయిన పరిస్తితి. ఈ పరిణామానికి ముందే మానసికంగా సిద్ధమయిన పద్దతిలో ఆ పార్టీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే ఇదంతా ఇంతకుముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని అనుకుంటే తప్పుపట్టడానికి అవకాశం లేదు.

పోతే, ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి అనేక రకాల రుగ్మతలతో బాధ పడుతున్న రోగిలా వుంది. రోగనిదానానికి పార్టీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలు ‘వ్యాధి కంటే చికిత్స’ ప్రమాదకరమన్న తీరులో సాగుతున్నాయి. అటు తెలంగాణా అంశం, ఇటు జగన్ జగడం కాంగ్రెస్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్యకు మూలాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా కేవలం తమకు అందిన సమాచారంతోనో లేదా అందుతున్న వివరాలతోనో ఢిల్లీ నుంచి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయే కానీ ఫలిస్తున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. శారీరక రుగ్మతలు అనేకం అయినప్పుడు ఒక దానికి చేసే వైద్యం మరో జబ్బుని ప్రకోపింపచేసినట్టు, ఒక సమస్యకు పరిష్కారం అనుకున్నది మరో సమస్యకు ఆజ్యం పోస్తున్నది.

రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ హయాములో ఢిల్లీ అధిష్టాన దేవతలు రాష్ట్రం వైపు అంతగా దృష్టి సారించలేదు. అనుదిన వ్యవహారాలలో అధిష్టానం జోక్యం అంతంత మాత్రంగానే వుండేది. అసంతృప్తులు లేవనీ చెప్పలేముకానీ  అవి అదుపు చేయలేని పరిమితులు దాటిపోలేదు. దీనికి రాజశేఖరరెడ్డి రాజకీయచతురత కొంతవరకు దోహదపడివుండవచ్చు. అయితే - సోనియా పట్ల సాధారణ ప్రజల అభిప్రాయం సానుకూలంగా మారడానికి ఈ వాతావరణం ఉపయోగడిందనే చెప్పాలి. రెండో పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ అదికారం అధికారం లోకి రావడానికి సాయపడిన అంశాలలో ఇది కూడా ఒకటి. అత్తగారు ఇందిరాగాంధీ కంటే కోడలు సోనియా చాలా నయం అన్న భావన క్రమంగా ప్రబలుతున్న సమయంలో హటాత్తుగా వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూయడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై లోగడ వున్న పాత పట్టును తిరిగి చేజిక్కించుకోవాలన్న ప్రబలమయిన కాంక్ష ఢిల్లీ పెద్దలకు కలిగినట్టుగా తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. గతంలో మాదిరిగా స్వల్ప కాలంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను నామినేట్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవడానికి అధిష్టానవర్గం మళ్ళీ నడుం కట్టిన సూచనలు కానవస్తున్నాయి. మచ్చలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్, పేను పెత్తనం చేయని కాంగ్రెస్ అద్యక్షురాలిగా సోనియా గాంధీ - అయిదేళ్ళ క్రితం జనబాహుళ్యంలో సంపాదించుకున్న మంచి మార్కులన్నీ, ఇటీవలికాలంలో కలికానికి కూడా కానరాకుండా పోయాయి. షరా మామూలు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు రాష్ట్రంలో తిరిగి తెరతీశారు. వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకోకుండా, తమ కందిన సమాచారం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మళ్ళీ మొదలయింది. శాశ్విత పరిష్కారాలను కనుగొనడం కన్నా తాత్కాలిక ఉపశమనాల పట్లే శ్రద్ధ పెరిగింది. ముడులు విప్పే క్రమంలో కొత్త ముళ్లు పడుతున్న విషయం గమనించకపోవడం వల్ల సరికొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి అంశం మీద తమదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం పరిస్తితిని మరింత గందరగోళపరుస్తోంది. కొద్దికాలం క్రితం పరస్పరం పొగుడుకున్న నాలుకలతోనే ఇప్పుడు ఎందుకు తెగుడుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాని స్తితి.
ఇంతవరకు మిత్రులుగా మసలిన వాళ్ళు ఇప్పుడు కత్తులు నూరుతూ కుత్తుకలు కోసుకోవడానికి ఎందుకు ముందుకు దూకుతున్నారో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతున్న దుస్తితి. పదవిలో వున్నప్పుడు వెన్నంటివుండే భజన బృందం ఆ పదవిపోగానే కనుమరుగయిపోతుందన్న నగ్న సత్యం, అధికారంలో వున్నంతకాలం అధినాయకులెవరికీ బోధపడకపోవడం మరో విచిత్రమయిన పరిస్తితి.
అనుదినం మీడియాలో హోరెత్తిపోతున్న విషయాలే కనుక వీటిపై మరింత వివరణ ఇవ్వడం కూడా అనవసరం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న మీమాంసకు తావులేదు. ఎందుకంటే తమ అభిప్రాయాలకు దన్నుగా వారు వినిపిస్తున్న వాదనలు కొండొకచో పరస్పరవిరుద్ధంగా వుంటున్నాయి. వీటిని వేలెత్తి చూపడం అంతకంటే అనవసరం. వారు తెలియక మాట్లాడుతున్నారన్న అనుమానం అక్కరలేదు. కావాలని చేసే వాదనలకు వాస్తవమయిన పునాదులు వుండవు. అలా చేసే వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకోవచ్చు.
అదే ఇప్పుడు జరుగుతోంది. తాము చెప్పింది జనం నమ్ముతున్నారా లేదా అన్న విషయంతో వారికి నిమిత్తం వున్నట్టులేదు. చెప్పుకుంటూ పోవడమే తమ కర్తవ్యంగా ముందుకు పోతున్నారు. ఉదయం చెప్పినదానికి సాయంత్రం అన్నదానికి పొంతన వుందా లేదా అన్నది వారికి అనవసరం. రాజకీయ అవసరమే వారి తక్షణ అవసరం. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. జవాబుదారీతనం లోపించిన రాజకీయం ఇప్పుడు తెలుగునాట రాజ్యమేలుతోంది. ఈ నేపధ్యంలో నైతికత గురించి మాట్లాడడం గొంగడిలో తింటూ వెంట్రుకలు ఏరుకున్న సామెతను గుర్తు చేసుకోవడమే అవుతుంది.
అవకాశవాదం ముందు ఏ వాదం నిలవదు. ఈ నాటి రాజకీయాలకు అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుండడమే విషాదం. గతంలో అవకాశవాద రాజకీయాలు వున్నప్పటికీ ఇంత నిస్సిగ్గుగా వాటిని రాజకీయులు అనుసరించలేదు. నమ్మిన సిద్ధాంతాలకు నీళ్ళు వొదులు కావడానికీ, పార్టీలు మార్చడానికీ కొంత వ్యవధానం తీసుకునేవారు. కొన్ని మర్యాదలు పాటించేవారు. ఇప్పుడా తీరిక ఎవరికీ వున్నట్టులేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా ఏపూటకాపూటే పరగడుపు. 'నిన్న ఏమి చెప్పాము? ఈ రోజు ఏమి చెబుతున్నాం? రేపేం మాట్లాడబోతున్నాం?’ అన్న స్పృహతో నిమిత్తం లేదు. ఏదో ఒక రాజకీయ పదవిలో కొనసాగుతున్నవారిది ఒక ధోరణి అయితే దానికి దూరంగా వున్నవారిది మరో దారి. పదవుల ఆరాటం తప్ప విలువల యావ ఎవరికీ లేదు. ఎదుటివాడిని ఇరకాటంలో పెట్టాలనుకున్నప్పుడే పాత సంగతులు కొత్తగా గుర్తుకు వస్తాయి. రాష్ట్ర రాజకీయ అవనికపై చకచకా కదులుతున్న దృశ్యాలు ఈ విషయాలనే మరోమారు కళ్ళ ముందు వుంచుతున్నాయి.
