27, ఏప్రిల్ 2022, బుధవారం

మారింది రోజులా! మనుషులా!

 తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.

జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.

హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.

లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”

అదెలా?”

ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. స్నేహితుల సంగతి చెప్పక్కర లేదు. ఎవరు ఎవరి మీద పడి తింటున్నాడో ఎవరికీ పట్టేది కాదు. ఇప్పుడలా కాదు. అన్నిటికీ లెక్కే. అవసరానికి ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ అవసరం వెనుక ఏదైనా మర్మం ఉందా అనే శోధింపు ఎక్కువైంది. ఇతరుల గురించి కాదు, నేను చెప్పేది. నేనైనా అంతే! ఈ తేడా ఎలా వచ్చిందో ఏమిటో మరి!”

“.........”

రేపెలా గడుస్తుంది అనే అ రోజుల్లో రేపటి గురించిన బెంగ ఎవ్వరికీ వుండేది కాదు. ఏపూటకాపూట హాయిగా గడిచిపోయేది. వున్నవాళ్ళు, లేనివాళ్ళు వున్నదా౦తోనే గడుపుకునేవాళ్ళు. లేదనే లోటు వుండేది కాని, లేదన్న మనాది ఉండేది కాదు”

“......”

మరో విషయం చెప్పనా! కష్టాలు తెప్పించే కన్నీళ్లు కళ్ళల్లో తిరిగేవేమో కాని, మొహంలో చిరునవ్వులు మాత్రం చెరిగేవి కావు. తరాలకు సరిఅడే ఆస్తులు పోగుపడ్డాయి కానీ, ఆ నాటి సంతృప్తి కలికానికి కూడా మిగల్లేదు”

విలేకరి దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవు, నోట మాటలూ లేవు.

 

26, ఏప్రిల్ 2022, మంగళవారం

టీఆర్ఎస్ ప్లీనరీ

 {Published in Namaste Telangana Daily on 26-04-2022)

 

నూతన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ఆ కొత్త రాష్ట్రానికి నూతన ప్రభుత్వ సారధిగా టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనాపగ్గాలు చేపట్టి మరో రెండుమాసాల్లో ఏడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో, ఈ నెల ఇరవై ఏడో తేదీన  హైదరాబాదు నగరంలోని  హైటెక్స్ సమావేశ మందిరంలో జరగనున్న ప్లీనరీ చర్చలు, పార్టీ నాయకత్వానికీ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తూనే మరోపక్క చక్కని ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తాయని ఆశించవచ్చు.  ఈ ప్రతినిధుల సభలోనే కేసీఆర్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటించడం లాంఛనంగా జరిగే మరో ప్రక్రియ. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ పగ్గాలు పూర్తిగా ఒప్పచెప్పి, యువ నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ వున్నట్టు సమాచారం.  కాకపొతే, ఈ ఊహాపోహలకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఆయన మనస్సులోని మాట ఆయన స్వయంగా బయట పెట్టేదాకా ఏ విషయం మూడో కంటికి తెలిసే అవకాశం లేని రాజకీయ చాణక్యం ఆయన సొంతం. కేసీఆర్ ఆలోచనా విధానమే విభిన్నం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదయిన విలక్షణ శైలి అని అందుకే అందరు చెప్పుకుంటారు.

ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. సుమారు రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఈ  క్రమంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే కేసీఆర్ తత్వం, తెలంగాణా ఉద్యమ స్పూర్తి ఏ దశలోనూ దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేయగలిగాయి. ఇందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాల్లో పార్టీ ప్లీనరీలు ఒక భాగం. ఉద్యమ తీవ్రతలో హెచ్చుతగ్గులు వుండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశ్నే ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్ ఎస్ పార్టీ ఎదుర్కున్న ఆర్ధిక ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా దశాబ్ద కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా నిభాయించుకోవడం మరో ఎత్తు. పార్టీని చీల్చయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే శక్తులు పక్కనే పొంచివుంటాయి. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే శక్తులను ఆదిలోనే కట్టడి చేసిన విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే పుష్కర కాలంగా తన మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణా చీకటి కూపం అవుతుందని వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన వారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకుని, పట్టుదలగా పనిచేసి అనేక సంవత్సరాలుగా జనాలు అలవాటుపడిన కరెంటు కోతల ఇబ్బందులను మంత్రం దండంతో మాయం చేసినట్టు మాయం చేశారు. రాష్ట్రం విడిపోగానే హైదరాబాదులోనూ, ఇతరత్రా తెలంగాణాలోనూ స్థిరపడ్డ ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాoదోళనలను అనతికాలంలోనే మటుమాయం చేశారు. భగీరధ, కాకతీయ వంటి పధకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణా దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

