27, జనవరి 2023, శుక్రవారం

యాత్రకు వేళాయెరా ! – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 27-01-2023, THURSDAY)

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ పాదయాత్రల్లో సరికొత్త రికార్డు స్థాపనకు నడుం బిగించారు. నలభయ్ ఏళ్ళ పిన్న వయసులో  నాలుగు వందల రోజుల్లో నాలుగువేల కిలోమీటర్ల దూరం యువగళం పేరుతో సాగే  ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈరోజున మొదలయింది.

2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అప్పటికి దూతదర్సన్ విలేకరిగా వున్న కారణం కావచ్చు, కొంత దూరం వై.ఎస్.ఆర్. తో కలిసి నడిచే అవకాశం, రెండు మూడు చోట్ల ఆయనతో ముచ్చటించే సావకాశం నాకు లభించాయి. చంద్రబాబువస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి విశాఖ పట్నంలో ముగిసింది. పాదయాత్రకు గుర్తుగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చంద్రబాబుకు వెండి పాదరక్షల జతను బహుకరించారు.

వై.ఎస్. జగన్ మోహనరెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను 2017నవంబరు ఆరో తేదీన వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని స్వగ్రామం ఇడుపులపాయలో మొదలుపెట్టి, 13 జిల్లాలగుండా 341 రోజులపాటు 3648 కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు.

తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ దేశంలో సాగిన రాజకీయ పాదయాత్రల్లో అప్పటికి  ఇదొక రికార్డు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాద యాత్రలు చేసిన దరిమిలా జరిగిన ఎన్నికల్లో విజయలక్ష్మి ఆయా పార్టీలని వరించడంతో వారిరువురు ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ విధంగా పాదయాత్రాఫలం వారికి సిద్ధించింది. దానితో ఎన్నికల్లో విజయానికి తోడ్పడే అనేక ప్రధాన అంశాలలో పాదయాత్రలు కూడా చేరిపోయాయి. అంతేకాదు, పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రి అవుతారనే ఓ గుడ్డి నమ్మకం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుంది. అదే కోవలో జగన్ మోహన రెడ్డి  కూడా తన  పాదయాత్ర దరిమిలా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో  ఈ నమ్మకం మరింత బలపడింది.

సాధారణంగా రాజకీయ నాయకులు పాదయాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే,  చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.

వస్తున్నా మీకోసం పేరుతొ చంద్రబాబు నాయుడు సాగించిన పాదయాత్రకు  నాలుగు దశాబ్దాలకు పూర్వమే ఆయన తొలి పాదయాత్ర చేశారు. దానిని గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా పరిచయం లేని చంద్రబాబు నాయుడు, కాణిపాకం నుంచి కాలి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు.

రచ్చబండల మీద,  ఇళ్ళ అరుగుల మీద సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియతిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.

అప్పటికింకా నిండా మూడుపదులు నిండని ఆ యువకుడే, మళ్ళీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరుపదులు పైబడిన వయస్సులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే విజయానికి మార్గంగా ఎంచుకున్నారు.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు.

అంతకుముందు వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర,  దానితో సాధించిన విజయం రాజకీయ నాయకులను పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. అంతకు ముందు రెండుమార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని, ఆ పాదయాత్ర దరిమిలా ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.

ఇక జగన్ మోహన రెడ్డి సాగించిన పాదయాత్ర ఏవిధంగా చూసినా ఒక రికార్డే. సుమారు రెండుకోట్ల మంది ప్రజలను ఆయన ముఖాముఖి కలుసుకోగలిగారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన సాధించినది చిన్న విషయం ఏమీకాదు. నడిచిన దూరం, వెంట నడిచిన జనం, మాట్లాడిన సమావేశాలు, ప్రసంగించిన బహిరంగ సభలు, హాజరయిన ప్రజలు ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ రికార్డులే. ఈ యాత్ర సందర్భంగా వై.ఎస్. జగన్, ఆకాశమే హద్దుగా  కురిపించిన వాగ్దానాలు, హామీల సంఖ్య కూడా ఒక రికార్డే అని చెప్పుకోవాలి.

