27, నవంబర్ 2022, ఆదివారం
తెగుతున్న తీగెలు
21, నవంబర్ 2022, సోమవారం
మాస్కోలో శంకరాభరణం – భండారు శ్రీనివాసరావు
గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో కె. విశ్వనాధ్ గారి అపూర్వ సృష్టి శంకరాభరణం సినిమాను ఇండియన్ క్లాసికల్ గా ఎంపిక చేయడం తెలుగు సినిమా రంగానికి గర్వ కారణం. ఈ వార్త టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నప్పుడు ఎప్పటివో నలభయ్ ఏళ్ళకు పూర్వం సంగతులు గుర్తుకు వచ్చాయి.
1980వ సంవత్సరంలో ఒక రోజు.
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు
పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా
టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్
నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు
ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి
లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)
సినిమా మొదలయింది. హాలు హాలంతా
నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు
ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, కధానాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో
ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను
గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండోవారం నుంచే మంచి
టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్నిరోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ
వేశారు. ప్రీ వ్యూ (PRE VIEW) కాదు, ఫ్రీ వ్యూ (FREE VIEW).
నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు
వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ
షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే
కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో
పడడానికి ఆయన గారికి కొంత వ్యవధి పట్టింది. అంతా
లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు
తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
కట్ చేస్తే.....
మళ్ళీ 2017లో...
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ
కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస
సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని
గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు
చూడడానికి అందులో ఏముందని అడిగాను. ‘ఏమోసారూ, ఆ
సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు.
జన్మధన్యం అవడం అంటే ఇదే కాబోలు”
చాలామంది చాలా మాట్లాడారు. మాజీ
ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.
సీన్ కట్ చేసి కొంత వెనక్కి వెడితే....
1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం
నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా
ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం.
దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో
రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో
తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం
లభించింది.
సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక
సినిమా హాలు కనబడింది. కాలక్షేపం కోసం టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు
వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా.
పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన
బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ
శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే
చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా
చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీనటుల గాత్రానికి తగిన
స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు
గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు
అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.
సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో
వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు
ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు
అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.
(21-11-2022)
ఇలపావులూరి ఇక లేరు
ఫేస్ బుక్ లో ఓ బ్రాండ్ నేమ్. ఒక పోస్ట్ పెడితే నిమిషాల్లో వందల లైకులు, డజన్ల కొద్దీ కామెంట్లు. వేల సంఖ్యలో అబిమానులు. రాజకీయ సంబంధమైన వార్తలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. విమర్సనాస్త్రాలు సంధిస్తే చాలు, ఆ శరపరంపరకు ఎంతటివాడయినా తల్లడిల్లాల్సిందే. అంతటి పదును వుంది ఆయన కలం పాళీకి.
మనసులోని మాటను ఎలాంటి భేషజం లేకుండా మొహం మీదనే
అనేయగల ధీరత్వం ఆయన సొంతం. రాజకీయం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు,
సినిమాలు కావచ్చు, అంశం
ఏదైనా సరే, పూర్తి పట్టుతో, నిజాయితీగా నిబద్ధతతో రచనలు చేయగల గొప్ప నేర్పరి మురళీమోహన్ గారు. అన్నింటికీ మంచి సహృదయులు,
నావంటి ఎంతో మందికి ప్రాణస్నేహితులు.
మూడేళ్ల కిందట రాజమండ్రిలో జరిగిన బుద్ధరాజు ఛారిటబుల్
ట్రస్ట్ ఆధ్వర్యంలో నాకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ఇచ్చిన సందర్భంలో నా వెంటనే
వున్నారు. నా భార్య చనిపోయినప్పుడు, వారి అబ్బాయిని వెంటబెట్టుకుని జూబిలీ హిల్స్ లో వున్న మా
అన్నయ్య గారి ఇంటిని వెతుక్కుంటూ వచ్చి నన్ను పరామర్శించారు.
నిగర్వి. చెడు అలవాట్లకు ఆమడ దూరం. అలాంటి మనిషి
గుండె పోటుతో మరణించారు అని వార్తలు వస్తుంటే ముందు నమ్మలేదు. అనేకమంది ఫోన్లు
చేసి చెప్పినా,
మెసేజ్ లు పెట్టినా నమ్మలేదు. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని వాదించాను. చివరికి
దేవరకొండ రమాభాస్కర్, అక్కరాజు నిర్మల్, శివ
రాచర్ల వంటివారు చెబుతుంటే ఇక నమ్మకపోవడానికి చాన్స్ ఎక్కడ?
ఏదైనా ఒక మంచి స్నేహితుడిని ఈరోజు చాలామంది
కోల్పోయారు. ఒక మంచి రచయితను తెలుగు పాఠక లోకం శక్తివంతమైన కలాన్ని ఫేస్ బుక్ చదువరులు, ఒక మంచి కుటుంబ పెద్దను వారి కుటుంబం
కోల్పోయింది.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని
కోరుకుంటున్నాను.
కింది ఫోటో: ఇలపావులూరి, డి. వెంకట్రామయ్య లతో నేను
(21-11-2022)
20, నవంబర్ 2022, ఆదివారం
చిక్కు సమస్యలు, చిరు పరిష్కారాలు : భండారు శ్రీనివాసరావు
(Published in ANDHRA PRABHA today, SUNDAY, 20-11-2022)
'యాభయ్ ఏళ్ళక్రితానికి, ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే, 'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట, బీడీ, సిగరెట్లు తాగేవారు, ఇప్పుడది లేద'ని, ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.
