17, జూన్ 2020, బుధవారం
రాజాకీయాల్లో కావాల్సింది విధేయతా అవకాశం వెతుక్కోవడమా
13, జూన్ 2020, శనివారం
పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు
11, జూన్ 2020, గురువారం
కరోనా లేకపోతే కోటి వదిలేది (సరదా గల్పిక)
“ఈరోజు మా మనురాలి పెళ్లి. ఇంట్లో కూర్చుని చూస్తున్నాము”
ఆయనెప్పుడూ అంతే! చాలా సరదా మనిషి. దేన్నీ సమస్యగా తీసుకుని బాధపడరు, బాధ పెట్టరు. అది ఆయన నైజం. పైగా ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే వయసు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండగలుగుతున్నారు.
“కరోనాకు ముందు ఇదిగో ఇదే మనవరాలి ఎంగేజ్ మెంట్ ధూమ్ ధాంగా గోవాలో చేశారు. నేనూ మా ఆవిడా ఇంకా అనేకమంది బంధుమిత్రులం గోవా వెళ్లాం. చాలా సరదాగా గడిపాము. మా అల్లుడి చేయి పెద్దది. చాలా గ్రాండుగా చేసాడు. పెళ్లి ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేశారు.
“ఈలోగా ఇదిగో ఈ కరోనా పిలవని పేరంటంలా దిగబడింది. పెళ్ళికి యాభయ్ మంది కన్నా ఎక్కువమందిని పిలవకూడదు. అంచేత మగపెళ్ళివారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మేము సర్దుకున్నాము. స్టార్ హోటల్లో పెళ్లి. అందరికీ లింకులు పంపారు. అవి పెట్టుకుని ఇంటి నుంచే వివాహ వేడుకలు చూస్తున్నాం.”
“ఇంకో మాట. ఈ కరోనా లేకపోతే ఈ పెళ్ళికి ఒక కోటి వదిలేది మా అల్లుడుకి” అన్నాడాయన నవ్వుతూ.
(June, 2020)
10, జూన్ 2020, బుధవారం
భయం – భండారు శ్రీనివాసరావు
9, జూన్ 2020, మంగళవారం
సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు
సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.
“ఆయన
నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే
కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో
కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి.
చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా
వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు
స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా
వుండలేరు. అది మాత్రం వాస్తవం”
శర్మగారికి
బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన
సంగతులు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారు.
శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.
అలా
ఈరోజు ఓ విషయం చెప్పారు.
విశాఖ
పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో
పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు
యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై వైజాగులో
తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన ‘గణపతి రామాయణ సుధ’ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు
వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా
తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
“వారొకసారి
విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు
కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు. ఎలా అని
గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి
వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”
శర్మగారు
చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను.
అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”
అంత
పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా
వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)
8, జూన్ 2020, సోమవారం
నారాయణ నారాయణ
“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్’ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.
తర్వాత
తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన
ఫోటోలు చూశారుగా.
చేపలు
తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి
మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు
వుందనుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచి చేస్తే
ఎంత? చేయకపోతే
ఎంత?
చిన్నప్పుడు
ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ
సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు
కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని
ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి
వాటిని చూస్తూనే ‘పీచు, కాసు’ అంటూ కళ్ళు తేలేశాడు.
గతంలో
మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు తీరారు.
ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో
మరి.
సరే!
గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు
ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి
హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.
లోగడ
వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు
చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ
ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ
తెచ్చిపెట్టారు.
ఉత్తర
భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే
మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి
మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం
వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి
ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు.
రైల్వే రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన
కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది
మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత
మాత్రమే.