20, జులై 2021, మంగళవారం

ఇదో రకం తుత్తి

 అప్పుడప్పుడు ఇలా కూడా అభిప్రాయం అడిగి తీసుకుని అచ్చులో నా పేరు వేస్తుంటారు. అదో తుత్తి. థాంక్స్ రిషిక

LINK to PRINT


https://theprint.in/politics/how-congress-became-irrelevant-in-andhra-pradesh-in-a-span-of-just-7-years/698407/

ప్రజాసేవ

 ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:

“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”

విలేకరి:

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో  రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

విలేకరి:

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధం పర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.  

సెంఛురీ దాటిన పెట్రోలు ధర

(ఈరోజు 25-07-2021 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. దాంతో పాటే డీసెలు ధర కూడా పోటీ పడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఈ రెండూ ఏనాడో చేరిపోయాయి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలోను గత ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ ఇవి తప్పని తలనొప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధన దిశలో వెడుతోంది. కొత్త చమురు నిక్షేపాల అన్వేషణకు, ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో  కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు? 

పెట్రోధరలు పెరిగినప్పుడల్లా  మరోసారి పెరిగాయి అనుకోవడం ఆనావాయితీగా మారింది. అయితే, ఈ ధరల పెరుగుదల  పెట్రోలు, డీసెలుతో ఆగిపోదు. ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితంఅలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు.

పొతేఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపే వాళ్ళుతమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలుప్రతివిమర్శలు చేసేవాళ్ళు యధావిధిగా టీవీ స్టూడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలురాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందోఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. (ఈమధ్య అదీ మానేశారు, రోజూ చనిపోయేవాడికోసం  ఏడ్చేవారు ఎవరన్న చందంగా)

పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయిఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీయెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఒక రివాజుగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదననిఎడ్ల బళ్ళురిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలువెచ్చాలు కొనని కొందరు రాజకీయ ఆడంగులు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు, ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండిపెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు. 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ? 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల. 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమే కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాతతరం నుంచివున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరోతరం నుంచిఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకోతరం నుంచిఅలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన రాదారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలికొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి.

‘ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయిఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా’ అనే ఆటో డ్రైవర్, సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే ఆటో చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటేఅవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది.

ఇది సమాజంలోని అన్ని వర్గాలకు వర్తిస్తుందికాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.

19, జులై 2021, సోమవారం

అభ్యసన అనగానేమి? – భండారు శ్రీనివాసరావు

భాష పరిపుష్టి కావాలంటే కొత్త పదాలు పుట్టాల్సిందే. అలా పుట్టించిన వాళ్లకి వీర తాళ్ళు వేయాల్సిందే. కాదనను. కానీ అనువాదం పేరుతొ పుట్టించే కొత్త అనువాద పదాలతోనే చిక్కంతా.

అభ్యసన అనే పదం ఇంతవరకు లేదు అని కానీ, అది తెలుగు పదం కాదని కానీ నేను అనను. కానీ అటువంటి పదాలు కేవలం అనువాదం కోసమే వాడడం అంత శోభస్కరం కాదేమో.
ఈ వార్త చూడండి.



“ఆన్ లైన్ లో అభ్యసన అంతంతే!”
అదీ ఈ వార్తకు పెట్టిన శీర్షిక.
ఆన్ లైన్ అనే ఇంగ్లీష్ పదానికి, ఒక ‘లో’ అనే అక్షరం చేర్చి దాన్ని అలవోకగా తెలుగు పదంగా చేసుకోగలిగినప్పుడు ఈ అభ్యసనకు మూలమైన ఆంగ్ల పదాన్ని ఎందుకు తెలుగుగా మార్చుకోకూడదు అనేది నా ప్రశ్న.
పోనీ ఎలాంటి పరిస్థితిలో కూడా ఆంగ్ల పదాలు రాకుండా చూడాలి అనే తపన వుంటే అదో మాట.
ఇదే వార్తలో ఎన్ని ఆంగ్ల పదాలు వున్నాయో ఒకసారి చూస్తే ఆ ఉద్దేశ్యం కూడా లేనట్టు అనిపిస్తుంది.
ఈ-తరగతి, క్లాసు, సర్వే, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, సొల్యూషన్, ప్రొవైడర్, టీం లీజ్ ఎడ్ టెక్, ప్రమోట్, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఇలా అనేకానేక ఇంగ్లీష్ పదాలతో ఈ వార్తను కూర్చినప్పుడు, ఒక్క అభ్యసన అనే పదానికి మూలమైన ఆంగ్లపదం ఏం పాపం చేసుకున్నట్టు?
సాటి జర్నలిస్ట్ సోదరులను ఎద్దేవా చేయడం కోసం రాసింది కాదిది.
పాఠకులకు అర్ధం అయ్యే అనువాదాలు చేయాలని మాత్రమే కోరేది.
(19-07-2021)

పార్లమెంటు సమావేశాలు

 ఈరోజు  సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు.

