21, నవంబర్ 2014, శుక్రవారం

తల్వార్


తల్వార్ అంటే కత్తి. కానీ ఈ ఆర్కే తల్వార్ కత్తిలాంటి మనిషి. అయితే ఈయన 'మాటల్లో మల్లెపూవు, చేతల్లో గులాబీ ముల్లు'  

(Late Shri R.K.Talwar)

చిన్న వయస్సులో స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియాలో అతి చిన్న ఉద్యోగంలో చేరారు.  మామూలుగా ప్రతి మూడేళ్ళకోసారి, అదీ ప్రతిభ ఆధారంగా వచ్చే ప్రమోషన్ ఈయన గారికి ఏడాది రెండేళ్ళు తిరక్కుండానే వచ్చేది. అది ఆయన ప్రతిభ కాదు,  పై వాళ్ళని పట్టుకునే చాకచక్యం అని ఎకసెక్కం చేసిన వాళ్ళు లేకపోలేదు. ఐతే అలాటి  'పట్టు' పనిచేసేది ఒకసారో రెండు సార్లో. కానీ తల్వార్ మహాశయులు అలా అలా ప్రతియేటా  నిచ్చెన  మెట్లెక్కి పోయి యాభయ్ రెండేళ్ళ వయస్సులోనే  స్టేట్ బ్యాంక్ చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. ఇక ఎక్కడానికి మెట్లు లేక అక్కడే ఆగిపోయారు. కానీ అసలు కధ అక్కడే మొదలయింది.
అప్పుడు నడుస్తున్నది ఎమర్జెన్సీ రోజులు.
ఒక రోజు ఓ పెద్దాయన అనిపించుకుంటున్న ఓ చిన్నాయన  నుంచి ఈ పెద్దాయనకు పిలుపు వచ్చింది. ఖుద్దున వచ్చి తన దగ్గర హాజరీ వేయించుకోమని విన్నపం లాంటి ఆదేశం. ఆరోజుల్లో ఆయన నుంచి పిలుపు వచ్చిందంటే మహా మహా  మంత్రులే రెక్కలు కట్టుకుని క్షణాల్లో వాలియేవారు. కానీ ఆయన పిలిచింది తల్వార్ ని. ఆయన రూటే సపరేటు. ఆయన ఆలోచనలే వేరు.  
'తనను పిలిపించుకోవాల్సింది అదీ అవసరం వుంటే ఆర్ధిక మంత్రి. తను వెళ్ళాలన్నా వెళ్ళేది ఆర్ధిక మంత్రి దగ్గరకు. అదీ ఏదైనా జరూరు పనివుంటేనే. మధ్యలో ఈ కుర్రకారు చిలిపి పిలుపులు లెక్కచేయాల్సిన పని లేదన్న'ది తల్వార్ గారి లెక్క.
ఈ లెక్కలు, అదీ  అసలు లెక్కలే తెలియని ఆ యువనేతకు రుచించలేదు. అనుకున్న పని అనుకున్న క్షణంలో జరిగిపోవాలి. అది ఆయన నైజం.
ఫలితం. స్టేట్ బ్యాంక్ చైర్మన్  తల్వార్ గారికి తక్షణం ఉద్వాసన పలకాలని ఉత్తర్వు. యువరాజు తలచుకుంటే ఉత్తర్వులకేం కొదవు. కానీ నిబంధనలు అంటూ కొన్ని వున్నాయి కదా! స్టేట్ బ్యాంక్ చైర్మన్ ని నియమించడం వరకే ప్రభుత్వానికి అధికారం. తొలగించడానికి లేదు. అదే విషయం యువరాజావారికి మనవి చేసారు. కిం కర్తవ్యమ్?
సర్కారు లో పనిచేసేవారికి ఒకటే కర్తవ్యమ్. పై వారు చెప్పింది అక్షరాలా చేయాలి. రూల్స్ అడ్డం  వస్తాయి. రాక చస్తాయా. అవి ఉన్నదే అందుకు. అందుకేం చేసారు ? మొత్తం స్టేట్ బ్యాంక్ చట్టాన్నే సవరించారు. మూడు నెలలు నోటీసు ఇచ్చి తల్వార్ గారిని తప్పుకోమన్నారు. డానికి తల్వార్ గారు ఏం చేసారు?
ఇప్పటి అధికారుల మాదిరిగా కోర్టుకెక్కలేదు. పత్రికలను పట్టుకోలేదు. ఉద్యోగం వొదిలేసిన తరువాత కూడా ఆయనకు నిబంధనల ప్రకారం లభించాల్సిన సౌకర్యాలను గురించి కూడా లిప్త కాలం ఆలోచించలేదు. నిజానికి మరో రెండు నెలలు అధికారిక నివాసంలో ఉండవచ్చు. మిగిలిన సదుపాయాలను కూడా అనుభవించవచ్చు. కానీ ఆయన ఎవ్వరు? తల్వార్!
అంచేతే, ఉద్యోగం పోయిన తరువాత వెంటనే తన కుటుంబంతో సహా పాండిచేరి వెళ్ళిపోయారు.  తను నమ్మిన అరబిందో మార్గాన్నే నమ్ముకున్నారు. అక్కడ ఓ రెండు గదుల అపార్ట్ మెంటులో లో మరణించేవరకు తన శేష జీవితాన్ని హాయిగా హుందాగా గడిపారు. దటీజ్ తల్వార్.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై కేంద్రంగా స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా తమిళ నాడుతో పాటు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల  వ్యవహారాలు చూసున్నప్పుడు మర్యాదపూర్వకంగా పాండిచేరి వెళ్లి తన మాజీ బాసును కలుసుకున్నారు. ఆయన భార్య స్వయంగా కలిపి తీసుకువచ్చిన టీ తాగారు.
స్టేట్  బ్యాంక్ చైర్మన్ గా అనుభవంలోకి వచ్చే వైభోగాలు తెల్సిన వాడు కనుక తల్వార్ మహాశయుల నిరాడంబర జీవితాన్ని చూసి చలించి పోయారు.
ఇలాటి వారు ఇంకా వున్నారా!
అంటే ఒకే సమాధానం. అలాటి వారు ఉండబట్టే మనం ఇంకా ఈ కర్మ భూమిలో జీవించగలుగుతున్నాం.
అది మనం చేసుకున్న అదృష్టం. అవునంటారా!

