19, నవంబర్ 2014, బుధవారం

పార్టీ ఫిరాయింపులు ఎవరి పుణ్యం? ఎవరికి శాపం?

(Published in 'SURYA' telugu daily in its Edit page on 20-11-2014, Thursday)

పార్టీ ఫిరాయింపుల పర్వం తెలంగాణా అసెంబ్లీని కుదిపివేస్తోంది. తమ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన ఈ అంశాన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సభనుంచి  వరుస సస్పెన్షన్ లకు  గురయిన కాంగ్రెస్ సభ్యులు ఏకంగా గవర్నర్ కే పిర్యాదు చేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, టీ.ఆర్.ఎస్. దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలనీ కోరారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును  అనర్హుడిగా ప్రకటించి  తక్షణం ఆయన్ని ఆ పదవినుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసారు.  
పార్టీ ఫిరాయింపులను దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లుతున్న తెలంగాణా కాంగ్రెస్ కోరుతున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
నిజమే. ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలం లేకుండా నిర్వీర్యం చేస్తోంది.  
గతంలో ఎన్నికలకు ముందూ, లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి పరిస్తితులకు  అనుగుణంగా ఇప్పుడవి నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి వీలు కల్పిస్తోంది.
తెలంగాణా ప్రాంతానికి సంబంధించి ఫిరాయింపుల తాకిడికి ఎక్కువగా నష్టపోయింది తెలుగు దేశం పార్టీ. 'ఇక తెలంగాణాలో టీడీపీకి భవిష్యత్తు లేద'ని అధికారపక్షం అయిన టీ.ఆర్.ఎస్. నాయకులు చేసిన,  చేస్తున్న ప్రచారానికి భయపడో, లేదా తమ భవిష్యత్తును మరింత ఖచ్చితంగా చెప్పాలంటే వర్తమానాన్ని  పదిలం చేసుకోవాలనే తాపత్రయంతోనో కొందరు టీడీపీ నాయకులు పార్టీని విడిచిపెట్టి టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. మరికొంతమంది తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఈ బాటలోనే వున్నారని ప్రచారం సాగుతోంది. అధికారంలో వున్నన్నాళ్ళు  పార్టీని అంటిపెట్టుకుని  వుండి, అన్ని రకాల పదవులను, వాటి తాలూకు వైభోగాలను  అనుభవించి, తీరా  అధికారానికి దూరం కాగానే పార్టీని విడిచిపెట్టి  వెళ్ళడం కేవలం స్వార్ధం కోసమే అని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలకు ప్రజల్లో ఆదరణ దొరకకపోవడానికి కారణం  కూడా గతంలో వారు అనుసరించిన ఇటువంటి  విధానాలే. గత అయిదేళ్ళ కాలంలో ఇలాటి సందర్భాలు అనేకం అందరికీ అనుభవైకవేద్యం. 'వేరే పార్టీవాళ్లు తమ పార్టీలోకి వస్తే  అది తమ ఘనత అనీ, తమ  శక్తి సామర్ధ్యాలపట్ల అపార నమ్మకంతోనే  వాళ్ళు తమ పార్టీలో చేరారనీ లోగడ ఘనంగా చెప్పుకున్న విషయమే ఇప్పుడు ముందరి కాళ్ళకు బంధంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు గురవుతున్న అన్ని పార్టీలదీ ఇదే వరస. ఎందుకంటె ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. ఎవ్వరికీ పార్టీ ఫిరాయింపులనేవి అంత అంటరానివి కావు. ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ లో ఇక భవిష్యత్తు  లేదు అని నిర్ధారణ చేసుకున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరడానికి  బారులు తీరినప్పుడు, వారిని పార్టీలో చేర్చుకోవడం నీతి బాహ్యం అని భావించి తలుపులు మూసివున్నట్టయితే ఆ పార్టీకి ఇప్పుడు విమర్శించడానికి తగిన నైతిక బలం చేకూరివుండేది. ఎన్నికలు ముగిసి ప్రజలు తమకు పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు అప్పగించిన తరువాత కూడా వై.సీ.పీ. నుంచి గెలుపొందిన ఒక పార్లమెంటు సభ్యుడిని   టీడీపీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆ చర్య అనైతికం అని  అనిపించకపోవడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట, అప్పుడది రాజకీయ అవసరం. కాబట్టి జంపు జిలానీలకు పార్టీలో స్థానం కల్పించారు. ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు అందరూ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట.  అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల మాటల పట్ల  ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.  
సరే. ఇదంతా వర్తమానం. ముందు ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి గతంలోకి కొంత తొంగి చూస్తె ముందేం  చేస్తే బాగుంటుంది అన్న విషయం బోధపడే అవకాశం వుంటుంది.  
పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల  అనంతరం.  ఆ విత్తనం   యెంత బలంగా పడిందంటే  ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,  తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా  వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే ఫిరాయింపులు యెంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.
1984  డిసెంబర్  29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం   28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  వోటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. లేదా, రాష్ట్రపతి పాలన  విధించడం.  అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. అంతేకాదు, రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపులను చాలా తీవ్రంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని   52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు. ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారింది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటె ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.      
ఈ ఏడాది జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన  ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి.
ఎన్నికలకు  ముందు వివిధ పార్తీలకు  చెందిన  పందొమ్మిదిమంది సీనియర్ నాయకులు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి  వేరే పార్టీల్లో చేరిపోయి పోటీ చేసారు. వీరిలో పదహారుమంది సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆఖరు నిమిషంలో గోడ దూకాలని  తీసుకున్న వారి నిర్ణయానికి ప్రజల ఆమోదం లభించలేదు. ఫలితంగా  వోటమి చవిచూడాల్సి వచ్చింది.
టీడీపీ  అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఇరవై ఆరుమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం తీర్ధం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు, బీ ఫారాలు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టారు. అయన వ్యూహం సగం సగం  పనిచేసింది. వారిలో పదమూడుమంది గెలిచారు. మరో పదమూడుమంది పరాజయం పాలయ్యారు.
అలాగే తెలంగాణా ప్రాంతంలో టీ.ఆర్.ఎస్.  అధ్యక్షుడు కేసీయార్  సయితం ఇదే ఎత్తుగడ అనుసరించారు. ఆయన వేరే పార్టీల్లోని పదమూడుమంది సీనియర్లను పార్టీలో చేర్చుకుని ఎన్నికల  గోదాలో నిలబెట్టారు. కాకపోతే ఈ ప్రయోగం  మిశ్రమ ఫలితాలను  ఇచ్చింది. వీరిలో ఎనిమిది మంది వోడిపోగా, అయిదుగురు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సయితం ఎన్నికల  చివరి ఘడియలో ఇద్దరు సిట్టింగు ప్రత్యర్ధి  ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని  పోటీకి నిలబెట్టింది కానీ వారిరువురూ వోడిపోయారు.
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి మన దేశానికీ, మన ప్రాంతాలకు  మాత్రమే పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది. ఉదాహరణకు  నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల  పార్టీ మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో  గాలివాటం చూసుకుని ఆ పార్టీకి  రాం  రాం చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో స్టేట్  గవర్నర్ అయి,  తిరిగి  2012 అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ  గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి  ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది.  కానీ మిమికో ఈసారి రూటు మార్చి పాలకపక్షంలో దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు.

