4, జూన్ 2020, గురువారం

రాజకీయ నాయకుల వేషధారణ – భండారు శ్రీనివాసరావు


ఇది రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టు మాత్రం కాదు.
నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలు, పెద్ద పెద్ద కళ్లద్దాలూ, ఎడమచేయి గాల్లోకి లేపి, చిద్విలాసం చిందిస్తూ.. సోదర సోదరీమణులారాఅంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.
అయితే సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేక సార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. లక్ష్మీ పార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.
చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండిపోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలా చారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకేరకం ఆహార్యంతో కానవచ్చేవారు.  
రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది కానీ అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.
ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం ఒకే రకం దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకేరకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం.
ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.
పొతే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒకరకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను.
వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. ఈ మధ్య మెడచుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపిస్తున్నారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవస్తున్న మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   
యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.     
          


2, జూన్ 2020, మంగళవారం

సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 02-06-2020 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

నాకు లీలగా గుర్తు. ఉద్యమం మాంచి ఊపులో వున్నప్పుడు కేసీఆర్ ఇలా అన్నారు.
“తెలంగాణా వచ్చిన తరువాత, దాన్ని మనం కోరుకుంటున్నట్టు అభివృద్ధి చేసుకోవడానికి రోజుకు  ఇరవై నాలుగు  గంటలు కూడా  సరిపోవు”.
నిజమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఎన్నో కావాలి. మొక్కవోని దీక్ష, సడలని పట్టుదల, అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్నసమయంలో అమలుచేసే యంత్రాంగం, సమయ పాలన. ఇన్ని కావాలి ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఇవన్నీ కలగలుపుని కేసీఆర్  సాధించిన  ఘన విజయమే కాళేశ్వరం ప్రాజెక్టు.
జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తయి ఏడోఏట అడుగుపెడుతోంది. ఈ ఏడాది తెలంగాణా  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయిదు రోజులముందే మొదలయ్యాయి. మే ఇరవై తొమ్మిదో తేదీనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు తుది అంకం ఆవిష్కృతం కావడంతో ఈ సంబురాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. అలనాటి భగీరధుడు గంగమ్మను ఆకాశం నుంచి భూమికి రప్పిస్తే, ఈనాటి అపరభగీరధుడు కేసీఆర్ కాళేశ్వరం గోదావరి జలాలను సముద్రమట్టానికి ఆరువందల మీటర్ల పైకి  తీసుకువచ్చి ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని నీరుకార్చి కొండ పోచమ్మ ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. దీనితో, భారతదేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప ఇంజినీరింగ్ విన్యాసం సాధించిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రపుటలకు ఎక్కింది. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు కేసీఆర్ పట్టుదలకు, మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే గోదావరి నీళ్ళను కొండ పోచమ్మ ప్రాజెక్టులోకి తోడి పోస్తున్నప్పుడు స్వప్నం సాకారమైందన్న సంతోషం, సంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించాయి.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలే  ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా. ఉమ్మడి రాష్ట్రము విడివడితే తెలంగాణా  అంధకారబంధురం అయిపోతుందని నాడు వినవచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని అనుకున్నారేమో తెలవదు కానీ ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది.
గత ఆరేళ్లుగా జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్తితి. దేవులపల్లి ప్రభాకరరావు గారి సారధ్యంలో జెన్కో, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది కలసికట్టుగా సాగించిన నిర్విరామ కృషి ఇందుకు ప్రధాన కారణం.   
తెలంగాణా ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడి కూడా ఆరేళ్ళు గడిచాయి. అనుకున్నవి అనుకున్నట్టు సాగుతున్నాయని కొందరు అనుకుంటూ వుంటే, ఏదీ, ఎక్కడ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా లేకపోలేదు.
అన్నం వుడికే దాకా వుడికినట్టు తెలవదు, కుతకుత శబ్దం తప్పిస్తే.
ఎవరి పరిపాలనలో అయితే పాలకులతో అవసరం లేకుండా పాలితులకు జీవితం హాయిగా  గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.
ప్రస్తుతం కేసీఆర్ పాలన ఆ రీతిలో సాగుతోందని పొగడ్తలు తగవు కానీ, ‘నేనున్నాను’ అనే భరోసా మాత్రం  ప్రభుత్వం నుంచి పాలితులకు లభిస్తోందని నేను నిశ్చయంగా చెప్పగలను. (EOM)