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఎలా జరగాలి?

(Published in 'SURYA' Daily in its Edit Page on 23-11-2014, SUNDAY)


రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదని నానుడి.  అభివృద్ధి అనేది ఒక క్రమపధ్ధతి ప్రకారం దశలవారీగా జరగాలంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి సరికొత్త రాజధాని నిర్మించే పనిలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది.  దార్శనికుడయిన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. దానికి తోడు   కొత్త రాజధాని నిర్మాణం అనేది  ఆయనకు మాత్రమే లభించిన అపూర్వ సువర్ణావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఎందుకో ఏమిటో కారణాలు ఆయనకే తెలియాలి. రాజధాని  ప్రదేశం ఎంపిక  విషయంలోనిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి  ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతిపక్షాలను సంప్రదించకుండాస్వపక్షంలో కూడా కొందరినే విశ్వాసంలోకి తీసుకుంటూ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జనబాహుళ్యంలో వుంది. రికార్డు స్థాయిలో అపార పరిపాలనానుభవం  కలిగిన చంద్రబాబుకు ఈ వాస్తవం తెలియదని అనుకోలేము. ప్రతి విషయంలో ఎంతో ఆచి తూచి వ్యవహరిస్తారనే పేరున్న వ్యక్తిభవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణం వంటి ప్రాముఖ్యత కలిగిన అంశం పట్ల అనుసరిస్తున్న వైఖరిఆయన కానీఆయన తరపున మంత్రులు కానీ చేస్తున్న ప్రకటనలు మరింత  గందరగోళానికి తెర తీస్తున్నాయి.
వరుణ దేవుడి కరుణాకటాక్షాలపై ఆధారపడాల్సిన అవసరం, అగత్యం ఏమాత్రం లేకుండా  ఏటా మూడు పంటలు నిక్షేపంగా  పండే ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల భూమి సేకరించడం ఏమేరకు సబబు అనే ప్రశ్నకు సరయినసహేతుకమైన సమాధానం దొరకడం లేదు. హైదరాబాదుకు పోటీగా సైబరాబాదును అత్యంత ఆధునికంగా అనతి కాలంలో అభివృద్ధి చేసిన ఘనత తన ఖాతాలో వుందని ఆయన పదేపదే చెబుతుంటారు. అది వాస్తవం కూడా. కానీ అది ఎలా జరిగింది ? అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం  అంత రుచికరంగా ఉండకపోవచ్చు.
రాళ్ళు రప్పలు, కొండలు గుట్టలతో కూడిన ప్రదేశంలో చంద్రబాబు పూనికతోఅయన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎల్ అండ్ టీ సంస్థ తొంభయ్యవ దశకంలో  హై టెక్ సిటీ భవనాన్ని నిర్మించినప్పుడుదాన్ని చూసి  అందరూ ఔరా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. క్రమంగా అక్కడవున్న ప్రభుత్వ భూముల్ని అంతర్జాతీయ కంప్యూటర్ సంస్థలకు ఇవ్వడంతో ఆ ప్రాంతంలో ఆర్ధిక పరమైన కార్యకలాపాలు శరవేగంతో పుంజుకున్నాయి. దానితో ఆ ప్రాంతంలో అభివృద్ధి మరింత చురుగ్గా చోటు చేసుకుంది. విశాలమైన రహదారులుబహుళ జాతి సంస్థలు నిర్మించిన  బహుళ అంతస్తుల సుందర భవనాలు  ఆ ప్రాంతం శోభను ఇనుమడింపచేసాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకోసం నివాసాలు నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. భూముల రేట్లకు రెక్కలు విచ్చుకున్నాయి. 'మీరూ బాగుండాలిమేమూ బాగుండాలిఅనే తరహాలో అందరూ  ఒకరికొకరు సహకరించుకున్నారు. దేశం యావత్తు ఘనంగా చెప్పుకుంటున్న  సైబరాబాదు ఆవిధంగా  ఆవిష్కృతమైంది. ఇందులో చంద్రబాబు పేరు ప్రతి ఇటుక మీదా వుందని అంటే కాదనే వారు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. ఈ ఆధునిక రాజధాని నిర్మాణం కోసం  ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అయ్యాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో జరగబోతున్నది ఏమిటిఇక్కడ జరిగిన దానికిఅక్కడ జరగబోయేదానికీ ఏమైనా పోలిక ఉందా పాలకులే ఆలోచించుకోవాలి. అక్కడ ప్రైవేటు భూములుఅవీ ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇదీ రెండింటి నడుమ ప్రధానమైన తేడా!