సాంప్రదాయకంగా  జరిగే అఖిలపక్ష సమావేశం ఒక రోజు ముందుగా  నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం, ప్రజాసమస్యల ప్రస్తావన చేయడానికి తమకు తగినంత వ్యవధానం ఇవ్వాలని విపక్షాలు పరస్పరం విన్నవించుకున్నాయి. అలా ఈనాటి సమావేశంలో ఉభయులు అంగీకారానికి వచ్చినట్టు టీవీల్లో స్క్రోలింగులు అయితే పరుగులు తీసాయి.

ఈ బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఓ భార్య మొగుడితో.

చూద్దాం ఏం జరుగుతుందో!

 

17, జులై 2021, శనివారం

దేవుళ్ళు మిస్సింగ్

 ఏదో ఛానల్ కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి ముక్కోటి దేవుళ్ళందరూ హూష్ కాకి.



మిస్సింగ్ కేసు కాదనీ,

వాళ్ళందరికీ మా ఆవిడ గ్రహణం విడుపు అభ్యంగనస్నానం చేయిస్తోందని ఆలస్యంగా అందిన సమాచారం.



అమ్మయ్య! గ్రహణం విడుపు స్నానాలు పూర్తయి దేవుళ్ళందరూ తమ గూటికి చేరారు. పుష్పా‌లంకరణ ఒక్కటే ఈ పూటకి మిగిలింది.

ఆ పని కూడా పూర్తి చేస్తేనే కానీ మా ఆవిడ టీవీ రిమోట్ ముట్టుకోదు. సీరియళ్ళ రేటింగుల్లో కాస్త ఆటుపోట్లు వుండే అవకాశం వుంది.

 

17-7-2019

 

సరిగ్గా నెల తర్వాత ఆ దేవుళ్ళు అందరూ వున్నారు, ఒక్క మా ఆవిడ తప్ప.

 

16, జులై 2021, శుక్రవారం

మా ఆవిడతో మాట్లాడాలని వుంది

 

ఒకటే హడావిడి. ఒక్క నిమిషం టైం లేదన్నట్టు రోజులు గడిచిపోయాయి. ఆఖరికి భార్యతో ఒక మాటా లేదు, ముచ్చటి లేదు.
జర్నలిస్టుల జీవితాలే అంతా. లేక నా బతుకే అంతా.
కరోనా అంటే ఏమిటో తెలియకుండా తను దాటి పోయింది. ఒక రకంగా అదృష్టవంతురాలు అన్నారు. అందరు చుట్టపక్కాలు, బంధు మిత్రుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. అదే ఇప్పుడయితే!
అంతవరకూ ఆమె అదృష్టవంతురాలే. అసలు దురదృష్టవంతుడిని నేను. కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేను గత రెండేళ్లకు పైగా ఇంటిపట్టునే పడి ఉంటున్నాను. ఆమె ఎప్పుడూ కోరుకుని, పైకి చెప్పని కోరిక అది.
ఒకప్పుడు అది అసాధ్యం. ఎప్పుడూ ఎవరో ఒకరు. ఏదో ఒక ఫోను. పగలు లేదు, రాత్రి లేదు. ఎక్కడో ఒక చోట గంటలు గంటలు వుండిపోవడం. ఇంటికి వస్తే వెంట నలుగురు. కాఫీలు, టీలు, భోజనాలు. నాకు తీరిక లేదు. అంచేత ఆమెకు తీరిక వుండేది కాదు.
అంతా అయిన తర్వాత, అందర్నీ పంపించిన తర్వాత ఏమిటి ఈరోజు విశేషాలు అని అడిగేది. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, రాజకీయాలు ... ఈ సంగతుల మీద ఆమెకు ఏమి ఆసక్తి.
రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే తీరు. ఉదయం ఆరింటికి లేస్తే ఏదో ఒక టీవీ. తను నాకంటే ముందే లేచి కాఫీ పెట్టి ఇస్తే తాగి బయట పడితే మళ్ళీ ఎప్పుడో.
‘అత్తయ్య! చూస్తున్నావా మామయ్య టీవీలో మాట్లాడుతున్నాడు’
ఫోన్లో నా మేనకోడళ్ళు ఎవరో అడిగేవాళ్ళు.
‘ఏఛానల్లో’ అనేది తను నిరాసక్తంగా.
నేను ఏ ఛానల్ కు వెడుతున్నానో తనకి తెలియదు. తెలిసినా చూసేది కాదు.
‘ఏమిటండీ ఆ పోట్లాటలు. అంతోటి వాటిని పనికట్టుకుని చూడాలా’ అనేది.
ఈ కరోనా కాలంలో తను ఉన్నట్టయితే ఎంత బాగుండేదో. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం.
అది కూడా నేను బయటకు పోయే ఛాన్స్ లేదు కాబట్టి.



(16-07-2021)