అప్పటికీ, ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'హాలులో పొగ తాగరాదు' అంటూ, ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప. 'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు, సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?
ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అదేమిటంటే, చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమాషెడ్లు, సిమెంటు ధియేటర్ల కాలం ముగిసి, ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు.
జనంలో వున్న ఈ సుగుణాన్ని, జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే, ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు, ఈ సూత్రాన్నే అమలు చేస్తే అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది.
హైదరాబాద్ వంటి సువిశాల నగరంలో ట్రాఫిక్ ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు.
అయితే, కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.
అన్నింటికంటే ముందు చేయాల్సింది, ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలం పాటయినా, ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు.
రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు నగరంలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.
ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.
ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు.
బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్ వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.
విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా, జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది అనుమానమే మరి.
పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది.
కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.
స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని, సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి.
ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. (EOM)
ఆడవారిని పొగడండి! (కనీసం ఈ ఒక్కరోజయినా)
నిన్న అంటే నవంబరు పందొమ్మిది మగవాళ్ల దినం అంటూ సాంఘిక
మాధ్యమాల్లో తెగ పోస్టులు చక్కర్లు కొట్టాయి.
మర్నాడే అంటే నవంబరు ఇరవయ్యో
తేదీని ఏకంగా ఆడవాళ్ళకు వదిలేశారు. ఆ కధాకమామిషు క్రమంబెట్టిదనిన:
అవలోకించుడు.
నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు
వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా
మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ
సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ
మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు.
దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని
మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా
అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ
ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని
ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ వదిలి అసలు ఈ ‘కొత్త రోజు
‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల
దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు
ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
‘హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి.
మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ
నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు
తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు.
పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ
కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే
తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా
జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన
ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి
కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ
చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో
ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్
గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’
కాబట్టి మొగుడు
మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు
మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో
మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ
కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం
వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు
నమ్మినట్టు కనిపిస్తారు.
ప్రయత్నం చేస్తే
పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.
15, నవంబర్ 2022, మంగళవారం
ఓ అర్చకుడి కధ - భండారు శ్రీనివాసరావు
ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.
అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.
గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది. అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో కోరుకుంటే అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను. కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.
సువిశాల ప్రాంగణంలో అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ.
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా మా దగ్గరకు వస్తుండేవారు. అనేక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ వుండేవారు.
ఆయన కుమారుడే సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి.
తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.
“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.
“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.
“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం!
“అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.
“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.
“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు ఓ అధికారి ఇలా అన్నారు.
‘సౌందర్రాజన్గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!
“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం.
‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.
“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.
“ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను.
“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.
“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.
“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.
“వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా.
“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.
(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు)
“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ఒక హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.
“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ దయ అని నేను నమ్ముతాను.
“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన భర్త వెంట నడవాలంటే గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”
ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ.
హీరో కృష్ణ ఇక లేరు - భండారు శ్రీనివాసరావు
‘ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’
ఈ మాట అన్నది సూపర్ స్టార్ కృష్ణ.
అప్పట్లో అంటే సుమారు యాభయ్ ఏళ్ళ
క్రితం, విజయవాడలో తన చిత్రం (పేరు గుర్తురావడం
లేదు) రిలీజ్ కోసం వచ్చి మనోరమా హోటల్లో బస చేశారు. ఆ రోజుల్లో అదే నెంబర్ వన్
హోటల్. జ్యోతి విలేకరిగా వెళ్లి కలుసుకున్నాం. వున్నది కాసేపే అయినా ఆ కొద్ది
సేపట్లో ఆయన లెక్క పెట్టలేనన్ని సిగరెట్లు తాగడం చూసి నేను విస్తుపోయాను.
ఆడే సినిమా కాదు అని కృష్ణ కామెంటు
చేసింది తను హీరోగా నటించిన ఆ చిత్రం మీదనే. అదే విచిత్రం.
మా ప్రసాదం బాబాయి గుర్తుకు వచ్చాడు.
చిన్నప్పుడు మా వూళ్ళో కొత్త వడ్లు
రాశులుగా కళ్ళాల్లో ఉన్నప్పుడే చూసి ‘ఇది ఇన్ని పుట్ల ధాన్యం’ అని ఉజ్జాయింపుగా
చెప్పేవాడు. కొలిచి చూస్తే ఆయన మాటే నిజం అయ్యేది.
అలాగే ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా డబ్బాలు వెనక్కి పోతాయో స్వపర బేధం లేకుండా చెప్పడంలో నటుడు కృష్ణ
అందెవేసిన చేయి అని సినిమా వర్గాల్లో చెప్పుకునే వారు.
సినిమా రంగంలో లేనిది మంచితనం అంటారు.
చీకట్లో చిరుదీపంలా ఇన్నాళ్ళు కృష్ణ గారు ఆ లోటు తీరుస్తూ వచ్చారు. ఈరోజు ఆయన మృతితో అది కూడా కొడిగట్టిపోయింది.
(15-11-2022)