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ఉభయ రాష్ట్రాల మీడియాలో ఆంద్ర ప్రదేశ్ రాజధాని గురించీఅందుకోసం సేకరించాలని అనుకుంటున్న భూములు గురించీ విస్తృత చర్చ సాగుతోంది. రాజధాని కోసం  ముప్పయ్ వేల ఎకరాల సారవంతమైన భూములు అవసరమా అని ప్రతిపక్షాలు యాగీ చేస్తుంటేపాలక పక్షం అయిన తెలుగు దేశం మాత్రం తను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికల ప్రకారమే ముందుకు సాగుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూమిని సాధ్యమైన మేరకు సమీకరణ ద్వారాతప్పనిసరి పరిస్తితుల్లో సేకరణ ద్వారా సంపాదించాలనే కృత నిశ్చయంతో వున్నట్టు కానవస్తోంది. అధికారంలో వున్న పార్టీ కాబట్టి  వ్యతిరేక ప్రచారానికి కారణం ప్రతిపక్షాలే అని సహజంగానే నెపం వారిమీద మోపే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం కూడా తన సహజరీతిలో స్పందిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని మరింత గట్టిగా అందిపుచ్చుకుని ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇది ఒక రాజకీయ క్రీడ. కానీ,   భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణ అంశాన్ని  కేవలం   రాజకీయాలకు పరిమితం చేసి చూడకూడదు.  ప్రతిపక్షాలు సరేరాజకీయం చేస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో, కనీసం వారిలో కొంతమందిలో అయినా  కానవస్తున్న వ్యతిరేకతను తక్కువగా అంచనా  వేయడం కానీవారి గోడును ఆలకించకపోవడం కానీ ప్రజాహితాన్ని కోరుకునే పాలకులు చేయాల్సిన పనికాదు.
ముందు సైబరాబాదు ఉదాహరణ ఉదహరించింది ఇందుకోసమే. అక్కడ ప్రభుత్వం  చొరవ చూపగానే ఆర్ధిక పరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొత్త నగర నిర్మాణం దానంతట అదే జరిగిపోయింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ  భూముల బదలాయింపులో సర్కారు కొంత చెడ్డ పేరు మోయాల్సివచ్చిన సందర్భాలు ఎదురయినా మొత్తం మీద  మంచి పేరు మొత్తం  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కింది. సమర్ధుడని ఆనాడు సముపార్జించుకున్న ఆ 'గుడ్ విల్ ' కారణంగానే  కొత్త రాజధాని నిర్మాణంలో ఆయన తప్పటడుగులు వేయరు అని చాలామంది నమ్మకం పెంచుకోవడానికి దోహదం చేసింది. వారే ఇప్పుడు జరుగుతున్న తతంగాలు చూసి నొచ్చుకుంటున్నారు. ఏమిటి ఇలా జరుగుతోందని బాధ పడుతున్నారు.
సమీకరణోసేకరణో మొత్తం మీద అనుకున్నమేరకు కాకపోయినా అత్యధిక విస్తీర్ణంలోనే  భూములు సర్కారుకు దఖలు పడడం ఖాయం. తరువాత ఏమిటికేంద్ర  సాయం గురించి ఎలాటి ఊసు వినరావడం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి చూస్తె 'లోటులో కొట్టుమిట్టాడుతోంది. మరి ప్రపంచం మెచ్చే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం సాగేదేలా?ఈ ప్రశ్నకు సర్కారు నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్లనే రాజధాని పేరుతొ  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోందనే నిందను ప్రభుత్వం మోయాల్సివస్తోంది. ఒకరంటున్నారని కాదు. ఒకరికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇవ్వకతప్పదు కదా! 
అందుకే ఇప్పుడయినా మించి పోయింది లేదు. ఇలాటి సమయంలో వొత్తిళ్ళు వుండడం సహజం. వాటిని ఎదుర్కోగలిగితేనే నాయకత్వ లక్షణాలు గుభాలిస్తాయి. ఘనమయిన ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన బెట్టి, సాధ్యాసాధ్యాలను మరోమారు పరిశీలించిప్రజలనుంచి అసమ్మతి  వీలయినంత తక్కువగా ఉండేలా చూసుకుంటూ మొత్తం వ్యవహారాన్ని పునః సమీక్ష చేసుకోవడం మంచిది. తీరిగ్గా విచారించడం కంటే సత్వరంగా మేలుకోవడం మేలు కదా! పై పంచ ముళ్ళ కంచెకు  చిక్కున్నప్పుడు దాన్ని సుతారంగా తిరిగి తీసుకోగలగాలి. అది చాతుర్యం అనిపించుకుంటుంది. 


పొతే, ఇలాటి సందర్భాలలలో అనుసరించాల్సిన కొన్ని విధి విధానాలు వుంటాయి. అది ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు.
ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏం చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదుపదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలువాళ్లకు వసతిగా  తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంతవారి అవసరాలు ఎలా వుంటాయివీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలిడ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలిఅసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.
ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారోహరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదువందల ఏళ్ళ చరిత్ర కలిగిన  ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబునగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను సయితం  రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ విమర్శలు వినవస్తున్నాయంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలుఅందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూభవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.
(22-11-2014)

NOTE: Courtesy Image Owner 

20, నవంబర్ 2014, గురువారం

రాజధాని నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలెవ్వరు?



ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏ చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదు, పదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలు, వాళ్లకు వసతిగా ఉండేలా తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంత? వారి అవసరాలు ఎలా వుంటాయి? వీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలి? అసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.



ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారో, హరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదు, వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబు నగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు అనే వాస్తవం తెలుసుకుంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలు, అందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూ,  భవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.

NOTE: Courtesy Image Owner
   

మౌంట్ అబూ - పదేళ్ళ కిందటి జ్ఞాపకాలు




2003 లో ఒక రోజు.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము. నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్ పై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ కుమారీల ప్రధాన కార్య స్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పౌరాణిక సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మ కుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమంది జర్నలిష్టులు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందం లో వున్నాము. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.


శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ లో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించని స్తితి. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది. కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరుచెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడి కంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి. గురు శిఖరానికి వెళ్ళే దారిలో పడి పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళూ మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది.అక్కడ మాకు హైదరాబాదు
నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు. కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత పని పట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మ కుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి డాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి.మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మ బంధాలలో చిక్కుపోయిన ఆత్మ – తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో – ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే – నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మ కుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాదునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
(రెండువేల మూడులో సతీ సమేతంగా చేసిన మౌంట్ అబూ యాత్ర గురించి మనసు పొరల్లో మరగునపడిన జ్ఞాపకాల ఆధారంగా - భండారు శ్రీనివాసరావు)
Be firm when authority is required, but be gentle and sweet when administering authority- Brahmakumaries

ఇదే తేలిక

  
చిదంబర స్వామి  చెన్నై సముద్ర తీరంలో ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ వుండగా హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని విలాసంగా అన్నాడు.
చిదంబరస్వామికి ముందు నోట మాట రాలేదు. తరువాత తెలివి తెచ్చుకుని  'స్వామీ! ఇక్కడ నుంచి నేరుగా సముద్రం మీద శ్రీలంకకు వంతెన నిర్మిస్తే ప్రజలకు ఎంతో సదుపాయంగా వుంటుంది. దయచేసి నలుగురికీ ఉపయోగపడే ఆ వరం ప్రసాదించు' అన్నాడు.
దేవుడు మరింత విలాసంగా నవ్వుతూ అన్నాడు.
'నేనేదో నీ భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే నువ్వేమో జనాలు వాళ్ళ  అవసరాలు అంటూ ఏవేవో సాధ్యం కాని కోరిక కోరుతున్నావు. మళ్ళీ అడుగుతున్నాను. నీకేదయినా పనికొచ్చే విషయం వుంటే అడుగు. తీర్చేసి వెడతాను'
'అలా అయితే అల్లాగే అడుగుతాను. నాకు పెళ్ళయి పదేళ్ళవుతోంది. నా భార్య మనసు ఇంతవరకు అర్ధం కాలేదు. ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా?'
దేవుడి మోహంలో నవ్వు మాయమయింది.
'ఇందాక ఏదో శ్రీ లంకా, వంతెన అంటున్నావు. ఉత్త రోడ్డు వంతెన చాలా లేక దానికి రైలు వంతెన కూడా వుంటే బాగుంటుందా చప్పున చెప్పు'



(సురేష్ బాబు కొల్లూరు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner)

అలవాటులో పొరబాటు

వార్త : హైదరాబాదు కేబీఆర్ పార్కులో కాల్పులు
వ్యాఖ్య : అమ్మయ్య! కాల్చింది పోలీసు కనుక సరిపోయింది. అలవాటుగా గురి తప్పి వుంటుంది.


19, నవంబర్ 2014, బుధవారం

మీ ఆడగుర్రం ఫోను చేసింది



ఏకాంబరం ఉదయం లేచి వరండాలో పేపరు చదువుకుంటున్నాడు.  ఇంతలో భార్య సూరేకాంతం అప్పడాల కర్రతో ఏకాంబరం మాడుపై ఒక్కటిచ్చింది. ఏకాంబరం కుయ్యో మొర్రో అంటూ మొత్తుకున్నాడు. మొత్తుకోవడం అయిపోయిన తరువాత ఎందుకలా కొట్టావ్ అని అడిగాడు.
'ఎందుకా' సూరేకాంతం చెప్పింది.       
'మీ ప్యాంటు జేబూలో కల్యాణి అని రాసిన చిట్టీ వుంది. ఎవత్తది ముందా సంగతి చెప్పండి'
ఏకాంబరానికి నిలువు గుడ్లు పడ్డాయి. కానీ వెంటనే తమాయించుకున్నాడు.
'ఓస్ ఆ కళ్యాణా! అది రేసు గుర్రం. మొన్న నా ఫ్రెండు గుర్నాధం కల్యాణి మీద పందెం కాయమని గుర్తుగా రాసిచ్చాడు'
అది విని సూరేకాంతం నొచ్చుకుంది. మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని లేచి వెళ్లి ఇంత వెన్నపూస తెచ్చి ఏకాంబరం మాడుకు రాసింది.
వారం తిరిగిందో లేదో ఏకాంబరం మాడు మళ్ళీ పగిలింది. ఈసారి సూరేకాంతం అప్పడాలకర్ర కాకుండా ఇనుప గరిటె తిరగేసి కొట్టింది. ఆ దెబ్బకు ఏకాంబరం మూర్చపోయాడు. తేరుకున్న తరువాత షరామామూలుగా అడిగాడు భార్యని, ఈసారి కొట్టడానికి కారణం ఏమిటని.
భార్య చెప్పిన జవాబు విని ఏకాంబరం మళ్ళీ మూర్చపోయాడు.
'మీ కల్యాణి - అదే మీ ఆడగుర్రం - ఇందాక మీ కోసం ఫోను చేసింది'

(కొల్లూరు సురేష్ బాబు గారి ఇంగ్లీష్ పోస్ట్ కి స్వేచ్చానువాదం)

NOTE : Courtesy Image Owner