అయినా చేయాల్సినది అంతా చేయలేదేమో అనే నిరాశాపూరిత వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వినబడుతూనే వున్నాయి. విపక్షాలు విమర్సించక ఏమి చేస్తాయి అని సరిపెట్టుకోవచ్చు, సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆ నిరసనలు వెలువడుతున్నది విపక్షాల గొంతుకలో నుంచా, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా అనేది జాగ్రత్తగా గమనించుకోవడం సమర్ధుడయిన పాలకుని ప్రధమ కర్తవ్యం.

ప్లీనరీ అందుకు తగిన వేదిక కాగలదని ఆశిద్దాం.




ఎవరీ పీకే – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 26-04-2022, Tuesday)

లార్జర్ దాన్ లైఫ్ (Larger than life) అని ఇంగ్లీష్ లో తెగ వాడేస్తుంటారు. ఈ వాక్యానికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని  గొప్పతనాన్ని  మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ (ప్రతిష్టను ఇనుమడింప చేయడం) అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.

కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే?  ఆయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.

‘ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు అనేది నా జవాబు. 

ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం,  చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా.  విజయంలో దాగున్న  అసలు రహస్యం అదే!

బీహార్ లోని  రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు  బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి, భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.

మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ  2012లో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ  తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. అ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం, ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో  కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.  తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రి    నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.

‘నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి  జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనుకునే తరుణంలో, పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగసభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని  ‘ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్’ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా చాలామందికి తెలియదు. ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అఖండ, అపూర్వ ఘన విజయం సాధించడంతో, ఎన్నికల వ్యూహ కర్తగా  పీకే పేరు దేశం యావత్తు మారుమోగిపోయింది.  పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం కూడా ఓ కారణం కావచ్చు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే. అలాగే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా, మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కుని సాధించిన విజయం కూడా చిన్నదేమీ కాదు.   

అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. కాంగ్రెస్ లో చేరి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆ వార్తల సారాంశం. వీటికి తగ్గట్టే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో  ప్రశాంత్ కిషోర్ ముఖాముఖి చర్చలు జరపడంతో ఈ వార్తలకు మరింత ఊతం చిక్కింది.

ఈ ప్రచారాలు ఇలా అనంతంగా సాగుతుండగానే ప్రశాంత్ కిషోర్, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ ఏకాంత చర్చలు జరపడం రాజకీయ దుమారం లేపింది. తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ అంశంపై చేసిన ట్వీట్లు, రాష్ట్ర  కాంగ్రెస్ అధినేతలలో కలవరం రేకెత్తించాయి. ‘నీ శత్రువుతో స్నేహంగా వుండేవాడిని  నమ్మరాదు’ అనే కొటేషన్ ను ఆయన వరసగా ట్వీట్ చేయడం ఏ.ఐ.సీ.సీ. వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది.  

ఇలా రాజకీయంగా పరస్పరం విబెధించుకునే పార్టీలతో మంతనాలు జరపడం ద్వారా పీకే ఏమి సాధించదలచుకున్నారు అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తికరమైన  జవాబు లేదు. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారం నుంచి తప్పించాలనే  ఏకైక ధ్యేయంతోనే తాను పనిచేస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పలుమార్లు  చెప్పిన విషయం గమనార్హం. అంటే మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడం అనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు అని అనుకోవాలి. అదే సమయంలో, ‘మీకు ఒక రాష్ట్రంలో విజయం ముఖ్యమా, కేంద్రంలో అధికారం ప్రధానమా అనేది మీరే  తేల్చుకోండ’ని, కాంగ్రెస్ పార్టీకే పీకే వదిలేసినట్టు అనిపిస్తోంది.  

ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆయన వల్లనే తాము విజయం సాధించామని పైకి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి కూడా  లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు. కారణం గెలుపు కోసం, అధికార పీఠం కోసం  వాళ్ళు పడే ఆరాటం, అనేక ఘన విజయాలు ఖాతాలో ఉన్న ప్రశాంత్ కిషోర్ వంటి వారివైపే అడుగులు వేయిస్తుంది.

ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. ఆయన ఖాతాలో ఇంతవరకు అపజయం అన్నది లేదు. (గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం ఒకటి వుంది. అయితే తాను ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా వివరణ ఇచ్చారు)

తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని నిబద్ధతతో పనిచేస్తాడు.(అయితే, పార్టీల నుంచి  డబ్బు తీసుకోను అని ఈ మధ్యనే ఆయన ఒక ప్రకటన  చేశాడు) తనను నమ్ముకున్నవారికి ఫలితం చూపిస్తున్నాడు, బాహుబలి రాజమౌళిలాగా. విశ్వాసానికి విజయమే గీటురాయి.

రాజకీయ పార్టీలు కూడా వ్యాపార సంస్థలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదల్చవు. ఉందనుకుంటే కోట్లు వెదజల్లుతాయి.

 

ఇక ఎవరికీ పట్టని నైతిక విలువలు ఓటర్లకు మాత్రం ఎందుకు? టీవీ చర్చల్లోకి  తప్ప.

పొతే, ప్రశాంత్ కిషోర్ కు ఓ హితవాక్యం.

ఇంతవరకు పీకే ఒడ్డున వుండి పావులు కదిపి తన జట్టును గెలిపించుకున్నాడు. ఇప్పడు తనే స్వయంగా ఓ పార్టీ తీర్థం పుచ్చుకుని, గోదాలోకి దిగుతున్నారు. ఈసారి పాత్ర మారుతోంది. మారిన కొత్త  పాత్రలో జీవించడం, మెప్పించడం  అంత సులభం కాదు. ఈ పరిస్థితిలో  అయన మునుపటి మాదిరిగా విజయాలు సాధిస్తే ఆయన్ని నమ్ముకున్నవాళ్లకు మంచిదే. కానీ, పరాజయం సిద్ధిస్తే మాత్రం  దాన్ని హుందాగా స్వీకరించగలగాలి. 



(25-04-2022)

 

25, ఏప్రిల్ 2022, సోమవారం

ఓ కధ చెప్పుకుందాం – భండారు శ్రీనివాసరావు

 నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.

కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే ఇది.

మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా  మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము. చిన్నవాడి నైన నాకే డెబ్బయి అయిదు. మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.

ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:  



“పై ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఈమె ఎవరికి కనపడదు. (సరిగా బట్టలు వేసుకోదని బయటకు రానివ్వరు) మండుటెండలో సైతం చెట్టు నీడ కూడా లేకుండా, ఈ రేకుల షెడ్డులోనే ఊరు బయట నాలుగేళ్లుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపుమేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడే లేకపోయినా, కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

 

“వెనుకటి రోజుల్లో పిచ్చమ్మ అనే ఆమె మన ఊళ్ళో ఉండేది. ఈ పిచ్చయ్య ఆమె కుమారుడు. కంభంపాడు లోనే కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిగా ప్రవర్తించడంతో గ్రామస్తులు వీరు  తమ  ఇళ్ళ మధ్య ఉండటానికి ఇష్టపడ లేదు.

“ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పడంతో, కంభంపాడు వెళ్లి మన ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని ఒక మూలన పొలంకు అడ్డులేకుండా చివరన తాత్కాలికంగా ఉండమని చెప్పాను. దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారి వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.

“అయితే ఇప్పుడు మన పొలాలు కొలిపిస్తున్నందున అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాను. పిచ్చయ్య నన్ను అడిగిన దాని ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి నివాసం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. నేను నాతో పాటు నా మిత్రులు, అన్నయ్య, ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ కలిసి వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి నివాసం ఏర్పాటు చేయాలని భావించాము. వాళ్ళకి మన ఊళ్ళోనే ఒక నివాసం ఏర్పాటు చేసేందుకు తలా ఒక చేయి వేస్తున్నాము”

ఈ కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా  భండారు సంతానం మేలిమి  బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.