ఇక్కడ మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదనుకుంటాను. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు, జగన్ మోహన రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన కొద్దిమంది జర్నలిస్టుల్లో నేను కూడా వున్నాను. జనాలకు ఇచ్చే హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విషయంలో ఫాలో అప్ మెషినరీ వంటి వ్యవస్థను పార్టీ పరంగా ముందుగానే ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించాను.

 

ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమిటనే విషయం పక్కనపెడితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి అనేది రాజకీయనాయకులు గుర్తిస్తున్నారు అనుకోవాలి. ఊళ్లను చుట్టబెడుతూ సాగే ఇటువంటి సుదీర్ఘ పాదయాత్రల్లో, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తమ కళ్ళతో గమనించి నేరుగా అర్ధం చేసుకోవడానికీ, సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనడానికి చక్కటి అవకాశం రాజకీయ నాయకులకు దొరుకుతుంది.

తమ నడుమ వుండేవారికే పట్టం కట్టడానికి జనం క్యూలు కడుతున్నారు అనేది అపోహ కావచ్చు కానీ అందులో కొంత నిజం లేకపోలేదని, ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారని గత అనుభవాలు తెలుపుతున్నాయి.

ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించగలిగితే ప్రజలకు కూడా వారి యాత్రాఫలసిద్ధి ప్రాప్తిస్తుంది.

ఇది జరిగింది కూడా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానంలో తనకు ఎదురయిన అనుభవాల ఫలితంగా రూపొందించినఆరోగ్య శ్రీ, 108, బడుగువర్గాల విద్యార్ధులు చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చే పధకం’ వంటివి రాష్ట్ర ప్రజానీకానికి దక్కాయి. చంద్రబాబు’ వస్తున్నా.. మీకోసం..’ యాత్ర వల్ల రైతులకు రుణ మాఫీ జరిగింది.

ఏదయితేనేం,  ఏ పేరుతొ అయితేనేం, నాయకులు ఏసీ గదులు వదిలిపెట్టి  కొద్దికాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఈ యాత్రల వల్ల ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి.

ముందే చెప్పినట్టు ఈ రాజకీయ పాదయాత్రలు భవిష్యత్తులో కూడా ఇబ్బడిముబ్బడిగా సాగే అవకాశం వుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సరిపుచ్చితే పర్వాలేదు కానీ ఇరువైపుల పారావారాలు శృతిమించి వ్యక్తిగత దూషణభూషణలకు దిగకుండా వుంటే అదే పదివేలు.

జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆకాశాన్ని దాటిపోయాయని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో వాటిని అమలుచేయడం మానవ మాత్రుడికి కూడా సాధ్యం కాదని ఆ రోజుల్లో అధికార పార్టీ విమర్శలు చేసింది. ‘వస్తున్నా మీకోసం..’ పాదయాత్ర సమయంలో’ చంద్రబాబు ఇస్తూ పోయిన వాగ్దానాలు గురించి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాబు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ  ఉదహరిస్తుంటారు. ‘వాకింగ్ ఫ్రెండ్’ (చంద్రబాబు) ఇస్తూ పోతున్న హామీలను అమలు చేయాలంటే, రాష్ట్ర బడ్జెట్ అటుంచి మొత్తం కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని ఆనాడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటారు.

రాజకీయ విమర్శలను కొంత అర్ధం చేసుకోవచ్చు . కొందరు వ్యక్తిగతంగానే కాకుండా చాలా చౌకబారుగా కూడా చేసే  వ్యాఖ్యల  తీరు బాధాకరం. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయన ధరించిన బూట్లు గురించి, దారిపొడుగునా దుమ్ము రేగకుండా నీళ్ళు చల్లించే ఏర్పాట్ల గురించీ ఎద్దేవా చేస్తూ ఆయన ప్రత్యర్ధులు చేసిన వ్యాఖ్యలు బహుశా వారికి గుర్తుండి ఉండకపోవచ్చు.

రాజకీయ యాత్రలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయపరమైన హామీలు పార్టీలన్నింటికీ తప్పనిసరి రాజకీయ విన్యాసాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో, రాజకీయ నాయకులు ఒకింత సంయమనంగా మాట్లాడడం వారికే మంచిది. ఏమో ఎవరికెరుక? ఇలాంటి కువిమర్శలను తామే ఎదుర్కోవాల్సిన దుస్తితి భవిష్యత్తులో తమకే ఎదురు కావచ్చు.