'పిల్లి  చనిపోయేలోగా ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఆంగ్లసూక్తి.  అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్  డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు  సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం  చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని, వేరే ధ్యాసలు ఏవీ  పెట్టుకోరని ఆయనకో పేరుందని అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా పదవి పోగొట్టుకోవడం,  మళ్ళీ  కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి  చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు  గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం  వైపు దూకుతుంటే పాలక పక్షానికి  చెందిన  నాయకుడు, ప్రస్తుత  పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చూడాలి ప్రజలు ఎవరి అదృష్టాన్ని  ఎలా తిరగరాస్తారో. (19-11-2014)


(కార్టూనిస్ట్ శ్రీధర్ కి కృతజ్ఞతలతో)

18, నవంబర్ 2014, మంగళవారం

పత్రికల తలరాతలు

(ఒకానొక పత్రిక ప్రచురించడానికి సంకోచించిన వ్యాసం ఏమిటని పాలా కొండల రావు గారు, జిలేబీ గారు అడిగారు. అది ఇదే)


పత్రికల తలరాతలు

పూర్వం సోవియట్ యూనియన్ కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న కాలంలో – ఇజ్వెస్తియా, ప్రావ్దా అనే రెండు రష్యన్ పత్రికలు రాజ్యం చేస్తూ వుండేవి. ఇజ్వెస్తియా ఆనాటి సోవియట్ ప్రభుత్వ అధికార పత్రిక. (ఇజ్వెస్తి అంటే ‘వార్త ’ అని అర్ధం). పొతే, ప్రావ్దా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. (ప్రావ్దా అంటే ‘నిజం’) వీటి సర్క్యులేషన్ కోట్లలో వుండేదంటే నమ్మడం కష్టం. కానీ నిజం. ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో నేను ‘రేడియో మాస్కో’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు – మాస్కోలో ప్రతి రష్యన్ పౌరుడి చేతిలో ఈ రెండింటిలో ఏదో ఒక పత్రిక విధిగా దర్శనమిచ్చేది. గోర్భచెవ్ - ‘గ్లాస్నోస్త్’ పుణ్యమా అని భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించిన రష్యన్లు – ‘ఇజ్వెస్తియా లో ప్రావ్దా లేదు – ప్రావ్దా లో ఇజ్వెస్తియా లేదు’ అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. 


ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ నడిపే పత్రికల్లో విశ్వసనీయత మాట అటుంచి – ఆ పత్రికలు వాటి కరపత్రాలుగానో, ప్రచార పత్రాలుగానో మిగిలిపోతాయి తప్ప – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల పటిష్ట పునాదులుగా పనికిరావన్న థియరీ ఒకటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండడం వల్లనే ఆకాశవాణి, దూరదర్శన్ వార్తలకు విశ్వసనీయత ప్రశ్నార్థకమయిందని చెప్పేవారు కూడా లేకపోలేదు.

ఇప్పుడు జరుగుతున్న చరిత్ర గమనిస్తుంటే – ఈ సిద్ధాంతానికి కూడా కాలం చెల్లిపోతున్నదన్న సూచనలు కానవస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలే కాదు – ప్రైవేటు రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల పరిస్తితి సయితం ఇందుకు భిన్నంగా లేదన్న భావన ఊపిరి పోసుకుంటోంది. పార్టీలనూ, ప్రభుత్వాలనూ తామే శాసించగలమన్న ధీమా ప్రబలడమే దీనికి కారణం. పైపెచ్చు, ఏదయినా విషయం ప్రజలకు చేరాలంటే ఈనాడు మీడియాను మించిన మార్గం లేకపోవడం కూడా ఈ ధీమాకు దన్ను ఇచ్చింది. అందుకే సమాజంలో మీడియా వారంటే అన్ని వర్గాల్లో అంత మన్ననా మర్యాదా. అలాగే అంత భయం బెరుకు కూడా.

గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

‘కలం కూలీ’గా తనను తాను సగర్వంగా చెప్పుకున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు జి. కృష్ణ గారన్నట్టు – ‘పత్రికల రాతలే వాటి ‘తలరాతలను’ మారుస్తాయి.
  

17, నవంబర్ 2014, సోమవారం

పత్రికాస్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు

  

అవి ఎమర్జెన్సీ రోజులు.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.



 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజాన్ని  వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేస్తున్న  నాకు, తన మాదిరిగా  వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్ఛవుందని ఒప్పుకుంటాను.

పత్రికా స్వేచ్ఛ పట్ల  అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు, నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్ఛ  గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.

ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికాస్వేచ్ఛ భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్ఛ  అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.

నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ఎడిట్చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో పత్రికా స్వేచ్చకుపెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల వెంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగా వున్నప్పుడు వారి పత్రికలలో వారి మార్గదర్సకత్వంలో   ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ఎడిటోరియల్ పాలసీఅంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికాస్వేచ్చకు  అర్ధమేముంటుంది?

నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.

అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవస్తున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.

అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు దగ్గరలో  ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి







ఆలస్యం చేస్తే 'చూడలేని' సినిమా 'పరంపర'


ఎవరో అన్నట్టు ఈరోజుల్లో చాలా సినిమాలు చూడలేనివే. కొన్ని కోట్లు పెట్టి తీస్తారు. పెద్ద యాక్టర్లు. పెద్ద పెద్ద సెట్టింగులు. ముందుగా టిక్కెట్లు కొనుక్కుని వెడితే 'ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా నాయనా' అనిపిస్తాయి. ఆ విధంగా 'చూడలేని' సినిమాలు అవి. మరికొన్ని, నిజంగా చాలా కొన్నే. వీటిని తీసేవారికీ దమ్ముండాలి. చూసేవారికీ దమ్ముండాలి. ఎవరో చెబితే పోనీ చూద్దాం అనుకుని, ఆర్చుకుని తీర్చుకుని వెళ్లేసరికి 'ఆ బొమ్మ' ఎంచక్కా ఎగిరిపోతుంది. ఆ విధంగా ఆ సినిమాలు కూడా 'చూడలేనివి'.
నిన్న ఆ రెండో బాపతు సినిమా ఒకటి చూడడం తటస్తించింది. 'చక్రవాకం' టీవీ సీరియల్ 'ఫేం' బిందు నాయుడు  గారి భర్త డాక్టర్  బాలాజీ  మొన్న ఫోన్లో మాట్లాడుతూ మాట వరసకు చెప్పినట్టు చెప్పారు,  'పరంపర అనే సినిమా వచ్చింది చూడండి' అని. 'వీలుంటే కాదు, వీలుచేసుకుని చూడండి, ఎందుకంటె ఇటువంటి సినిమాలు ఎక్కువ రోజులు ఆడవు'  అని ఆయన  చెప్పకపోయినా విషయం నాకు అర్ధం అయింది.


