9, నవంబర్ 2019, శనివారం

ఆలాపన – భండారు శ్రీనివాసరావు.



సినిమా నుంచి బయటకు రాగానే పక్కనే ఉన్న తాజ్ మహల్ కు వెళ్లి కాఫీ తాగి నడుచుకుంటూ చిక్కడపల్లి లోని ఇంటికి రావడం అలవాటు. హోటల్లో జనం పల్చగా వున్నారు. మా పక్క టేబుల్ మీద ఓ యువ జంట చూడ ముచ్చటగా వున్నారు.
టిఫిన్ చేసి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుంటే మరో టేబుల్ మీద అనిల్, అతడి భార్య కనబడ్డారు. నన్ను చూడగానే అతడు బాధగా మొహం పెట్టాడు.
‘విషయం తెలిసింది, వద్దామని అనుకున్నాను. వేరే వూళ్ళో వుండడం వల్ల రాలేక పోయాను. సారీ బాస్.’
అతడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు.
‘మేమూ అటువైపే వెడుతున్నాం. పదండి కార్లో డ్రాప్ చేస్తాను’ అన్నాడు.
‘థాంక్స్. మేమూ కార్లోనే వచ్చాము. అదే ఉబెర్. అదుంటే కారూ, డ్రైవర్ రెండూ ఉన్నట్టే’ నవ్వాను.
అతడు విచిత్రంగా చూసాడు.
‘సరే. నీ మాటే వింటాను. ఒక్క నిమిషం’ అంటూ మా టేబుల్ వైపు వెళ్లాను. యువ జంట అక్కడే వుంది. ఎవరూ లేరు.
నా కళ్ళు హోటల్ అంతా పరికిస్తున్నాయి.
అనిల్ వచ్చి భుజం మీద చేయేసి పదండి బాస్ అన్నాడు.
మెలకువ వచ్చి చూస్తే గడియారం మూడు చూపెడుతోంది.
చిక్కడపల్లి ఇంట్లో వుండి నలభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఉబెర్లు ఎక్కడివి.
క్రమంగా వాస్తవం బోధపడింది.
కాకతాళీయం కావచ్చేమో కానీ ఇద్దరం కలిసి బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుని పంజాగుట్ట గలేరియా మాల్ మల్టిఫ్లెక్స్ లో అనేక సినిమాలు చూశాము. ఉబెర్లో వెళ్ళడం ఉబెర్లో రావడం.
జనవరిలో NTR కధానాయకుడు, F2, మార్చిలో మా మేనల్లుడి కొడుకు విమల్ నటించిన జెస్సీ, లక్ష్మీస్ NTR, మేలో మహర్షి, జులైలో ఓ! బేబీ, చివరిగా అదే నెల 31 న డియర్ కామ్రేడ్.
అంతే! అదే ఆఖరు. ఆగస్టు 17 న తను లేదు.
ఏ సినిమా అయినా చూసి సూపర్ అంటుంది. సినిమా ఒక్కటే తను అడిగే కోరిక. నిజానికి అది పెద్ద విషయమేమీ కాదు. కానీ నాకు బోర్. అందుకే నా ఇతర కార్యక్రమాలకు అడ్డం రాకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం నాలుగు గంటలకు వుండే సినిమాలు బుక్ చేసేవాడిని.
ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం.
జేీవితమే సినిమా అయిపోయింది.
ఇష్టం లేకపోయినా, బోరు కొట్టినా చూడక తప్పదు.


8, నవంబర్ 2019, శుక్రవారం

మూడేళ్ళ క్రితం మోడీ ప్రయోగించిన ‘బ్రహ్మ శిరోనామకాస్త్రం’


పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడేళ్ళు నిండాయి. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి మోడీ ప్రయోగించిన ఈ ‘బ్రహ్మ శిరోనామకాస్త్రం’ గురికి తగిలిందా లేక గురి తప్పిందా అనే విషయంలో ఇన్నేళ్ళుగా చర్చోప చర్చలు సాగుతూనే వున్నాయి.
మహాభారతంలో ప్రస్తావించిన ఈ అస్త్రాన్ని సర్జికల్ స్ట్రైక్ తో పోల్చవచ్చు.
నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధికి  కారణమైన కణంఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్నిపాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి అపాండవం భవతుఅంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినాబ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.
భారత ఆర్ధిక వ్యవస్థకు ఏమాత్రం విఘాతం కలుగకుండా నల్లదనం, నకిలీ కరెన్సీ, శత్రుపీడ మొదలయిన చెదపురుగులను తుదముట్టించాలని మోడీ ఈ పెద్ద నోట్ల రద్దు తలపెట్టారు. ఒక రకంగా అశ్వద్ధామ ప్రయోగించిన అస్త్రం వంటిదే.
మరి ఫలితాలు? ఇంకా ప్రశ్నార్ధకమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.  