దీనికి ఓ మంచి మార్గాన్ని కవి బ్రహ్మ తిక్కన మనకేనాడో బోధించాడు.

ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో విదుర నీతి పేరుతో ఆ మహాకవి చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా!

‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్’’.

ఇతరులు ఏం చేస్తే మనకు ఇష్టం ఉండదో, దాన్ని మనం ఇతరులపట్ల చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం అన్నది ఈ పద్య తాత్పర్యం.

ఇతరులకు నీతులు చెప్పే రాజకీయ నాయకులకు ఈ నీతిపాఠాలు తలకెక్కుతాయా!

అనుమానమే!




(27-01-2023)

25, జనవరి 2023, బుధవారం

ఈ ఏడాది బడ్జెట్ లో హల్వా – భండారు శ్రీనివాసరావు

ఢిల్లీ నార్త్ బ్లాక్ అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది ఆల్ మకాం, అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. చివరి రోజున అంటే బహుశా రేపు గురువారం కావచ్చు అంటున్నారు, మొత్తం సిబ్బందికీ కేంద్ర ఆర్థికమంత్రి స్వయంగా అక్కడే హల్వా చేసి అందరికీ పంచుతారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. కోవిడ్ కారణంగా నిరుడు, అంతకు ముందు ఏడాది హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.
బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓతోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు. డిజిటల్ శకం మొదలయిన తర్వాత లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి.
ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సమర్పణ. చూడాలి బడ్జెట్ లో హల్వా వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!




PHOTO COURTESY : ANI
25-1-2023

23, జనవరి 2023, సోమవారం

జారుడు మెట్లు – భండారు శ్రీనివాసరావు


(Published in ANDHRAPRABHA on 22-01-2023, SUNDAY)


ఏదైనా ప్రధాన పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని, 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       

'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   

పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  

పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.

2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది. దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.

పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     

సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు, పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      

స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. 

కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.  (ఉదాహరణకు కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జనతా, జనతా దళ్ వగైరా)

విచిత్రం ఏమిటంటే పార్టీ మార్పిళ్ళకు కూడా ముహూర్త బలం వుండాలి అనే వాదన ఒకటి వుంది.      

గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు. 

పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం, అని ఈ రకం వాదితులు చెబుతుంటారు.

పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.

పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   

రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.

వాళ్ళ వేగం, ఉరవడి  చూస్తుంటే, ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంటుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.

అన్నమైతే ఏమిరా! సున్నమైతే ఏమిరా!

అయినా ఈ పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!  అని ఏదో పాత సినిమాలో ఓ గీతం వుంది. 

పార్టీ మారే వారిది కూడా ఇదే బాణీ.

ఆ పార్టీ అయితేనేం ఈ పార్టీ అయితేనేం

పనులు జరిగే అధికార పార్టీయే మేలు కదా! అనేది వాళ్ళ థియరీ.

మరి చేరిన పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతే ఎలా! అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం సిద్ధంగా వుంటుంది.

“తలుపు తీసుకుని  బయటకు వెళ్ళిన వాళ్లకు, లోపలకు వచ్చే దారి తెలియదని ఎలా అనుకుంటున్నారు?”    


ముక్తాయింపు :       

ఎన్నికలకు  ముందు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడే మాట:

"ఈరోజు ప్లస్సెంత ? (చేరినవారెందరు) మైనస్ యెంత? (జారినవారెందరు) "