ఆదివారం మధ్యాహ్నం జూబిలీ క్లబ్ లో జ్వాలా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ  లంచ్. మాటల సందర్భంలో మళ్ళీ 'పరంపర' ప్రస్తావన. అది ఎక్కడ ఆడుతుందో తెలుసుకుని ఆరుగంటల ఆటకు వెళ్ళండి అని పదో నెంబరు కౌంటర్ లో నా పేరు చెప్పండి అని లంచ్ కు వచ్చిన బుంటీ చెప్పింది. 'మంచి పుస్తకాన్ని కొని చదవాలి, మంచి సినిమా టిక్కెట్టు కొని చూడాలి' అని ఈ మధ్య ఓ తిరుగులేని స్వచ్చంద  ప్రతిన చేసుకుని పాటిస్తున్న నేను,  కాస్త ముందుగానే థియేటర్ కు వెళ్లి పలానా వారు చెప్పిన పలానా కౌంటర్ దగ్గర  పలానా వారి పేరు చెబుతుండగానే కౌంటర్లోని అమ్మడు 'ఎన్ని టిక్కెట్లు' అని అడిగింది. దాంతో బోధ పడింది చూడబోతున్న సినిమా 'రెండో రకం చూడలేని' సినిమా అని.
సినిమా సంగతి ఎలా వున్నా హాలు బాగుంది. జనం అనుకున్నట్టే పలచపలచగా వున్నారు. మొదటి రోజు 'మిధునం' సినిమాకు వెళ్ళినప్పుడు ఇదే అనుభవం. చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదులో  'శంకరాభరణం' మొదటి ఆట చూసినప్పుడు కూడా ఇదే సీను.
సినిమా మొదలయింది. డైరెక్టర్ ఫోటోగ్రఫీ రంగానికి చెందిన  వ్యక్తి  అని నెట్లో చదివాను. అందుకే కాబోలు ప్రతి ఫ్రేము చాలా అందంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రీ కొడుకుల కధ. చిన్న లైనుతో కధ అల్లుకోవడం వల్ల దాన్నుంచి  దారి తప్పిపోకుండా సినిమా నడిపించారు. సినిమా ఇలా తీయాలని అనుకుని తీసినట్టు వుంది కానీ ఇలా తీస్తేనే జనం చూస్తారు అనే భావనతో తీసినట్టులేదు. అంచేత సినిమాకు డాక్యుమెంటరీ ఛాయలు అద్దుకున్నాయి. రాజీపడని ఈ తత్వం ఓ సారి సినిమాకు కీడు చేయవచ్చు, కొండొకచొ మేలూ చేయవచ్చు.
సినిమాలో ప్రధాన పాత్రధారి నరేష్. ఆయన అనగానే మనకు జంధ్యాల జ్ఞాపకం వస్తారు. నవ్వులు జ్ఞాపకం వస్తాయి. అయితే, ఇలాటి సినిమాలు తీసేవారికీ, చూసేవారికే కాదు అందులో వేషం వేసేవారికి కూడా దమ్ముండాలి. నరేష్, అయన భార్యగా నటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని  కూడా తమకు ఆ దమ్ముంది అని నిరూపించారు. మొదటి నుంచి చివరి వరకు మాసిన నెరిసిన గడ్డంతో ఒక మధ్య తరగతి మానవుడిగా, నిత్య సమస్యలతో సతమతం అయ్యే గృహస్తుగా, కోరికలకు తనకుతానే సమాధి కట్టుకుని జీవితంతో సమాధానపడే వ్యక్తిగా నరేష్ ఇందులో నటించారు. ఆ మాటకు వస్తే ఇటువంటి సినిమాల్లో నటీనటులు నటించరు. అలా అలా కధలో లీనమై జీవిస్తారు.  నరేష్, ఆమని కూడా అదేపని చేసారు.
