23, ఏప్రిల్ 2022, శనివారం

తలెత్తుకుని జీవిద్దాం! – భండారు శ్రీనివాసరావు

 

ఆరేళ్ల క్రితం చక్కటి మాట చెప్పాడు నిర్మల్ అక్కరాజు. చక్కటి మాట కాబట్టే ఇప్పటిదాకా గుర్తుంది.

ఆ రోజుల్లో నేను ప్రతి   రోజు   ఒక టీవీ స్టూడియో చర్చకు  వారంలో ఏడురోజులు వెడుతుండేవాడిని. ఇది ప్రతి రోజూ ఉదయం తంతే కనుక మా ఆవిడ నాకు ‘వారాలబ్బాయి’ అనే నిక్ నేమ్ పెట్టింది.

ఆ క్రమంలో నాకు ప్రతి గురువారం ఉదయం స్నేహ టీవీలో ఉభయం. అంటే ఆనాటి వార్తల మీద విశ్లేషణ.

ఒకరోజు ప్రోగ్రాం అయిపోయి తిరిగొస్తున్నప్పుడు అతనన్న మాట ఇది.

తలెత్తుకుని జీవిద్దాం’.

ఈ మాట అంటూ అతడు చూపించిన వైపు దృష్టి సారించాను. రోడ్డు మీద కనబడ్డ వారందరి చేతుల్లో సెల్ ఫోన్లు వున్నాయి. వారిలో రాత్రంతా ప్రయాణం చేసి బస్సులు దిగిన వాళ్ళున్నారు. వాళ్ళను ఇళ్ళకు చేరవేసే ఆటో డ్రైవర్లు వున్నారు. రోడ్లు ఊడ్చే పనివారు వున్నారు. దాదాపు అందరూ తలదించుకుని మొబైల్ ఫోన్లలోకి చూస్తున్నారు.

నిజమే! వీరందరూ ‘తలెత్తుకుని’ ఎప్పుడు జీవిస్తారు?

అప్పట్లో  నిర్మల్  అక్కరాజు టీవీ యాంఖర్. నిజానికి ఆయన ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ ఇంత పొద్దున్నే లేచి వచ్చి చేసే ఈ యాంఖర్ కొలువు మాత్రం ఆయన ఇష్టపడి నెత్తికెత్తుకున్నది. అసలాయన అసలు ఇష్టం రేడియో. ఆదివారం సెలవయినా పనికట్టుకుని, ఒకప్పుడు నేను పనిచేసిన రేడియోకి వెళ్లి వార్తలు చదువుతాడు. ఇష్టమయిన పనిచేసేటప్పుడు కష్టం అనిపించదు అంటాడు రేడియో మీద చిన్నప్పటి నుంచి అవ్యాజమైన అనురాగం గుండెలనిండా నింపుకున్న ఈ పెద్దమనిషి.



(PHOTO COURTESY: IMAGE OWNER)


 

21, ఏప్రిల్ 2022, గురువారం

మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు

 ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.

ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”

బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.

పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!

నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.

నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్ ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”

ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.

నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.

మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.

అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.

పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి  పోస్టింగుల మీద  ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.

ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.

సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె,  గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”

అది సరే! మీకు సాయం చేసిన వారి మాట చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”

సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”

(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి అయ్యేసులు ఆయనకి పెట్టిన పేరు పిచ్చోడు)

20, ఏప్రిల్ 2022, బుధవారం

గద్దర్ టు గణేశా! – భండారు శ్రీనివాసరావు

 రెయిన్ బో ఇయర్స్. ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల. దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ  జీవన చిత్రం అనాలా! రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయివరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.

పుస్తక పరిచయ కార్యక్రమం నిన్న మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు. హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి నిన్న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో మావో నుంచి మహర్షి దాకా అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం  కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.  

పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు.  వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి  ఇండియన్ సివిల్ సర్వీసులో  ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం.  నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.

నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని  ఏదో  మానవాతీత శక్తి కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో   అనేకరకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS).  మరి  CONTENTMENT సాధించడం ఎల్లా!

(ఈ పుస్తకం నేనింకా చదవలేదు. అంచేత ఇందులో పేర్కొన్న అంశాలు ఒక క్రమంలో ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు.  సభలో మాట్లాడిన దాన్నిబట్టి. ఆ తర్వాత ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నప్పుడు చెవినపడ్డ విశేషాలు ఇవి)

మదన్ గోపాల్ కి  చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో ఉంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, నీ రాతలతో నా తల తినడం ఆపేసి ఓసారి నా దగ్గరకు రా అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసిపడేసారు.

మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం,  వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే  ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం కాసేపు తోటపని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT  ఒకటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే తెలిసింది.

సరే ముందు మొదలు పెట్టిన గద్దర్ టు గణేశా ఏమిటి అంటే!

పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని మదన్ గోపాల్  గద్దర్ లోగడ పాడిన ఓ పాట పాడుతూనే  సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.

నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS  కనిపించివుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT   దశకు చేరుకోలేదు.

తోకటపా: కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ..ఎస్. అధికారులు కనిపించారు. మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్,  తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు  మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.

మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం  విజయలక్ష్మి,  వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందుభోజనం నిన్నటి మా కలయికలో నిజంగా హై లైట్.

కింది ఫొటోల్లో : అష్టగ్రహ కూటమి అంటే మేమే. మేము ఎనిమిదిమందిమి అన్నమాట.

PHOTOS COURTESY: JWALA










(20-04-2022)

 

నాకు తెలిసిన చంద్రబాబు - భండారు శ్రీనివాసరావు

 (ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
27 ఏళ్ళ కిందటి సంగతులు. ఇప్పుడు నలభయ్ ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా ఆనాటి సంగతులు సరిగ్గా గుర్తు వుండే అవకాశం లేదు. ఇప్పుడు అంటే ప్యాంటు చొక్కాల రాజకీయ నాయకులు చాలామంది కనబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్యాంటు షర్టు చీఫ్ మినిస్టర్ ని చూడడం కొంచెం అటూ ఇటూగా అదే అదే వయసులో వున్న మా బోటి జర్నలిస్టులకు అదే ప్రధమం. పరిచయాలు పెరగడానికి, బలపడడానికి అదొక్కటే కారణం కాదు. పాత్రికేయులతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే చంద్రబాబు తత్వం కూడా ప్రధాన కారణం. అంచేత అనేక అనుభవాలు, చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఆయనతో ముడిపడి వున్నాయి.
ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. (విజయవాడ నుంచి ఒక ఉపాధ్యాయురాలు ప్రతియేటా క్రమంతప్పకుండా విజయవాడ నుంచి ముందు రాత్రి బస్సులో వచ్చి ఉదయమే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ వెంటనే బస్సు పట్టుకుని తిరిగి వెళ్ళిపోవడం ఒక విలేకరిగా నాకు తెలుసు)
అభిమానుల తాకిడి తప్పించుకోవడానికి తరువాతి సంవత్సరాలలో చంద్రబాబు మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని పుట్టినరోజున ఇంట్లో లేకుండా ఆ రోజంతా ప్రజల నడుమన గడపడం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు. టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో కేంద్రంలో ఆయనంటే పొసగని ప్రభుత్వం వుండేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు కనుసన్నల్లో మెలిగే కేంద్ర ప్రభుత్వం వుండేది. రాజకీయంగా చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది కనుక.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. ఆయనను అభిమానించేవారికి వారు కోరుకునే అవసరమైన అంశాలు కనబడవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
కరెంట్స్ కట్స్
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి లోపలకు వెళ్ళిపోయారు.
ఆకస్మిక పర్యటనల ఆకర్షణ
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
కాకినాడ రేడియో స్టేషన్
ఇది ఏర్పాటు కావడానికి ముందు ఒక చిన్న కధ నడిచింది. రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ముందు స్థానిక రెవెన్యూ అధికారులు ఒప్పుకోలేదు. ఇప్పుడు రేడియో వినే వాళ్ళు ఎవ్వరు, దానికోసం స్థలమా అని ఎద్దేవాచేసిన వాళ్ళు కూడా వున్నారు. హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రంలో సివిల్ వర్క్స్ చూసే ఇంజినీర్ రాజు పట్టుకుంటే వదిలే రకం కాదు. నన్ను అడిగితే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకు వెళ్లాను. విషయం చెప్పాను. ఆయన ఆ బాధ్యతను తన కార్యాలయంలో పని చేసే ఐఏఎస్ అధికారి సాంబశివరావు గారికి ఒప్పచెప్పారు. ఆ అధికారి వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణం స్థలాన్ని రేడియో అధికారులకు అప్పగించి ఆ విషయం వెంటనే సీఎం పేషీకి తెలియపరచాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో వున్నారని చెప్పారు.
అంతే! పెద్ద ఆటంకం ఆ విధంగా చంద్రబాబు చొరవతో తొలగిపోయింది.
చంద్రబాబు నవ్వుతారా!
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు.