రేడియో రోజులు – 10 – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 08-11-2019, Friday, today)

చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు  ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు, అన్నన్ని సంగతులు ఎలా గుర్తుంటాయని.' కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని. కొన్నేళ్ళ క్రితం  సర్వే వాళ్ళు వచ్చి అడిగారు,  'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ.  నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు  మిడిమిడి జ్ఞానం బాపతు.  అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే  మనలో నిండుకుని వున్న  అజ్ఞానం చాలావరకు అంధకారంలోనే కప్పబడిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర  ఖండన ముండనలు, హర్షాతిరేక  ప్రకటనలు,  ప్రగాఢ సంతాప ప్రకటనలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. ( ట్విట్టర్, ఫేస్ బుక్ ల పుణ్యమా అని ఇప్పుడిలా  పేపరాఫీసుల చుట్టూ  తిరిగే అవస్థ వారికి  తప్పింది)
వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారి వారి నొసటిరాత ప్రకారం  మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే  స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. కానీ పేరు వేరుగా వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' ఆ ఎంపీ ఈ ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డును పరికించి చూస్తే మాత్రం  అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటే ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే  ఇప్పుడు మాత్రం మాజీ.  'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు, హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో  చిన్న అక్షరాలలో ముద్రించారు. 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకు నేనే సమాధాన పడ్డాను.
అలా ఆసారి కూడా నా  అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల,  ఇదిగో ఇప్పుడిలా,  కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను.
రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన  పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి,  రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.
(ఇంకా వుంది)