'సినిమా అనగానే కాస్త మెలో డ్రామా వుండాలి వుండి తీరాలి' అని సినీ పండితుల ఉవాచ. కానీ దర్శకుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. తను అనుకున్నట్టు తాను  తీసుకుంటూ పోయాడు. 'నేనిలాగే తీస్తాను, చూస్తే  చూడండి లేకపోతే లేదు' అనే అనే గుండె ధైర్యం  సినిమా అంతటా నిండుగా  పరచుకుంది.' చాలా సీరియస్ సినిమారా బాబోయ్' అనే వాటిల్లో కూడా అక్కడక్కడా కొంత హాస్యం చిప్పరిల్లేలా జాగ్రత్తలు తీసుకోవడం కద్దు. కానీ ఈ సినిమా దర్శకుడు మహా మొండివాడు.  రాజీ పడే ధోరణి యెంత మాత్రం  ఎక్కడా కానరాలేదు. అందుకు చెప్పాలి ఆయనకు కంగ్రాట్స్.
పొతే, నాకు చాలా రోజులనుంచి గోదావరి జిల్లాల గ్రామీణ సౌందర్యం వీక్షించాలని కోరిక. నేను కొన్న టిక్కెటు ఖరీదు  అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే బస్సు చార్జీకంటే తక్కువ. నేత్రపర్వంగా వున్నాయి దృశ్యాలు.  అది చాలు అనిపించింది.
సినిమా చూసిన తరువాత బాగుందా లేదా అనే చర్చ ఎలాగూ వుంటుంది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు.
నాకు మాత్రం ఒకటే అనిపించింది.
'ఈ సినిమా బాగుందా లేదా అనికాదు. మూసబాణీలో కొట్టుకుపోతున్న తెలుగు చలన చిత్ర రంగాన్ని ఓ మలుపు తిప్పాలంటే ఇటువంటి సినిమాలు అడపాదడపా రావాలి. అలా రావాలంటే సకృత్తుగా వచ్చే ఇటువంటి 'పరంపర' సినిమాలను టిక్కెట్టు కొని చూసి, ఇలాటివి మరికొన్ని తీయడానికి  మరి కొంతమంది ముందుకు వచ్చేలా చేయాలి.
సినిమా చూసిన ఇంకోటి కూడా  నాకనిపించింది. నేను కొన్న నూట యాభయ్ రూపాయల టిక్కెట్టులో మొత్తం సొమ్ము ఈ సినిమా తీసిన వారికే పొతే బాగుంటుందని.
అది సాధ్యం కాని  పని. అలాగే 'పరంపర' వంటి సినిమాలు తరచుగా చూడ్డం కూడా.
దర్శకుడు మధు మహంకాళి గారికి 'హాట్స్ ఆఫ్'
కానీ ఇలాటి హాట్స్ ఆఫ్ లు, అవార్డులు 'కాసు'కు సమానం కావు కదా! 

తోక టపా: ఇందులో మా రేడియో కోణం కూడా ఒకటుంది. చిత్రంలో ఒకచోట రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఆ స్వరం ఎవ్వరిదయ్యా  అంటే,  మన ఈ ఫేస్ బుక్ ప్రపంచం మిత్రుడు, రేడియోలో ఇప్పటికీ వార్తలు చదువుతున్న పోణంగి బాలభాస్కర్ ది, వెంటనే ఫోను చేసి చెప్పాను.
  
 (17-11-2014)

16, నవంబర్ 2014, ఆదివారం

మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?



ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా  పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 
అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన అనుగ్రహ భాషణంఇది. తెలుగుదనం కోసం, అనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం.
చిత్తగించండి.



మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలు, మన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం.
పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశమే మొదటి వరసలో వుంది.
ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభం? వీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే.
ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది  కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు  ప్రచురించవన్న సంగతి అప్పుడే  అర్ధం అయింది.
మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు.
అదేమిటంటే.  విదేశీ వస్తువుల  మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై  వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము.
ఆ  మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను జీవితంలో నీ లక్ష్యం ఏమిటని. ఆ అమ్మాయి బదులిచ్చింది. 'అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన  భారత దేశంలో జీవించాలని వుంది అని.
ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత  మనందరిమీదా  లేదంటారా. ఆ కర్తవ్యం  మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
మరో విషయం. మనందరికీ  ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారు, వీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా  లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము.
ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన  జన్మ హక్కు అనుకుంటాము.
వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే.  కానీ మనమేం చేస్తున్నాము? ఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా? 
మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్! యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక.  సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడతాము. ఏ షాపింగ్ మాలుకో, రెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదా, స్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు.
లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లి, నేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని  నాకు బిల్లు పడకుండా చూడండిఅని అడిగే ధైర్యం చేయం.
వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు  మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసి, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!అంటూ హుంకరించం. లేదా నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోఅని ఆమ్యామ్యా పైసలు  చేతిలో పెట్టే తెగింపు చేయం.
అలాగే, ఆస్త్రేలియాలోనో, న్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూ, తాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం.  వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి  బిన్ లో వేసికాని రాము.
టోకియోలో  పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా ? బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమా? విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే!  కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా?
ఎందుకంటే, మనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే  కనిపెట్టి చూడాలని కోరుకుంటాం.
వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని  తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి  మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే  సిబ్బందికి కూడా  మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది.
ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి  సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని   ఆపగలవారు, అడ్డగలవారు  వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయిఅన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను  చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూఅంటూ   అని ధర్మపన్నాలు వల్లిస్తాం.
మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడం? దానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను, సమాజాన్ని  క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరు? పక్కింటివాళ్ళు, ఎదురింటివాళ్ళు, మన  కాలనీవాళ్లు, వూళ్ళో వున్న పౌరులు, లేదా  మునిసిపాలిటీ, ప్రభుత్వం, ప్రభుత్వ అధికార్లు. అంతే. మనం  కాదు. ఈ వ్యవస్తలో  మనం మాత్రం  వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారాఅని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతే, విమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని,  వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరం, ఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితే, అంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి.
ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం.

భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు  ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.  (14-08-2012)

15, నవంబర్ 2014, శనివారం

కడుపుకోత



(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా,  ఆ రంగానికి ఒకప్పుడు చెందిన మనిషిగా ఒక్కోసారి  కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. చదవం, చూడం అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. అవి ఏం రాస్తున్నాయి అనే దానికంటే వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల  నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని  పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు. నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం  ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ  కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెలుగునాట దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ  ఎదురవుతాయి.

ఎందుకంటే  అన్నం తింటున్నది గొంగట్లో కనుక.

(NOTE: Courtesy Image Owner) 

