16, మే 2021, ఆదివారం
కరెంటులో బల్లి పడింది
15, మే 2021, శనివారం
2017 లో ఒక రోజు
ఇలా కూడా జరుగుతుంది
పన్నెండు గంటలు కొట్టడానికి ఒక్క నిమిషం మాత్రమే
వ్యవధి వుంది.
ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి
సిద్ధమై వుంది.
‘నేను రెడీ’ అన్నాడాయన
మేనల్లుడితో. మేనమామ అన్నమాటే ఆ పెద్దరికం ఎన్నడూ చూపించేవాడు కాదు. ఒక స్నేహితుడికంటే ఎక్కువ
చనువు ఆయనతో.
పిల్లలు అమెరికాలో వుంటారు. న్యూ యియర్ బెల్స్
మోగుతుండగానే వాళ్ళు ఒకరి వెంబడి మరొకరు వీడియో కాల్స్ చేశారు. చేతిలో గ్లాసుతోనే వాళ్ళని గ్రీట్
చేసాడు. కాసేపు మాటలు, ముచ్చట్లు.
అన్నీ విస్కీ సిప్ చేస్తూనే. చేస్తూనే కుర్చీలో ఓ పక్కకి ఒరిగిపోయాడు. ఏం జరిగిందో
అందరికీ తెలిసేలోగానే
జరగకూడనిది జరిగిపోయింది. పక్క పోర్షన్ లో ఉంటున్న డాక్టర్ వచ్చి చూసి చెప్పిన ఆ
సంగతి విని ఇంటిల్లిపాదీ మ్రాన్పడి పోయారు.
అప్పటి దాకా అన్ని కబుర్లు చెప్పిన ఆ మనిషి ఇక లేరు.
‘నేను రెడీ’ అంటే అర్ధం ఇదా!
మొన్న రాత్రి విందు భోజనం సందర్భంలో ఆ మేనల్లుడు
చెప్పిన కధనం ఇది.
Yes. Truth is stranger than fiction.
14, మే 2021, శుక్రవారం
నేరము శిక్ష పత్రికలు
ఈద్ ముబారక్!
13, మే 2021, గురువారం
ఆవకాయ కారాల సీజన్
వెల్లిపాయ కారం
ఈ కారానికి కూడా చిన్న రసాలు, కానీ తెల్ల గులాబీ రకం మామిడికాయలు కానీ బాగుంటాయి.
కావాల్సినవి:
మామిడికాయలు పాతిక, (ముక్కలు చేసి జీడి, పొర తీసి పొడిగా వుంచుకోవాలి), ఎర్ర కారం: ఒక కిలో, మెంతులు: పావు కేజీ, ఉప్పు: ముప్పావు కేజీ, ఆవపిండి: పావు కేజీ, ఎండలో వుంచి పొట్టు వలిచిన వెల్లిపాయలు : అర కేజీ, పప్పు నూనె: మూడు కేజీలు
ముందుగా మెంతులను, నూనె లేకుండా ఎర్రగా వేయించు కోవాలి. కమ్మటి వాసన వస్తే బాగా వేగినట్టు గుర్తు. అవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లిపాయల్లో కొంత అంటే ఓ చిన్నగ్లాసుడు విడిగా తీసి గ్రైండర్ లో వేసి నీళ్ళు కలపకుండా పేస్టుగా చేసుకోవాలి.
ఒక బేసిన్ తీసుకుని అందులో కారం, మెంతి పిండి, ఆవ పిండి, వేసి కలపాలి. సిద్ధంగా ఉంచుకున్న ఉప్పులో సగం మాత్రమే ఈ మిశ్రమంలో కలపాలి. అందులో వెల్లుల్లి పేస్టుతో పాటు మిగిలిన వెల్లుల్లి రెబ్బలను వేసి, ఒక లీటరు నూనె వేసి కలపాలి. అందులో మామిడికాయ ముక్కల్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండి ముక్కలకు బాగా అంటేలా కలిపి జాడీలోకి తీసుకోవాలి. గట్టిగా అదిమిపెట్టి వుంచి తర్వాత ఆ జాడీకి తెల్లటి గుడ్డతో వాసెన కట్టాలి. మూడు రోజులు అలాగే వుంచి తర్వాత జాడీలోని మొత్తం కారాన్ని ఓ బేసిన్ లోకి తీసుకుని తిరగ కలపాలి. కనపడకుండా జాడీలో నూనె నింపాలి. అప్పుడు ఉప్పు రుచి అవసరం అనుకుంటే వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకుని పచ్చడి కనపడకుండా నూనె నింపి వాసెన కట్టి భద్రపరచుకోవాలి.