(కాలు విరిగి ఆసుపత్రిలో వున్న రచయితకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ)


17, ఏప్రిల్ 2022, ఆదివారం

"వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్నా!” – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha today, Sunday, 17-04-2022)


నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలా రాసేవారో గుర్తున్న వాళ్లకు, ఆ తెలుగు చూసి తాము పడ్డ ఆవేదన కూడా గుర్తుండే వుంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట దేశంలో తొట్ట తొలిసారిగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో మాతృభాష తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు ఆనాటి వారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో చూపించే, పత్రికల్లో వేసే ప్రకటనల్లో సయితం తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటే ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయి(ఇప్పుడు ముంబై)లో తయారయ్యేవి. హిందీలిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.

మా కుటుంబంలో మా బావగార్లూ, వాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.

ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకే ఒక్క రైలు, నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు, బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు కూడా తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం, పెద్ద వైద్యాల కోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.

ఫలితంగా, గత యాభయ్, అరవై ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తే బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగు వాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారివారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్ని గమనిస్తే వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.

భాష పట్ల మమకారంలేని వాడు వుండడు. అది కన్నతల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడిపొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.

మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం. ఏ భాషలో అయినా అంతే!

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.

అయితే భాషలో ‘తమవి’ అనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయి పోతూవుండడం చూస్తూ బాధ పడేవారి ఆవేదన కూడా అర్ధం చేసుకోవాలి.

భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ‘ఒరే’ అనడం, అమ్మను ‘ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని.






.

16, ఏప్రిల్ 2022, శనివారం

ఆసుపత్రిలో బోధివృక్షం – భండారు శ్రీనివాసరావు

 2015 లో ఒకరోజు.

రైల్వే ప్లాట్ ఫారం మాదిరిగా కిటకిటలాడుతున్న ఆ కార్పొరేట్ ఆసుపత్రి వెయిటింగు హాలులో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆత్మీయుల ఆరోగ్యం గురించి వినీ వినపడకుండా వాళ్ళు  మాట్లాడుకునే మాటలు చెవిలో పడుతున్నాయి. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే....ఇది ఈ జన్మకు తీరే కోరిక కాదు.

రోగాలు, రొష్టులు తెలియని ఓ చిన్న పాప అక్కడే ఆడుకుంటోంది. తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది.

ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగవాళ్లు, మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా మగవాళ్ల  మాదిరిగానే  వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.

ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు. కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్ వుంది. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ తెస్తాను అని లేస్తే, అదో సాధారణ విషయం అయినట్టు వాళ్ళలో ఒక్కరు కూడా కిమ్మనలేదు.నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.

మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరిపోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....

అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే!



 

14, ఏప్రిల్ 2022, గురువారం

నస్మరంతుల పరిణామక్రమంబెట్టిదనిన .... భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో బాపూ రమణలు తెలుగు వారపత్రికల్లో చెలరేగిపోయి రాస్తున్న ఒకానొక స్వర్ణ యుగంలో, ఒకసారి ఈ నస్మరంతి పురాణం విప్పిచెప్పారు.
“పెళ్ళయి పాతికేళ్ళు అవుతున్నా కూడా పెళ్ళానికి ఆమె పుట్టింటి పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే, ఆ మగడిని “నస్మరంతి గాడు” అంటారని వాళ్ళు వాకృచ్చారు. అంటే ఏమిటన్న మాట. అతగాడిని ఎవరూ తలచుకోరు, లెక్క పెట్టరు, గుర్తించరు అనేది వారి ప్రతిపదార్ధ తాత్పర్యం.
తరవాత్తరవాత కాలంలో సెల్ ఫోన్లు వచ్చాక, రోజుకు ఒక్కసారి కూడా ఎవరూ ఫోన్ చేయకపొతే. కనీసం రాంగ్ కాల్స్ కూడా రాకపోతే, ఆ ఫోన్ తాలూకు శాల్తీని నస్మరంతి అంటారని మరో ఉవాచ.
ఇక ఇప్పుడు ఈ సాంఘిక మాధ్యమాల కాలంలో చెప్పాల్సివస్తే, రాసి పోస్టు చేసి పది గంటలు గడుస్తున్నా, ఒక్కరంటే ఒక్కరు మర్యాదకోసమైనా, పోనీ మొహమాట పడైనా లైక్ చేయడం, లేదా కామెంటు పెట్టడం అంటూ చేయని పక్షంలో ఆ పోస్టించిన మగానుభావుడిని ‘నస్మరంతి’ అంటారని సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో నొకండు దానిని ఎల్లలోకంబులకు తెలియపరిచె.
(14-04-2022)