చరిత్రలో నెహ్రూ స్థానం

(Published by 'SURYA' telugu daily in its Edit page on 16-11-2014, SUNDAY)
నూటపాతికేళ్ళ క్రితం జన్మించి యాభయ్ ఏళ్ళ కిందట మరణించిన జవహర్ లాల్ నెహ్రూ గురించి  ఈనాడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు వుండి తీరాలి. గొప్ప చరిత్రకారుడు అయినప్పుడే ఇది సాధ్యం. అయితే ఇందులో విడ్డూరంగా కానవచ్చే ఒక విషయం ఏమిటంటే, నెహ్రూను ప్రత్యర్ధి కాంగ్రెస్ ఆస్తిగా పరిగణించి ఆయన్ని చరిత్రపుటల్లో నుంచి సమూలంగా తొలగించాలని పావులు కదుపుతున్న మోడీ సర్కారు కూడా ఇన్నేళ్ళ తరువాత జనం నెహ్రూను సంస్మరించుకోవడంలో పరోక్షంగా సహకరించడం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏళ్ళతరబడి ప్రధానమంత్రిగా పనిచేసి తన అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఒక సముచిత స్థానం కల్పించడంలో నెహ్రూ చేసిన కృషి జాతి స్మృతి పేటికలో ఈనాటికీ పదిలంగా వుంది. నెహ్రూ పొరబాట్లు చేసివుండవచ్చు కానీ తప్పులు చేయలేదు అని విశ్వసించే జనానికి ఈనాటికీ  కొదవలేదు.  ఆయన నూటపాతిక జయంతిని ప్రభుత్వమే స్వయంగా పూనుకుని నిర్వహించి వుంటే మోడీ సర్కారుకు మరింత వన్నె వచ్చి వుండేది అని వారు నమ్ముతున్నారు. నెహ్రూ మా పార్టీ ఆస్తి అని కాంగ్రెస్ నమ్ముతున్నట్టే మోడీ ప్రభుత్వం కూడా ఆయన్ని కాంగ్రెస్ మూల పురుషుడిగానే భావిస్తూ ఆయన స్మృతిని పరిహరించడం ద్వారా కాంగ్రెస్ మూలాలను పెళ్లగించవచ్చుననే ఉద్దేశ్యంతోనే, ఏటా నవంబర్ పదునాలుగో తేదీన సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్న చాచా నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా అధికారికంగా జరిపే పద్దతికి స్వస్తిచెప్పినట్టు భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే  మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. గతంలో వాజ్ పాయ్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన రోజుల్లో కూడా పండిత నెహ్రూ జయంతిని  యధారీతిగా సర్కారే నిర్వహించిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. అలాగే,  కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో మహా నాయకుడు, నెహ్రూ సమకాలికుడు, అన్నింటికీ మించి మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ కు చెందిన ఉక్కుమనిషి -  సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తిరిగి  తెర మీదకు తీసుకువస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. నెహ్రూను తమ సొంత ఆస్తిగా పరిగణించే విధానం ఇంకా ఆ పార్టీలో కొనసాగుతోంది. నెహ్రూ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని  ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సుకు దేశదేశాల వారిని ఆహ్వానించిన ఆ పార్టీ,  సొంత దేశపు ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీని పిలవకపోవడం దీనికి దృష్టాంతం. ఏతావాతా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల నడుమ ఇప్పటికే వున్న అనేక విభేదాంశాల జాబితాలోకి నెహ్రూ పేరు కూడా చేరింది.
నెహ్రూ ప్రధానిగా పాలించిన తొలి ఏళ్ళలో, కాంగ్రెస్ పార్టీకే చెందిన అనేకమంది నాయకుల ప్రాధాన్యతను ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఒక పధకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారనీ, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే క్రమంలో ఇది జరుగుతూ వచ్చిందనీ నమ్మేవారు ఆ పార్టీలోనే అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు.  స్వతంత్ర భారతావనికి ప్రధమ ప్రధానమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు నెహ్రూను మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉన్నప్పటికీ జవహర్ మీద గాంధీ పెంచుకున్న అవ్యాజానురాగం, పటేల్ అవకాశాలకు గండి కొట్టిందని వారి నమ్మకం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, నెహ్రూ నేతృత్వంలో పనిచేయడానికి సర్దార్ పటేల్ ఎన్నడూ విముఖత చూపలేదు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసువాది అయిన సర్దార్  పటేల్, ఉప ప్రధానిగా, హోమ్  మంత్రిగా తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. ఆనాటికి  ఇంకా సజీవంగా వున్న ప్రజాస్వామిక లక్షణాల దృష్ట్యా కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో లేదా ఇతర సందర్భాల్లో నెహ్రూ, పటేల్ ల నడుమ సాగిన వాదోపవాదాలు ఇరువురి మధ్యా సఖ్యత తక్కువ అనే సంకేతాలను ఇచ్చివుండవచ్చు. కానీ, ప్రజాస్వామిక  విధానాల్లో నెహ్రూకు వున్న విశ్వాసం యెంత బలవత్తరమైనదో తెలియచెప్పే సంఘటనలు కూడా అనేకం వున్నాయి. పటేల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన అభీస్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వాటిని నెహ్రూ ఆమోదించిన తీరే ఇందుకు ఉదాహరణ.
జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో సందర్భంలో చెప్పిన ఒక ఉదంతం ఇది.


భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.  ప్రధాని నెహ్రూ పరిస్తితి కూడా అదే. అలా ఉండేదిట సర్దార్ పటేల్ వ్యవహార శైలి.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి.  స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు  రాస్తున్నారని అనుకునేవారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత ప్రపంచవ్యాప్తంగా  నూతన ఆర్దిక విధానాలు అమలుకావడం మొదలైన దరిమిలా, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం చూసాం. ధరల పెరుగుదల వంటి  రుగ్మతలు మినహా ఆర్ధిక సంస్కరణలవల్ల ఆదిలో తలెత్తిన అనేక ఆటుపోట్లను మన దేశ ఆర్ధిక వ్యవస్థ తట్టుకోగలగడానికి ప్రధాన కారణం - ప్రభుత్వ రంగ వ్యవస్థలకు శ్రీకారం చుడుతూ, మరో పక్క ప్రైవేటు రంగానికి పరిమిత ఊతం ఇస్తూ నెహ్రూ అలనాడు అనుసరించిన మిశ్రమ ఆర్ధిక విధానం. ఈ వాస్తవాన్ని ఈనాటి ఆర్ధిక నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు.
కాశ్మీర్ సమస్య, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలలో నెహ్రూ తనకుతానుగా తీసుకున్న నిర్ణయాలు దేశ శ్రేయస్సుకు విఘాతంగా పరిణమిస్తాయని నెహ్రూ రోజుల్లో కూడా బహిరంగ విమర్శలు చెలరేగాయి. అయితే జాతి జనులలో నెహ్రూకు వున్న అపార ఆకర్షణ ముందు ఈ విమర్శలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నెహ్రూ మరణించిన వెంటనే ఆసేతుహిమాచలం స్పందించిన తీరు నెహ్రూకు ప్రజల్లో వున్న ఆదరణకు అద్దం పడుతుంది.
నెహ్రూ  అనంతరం ఆయన వారసురాలయిన శ్రీమతి ఇందిర అనుసరించిన కొన్ని విధానాలు కాంగ్రెస్ పార్టీ పట్ల  ప్రజల్లో విరక్తిని  కలిగించిన మాట కూడా నిజం. అయితే అదేసమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన యుద్ధంలో  పాకిస్తాన్ పై,  పై చేయి సాధించిన నాయకురాలిగా శ్రీమతి ఇందిరా గాంధి,  చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న విషయం కూడా వాస్తవం. రాజకీయ ప్రత్యర్దులనే కాకుండా సొంత పార్టీలో ప్రత్యర్దులను సయితం ఆవిడ విడిచిపెట్టలేదు. సర్వం సహా నాయకురాలిగా రూపొందాలనే కాంక్ష చివరికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవితాన్నే బలితీసుకుంది. విచిత్రం ఏమిటంటే శ్రీమతి ఇందిరను, ఆమె విధానాలను తూర్పారబట్టిన వారు కూడా అధికార అందలం ఎక్కిన తరువాత దాన్ని నిలుపుకునే క్రమంలో వాటినే అనుసరించడం.
ప్రత్యర్ధి పార్టీలను సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనలు ఇప్పుడు మరింత వూపందుకున్నట్టుగా కానవస్తోంది. నిజంగా ఇది విచారకరం. ప్రజాస్వామ్య ప్రియులను ప్రధానంగా కలవరపరుస్తున్న  అంశం ఇదే.
రాజకీయ నేతలు రాజకీయులుగా మిగిలిపోకూడదు. రాజనీతిజ్ఞులుగా పరిణతి చెందే ప్రయత్నం చేయాలి. చరిత్ర సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ, ఎవరినో చరిత్ర గర్భంలో కలిపే యోచనలు మంచి చేయవు. చరిత్రను  తిరగరాయాలని గతంలో ఎందరో పూనుకున్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలో తలపెట్టిన  'టైం కాప్స్యూల్' వ్యవహారం ఇంకా కొందరికి గుర్తుండేవుంటుంది. కాబట్టి గమనంలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రకారులను ఎవ్వరూ తయారు చేయలేరు. చారిత్రిక పురుషులకు  చరిత్ర తనకుతానుగా తనలో స్థానం కల్పిస్తుంది. అలాగే, చరిత్ర హీనులను పనికట్టుకుని చరిత్ర నుంచి తొలగించాల్సిన అక్కర కూడా లేదు. అలాటివారు ఎవరికివారే చరిత్ర పేజీలనుంచి కనుమరుగయి పోతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. (15 - 11 - 2014)

NOTE: Courtesy Image Owner