29, మే 2020, శుక్రవారం

జగన్ ఓ సీతయ్య...ఎవరిమాటా వినడు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 30-05-2020, Saturday)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది.  దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే. చుట్టూ చాలామంది వుంటారు. కానీ ఎవర్నయినా అడిగి చూడండి. ఒకటే మాట, ‘ఆయన చాలా లోతయిన మనిషి.  జనం చెప్పేది  తప్ప పరిజనం మాట  ఆయనకు పట్టదు”.
ఒక నిజం చెప్పుకుందాం. ఎవరి మాటయినా వినాల్సిన అవసరం ఏముంది? ఆయనకు తన గమ్యం తెలుసు. వెళ్ళాల్సిన మార్గం తెలుసు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి ఏమి చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆయన సిద్ధంగా ఉంచుకుని ముందుకు సాగుతున్నట్టు ఆయన వ్యవహార శైలి గమనించిన వారికి అర్ధం అవుతుంది.
జగన్ మోహన రెడ్డి జనాలకు కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగించారు. వాటిలో చేయగలిగినవి ఏమిటి? చేయలేనివి ఏమిటి అని ఆయనే ఆలోచించుకుని ఒక కాల పట్టిక తయారు చేసుకుని పలానా రోజులోగా ఈ పనులు చేయాలి అని వాటిని చేసుకుంటూ, చేసిన వాటిని టిక్కు పెట్టుకుంటూ, చేయాల్సిన వాటిని ఎప్పుడు చేసేది ప్రజలకు చెప్పుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇక తనకూ ప్రజలకూ నడుమ ఎవరూ లేరని, వారికి తానే జవాబుదారుననీ అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక ఒకరి మాట వినాల్సిన అవసరం ఏమిటనే ధీమా ఆయన్ని సీతయ్యని చేసివుంటుంది.
గుర్తుండే వుండాలి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తొలిరోజుల్లో ఆయన ధోరణి కూడా అచ్చు ఇదే విధంగా వుండేది.  ప్రజలకు తప్ప ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అగత్యం తనకు లేదనే పద్దతిలో శ్రీ రామారావు వ్యవహరించేవారు. నిజానికి ప్రజల అభిమానంతో విజయాలను మూటగట్టుకున్న ఏ రాజకీయ నాయకుడి తరహా అయినా ఇదే విధంగా వుంటుంది. జరిగే తప్పులకీ, ఒప్పులకీ తనదే బాధ్యత అనే తీరులో వుంటుంది. గతంలో ఇందిరా గాంధీ, ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణతో, ప్రతిభతో, ప్రజాభిమానంతో గద్దె ఎక్కారు. తమను నమ్ముకున్న ప్రజానీకానికి ఏది మేలు చేస్తుందని వాళ్ళు నమ్ముతారో అదే చేస్తూ పోతారు. ఈ విషయంలో ఏవిధమైన శషభిషలకు, సమాలోచనలకు తావు లేదనే దోవ వారిది.
ఇప్పుడు జగన్ మోహన రెడ్డిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ కోణంలో ఆలోచించాలి. అప్పుడే ఆయనలో తెలియని కోణాలు తెలుసుకోగల అవకాశం లభిస్తుంది.
సరే! ఇదొక కోణం.
చెప్పిన వాటిలో తొంభయ్ శాతం పూర్తి చేశాను అనేది ఫుల్ పేజి పత్రికాప్రకటనలకు పనికొస్తుంది. ఏడాది పాలనలే కాదు, వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలలో కూడా పాలకులు గతంలో ఇలాంటి ప్రచార ఆర్భాటాలే చేసారు. అది కాదు విషయం. ప్రభుత్వ పధకాల వల్ల ప్రయోజం పొందేవారికి మళ్ళీ ఇలా ప్రకటనల ద్వారా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్లకి ప్రభుత్వ పనితీరే కొలమానం. సాధారణ ప్రజలకు నిత్యం ప్రభుత్వంతో పని పడని పాలన అందించ గలిగిన ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం అవుతుందని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
గత ఏడాది పాలనలో జగన్ మోహన రెడ్డి తలెత్తుకుని చెప్పుకోగల పనులు  కొన్ని చేసారు. తల బొప్పికట్టే పనులు కూడా చేసారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. రాజకీయ నాయకుల  నిర్ణయాలు రాజకీయ కోణంలో వుంటాయి. కోర్టు తీర్పులు న్యాయశాస్త్ర పరిధికి లోబడి వుంటాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి రాజకీయులు తమ చర్యలు ధర్మ బద్ధం అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి చట్టబద్ధం కాకపోవచ్చు. ఇలాంటి తేడాలే వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తాయి.  ఇది ఒక్క జగన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితంకాదు. ఇందిరాగాంధీ, మోడీ, కేసీఆర్ వంటి వారికి సైతం ఈ తలనొప్పులు తప్పలేదు. అయితే ఒకేరోజు అనేక వ్యతిరేక తీర్పులు కోర్టులు వెలువరించిన రికార్డు జగన్ మోహన రెడ్డి ఖాతాలో చేరడం వల్లనే  ఈ అంశానికి ఇంతటి ప్రాధాన్యం. 