17, జనవరి 2023, మంగళవారం

1996 జనవరి 18 - భండారు శ్రీనివాసరావు

తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. రైలు రేణిగుంట స్టేషన్లోకి ప్రవేశిస్తోంది. తోటి ప్రయాణీకుల్లో చాలామంది లేచి తిరుపతి స్టేషన్లో దిగడానికి సామానులు సదురుకుంటున్నారు. పక్క బెర్త్ లో పడుకున్న మాజీ మంత్రి, తెలుగు దేశం నాయకుడు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు, నా జర్నలిస్టు మిత్రుడు ఎం.ఎస్. శంకర్ ఇంకా నిద్రలోనే వున్నారు. శంకర్ కి తిరుపతి దేవుడు అంటే తగని నమ్మకం. నిజానికి అతడి ఒత్తిడి తోనే ఈ ప్రయాణం. ఏడాదికి ఒకటి రెండు సార్లు స్వామి దర్శనం చేసుకోవడం అతడికి అలవాటు. రైల్లో రాత్రంతా ముద్దు కృష్ణమ నాయుడి గారితో కబుర్ల తోటే సరిపోయింది. దర్శనానికి ఎవరికయినా చెప్పనా అని ఆయనే అడిగారు. వద్దండి, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాము అని చెప్పాము.
నా దగ్గర బి.హెచ్. ఇ.ఎల్. వాళ్ళు ఓసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన సిగరెట్ పెట్టె సైజు బుల్లి ట్రాన్సిస్టర్ రేడియో వుంది. దాన్ని ఆన్ చేశాను. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. వున్నట్టుండి, “హియర్ ఈజ్ ఎ ఫ్లాష్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావ్ ఈజ్ నో మోర్. ఎకార్దింగ్ టు అవర్ హైదరాబాద్ కరస్పాండెంట్ పవని విజయ లక్షి..”
షాక్. కాసేపు మెదడు మొద్దుబారింది. అంతకు ముందు రోజే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వార్త కూడా నేనే ఇచ్చాను. ఎక్కడా ఆయనలో అనారోగ్యం ఛాయలు కనిపించలేదు. ఇదేమిటే? ఎలా జరిగింది? నిజమా కాదా! వార్త వచ్చింది రేడియో నేషనల్ బులెటిన్ లో. శంకర్ ని, ముద్దు కృష్ణమ నాయుడు గారిని లేపుతుండగానే, రైలు రేణిగుంట స్టేషన్ లో ఆగింది. విషయం వినగానే ముద్దు కృష్ణమ నాయుడు గారు ‘నేను అనాథను అయిపోయాను’ అంటూ గుండెలు బాదుకుంటూ భోరున ఏడవడం మొదలు పెట్టారు. శంకర్ బయటకి పరిగెత్తాడు, పేపర్ కొనుక్కుని రావడానికి. అందులో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తప్పిస్తే వేరే విషయం లేదు. ప్లాట్ ఫారం కూడా మామూలుగానే వుంది. ఇంకా ఎవరికీ విషయం తెలిసినట్టు లేదు. అంటే పత్రికల ఎడిషన్ టైం అయిపోయిన తర్వాత జరిగి వుంటుంది. నాయుడి గారి ఏడుపు గమనించి ఆయన గన్ మెన్ పరిగెత్తుకు వచ్చాడు.
భారంగా రైలు దిగాము. పరికిస్తీ అంతా మామూలుగా ప్రయాణీకుల రణగొణధ్వనులతో వుంది. వెంటనే కొండ పైకి వెళ్ళాము. అక్కడ కూడా అంతాప్రశాంతంగానే వుంది. ఏర్పాట్లు చేసుకున్నాము కనుక దర్శనం త్వరగానే ముగిసింది. బయటకి వచ్చేసరికి వాతావరణంలో పెనుమార్పు. తిరుమలలో అంగళ్లు, హోటల్లు మూసేస్తున్నారు. వెంటనే మిమ్మల్ని పైకి తీసుకువచ్చిన టాక్సీలోనే కిందికి వెళ్ళాము. శంకర్ మూడు నాలుగు అవుట్ స్టేషన్ ఇంగ్లీష్ పత్రికలకి వార్తలు పంపుతుంటాడు. తిరుపతిలో బంద్ పాటిస్తున్నారు. ప్రతి కూడలిలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి నల్ల జండాలు కట్టారు. వీధులు అన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. ఆఖరికి బండి దుకాణాలు కూడా లేవు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అధికారి. ఆఫీసు కూడా మూసేసి వుంది. ఎలాగో లోపలకి వెళ్ళాము. శంకర్ అక్కడే కూర్చుని టైప్ రైటర్ మీద నాలుగు విభిన్న వార్తలు టైప్ చేశాడు. వాటిని ఫాక్స్ చేయడానికి (సుభాష్ గౌడ్ తర్వాత ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు) అతడో మనిషిని ఇచ్చి పెద్ద పోస్ట్ ఆఫీసుకు పంపించాడు. అది మూసేసి వుంది. తలుపు మీద తడితే ఎవరో తలుపు ఓరగా తీసి ఏం కావాలంటే హైదరాబాదు నుంచి వచ్చిన జర్నలిస్టులం ఎన్టీఆర్ వార్త ఇవ్వాలి అంటే లోపలకు రానిచ్చాడు. పని పూర్తయిన తర్వాత ఆకలి సంగతి తెలిసింది. ఎన్ని చోట్ల తిరిగినా ఒక్క హోటల్ తెరిచి లేదు. సుభాష్ గౌడ్ చెబితే అతడి మనిషి ఓ చిన్న రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. షట్టర్లు వేసి వున్నాయి. వెనుక నుంచి దొంగ దోవన లోపలకి తీసుకు వెళ్ళాడు. భోజనం లేదు, ఒక్క ప్లేట్ సాంబార్ రైస్ మాత్రం ఇస్తాను, సర్దుకోండి అన్నాడు. ఏం చేస్తాం అదే మహాప్రసాదం అనుకుని తినేసి బయట పడ్డాము. సాయంత్రం హైదరాబాదు వచ్చే రైల్లో రిజర్వేషన్ వుంది కాబట్టి ఎక్కాము. రైలంతా ఖాళీ. ఎక్కడైనా ఆపెస్తారేమో అనుకున్నాము కానీ మొత్తం మీద ఇళ్లకు చేరాము.
ఇంటికి రాగానే మా ఆవిడ నిన్నంతా మీకోసం తెగ ఫోన్లు. తెల్లవారుఝామున్నే రోశయ్య గారి ఫోను. మీరు తిరుపతి వెళ్ళారు అని చెప్పాను అంది.
ఇక తరువాతి కధ అందరికీ తెలిసిందే.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం తరువాత ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అనే వార్త మొట్టమొదటిసారి నాద్వారా లోకానికి తెలిసింది. కానీ ఆయన మరణ వార్త ఇవ్వలేకపోయాను.
(18-01-2023)