7, నవంబర్ 2019, గురువారం

అరమరికలు లేని స్నేహం


స్నేహం అంటేనే స్వచ్చత. దాపరికం, స్వార్ధం ఇసుమంత కూడా  లేనిదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. మిగిలినవన్నీ పరిచయాలు మాత్రమే.
ఇప్పుడు మీరు చదవబోతున్న కధనంలోని పాత్రలన్నీ నిజమైనవే. కాకపొతే ఆ పాత్రలు పలికిన పలుకులన్నీ ఒక ప్రత్యక్ష సాక్షి నోట విన్నవే.
కాకినాడ జే.ఎన్.టీ.యూ. చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. అక్కడ విద్యాభ్యాసం చేసి జీవితాల్లో స్థిరపడిన విద్యార్ధులు ఒక సాంప్రదాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారుట. అదేమిటంటే, ఒక బ్యాచ్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులు  పాతికేళ్ళ తర్వాత అదే కళాశాలలో కలుస్తారు. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళు ప్రతియేటా అదేచోట కలుస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుని రెండు మూడు రోజులు సరదాగా గడపడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని విన్నాను. ఇది నిజమైతే నిజంగా గొప్ప సంగతే.
ఈ ఏడాది నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాతికేళ్ళ క్రితం ఆ కాలేజీలో చదువుకున్న ఓ  బ్యాచ్ కి చెందిన మొత్తం 180 మందిలో 130 మంది  హాజరయ్యారు. వారిలో ఇద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సీనియర్  పోలీసు అధికారి వున్నారు. అమెరికా నుంచి వచ్చిన ముప్పయ్ మంది దంపతయుక్తంగా పాల్గొన్నారు. కొందరు కళాశాల రోజుల్లోనే ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినవారు కూడా వున్నారు. 
రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ మధ్యంతర కాలంలో ఎవరికి వారు జీవితాల్లో వారు స్థిరపడ్డారు. కళాశాలలో కలిసి చదువుకున్న తమ సహాధ్యాయే తమకు  పై అధికారిగా వచ్చిన ఉద్యోగులు కూడా కొందరు  వున్నారు. ఆఫీసులో సార్ సార్ అనే మర్యాద పిలుపులు కాస్తా  ఈ సమ్మేళనంలో పాత  రోజుల్లోమాదిరిగా షరామామూలు  అరేయ్ ఒరేయ్ కి మారిపోయాయి.
‘ఐ.ఏ.ఎస్. కాగానే మమ్మల్ని మరచిపోయావు. నేను పనిచేస్తున్న డిపార్ట్ మెంటుకి నువ్వే హెడ్డువి. ఏదో ఫ్రెండువి  కదా కలవాలని వస్తే నన్ను లోపలికే పంపలేదు.’ డివిజినల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నాడు.
‘భలేవాడివే! విజిటర్స్ స్లిప్ మీద నీ పేరు చూసి నా పియ్యేను పంపించి మరీ పిలిపించా కదా! ఇలా నిష్టూరం ఆడితే ఎలా’ జవాబిచ్చాడు ఆ ఐ.ఏ.ఎస్.
పోలీసు అధికారి అన్నాడిలా. ‘ఈ ఉద్యోగం పుణ్యమా అని నాకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడూ నీడలా స్టెన్ గన్లు పట్టుకుని సెక్యూరిటీ గార్డులు. దేశ సరిహద్దుల్లో వున్నప్పుడు  ఎలాగూ తప్పదు. నేను చదువుకున్న చోటు ఇది. ఇక్కడన్నా నన్ను వదిలిపెట్టండిరా బాబూ అని బతిమిలాడుకుని వాళ్ళని మెయిన గేటు దగ్గరే వదిలి వచ్చాను’
అందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఆ నవ్వులు అలా ఓ మూడు రోజుల పాటు పువ్వులు పూస్తూనే వున్నాయి. ఒకరు పెద్దా అని లేదు, ఒకరు చిన్నా అనిలేదు. అందరూ టైం కాప్స్యూల్ లో మాదిరిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళారు. కేరింతలతో, కాలేజీ కబుర్లతో సాగిపోతున్న ఆ ధారా ప్రవాహం ఎవరో అన్న ఒక్క మాటతో ఆగిపోయింది.
‘అన్నట్టు గణేష్ ఏడీ?’
పొట్టిగా వుండే గణేష్ కూడా వారందరితో పాటే అదే కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. పెళ్లయింది. ఒక పిల్లాడు. ఏమైందో తెలియదు ఏదో అస్వస్తతకు గురై హఠాత్తుగా కన్నుమూశాడు. అమెరికాలోనే ఉంటున్న కళాశాల సహాధ్యాయులు  గణేష్ భార్యను, పిల్లల్ని  పట్టుబట్టి కాకినాడ తీసుకువచ్చారు. గణేష్ లేడన్న విషయం తెలిసి స్నేహితులందరూ ఎంతో బాధ పడ్డారు.
గణేష్ కొడుకు కల్పించుకుని అన్నాడు.
‘మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే మా నాన్న ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది. ఇక్కడ అరమరికలు లేని మీ స్నేహం గమనించిన తర్వాత చనిపోయి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తోంది’
ఈ మాటలతో అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.                  