ఇక గత ఏడాదిగా జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాల జాబితా వేస్తే అది ఇలా వుంటుంది.
విజయాలు: తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాల అమలుపై పూర్తి దృష్టి పెట్టడం. ఇంతవరకు ఏ రాష్ట్ర చరిత్రలో ఎరుగని గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. విద్య, వైద్య రంగాల్లో నాడు నేడు పధకం ద్వారా గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం, పెన్షన్లను ఖచ్చితంగా ప్రతినెలా నిర్దిష్టమైన తేదీన బట్వాడా చేయడం, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మొహల్లా క్లినిక్ ల పద్దతిలో క్లినిక్కులు ఏర్పాటు చేయడం, స్కూలు పిల్లలకు మధ్యాన్న భోజన పధకంలో నాణ్యతకు ప్రాధాన్యత లభించేలా చూడడం, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు కనీ వినీ ఎరుగని ఉదార పరిహారాన్ని ప్రకటించి అందచేయడం, సమీక్షల పేరుతొ పొద్దుపోయేవరకు అధికారుల సహనానినికి పరీక్షలు పెట్టకపోవడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పేదల ఇళ్ళ స్థలాలకోసం భూసేకరణ విషయంలో వచ్చిన కొన్ని ఆరోపణలు మినహాయిస్తే పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగు చూడకపోవడం   మొదలైనవి వున్నాయి.
మైనస్ పాయింట్ల జాబితా కూడా చిన్నదేమీ కాదు.
పార్టీ మార్పిళ్ళకు సంబంధించి తొలి రోజుల్లో చేసిన గంభీరమైన ప్రకటనకు కట్టుబడి వ్యవహరించడం లేదేమో అన్న అనుమానాలు కలగడం, అల్లాగే అసెంబ్లీ నిర్వహణలో గత అనుభవాలు పునరావృతం కావని సభాముఖంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకపోవడం,  గడప దాటిన ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో జగన్ మోహనరెడ్డి అనుసరించిన వైఖరి సాంకేతికంగా తప్పుపట్టలేనిది కావచ్చేమోకానీ నైతికంగా సమర్ధించుకోలేని పరిస్తితి తలెత్తడం, అధికారులకు సముచిత స్థానాలు కల్పించడంలో ఒక సామాజికవర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలకు సరయిన రీతిలో సమాధానం చెప్పలేని స్తితిలో వుండడం,  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఆసక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత కనబరచకపోవడం, ఇలా అనేకం. ముందే చెప్పినట్టు ఈ జాబితా కూడా పెద్దదే.
జగన్ మోహన రెడ్డికి  గతంలో అధికార పీఠానికి దగ్గరగా మెసలగలిగిన అనుభవం వుంది. కానీ అధికార పీఠం అధిష్టించిన సందర్భం కానీ అవకాశం కానీ లోగడ లేదు. అంచేత కొన్ని పొరబాట్లు దొర్లడం సహజం. కాబట్టి, కాసేపు ఆగి, నిలబడి, వెనక్కి తిరిగి చూసి, విషయాలను సాకల్యంగా పునః సమీక్ష చేసుకుని  మళ్ళీ ముందుకు సాగడానికి ఇది చక్కటి అవకాశం. పొరబాట్లు తప్పులుగా, తప్పులు తిరిగి సరిదిద్దుకోలేని  ఘోర తప్పిదాలుగా మారకముందే జాగ్రత్త పడడానికి కూడా ఇదొక మహత్తర అవకాశం.    
జగన్ మోహన రెడ్డి 2014లో ఓటమి అంటే ఏమిటో రుచి చూసారు. అదే జగన్ మోహన రెడ్డి 2019లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పరాజయం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో విజయాన్ని సాధించారు. విజయం నేర్పే పాఠాలను కూడా ఒంటబట్టించుకుంటే మరో విజయం సాధ్యం అవుతుంది. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం తప్పదు. కానీ రాజకీయమే సర్వస్వం కాకూడదు.
చివరిగా ఒక మాట.
అనుభవాన్ని మించిన సలహాదారుడు ఈ లోకంలో వుండరు. (EOM)

“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...” – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha  daily on 30-05-2020, Saturday)
“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...”

ఏడాదిగా ఏపీలో జగన్ మోహన రెడ్డి పాలన ఏ తీరుగా సాగుతున్నదో తెలపడానికి ఈ ఒక్క వాక్యం చాలు.
ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించినవాళ్ళు మీడియా ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు.
“లక్ష్యాన్ని సాధించితీరాలి అనే గమ్య నిర్దేశనం చేసుకున్న తర్వాత మేము బాహ్య ప్రపంచాన్ని దాదాపు మరచిపోయాము. సినిమాలు, షికార్లకి స్వస్తి చెప్పాము. రోజువారీ సరదాలు మరచిపోయాము. ఏమైనా సరే, అనుకున్నది  సాధించితీరాలని  దృఢంగా చేసుకున్న నిర్ణయం ముందు ఇవన్నీ అత్యంత స్వల్పవిషయాలనే  నిర్ధారణకు వచ్చాము. అంచేతే మా జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకోగలిగాము”
బహుశా జగన్ మోహన రెడ్డి ఈ కోవకు చెందినవాడయి ఉండవచ్చు. అంచేతే, కేవలం తన కష్టాన్ని నమ్ముకుని తన పార్టీని ఎన్నికల్లో గెలిపించి, ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇదంత సులభమైన వ్యవహారం కాదు. అయినా సరే, మొక్కవోని పట్టుదలతో, తన రెక్కల కష్టంతో దాన్ని సాధించగలిగారు. ముఖ్యమంత్రి అయిన తరవాత కూడా ఆయన తన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఒక పద్దతి ప్రకారం ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నారు. వాటికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణంలో ఇతరేతర విషయాలను వేటినీ  ఆయన చెవికి ఎక్కించుకోవడం లేదు.
ఈ నేపధ్యంలో, అఖండ విజయం ఆయనను అహంకారిగా, ఎవరి మాటను ఖాతరు చేయని మనిషిగా మార్చివేసిందని ఆరోపించేవారు కూడా వున్నారు.    
నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, చెల్లుబాటయిన మొత్తం ఓట్లలో అప్పటికి అయిదేళ్లుగా పాలిస్తున్న టీడీపీకి, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన జనసేనకు, కాంగ్రెస్, బీజేపీ లకు కలిపి వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఆరులక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ గణాంకాలనే  ప్రాతిపదికగా తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాటిపై వైసీపీ విజయం సాధించి వుండేది అనేది  ఒక వాదన.
అయితే ఇంతటి బహుళ ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోకుండా  తన చిత్తం వచ్చినట్టు పాలన సాగించవచ్చా అనేది ఆదినుంచి  ప్రతిపక్షాలు లేవదీస్తున్న ప్రశ్న. కరోనా పూర్వరంగం నుంచి తొలుస్తూ వచ్చిన ఈ సందేహాన్ని,  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ పార్టీలు  ఒకటికి పదిసార్లు ప్రజలకు చెబుతూ మరింత పెద్దది చేస్తూవచ్చాయి. కేవలం సందేహం అయితే పర్వాలేదు, జగన్ పాలనాపరంగా పూర్తిగా వైఫల్యం చెందారు అనేది జనం నమ్మేలా  చేయడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ మోహన రెడ్డిపై ముందు నుంచీ ఒక అపోహ వుంది, అయన ఎవ్వరి మాట వినని సీతయ్య అని. నిజమే కావచ్చు. కానీ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటినుంచి  పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒకరో ఇద్దరో, దామోదర సంజీవయ్య, టి. అంజయ్య వంటి వారిని మినహాయిస్తే అందరూ ఈ సీతయ్య కోవలోకి వచ్చేవారే. కాకపోతే వారిలో చాలామంది తమలోని ఈ స్వభావం బయట జనాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జగన్ మోహన రెడ్డికి ఆ శషభిషలు వున్నట్టులేదు. అందుకే ఆయన మీద ఈ అపోహలు తేలిగ్గా ముసురుకుంటున్నాయి కాబోలు.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా తొలిరోజుల్లోనే  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఎంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలని విజ్ఞులు పదేపదే సూచనలు చేసేది ఇందుకే.    
కిందటేడాది ఏప్రిల్ 11 వ తేదీన అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఆయన పాలిట అగ్ని పరీక్ష వంటివి. సరిగ్గా నలభయ్ రెండు రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.  నిజానికి ఆ ఎన్నికల్లో గట్టెక్కడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు  ఎంతో కీలకం. ఎందుకంటే ఆయనది ఒక ప్రాంతీయ పార్టీ. వరసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలయితే మూడోసారి ప్రజా పరీక్షకు సిద్ధం కావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి, అందులో ఏనాడు అధికార పీఠం ఎక్కని రాజకీయ  పార్టీకి  అసాధ్యం అని అంటారు.  అయితే, జగన్ మోహనరెడ్డి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. ఈ విజయాల్లో అధికభాగం ఆయన తన సొంత రెక్కల కష్టంతో సాధించుకున్నవే.
గత ఏడాది కాలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితమైనవి, తొందరపాటుతో కూడినవి కాకపోయినా చాలావరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో దుందుడుకుతనంగా అనిపించినా తర్వాత తర్వాత వాటిల్లో సహేతుకత లేకపోలేదని జనమే ఒప్పుకునేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. కానీ ఈలోపలే ఆ ప్రకటనను జగన్ అనుభవరాహిత్యానికి గీటురాయిగా ముద్ర వేయడం జరిగిపోయింది.    
ఈ కరోనాకు తోడు పులిమీది పుట్రలా విరుచుకుపడిన వైజాగ్ విష వాయువు దుర్ఘటన దరిమిలా ప్రతిపక్షాల వాదన సరయినదేమో అనే శంక సమాజంలోని  కొన్ని వర్గాలవారికి కలిగేలా ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి.
తనపై దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగితే అంత మంచిదని జగన్ మోహన రెడ్డి భావిస్తున్నారేమో తెలవదు. దీన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు ఏవీ ఆయన వైపు నుంచి కానరావడం లేదు. బహుశా గతంలో ఇలాగే అన్ని  రాజకీయ పక్షాలు ఏకమై తనను ఒంటరివాడిని చేసినప్పుడు ప్రజలకు తనపట్ల సానుభూతి వెల్లువెత్తిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రతిస్పందించకుండా మిన్నకుంటున్నారేమో తెలవదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరి అంచనాలకు అందని లోతైన మనిషి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక అభిమాన నాయకుని పట్ల అయన  అభిమానులు పెంచుకున్న అభిమానం ఎల్లవేళలా ఒకేలా వుండదు. అంతగా అభిమానించిన ఎన్టీఆర్ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. పూచిక పుల్లను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకుందని అహంకారపూరిత ప్రకటనలు చేయడం, ఓ చిన్న కారణం చూపెట్టి తన మంత్రివర్గంలోని మంత్రులను అందరినీ ఒక్క కలంపోటుతో  తొలగించడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. 
కాకపొతే, గతంతో పోలిస్తే కొట్టవచ్చినట్టు కనబడుతున్న తేడా ఒకటుంది. అది ప్రచార ఆర్భాటం భారీగా తగ్గిపోయిన మాట నిజం. అలాగే, అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ ఏడాది పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది. కరోనా కట్టడి కాలంలో అది కొద్దిగా రూపు మార్చుకుంది. ముఖ్యమంత్రి నేరుగా విలేకరులతో మాట్లాడకుండా ముందుగా రికార్డు చేసుకున్న వీడియోని మీడియాకు విడుదల చేస్తున్నారు.