15, జనవరి 2023, ఆదివారం

ఒక్క రోజు కోటీశ్వరుడు – భండారు శ్రీనివాసరావు

 


కొన్నేళ్ళ క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోఃన రెడ్డిని కలుసుకున్నప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రికి కప్పిన శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం. అలాగే ఫేస్ బుక్ లో చంద్రబాబుకు అనుకూలంగా రాసే ఓ రచయిత/విశ్లేషకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల రంగు నీలి వర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.  ఏవో ఈ రెండు వాదనలు నాకు నచ్చవు. రాజకీయాల్లో రంగులు మార్చేవారు ఉండవచ్చు. కానీ, రంగుల్లో రాజకీయాలు వుండవు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. తొలిరోజుల్లో దూరదర్సన్ ద్వారా  ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఇవ్వాల్సిన ఒక సందేశం ముసాయిదా  ప్రతిని ప్లాస్టిక్ ఫోల్డర్ లో తీసుకువెళ్లి, సీఎం పేషీ అధికారికి ఇచ్చాను. ఆయన ఎగాదిగా చూసి, ‘శ్రీనివాసరావు గారూ! ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు’ అన్నారు. ఎందుకు ఇలా అన్నారని పరకాయించి చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు రంగు.

నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలిరంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి మనకు కనబడే రంగు వుంటుంది.

ఈ రంగులతో నేనూ ఓ సారి ఇబ్బంది పడ్డాను. జెమినీ టీవీలో చర్చాకార్యక్రమాలు నిర్వహించే పాత రోజుల్లో సంగతి ఇది. జెమినీ వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.

దాదాపు నలభయ్ ఏళ్ళయింది నేను  కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.

మళ్ళీ ఇన్నాల్టికి ఆ  టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల  ఆ రోజు నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి, పాత కోటు కప్పుడు  వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. (చూసేది కాదు) అదన్నమాట



Disclaimer : ఇది ఏ విధంగాను రాజకీయ పోస్టు కాదు

 

14, జనవరి 2023, శనివారం

జంధ్యాలకో నూలుపోగు- భండారు శ్రీనివాసరావు

(జనవరి 14 జంధ్యాల జయంతి) 

జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. 

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.

పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా! 

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు

కింది ఫోటో:  కాలేజి రోజుల్లో జంధ్యాల