పిచ్చయ్య కుటుంబానికి  ఆధారం దొరుకుతుంది. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ దేశంలో ఎంతమంది వున్నారో!

(25-04-2022)

24, ఏప్రిల్ 2022, ఆదివారం

ఈ ప్రశ్నకు బదులేది? – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 24-04-2022, SUNDAY)

 

1973 లో స్వీడన్ లోని స్టాక్ హోంలో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది బ్యాంకు  సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా, దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒక రకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా కూడా బందీలు బయట పడడానికి  అంగీకరించలేదు. పైపెచ్చు, తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి, బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.

ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.

మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల మాటలు,  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీరు వంటివి.’

ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  మరో విశ్లేషకుడు ఏకీభవించలేదు.

మేధావులు, చదువుకున్నవాళ్లు, తమకున్న పరిజ్ఞానంతో అది లేని వారికి విషయం విడమరచి చెప్పి, సరయిన తీరులో వాళ్ళు కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.

ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?

సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.

ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న ఒక ప్రసిద్ధ నటుడు సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే, ఆ ఒక్క షో తోనే  ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమలోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.

ఇది చెప్పి, టీవీ ఛానళ్ళ వాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం వెల్లడించాను. అయితే ఇవన్నీ చాలా పాత రోజుల ముచ్చట్లు అనుకోండి. ఇప్పుడు ఇలా మాట్లాడే సావకాశం విశ్లేషకులకు లేదు. అలాంటి అవకాశం ఇచ్చే వీలూసాలూ,  చర్చను నిర్వహించేవారికి కూడా  వున్నట్టు లేదు.

అసలింతకీ విషయం ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని సామాన్యులు అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే, ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన, అందరూ ఆ తానులో ముక్కలే అనే అభిప్రాయం  ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకవు.

ఓట్లు అమ్మకాలు, కొనుగోళ్ల గురించి మా వాచ్ మన్ కుటుంబం దగ్గర ప్రస్తావన తెస్తే వాళ్ళు చెప్పిన జవాబులు కూడా ఆలోచింపచేసేలా వున్నాయి. 

‘రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటుకు  బదులుగా ఏదయినా కోరుకుంటే అది అధర్మం. నిజానికి ఓటు అమ్మడం అలవాటు చేసింది వాళ్ళే. కొనేవాడు లేకపోతే ఇక అమ్మేదెవరికి? ఓటుకింత అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్న మాట కూడా నిజమే.  ఓ వెయ్యో, రెండు వేలో మా మొహాన విదిలించి గెలిచినవాళ్ళు ,కౌన్సిల్, రాజ్యసభ ఎన్నికల్లో వారి ఓటును లక్షలకు అమ్ముకుంటున్నారని టీవీల్లో చూసి తెలుసుకున్నప్పుడు, మరి  మాకు బాధగా ఉండదా! రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ, తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. రాజకీయంగా సమర్థనీయం. సమాజం మొత్తాన్ని అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతే కాని, పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు”

సామాన్యుడు అనేవాడు ఇక ఎంత మాత్రం సామాన్యుడు కాడని, అసామాన్యంగా ఆలోచించడం మొదలు పెట్టాడని  నాకు ఆ మాటలతో తెలిసి వచ్చింది. నువ్వు చేస్తున్నది తప్పు అని అతడికి  చెప్పగలిగే స్థాయి నాకు వుందని నేను అనుకోను.

రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ తమ స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారన్న మాట.

తోకటపా:  

పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఇలా పుణ్య కార్యాలు చేస్తూ ఎంతో పుణ్యం మూటగట్టుకుని స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించి పెట్టుకుంటున్నాడు అని జనం అందరూ వేనోళ్ళ చెప్పుకునేవారు. అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో ఆ భవనానికి వెళ్లి, కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో జనం రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ, అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.

త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ అది.

మాదోరి పాప. ఆదోరి బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది.