18, జనవరి 2014, శనివారం

దడిగాడువానసిరా


సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా  మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. 

కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు,  చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్  టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు.  వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని  విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన,  వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది  వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని  భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు.  అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?'  అంటూ ఆరాలు తీసేవాడు.  ఇలా చాన్నాళ్లు  అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే చదివినవాడు గాడిదఅన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం.  కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ  - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.
తాజాతోక
చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ,  ఆ పదాలపై అన్ని స్వామ్యములు, ఈప్రజాస్వామ్యదేశంలో,   ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. – రాయని రచయిత 

ఏరీ! వారేరీ! కనరారే!


(2010 ఫిబ్రవరి తొమ్మిదో తేదీన రాసింది)

ఆ దృశ్యం చాలా అపురూపం. చూడ ముచ్చటగా వుంది. సెల్ ఫోన్లో ఫోటో తీసి శాశ్వితంగా భద్రపరచుకోవాలనిమనసులో గట్టిగా అనిపించి కూడా  కూడా సభ్యత కాదని తమాయించుకున్నవారు ఎంతోమంది.


(ఈరోజు మహానటుడు ఎన్టీయార్ వర్ధంతి)


అందులోకనబడుతున్నవారందరూ పెద్ద వాళ్లే! ఆరేడుపదుల వయస్సు పైబడ్డ వాళ్లే!

చేతికర్ర ఊతంతో కొందరు-

భార్య భుజం ఆసరాతో మరి కొందరు-

మొగుడిచేయి పట్టుకుని ఇంకొందరు-

'రంగుల' మాయా బజార్ ఆడుతున్న అదునాతన థియేటర్ కాంప్లెక్స్ లో

నెమ్మదిగా పైపైకి పాకుతున్న ఎస్కలేటర్ పై నిలుచుని వెడుతున్నదృశ్యం 'జగన్మోహనంగా' గోచరించింది.

జీవన పధంలో మూడు వంతులకు పైగా నడిచివచ్చిన ఆ ముదివగ్గులందరూ - గతంలోని మధురిమను మరోసారి మనసారా నెమరు వేసుకోవాలని వచ్చిన వారిలా కానవచ్చారు.

వీళ్ళల్లో కొందరయినా- .

బళ్ళు కట్టుకుని పోరుగునవున్న బస్తీకి పోయి - మూడు నాలుగు ఇంటర్వెల్స్ తో టూరింగ్ టాకీస్ లో ఆ సినిమా చూసివుంటారు.

లేదా సినిమా చూడమని అమ్మా నాన్నా ఇచ్చిన అర్ధ రూపాయిలో ఒక బేడానో, పావులానో పెట్టి ముంతకింద పప్పుకొనుక్కొని, గోలీ సోడా తాగి నేల టిక్కెట్టుతో సరిపెట్టుకున్న వాళ్ళుంటారు.

బెజవాడ దుర్గా కళా మందిరంలో మేడ మీద గోడను ఆనుకుని నిర్మించిన పరిమిత సీట్ల చిన్న బాల్కానీలో దర్జాగా కూర్చుని చూసినవాళ్ళు వుండివుంటారు.

మొదటిసారి వచ్చినప్పుడు, రావడం ఆలస్యమై చిన్న శశిరేఖమ్మ పాట చూడలేకపోయినవాళ్ళు - మరునాడు ముందుగా వచ్చేసి ఆట మొదటినుంచీ చూసినవాళ్ళు వుండేవుంటారు.

సినిమాలు ఇలా కూడా తీస్తారా అని బోలెడు బోలెడు ఆశ్చర్య పోతూ మళ్ళీ మళ్ళీ చూసినవాళ్ళు తప్పకుండా వుంటారు.

అందుకే ఈ రోజున ఆ సినిమా మళ్ళీ చూస్తూ ఆ నాటి సంగతులను గుర్తుకు తెచ్చుకునే వుంటారు.