ఓ కలెక్టర్ కధ!
ఒకానొక కాలంలో జిల్లా మొత్తాన్ని తమ కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు
పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని
రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు.
కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల
నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి
వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ గారి
దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని
వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి
నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం
చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు
చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్
వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు.
కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు
కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన
మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక
తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి
కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ
పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక
మంచి నీటి బావి మంజూరు చేయాలని సర్పంచు నుంచి ఓ
అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద
ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను
తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం
చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు
వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది.
అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు.
అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో
వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి
బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం
జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు
ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ ఆ గూడెం
ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.
12, మే 2021, బుధవారం
మనసే ఒక న్యాయస్థానం
సైకిల్ పైనా, సిటీ బస్సుల్లోను తిరిగే ఏకాంబరానికి చిన్న ఉద్యోగం వచ్చింది. జనాలకు యేవో చిన్న చిన్నపనులు చేసిపెట్టి చిన్నగా పోగేసిన డబ్బులతో ఓ స్కూటరు కొనుక్కున్నాడు. అందులో సుఖం తెలిసివచ్చింది. ఆ హాయిని నిలుపుకోవడానికి కొంత అదనపు ఆదాయం కావాల్సి వచ్చింది. అందుకోసం అవకాశాలు వెతుక్కున్నాడు. ఆ అవకాశాల పేరే ఆమ్మామ్యా! అదే లంచం!
ఉద్యోగంలో
ప్రమోషన్ వచ్చింది. కారు కొనుక్కున్నాడు. ఆ సుఖమయ జీవితాన్ని మరింత పదిలం
చేసుకునేందుకు ‘అవకాశాలు’ పెంచుకున్నాడు.
జీతం పెరిగింది, జీవితమూ
పెరిగింది. ‘అవకాశాలూ’ పెరిగాయి. దాంతో పట్టుబడే అవకాశాలు పెరిగాయి.
పట్టుబడిపోతాననే భయమూ పెరిగింది. పట్టుబడకుండా ఏం చేయాలనే ఆలోచనలూ పెరిగాయి.
ఉద్యోగం
ఒదిలేసాడు. కంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. లంచాలు తీసుకున్న చేతులతోనే లంచాలు
మేపాడు. కోట్లకు పడగలెత్తాడు. అయినా పడగనీడన బతికే బతుకులో
సుఖం లేదనిపించింది.
డబ్బు డబ్బు
డబ్బు. ఎటు చూసినా డబ్బు. ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు.
సినిమాలు తీసాడు.
అక్కడా డబ్బే పిల్లలు పెడుతూ పోయింది. సినిమాల్లో వేషాలు మొదలుపెట్టాడు. కను
ముక్కు తీరు బాగా లేకపోయినా హస్త రేఖలు బాగున్నాయి కాబట్టి బాగా ఆడాయి. పెద్ద హీరో
అయ్యాడు. పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఎన్ని
పేరు ప్రఖ్యాతులు వుంటే ఏం లాభం. ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్న ఓ అవుట్ డోర్ షూటింగ్ ఓ చిన్న పోలీసు అధికారి
కారణంగా ఆగిపోయింది.
కిటుకు డబ్బులో
లేదని తేలిపోయింది. అధికారంలో వుందని
అర్ధం అయింది. ఆ రక్షణ కవచం కావాలనుకున్నాడు. సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా
పెట్టి రాజకీయాల్లో ప్రవేశించాడు. అధికార పదవులు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు
‘అవకాశాలు’ మరింత పెరిగాయి. జీవితంలో స్థాయి కూడా ఎంతో పెరిగింది. పట్టుపడతాననే
భయం తగ్గిపోయింది. ఎందుకంటే పట్టుకునేవారే ఇప్పుడు తన గుప్పిట్లో వున్నారు.
అయినా సరే! ఏదో
ఆందోళన! ఏదో భయం. ఇలా ఎన్నాళ్ళు ? పైకి
చెప్పుకోలేడు.
ఒకప్పటి స్థాయిని గుర్తు తెచ్చుకోలేడు. ఇప్పుడున్న స్థాయిని వదులుకోలేడు.