రేడియో రోజులు – 9 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA telugu daily on 07-11-2019, Thursday)
రేడియో  విలేకరిగా పనిచేసిన రోజుల్లో ఒక్క పాలక పక్ష నేతలతోనే కాకుండా ప్రతిపక్షంలో వున్న నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి.
నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరినప్పుడు నాకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. 1978 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ నాయకులు మరో ఇద్దరితో కూడా నాకు బాగా పరిచయం వుండేది. ఒకరు శ్రీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాగా రెండో నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు. పైగా ఆ రోజుల్లో  వీరిద్దరూ జిగ్రీ దోస్తులు. ఒక మంచం, ఒక కంచం అంటారే అలా అంత స్నేహం వారి మధ్య. నాలాగే ఆ కాలంలో పనిచేసిన విలేకరులందరికీ ఈ విషయం తెలుసు.
ఆ రోజుల్లో సీనియర్ పాత్రికేయులందరూ వయసులో, అనుభవంలో చాలా పెద్ద వారు. వాళ్ళ ఆహార్యం కూడా పెద్దరికంగా వుండేది. కొందరు పంచెలు, లాల్చీలు ధరిస్తే కొందరు సూటూ బూటుతో కనబడేవారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరేమో యువకులు.  బహుశా అదొక కారణం అయుంటుంది ప్యాంటూ చొక్కా వేసుకుని తిరుగుతున్న నాలాంటి విలేకరులతో మాటామంతీ కలపడానికి.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ను అనుదినం దుమ్మెత్తిపోస్తూ వున్నప్పుడు కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోలేదు. పైగా అవకాశం లభిస్తే మామగారి (ఎన్టీఆర్) పైనే పోటీ చేస్తానని విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఆయన చాంబర్ నుంచే నేను రేడియోకి ఫోన్ చేసి చెప్పడం, అది వెనువెంటనే వార్తల్లో రావడం జరిగిగింది. ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకున్న కొన్నాళ్ళ వరకు వై.ఎస్. బాబుల  స్నేహం కొత్త చిగుళ్ళు వేస్తూనే వుంది. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత వారి దారులూ వేరయ్యాయి, పార్టీలూ  వేరయ్యాయి. దాంతో  సహజంగానే ఆ నాటివరకు వారి నడుమ వెల్లివిరిసిన  స్నేహం వసివాడిపోయింది. వారితో నా పరిచయం కూడా విడివిడిగా కొనసాగింది.
ఇతర పార్టీల్లో కూడా నాకు మంచి పరిచయం వున్న నాయకులు అనేకమంది వుండేవారు. ఆ పరిచయాలు మరింత బలపడడానికి కూడా ప్రధాన కారణం నాకున్న రేడియో విలేకరి అనే ట్యాగ్ లైన్.
శాసనసభలో సీపీఎం నాయకుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు గారు వ్యవహరించేవారు. ఆకారంలోనూ, ఆహార్యంలోను నిజంగా పెద్దమనిషి. ఆ రోజుల్లో అంటే రేడియో ఏకచ్ఛత్రాధిపత్యం సాగిపోతున్న కాలంలో అసెంబ్లీ జరిగే రోజుల్లో ప్రతిరోజూ సభాకార్యక్రమాలపై అదే రోజు రాత్రి రేడియోలో ఒక సమీక్షాకార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. హైదరాబాదులోని పాత, కొత్త  ఎమ్మెల్యే హాస్టళ్ళలో ప్రత్యేకంగా మైకులు పెట్టి వినిపించేవాళ్ళు. అసెంబ్లీ ముగిసిన తర్వాత హాస్టళ్ళలో చాలామంది శాసన సభ్యులు, ఇతరులు గుమికూడి  ఈ కార్యక్రమం ఆసక్తిగా వినేవాళ్ళు. తమ తమ నియోజక వర్గాల సమస్యలు గురించి తాము సభలో  లేవనెత్తిన విషయాలు తమ ప్రాంతం  వారికి వెనువెంటనే తెలుస్తాయని వారి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలను రేడియోలో పనిచేసే మేము కాకుండా పత్రికలలో పనిచేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలు రిపోర్ట్ చేసే విలేకరుల చేత  రాయించేవాళ్ళం. అలా అయితే నిష్పాక్షికంగా సమీక్షించే అవకాశం ఉంటుందన్నది రేడియో అధికారుల భావన.  వాటిలో ఏదైనా తప్పులు దొర్లాయా అనేది పర్యవేక్షించడం వరకు మాత్రమే వార్తావిభాగం బాధ్యత. ఒకసారి బోడేపూడి వారు ఏదో అంశంపై సభలో మాట్లాడారు. అందుకు విరుద్ధంగా రేడియో సమీక్షలో ప్రసారం అయిందని వారికి ధర్మాగ్రహం కలిగింది. వెంటనే రేడియో స్టేషన్ అధికారులకు అసెంబ్లీ నుంచి తాఖీదు వచ్చింది. ఏదైనా తభావతు జరిగిందని స్పీకర్ భావిస్తే రేడియో స్టేషన్ డైరెక్టర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలి. (ఇప్పుడు ఈ నిబంధనలు వున్నాయో లేదో తెలియదు. వున్నా పాటిస్తున్నారో లేదో తెలియదు)
ఇది తెలియగానే నేను  అసెంబ్లీ ఆవరణలో బోడేపూడివారిని కలిసి విషయం చెప్పి పొరబాటు ఎలా జరిగిందో చెప్పాను. ఆయన సంతుష్టపడ్డారు. అంతేకాదు, తన పిర్యాదును ఉపసంహరించుకున్నట్టు స్పీకరుకు లేఖ రాసి ఆ ప్రతిని స్వయంగా తీసుకుని వచ్చి మా స్టేషన్ డైరెక్టర్ కు అందచేశారు. అది వారి మంచితనం, అది వారి హుందాతనం.
(ఇంకా వుంది)

6, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు – 8 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 06-11-2019, Wednesday, Today)

అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయిన శ్రీ భవనం వెంకట్రాం అతి సౌమ్యులు. శాసన మండలి సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా భవనంతో సన్నిహిత పరిచయంలేని విలేకరి అంటూ ఆ రోజుల్లో ఎవరూ వుండేవారు కాదు. ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలిరోజుల్లోనే ఆయన తన పేరు లోని రెడ్డి అనే రెండు అక్షరాలను తొలగించుకున్నట్టు అధికారికంగా ప్రకటన చేయడం విశేషం. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ ఆనాటి సీనియర్ పాత్రికేయుడు, తన స్నేహితుడు అయిన  శ్రీ నరిసెట్టి ఇన్నయ్య ఇంటికి వెళ్లి భోజనం చేయడం నాకు తెలుసు. చాలా నిరాడంబరంగా వుండేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తనకు మంత్రిగా కేటాయించిన క్వార్టర్ లోనే వుండేవారు. ఆయన్ని కలవాలంటే ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. విలేకరులకు విందు భోజనాలు ఏర్పాటుచేయడం శ్రీ వెంకట్రాం కు ఓ సరదా. ఒకసారి గండిపేటలో విందు ఏర్పాటు చేసి విలేకరులను బస్సులో తీసుకుపోయారు. కానీ ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేదు.
దానికి  కాంగ్రెస్ పార్టీలోని అంతఃకలహాలు  కావచ్చు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుంచి ఎదురవుతున్న పెను సవాలు కావచ్చు,  శ్రీ భవనం వెంకట్రాం కొద్ది కాలంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 
తరువాత ముఖ్యమంత్రి అయిన శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి చాలా కొద్ది కాలం మాత్రమే ఆ పదవిలో వున్నారు. అంటే కేవలం నాలుగు నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిపోయాయి.
శ్రీ విజయ భాస్కర రెడ్డి రూపంలోనూ, వ్యవహారంలోనూ మేఘ గంభీరుడు. నిజాయితీకి నిలువుటద్దం. కానీ ఎన్టీఆర్ వేవ్ లో ఈ మంచి లక్షణాలు ఏవీ పనిచేయలేదు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏర్పడ్డ ఏహ్యభావాన్ని ఆయన చెరిపేయలేకపోయారు. ఓ పక్క ఫలితాలు వస్తున్నాయి.  మెజారిటీ స్థానాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత కనబడుతోంది. ముఖ్యమంత్రి స్పందన కోసం విలేకరులు ఆయన అధికార నివాసానికి వెడితే ఆయన ఏ మాత్రం తొణుకూబెణుకూ లేకుండా తమ పార్టీ విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం విస్మయం అనిపించింది.
సరే! పొలోమని బేగంపేట నుంచి ఆబిడ్స్ లో ఉన్న రామారావు గారింటికి వెళ్ళాము. అక్కడ పరిస్తితి మరింత విచిత్రం అనిపించింది. తెలుగుదేశం గెలుస్తోందని ఉప్పండడంతో ఊరంతా పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటూ వుంటే ఎన్టీఆర్ మాత్రం పెందలాడే నిదురించే తన అలవాటు ప్రకారం నిద్రకు ఉపక్రమించారు.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత  శ్రీ విజయభాస్కర రెడ్డి తిరిగి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. వారం వారం హైదరాబాదు వచ్చి తమ వూరు వెడుతుండేవారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీ రాం భూపాల్ చౌదరి ఒకసారి పొద్దున్నే ఆయన దగ్గరికి వెడుతూ ఎందుకో జ్వాలాని, నన్నూ వెంటబెట్టుకు వెళ్ళారు. ఎలాగో వెళ్ళాము కనుక, అందులోను కేంద్ర మంత్రి కనుక రేడియోకి ఏదైనా వార్త ఇస్తారా అని అడిగాను. ఆయన ఏదో కేంద్ర పధకం గురించి చెప్పారు. నేను అక్కడినుంచే విజయవాడ వార్తావిభాగానికి ఫోను చేసి న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కి  చెప్పాను. ఈ వార్త ఎప్పుడు, సాయంత్రం వస్తుందా అని అడిగితే, కాదు ఇప్పుడు ఆరూ నలభయ్ అయిదు ప్రాంతీయ వార్తల్లో వస్తుందన్నాను. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటూ పనివాడ్ చేత రేడియో తెప్పించారు. మేము అక్కడ ఉండగానే వార్తలు మొదలయ్యాయి. మొదటి  హెడ్ లైన్ ఆ వార్తతోనే మొదలయింది. ఆయన ఆసక్తిగా విని థాంక్స్ చెప్పడం సంతోషం అనిపించింది.
(ఇంకా వుంది)

5, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 7 - భండారు శ్రీనివాస రావు

(Published in SURYA telugu daily on 05-11-2019, Tuesday)

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది!  మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి,  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే,  విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.  ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో,  ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.
ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.
శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.
 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల, అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన, అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.
ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.
నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

(ఇంకా వుంది)