చిరంజీవిని దగ్గరకు తీసి, సీమాంధ్ర లో జగన్ మోహనరెడ్డికి కళ్ళెం వేయాలనే ఆలోచనలో వున్న అధిష్టానం- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా, వారితో విస్తృత స్తాయిలో చర్చలు జరపకుండా, ఏకపక్ష నిర్ణ యాలు తీసుకునే ధోరణిలో వ్యవహరించడం ఢిల్లీ పెద్దల దాష్టీకానికి నిదర్శనంగా కొందరు భావిస్తున్నారు. మరో పార్టీని ఏకంగా విలీనం చేసుకోవడం అనే కీలకనిర్ణయం తీసుకునే విషయంలో అధిష్టానం తమతో నేరుగా ఒక మాట కూడా చెప్పకుండా వ్యవహరించడం వారిని బాధ పెడుతోంది. పీ ఆర్ పీ ని విలీనం చేసుకోవడం వల్ల తమ కేడర్ నుంచి ఎదురయ్యే ప్రతికూలతను ఎలా ఎదుర్కోవాలా అన్న దానిపై అనేకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది వారిని మరింత అయోమయంలోకి నెడుతోంది. పైకి అందరూ కోరస్ గా అధిష్టానం వేస్తున్న అడుగులు సరయినవే అని ప్రకటనలు గుప్పిస్తున్నా – లోలోపల రగిలిపోతున్న దాఖలాలు ప్రైవేట్ సంభాషణల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. అయినా అధిష్టానాన్ని ప్రశ్నించలేని పరిస్తితి వారిది. కానీ, కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తమ ఎదుగుదలకు, భవిష్యత్ అవకాశాలకు ఈ పరిణామం గండికొట్టగలదన్న భీతి సీనియర్లను వెంటాడుతోంది. పదవుల పందేరంలో వెనుకబడిపోతున్నవారి పరిస్తితి మరీ ఘోరం. కొత్తవారికి పెద్ద పీట వేసే పరిస్తితే ఎదురయితే – తమ స్తితి ‘అయినవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో’ అన్న సామెత చందాన కాగలదని వారి భయం.
దీనికితోడు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కుడికాలు పెడుతూనే, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో అవినీతి జరిగిందని ఆరోపణాస్త్రాలు ఎక్కుబెడుతున్న తీరు చూసి పార్టీలో వైఎస్సార్ పట్ల కొద్దో గొప్పో అభిమానం, కృతజ్ఞత మనసులో వున్న కాంగ్రెస్ నాయకులకు గుబులురేగుతోంది.
ఎందుకిలా అధిష్టానం ప్రవర్తిస్తోందని విశ్లేషించుకుంటే ఒకే సమాధానం తడుతోంది. అదే ఎన్నికలకు మిగిలివున్న మూడేళ్ళ వ్యవధానం. అప్పటివరకు తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా. మూడేళ్ళలోగా ఇల్లు సర్డుకోలేకపోతామా అన్న ధైర్యం. ఇక ఇవేవీ పనిచేయవనుకుంటే, పరిస్థితులు చేయిదాటిపోయే తరుణమే వస్తే, కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన విధింఛి, చేజారిన పరిస్తితులను తమ చేతిలోకి తిరిగి తెచ్చుకునేలా చేయగల ‘అంతిమ అధికారం’ తన గుప్పిటిలోనే వుందన్న భరోసా. అదే కాంగ్రెస్ చేత ఇన్ని ‘కాని’ పనులు చేయిస్తోంది. (06 -02-2011)





