15, ఆగస్టు 2024, గురువారం

ఆ రోజు ఏం జరిగింది అంటే...



ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది. రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.

13, ఆగస్టు 2024, మంగళవారం

ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు



అందించడం అంటే మాటలు కాదు.
రెండూ రెండున్నర గంటల కార్యక్రమమే అయినా ఇల్లాలు మాత్రం  శతావధానం చేయాల్సిందే.
‘ఆవు నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను, తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి విస్తట్లో ఆ మూల వుంచండి, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి, ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి’ 
కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన బ్రహ్మగారు ఇలా విరామం లేకుండా ఏదో ఒకటి   అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆరోజున ఓ వంటమ్మగారు వచ్చి వంటలు చేసినా, ఈ అందింపు, వడ్డింపుల  బాధ్యత మాత్రం ఇల్లాలిదే. తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం  సవ్యం, అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది  జంధ్యాన్ని మారుస్తూ ఉంటాడు. 
మా అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు ఇదే.
 డ్రెస్సులకు అలవాటు పడిన యువతరం  కోడలు అయినా అలవాటులేని  చీరకట్టుతో  పడిన ఇబ్బందినీ,  కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,  ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా  కష్టపడిందా అనే ఎరుక నాకు కలగకపోవడం ఆశ్చర్యం. 
నిజానికి ఇందులో  విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లు  తెలుసుకోగలిగితేనే ఆశ్చర్యపడాలి.    
   
 
నిరుడు అయినా ఈ ఏడాది అయినా, వచ్చే యేడు అయినా  మరచిపోవాలని అనుకుని మరచిపోలేని  ఈ జ్ఞాపకాలు బతికి వున్నంత కాలం వెంటాడుతూనే వుంటాయి.

12, ఆగస్టు 2024, సోమవారం

చేతిలో చెయ్యేసి


Puget sound అనేది మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి.
 దీని వొడ్డున ఉక్కు తీగెల కంచె యేమిటి? కంచెకు వేసిన ఆ తాళాలు యేమిటి?

మన దేశంలో 
ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోష పడినట్టే, ఇక్కడ అమెరికాలో ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ  సంతుష్టి పడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.

వాషింగ్ టన్ లేక్ వడ్డున ఓ సాయంత్రం

సియాటిల్ వాషింగ్ టన్ లేక్ నడుమ సూర్యాస్తమయవేళ. చెక్క అంచున అంగుళం వెనక్కి జరిగితే లోతు ఎంతో తెలియనంత జలరాశి. అక్కడ కూచుని లేవడమే గగనం అనుకుంటే, ఇదిగో ఇలా దూకడాలు, గెంతడాలు. 
అంచేత ఇలా ఓ గూడు వేసి, ఫ్యాను పెట్టి చూస్తూ వుండమని కూర్చోబెట్టారు. అచ్చం గోవాలో వున్నట్టు అనిపించింది. ఆడా మగ అంతా పచ్చని పచ్చికపై ఒళ్ళు ఆరబెట్టుకుంటూ.
మన ఒళ్ళు జలదరించేలా ఈతలు మరోపక్క.

11, ఆగస్టు 2024, ఆదివారం

లోకం అంటే స్వచ్చత, పచ్చదనం

ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 78 ఏళ్ల టైమ్ పట్టింది. ఈ వృక్షం ఇంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. సియాటిల్  లో ఎటు పోయినా కనిపించే వాషింగ్టన్ లేక్  లో నీటి స్వచ్ఛతని చూస్తుంటే అక్కడే  వుండిపోవాలని అనిపించింది.

10, ఆగస్టు 2024, శనివారం

ఆగష్టు అంటే అయిష్టత


102 డిగ్రీలు ఒక జ్వరమా?

రాసిన నోట్స్ అన్నీ దాచుకోవడం అవసరమా!

కాకపోవచ్చు. 
కానీ ఏదో ఒక రాత్రి, నిద్ర పట్టని రాత్రి ఆ రాతలే అవసరం అవుతాయేమో ఏం చెప్పగలం.

2019 ఆగస్టు 15 రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాలకు 102.3 డిగ్రీలు 
ఆగస్టు 16 ఉదయం ఆరున్నరకు 99.2 డిగ్రీలు 
ఆగస్టు 16 మధ్యాన్నం ఒకటిన్నరకు 100 డిగ్రీలు

పిన్నికి ఒంట్లో బాగా లేదని జూబ్లీ హిల్స్ అపోలో లో పనిచేస్తున్న మా కజిన్ డాక్టరు బాబీ (సుసర్ల కామేశ్వర రావు) కి ఫోన్ చేస్తే, ఏదో టాబ్ లెట్ చెప్పి,  టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాడు.

ఆగస్టు 17 కల్లా నెమ్మదించింది. ఓకే అనుకున్నాను. బాబీ ఇంటికి వచ్చి చూసి పరవాలేదు అన్నాడు. 
ఆ మర్నాడు అంటే 18 రాత్రి చెప్పాపెట్టకుండా దాటిపోయింది. 
ఆమెది అదృష్టం. నాది దురదృష్టం.
అందుకే ఆగస్టు అంటే, నేను పుట్టిన రోజు ఆ నెలలోనే అయినా,  ఒక రకమైన అయిష్టత. అకారణ ద్వేషం.

9, ఆగస్టు 2024, శుక్రవారం

శనగల మంగళ వారం - భండారు శ్రీనివాసరావు



టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి గ్రహీతలను నిర్ణయించే బాధ్యత నాకిస్తే, నేను ఖచ్చితంగా ఆ బహుమతిని గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.

ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి, పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా, నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.
అలాటిది, వానయినా వంగిడి అయినా, కార్లూ డ్రయివర్లూ లేకున్నా, ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా, అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా, అది మన ప్రాప్తం.

ఉపశృతి:

శనగల మంగళ వారం
'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం
వేయించిన శనగలతో
తప్పనిసరి పలహారం'