1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కాలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే ఇప్పటికి అక్షరాలా తొంభయ్ ఒక్క సంవత్సరాలు గడిచాయి. అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది.
మొన్న మా స్వగ్రామం కంభంపాడు వెళ్ళినప్పుడు ఎప్పటిదో బ్రిటిష్ కాలంనాటి ఓ దస్త్రం నా కంటపడింది.
‘DETAILED LIST OF JOINTLY REGISTERED HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.
వివరాల్లోకి వెడితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. అయితే ఈ మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణలో కూడా సమగ్ర భూసర్వే జరుగుతోందని, అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే జరిగి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. ఇది పూర్తయితే భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని వారి ఆశ.
ఇదలా ఉంచితే తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో 128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవి కాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు. సాగుకు పనికి రాని భూమి 34.40 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగా, గ్రామంలో భూమిశిస్తు మొత్తం 4720 రూపాయలు వసూలు అయ్యేది. 9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని కట్టివేసే దొడ్డి అన్నమాట. నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు.
1929 వ సంవత్సరం జమాబందీ లెక్కల ప్రకారం ఊరి మొత్తంలో 1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా) 675 గొర్రెలు, మేకలు వుండేవిట.
ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు ఉండేవి. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు వీటికి మాత్రం కొదవలేదు.
(05-07-2022)