పెద్ద తెరపై, స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం తో, సినిమాస్కోప్ లో 'విజయా వారి' హనుమ కేతనం హోరున ఎగురుతుంటే కళ్ళార్పకుండా ఒక పక్క చూస్తూనే మరో పక్క తమ మనోఫలకాలపై పాత జ్ఞాపకాలను 'రీవైండ్' చేసుకునే వుంటారు.
 అందుకే అంత నిశ్శబ్దంగా వున్న హాలులో అన్ని గుసగుసలు. అన్ని ధ్వనులు చెలరేగుతున్న థియేటర్ లో ముందుకు ముందే వినబడుతున్న డైలాగులు. నటులు నోరు తెరవకముందే వాళ్ళు ఏమంటారో ముందే ప్రేక్షకులు అనేస్తుంటారు.  చిన్న చిన్న సంభాషణలలో యెంత పెద్ద అర్ధం దాగునివుందో పక్కవారికి చెప్పేస్తుంటారు. పాటలు వస్తూనే గొంతు కలిపి పాడుతుంటారు. జరగబోయేది చెప్పేస్తుంటారు. వినే వాళ్లకి కూడా అంతా తెలిసే వింటుంటారు. ఆహా ఓహో అని ముక్తాయింపు ఇస్తుంటారు. హోల్ మొత్తం హాలంతా ఇదే తంతు. ఎవరూ విసుక్కునే వాళ్ళుండరు. ఎందుకంటె అందరిదీ ఇదే వరస.

వున్నట్టుండి, కనీకనబడకుండా, లైట్లు వెలుగుతాయి.  అప్పుడే ఇంటర్వెల్లా! అని చూస్తే- ఆ వేళ కాని వేళలో , సంధ్యాసమయంలో 'వర్కింగ్ డే' రోజునవేసిన ఆ ఆటకు హాలు మూడువంతులు నిండి పోయి వుంటుంది.   కానీ ఆ సంతోషం వెంటనే ఆవిరి అయిపోతుంది. అవును!  ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన చిన్నారులేరీ! ఏరీ! వారేరీ! కనబడరేమీ!

బహుశా పరీక్షల రోజులేమో! సినిమాకు తీసుకురావాల్సిన తలిదండ్రులకు తీరుబడి దొరకలేదేమో. మరో రోజు చూపిస్తారేమో. అని మనసు మూలల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ.

'వుయ్ డోంట్ లైక్ టెల్గూ మూవీస్ ఎటాల్!' అంటున్న ఈనాటి తెలుగు యువతరానికి- 'మనమూ గొప్ప చిత్రాలు తీయగలం - కాదు, కాదు ఎప్పుడో చిన్నప్పుడే తీసేసాం' అని చాటి చెప్పుకోవడానికైనా - ఈ సినిమా చూపిస్తే యెంత బాగుంటుందో కదా!.

(09-02-2010)


ఇద్దరు అధికారులు – ఒకే పాఠం


(నా వ్యాపకాల జ్ఞాపకాలనుంచి)
ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని నా  అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి  సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత  రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ  నరసింహన్ దంపతులు  కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. వారి డ్యూటీ వారిని చేయనీయండిఅంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు  ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది  అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా  పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లాఅన్నట్టు చిరునవ్వే సమాధానం.
ఎదిగినకొద్దీ వొదగమని ఓ సినీ కవి  చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే  యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు,  పాడు అహం ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం! (05-11-2012)  

17, జనవరి 2014, శుక్రవారం

నో మోర్ 'గ్యాస్ ట్రబుల్'

ఎన్నికల ప్రచార రుతుపవనాలు ఢిల్లీని తాకాయి. మొదటి జల్లు పడింది.



వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండుకు పెంచాల్సిందని రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన కొద్ది నిమిషాల్లోనే సంబంధిత మంత్రిగారి నుంచి తదనుగుణమైన క్యాబినెట్ నోట్ గింగిరాలు తిరుగుతూ వచ్చిందని స్క్రోలింగులు బుల్లి తెరలపై పరుగులు తీశాయి. (యువ)రాజు తలచుకుంటే సిలిండర్లకేమి కొరత? సెహభాష్.
మరి ఇది కుదరని పని అని నిన్నగాకమొన్న మంత్రిగారు చేసిన ప్రకటనలు ఏ గాలికి ఎగిరిపోయాయో!

(17-01-2014) 

ప్లస్ లూ మైనస్ లూ


“కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ రాహుల్. రాహుల్ కి ప్లస్ పాయింట్ కాంగ్రెస్
“బీజేపీకి ప్లస్ పాయింట్ మోడీ. మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ”
ఈ వ్యాఖ్యను వ్యాఖ్యన సహితంగా వివరించే వ్యవధానం నాకు లేకపోవడంతో, రాత్రి  టీవీ – 5 ‘హాట్ టాపిక్’  చర్చలో నా పక్కన కూర్చున్న బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ ఎన్.వీ.ఎస్.ఎస్. ప్రభాకర్ కాస్త అసహనంగా ఫీలయినట్టు నాకనిపించింది. ఢిల్లీ నుంచి పాల్గొంటున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు  ఆనంద్ భాస్కర్ ఏమనుకున్నారో తెలియదు.
కార్యక్రమం ముగింపులో ఈ ప్లస్ లూ, మైనస్ ల వ్యవహారం ఎత్తుకోవడంవల్లా, వివరణకు ఆట్టే అవకాశం లేకపోవడం వల్లా – ఇప్పుడు ఇక్కడిలా  కవి హృదయం ఆవిష్కరించుకోవాల్సివస్తోంది.

రానున్న లోక సభ ఎన్నికల తరువాత అటు కాంగ్రెస్ కయినా, ఇటు బీజేపీకయినా కావాల్సిన లక్కీ నెంబరు 272. జాతీయ పార్టీలుగా వుంటూ రెండు ప్రధాన రాజకీయ కూటములకు నాయకత్వం వహిస్తున్న ఈ రెండు పార్టీలకు ఆ మేజిక్ ఫిగర్ సొంతంగా సాధించుకోగలమన్న నమ్మకం ఎట్లాగో లేదు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటే కాని అది సాధ్యం కాదు. ఓటర్లపై  మోడీ మంత్రం ఎంతో కొంత పనిచేసి కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాలను బీజేపీ  గెలుచుకోగలిగినా,  ఆ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి వేరే పార్టీలకి అనేక అభ్యంతరాలు అడ్డం వస్తాయి.  మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ అని చెప్పడం అందుకే. (17-01-2014)

16, జనవరి 2014, గురువారం

వీఐపీ ఏకాదశి

ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఓ అధికారి చెప్పాడు. 'రోజూ వేలమంది వస్తుంటారు. వాళ్ళల్లో ఓ రెండువేలమందిని మా వాళ్లు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మిగిలిన వాళ్ళతో మాకు ఏం ప్రమాదం వుండదు. నాలుగు తిట్టుకుంటారు. అంతే. సర్డుకుపోతారు. మళ్ళీ వస్తారు. వీఐపీ లంటే వాళ్ళలో మీ జర్నలిష్టులు కూడా. కొండమీద గోరంత జరిగితే కొండంత చేసి రాస్తుంటారు. మళ్ళీ పాసులూ అవీ మామూలే. ఇవేవీ మాకు కొత్తకాదు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. తరువాత మరిచిపోతారు. వీఐపీ లని, మళ్ళీ వాళ్ళలో కొంతమందిని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుని దర్శనం చేసి పంపిస్తే చాలు. ఇక్కడ మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ వుండడు' ఇదీ వరస.


15, జనవరి 2014, బుధవారం

ఎవరా జర్నలిష్టు ........అని మాత్రం అడక్కండేం......


ఇది ఇప్పటి మాటకాదు. ఇది జరిగిన నాటికే ఆయన చేయి తిరిగిన పత్రికారచయిత. అంతేకాదు, బాగా ప్రాచుర్యంలో వున్న పత్రిక్కి సంపాదకుడు కూడా. అనుదినం రాసే సంపాదకీయాలతో పాటు వారం వారం కలం పేరుతొ ఆయన రాసే ప్రత్యేక వ్యాసాల పట్ల ఆకర్షితులై, అభిమానులుగా మారిన పాఠకులు ఆయనకు వేల సంఖ్యలో వుండేవారు. ఇదిలా వుంచితే....


హైదరాబాదు దూరదర్శన్ లో తెలుగు వార్తలతో పాటు వార్తాసంబంధిత కార్యక్రమాలు మొదలయిన రోజులవి. ఆ కార్యక్రమాలు పర్యవేక్షించి నిర్వహించే అధికారికి పైన పేర్కొన్న జర్నలిష్ట్ అంటే వల్లమాలిన అభిమానం. ఒక్క సారయినా ఆ జర్నలిష్టుతో ఏదో ఒక ఇంటర్వ్యూనో లేదా ఆయన పాల్గొన్న ఏదయినా కార్యక్రమాన్నో బుల్లితెరపై చూపాలన్నది ఆయన ప్రగాఢ అభిమతం. చాన్నాళ్ళకు కానీ అది నెరవేరలేదు. ఎందుకంటే ఆయనకు ఇలా టీవీల్లో కనిపించడం ఇష్టం వుండదు. మొత్తానికి డీడీ అధికారి ఎంతో బామాలి బతిమాలి ఆయన్ని స్టూడియోకు తీసుకువచ్చారు. అప్పటికింకా కలర్ టీవీ శకం మొదలు కాలేదు. స్టుడియోలో జర్నలిష్టు కూర్చున్న తరువాత లైటింగు అదీ సరిచేస్తున్న కెమెరామన్  ఆయన వేసుకొచ్చిన చొక్కా రంగు చూసి  పెదవి విరిచాడు. వెనుక వున్న బ్యాక్ గ్రౌండ్ రంగుకు ఆ చొక్కా రంగు మ్యాచ్ కావడం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే దాన్ని  సంపాదకులవారు ఏమాత్రం  లెక్కపెట్టలేదు. ఇలా టీవీ కోసం చొక్కా రంగులు, రంగుల చొక్కాలు మార్చడం తన వల్ల కాదని చెప్పి బయటకు వెళ్ళబోయారు. అదీ నిజమే. ఆయన కొన్ని దశాబ్దాలుగా తన ఆహార్యాన్ని యెంత మాత్రం మార్చుకోకుండా ఒకేరకమైన దుస్తులు ధరిస్తూ  వస్తున్నారు. ఆయనలా భీష్మించడంతో దూరదర్శన్ అధికారులే చివరకు  రాజీ పడాల్సివచ్చింది. మొత్తానికి ఏమైతేనేం ఆ కార్యక్రమం రికార్డింగు పూర్తిచేసి వూపిరిపీల్చుకున్నారు.
ఇది జరిగి ఏండ్లూపూండ్లు గడిచిపోయాయి. దూరదర్శన్ కు పోటీగా ‘ఏ టు జడ్’  ప్రైవేట్ టీవీలు రంగప్రవేశం చేశాయి. ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. కలర్ టీవీ సెట్లు ఇంటింటా కొలువు తీరాయి. ఇప్పుడదే జర్నలిష్టు వివిధ రంగుల చొక్కాలు ధరించి వేర్వేరు ఛానళ్ళలో దర్శనమిస్తున్నారు.


ఇది రాసికూడా ‘చాలాకాలమయింది’ అని గమనించ ప్రార్ధన.