ఏడాది కాలం కళ్ళముందే కాలగర్భంలో కలిసిపోయింది. కానీ రెండు కొత్త తెలుగు  రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు ఆరేళ్ళు దగ్గరపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. పోతిరెడ్డిపాడు వంటి అంశాలు ఇటీవల చిలికి చిలికి గాలివానగా మారడం గమనిస్తున్న వారికి ఈ ఇరువురు నాయకుల మధ్య సయోధ్య మూడునాళ్ళ ముచ్చట అవుతుందేమో అనే సందేహం కలిగితే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు.   
చేసినవి ఎన్నో కనిపిస్తున్నా, చేయాల్సినవి ఇంకా చాలా మిగిలే వున్నాయి. ‘ఏడాదేగా గడిచింది ఇంకా నాలుగేళ్ల వ్యవధానం వుందిగా’ అనుకోవడానికి, ‘అయ్యో అప్పుడే ఏడాది పుణ్యకాలం గడిచిపోయింది, మిగిలింది కేవలం నాలుగేళ్లే’  అనుకోవడానికి చాలా తేడా వుంది. ఇది ముఖ్యమంత్రి గమనంలో వుంచుకోవాలి.
ఈ రెంటిలో జగన్ మోహన రెడ్డి దేనికి మొగ్గు చూపుతారు అనేదానిపై ఆయన పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రెండూ ఆధారపడివున్నాయి. (EOM)  