7 కామెంట్‌లు:

SHANKAR చెప్పారు...

గురువుగారూ, ఇటు ఓ లుక్కేసి మీ అభిప్రాయం చెప్పండి
http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post.html

విశ్వామిత్ర చెప్పారు...

భండారు శ్రీనివసరావుగారు నమస్కారం. మీ విశ్లేషణలు చదువుతాను. మొత్తం చదివాక ముగింపు ఏమిటొ నా మొద్దు బుర్రకు అర్ధం కాదు. ఒక విషయంమీద విశ్లేషణ చేసినప్పుడు మీ ఉద్దేశ్యంలో అది మంచిదో కాదో మీరు చెపితే బాగుంటుంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఉండే విశ్లేషణలు ఎవరికైనా ఒక అభిప్రాయాని కలిగిస్తాయా అనేది సందేహమే! కాబట్టి మీ అభిప్రాయంతొ కూడిన విశ్లేషణలు చేస్తే చర్చించడానికి ఆస్కారం ఉంటుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విశ్వామిత్ర గారికి, మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కాకపొతే, బ్లాగులోకంలో విహరించేవారందరూ, చదివినదాన్నిబట్టి ఒక అభిప్రాయానికి రాగలిగినవారై వుంటారని నాదో వెర్రి నమ్మకం. పైగా బ్లాగుల్లో వస్తున్నదూషణ భూషణ స్పందనలు చూస్తుంటే, ఒక్కోసారి మనసులోని భావనను పూర్తిగా వెల్లడించకుండా తామరాకుమీది నీటిబొట్టులా వ్యవహరించడమే మంచిదనిపిస్తోంది. నేను పాతతరానికి చెందినవాడిని. నా భావాలు కొందరికి నచ్చకపోవచ్చు. పైగా, పార్టీల వారీగా, వ్యక్తులవారీగా జర్నలిస్టులు, మీడియా సంస్తలు విడిపోయి బాకాలుగా మారిపోతున్న రోజులివి. అందుకే, ఏదో నాకు తోచిన విస్లేషణలను, నొప్పించక,తానొవ్వక తీరులో రాసుకుపోతున్నాను. చదివి అభిప్రాయాలు తెలియచేస్తున్న మీలాటి బ్లాగు మిత్రులందరికీ కృతజ్ఞతలు.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

hmmm my strong feeling is.... ఇది అంతా Chiranjeevi ముఖ్య మంత్రి అయ్యెందుకు వెస్తున్న ప్లాన్... very soon Sonia will say yes(again) to separate 'Telangana state' and 'Chiranjeevi' will become the 'next CM candidate' from AP. God save us!!!
I sincerely wish that Chiranjeevi will go back to Acting business and be a Hero instead of being a dirty politician.

-Madhu

అజ్ఞాత చెప్పారు...

చిరంజీవి ని చూస్తే ఇతనికి కొంచెమన్నా వ్యక్తిత్వం ఉందా అనిపిస్తున్నాది? ఇతనిలో కనీస నాయకత్వ లక్ష్యణాలు లేవు. ఇతనికన్నా ఊరిలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు కనీస నాయకత్వ లక్ష్యణాలు కొన్నాయినా ఉంటాయి.
---------------
తెలుగు వారి పరువును వేరే రాష్ట్రాల వారి వద్ద (మొయిలి, ప్రణబ్) తీసిన మహా మనిషి. ప్రణబ్ గారు ఎప్పుడు చూసిన రాజ్యసభ నుంచి వచ్చి పార్లమేంట్లో కూచునే నాయకుడు. అది వారికి ఉన్న ప్రజాబలం.ఇక మన ప్రధాన మంత్రిని గురించి ఎంత తక్కువ చేప్పుకుంటె అంత మంచిది.

SRI

అజ్ఞాత చెప్పారు...

అబ్బ విశ్వామిత్ర గారూ...ఎంత కరెక్టుగా చెప్పారండీ!

అజ్ఞాత చెప్పారు...

ఎవరిని విలీనం చేసుకున్నా, లేకున్నా ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడైన జగన్ ని పార్టీ నుంచి తరిమి చాలా రోజుల తరువాత కాంగ్రెస్ మంచి పని చేసింది. లేకుంటెఏ ఇంకా లక్షల కోట్ల ప్రజా ధనం అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లేవి.