సంబరాల వేళ సమీక్షాసమయం


వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి రేపటితో అంటే మే ముప్పయ్యో తేదీకి ఏడాది కాలం పూర్తవుతుంది. రాజకీయ పార్టీలకి ఇలాంటి సందర్భాలు సంబరాలు చేసుకునే సమయాలు. కరోనా కట్టడుల కారణంగా అట్టహాసంగా ఉత్సవాలు చేసుకునే వీలు  ఎలాగు లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు, కొత్త కమిషనర్ నియామకాల విషయంలో జగన్ ప్రభుత్వం లోగడ ఇచ్చిన జీవోలను కొట్టేస్తూ  హైకోర్టు ఆదేశాలు కూడా ఏడాది ఉత్సవాలకు ఒక్క రోజు ముందే వెలువడడం అనేది ఆశానిపాతమే. మానసికంగా కలచి వేసే అంశమే. గత కొద్ది రోజులుగా న్యాయస్థానాల నుంచి జగన్ ప్రభుత్వం తీర్పుల రూపంలో ప్రతికూల పరిస్తితులను ఎదుర్కుంటున్న మాట నిజమే. కానీ తాజా తీర్పు ప్రభుత్వాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడవేసేదిగావుంది. వైసీపీ ఏడాది  సంబరాల మాటేమో కానీ ఈ తాజా తీర్పు ప్రతిపక్షాలకు సంబరాలు చేసుకునే అవకాశం కల్పించింది.
హైకోర్టు పైన సుప్రీం కోర్టు ఉండవచ్చు. అప్పీలు చేసుకునే అవకాశం న్యాయమూర్తులు ఇచ్చారో లేదో తీర్పు పూర్తి పాఠం వెలువడితేకాని తెలియదు. ఆ ప్రక్రియ మరికొంత సమయం తీసుకోవడానికి (Purchasing Time) పనికిరావచ్చు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కూడా అనుకూలంగా వస్తుందనే పూచీలేదు.
ఎలాగూ, ఏడాది పాలన ముగియవచ్చే ముందు అన్ని శాఖలతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమీక్షలు నిర్వహిస్తూనే వున్నారు. అందులో కొంత సమయాన్ని ఈ కోర్టు తీర్పులకు కేటాయించి, భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వంలోనా, ప్రభుత్వ నిర్ణయాలను సరయిన విధంగానే వున్నాయి అని ముఖ్యమంత్రికి తెలియబరచే బాధ్యత వున్న అధికారుల స్థాయిలోనా, లేక వాటిని ప్రతిభావంతంగా సమర్ధించి రాజ్యంగబద్ధంగానే వున్నాయని న్యాయమూర్తులను ఒప్పించడంలో ప్రతిభ చూపాల్సిన ప్రభుత్వ న్యాయవాదుల స్థాయిలోనా.
ముందు నిర్మొహమాటంగా ఈ విషయాలను కూలంకషంగా చర్చించుకోవాలి. ప్రభుత్వంలోనే పొరబాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, టీటీడీ ఆస్తుల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా, కోర్టు కాదన్న నిర్ణయాలను హుందాగా మార్చుకోవాలి. అధికారులది బాధ్యత అనుకుంటే వారిని తప్పించాలి. ప్రభుత్వ న్యాయవాదులే కారణం అనుకుంటే వారి స్థానంలో సమర్ధులను ఎంపిక చేసుకోవాలి.
ఇక ఈ విషయాల్లో చేసే ఎలాంటి కాలయాపన అయినా  ప్రభుత్వానికి మునుముందు ఓ గుదిబండలా తయారవుతుంది.
లేదా రాజకీయ ప్రత్యామ్నాయం ఎంచుకుని కొత్తగా ప్రజా తీర్పుకు వెళ్ళాలి. కానీ మధ్యంతర ఎన్నికల నిర్ణయం అనేది  ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు.  వెనుక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా శాసనసభను రద్దు చేసి తాజాగా ప్రజల  తీర్పును కోరినప్పుడు ఆయన అభిలాషకు అనుగుణంగా ఎన్నికలు జరిగాయి. అది ఆయనకు కలిసివచ్చింది. ఇప్పుడలాంటి పరిస్తితులు లేవు.
ఇప్పటి రాజకీయ వాతావరణంలో అలాంటి నిర్ణయాలు ఆత్మహత్యాసదృశమైనవి కూడా కావచ్చు.

28, మే 2020, గురువారం

Senior NTR Jayanthi Special || Sr.Journalist Bhandaru Srinivasa Rao On S...

మహానాడు – ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు


చంద్రబాబునాయుడు అవిభక్త  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజు అక్కడికి చేరుకున్నాం. ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ  9 వారికి ఓ  ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు. పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఏదో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని తెలుసుకోలేని విషయాలు  వాళ్లకు తెలుస్తాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు ఏ పార్టీ సమావేశాలు  అయినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మోహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట!