10, నవంబర్ 2013, ఆదివారం

కొత్త బంగారులోకం



పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్  వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్  ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే  సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే  కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం.
టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్  అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా!
సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా   పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప్పుల మీద దొండ పాదుల పందిళ్ళ మాదిరిగా దూరదర్శన్ యాంటీనాలు దర్శనమిచ్చాయి. వెళ్ళి  టీవీ పెడితే,  పాలూ చేలూ పెరుగూ పేడా గురించి ఎవరో  చెబితే ‘మా స్టుడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారం’టూ యాంఖరమ్మ వయ్యారాలు పోతూ అంటోంది.
రోజూ పొద్దున్నే ఇంటి గుమ్మం ముందు పడివుండే పేపరు మధ్యాహ్నానికి కానీ మొహం చూపించలేదు. అప్పుడు కానీ ‘ఈ చిత్రం భళారే విచిత్రం’ కారణం అర్ధం కాలేదు. అంతరిక్షంలో ఎక్కడినుంచో దారితప్పి  భూమి వైపు అమిత వేగంతో దూసుకువస్తున్న ఓ గ్రహశకలం మరోసారి దారితప్పి రోదసిలో వున్న మన సమాచార కృత్రిమ ఉపగ్రహాన్ని డీకొన్నదట. దాంతో దేశంలో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిందట.
ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ  మోగిపోతున్నాయి.
అయ్యో ఇది కలా !

కల నిజమైతే యెంత బాగుంటుంది.  
(10-11-2013)             

9, నవంబర్ 2013, శనివారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 3



దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో,  ‘డెక్కన్ రేడియోఅనే పేరుతో  ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్  ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం  ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాటయింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు,  పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.  
మొహరం మాసంలో  రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.         

ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.

ఇదో చిత్రం



తెలతెల్లారుతున్నప్పుడు, కంటున్న  కలలకు తెరపడుతున్నప్పుడు,  కళ్ళు తెరవాలంటే తగని బద్ధకం. ఇంకాసేపు అలాగే  పడుకోవాలని, నిద్ర పోవాలని తెగ అనిపిస్తుంది. ఇక  మధ్యాహ్నం భోజనం చేసీ చేయగానే ఓ కునుకు తీయాలని చావుకోరిక పుడుతుంది. కాని  అదేవిటో చిత్రం,  రాత్రి వేళ మాత్రం అర్ధరాత్రి బాగా  పొద్దుపోయిన తరువాత కూడా నిద్రపట్టి చావదు.


8, నవంబర్ 2013, శుక్రవారం

ఏవీఎస్ అనే మూడక్షరాలా! తుత్తి అనే రెండక్షరాలా !!


మూడయితేనేం రెండయితేనేం ఈ రెండూ ఇప్పుడు లేవు. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనే నవ్వుల రేడు మనల్ని విషాదంలో ముంచేసి ఎక్కడో ఎవ్వరో ఎవరికీ తెలియనివారిని నవ్వులతో ముంచేయడం కోసం ఈ రోజు అర్జంటుగా ఎవ్వరివద్దా   సెలవు తీసుకోకుండానే వెళ్ళిపోయారు.


నేను పనిచేసిన ఆంధ్రజ్యోతిలోనే ఆయనా నా తరువాత పనిచేశారు. నేను నమ్మిన నవ్వుల్నే ఆయన అఖిలాంధ్ర లోకానికి పంచిపెట్టాడు. ప్రెస్ క్లబ్  ఫంక్షన్ కు పిలవగానే వచ్చి, పిలవకుండానే ఆపక్కనే  వున్న మా ఇంటికి వచ్చి ఆ రాత్రి నవ్వుల పువ్వులు పూయించి వెళ్లారు.
ఎవీఎస్ ఒక జర్నలిస్టు. ఒక హాస్య రచయిత. ఒక మిమిక్రీ కళాకారుడు. ఒక రాజకీయ వ్యాఖ్యాత. అన్నింటికీ మించి ఒక మానవతావాది.
మంచివాళ్ళంటే ఆ దేవుడికి ఇష్టం. ఏవీఎస్ లాటి మనుషులంటే మరీ  ఇష్టం. ఆయన చెప్పే ‘తుత్తి’ జోకులంటే మరీ మరీ ఇష్టం. అందుకే చెప్పాపెట్టకుండా ఈ పయనం.
ఆయనకు నా శ్రద్ధాంజలి. 

(08-11-2013) 

చాయ్ పట్టుకొచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య


‘అంజయ్య గారితో నా అనుభవాలు’ చదివిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ  మరో జ్ఞాపకాన్ని తట్టిలేపారు.
అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో -  రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గురించి ఆకాశవాణి  ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి  ముఖ్యమంత్రి సందేశం కూడా జోడిస్తే బాగుంటుందని రేడియో అధికారులు భావించారు.   రికార్డింగ్ యూనిట్  తీసుకుని, అప్పుడు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న గోపాలకృష్ణ, నేనూ కలసి   ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాము. మాటా మంతీ మధ్య అంజయ్యగారు ఎవర్నో పిలిచి అందరికీ చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ కబుర్లలో పడిపోయారు. రికార్డింగ్ కూడా పూర్తయింది.  కాని,  చాయ్ రాలేదని గ్రహించిన అంజయ్యగారు తానే లేచి వెళ్ళి మా అందరికీ ట్రేలో తేనీరు తెచ్చి ఇచ్చారు. ‘ఎలాటి భేషజాలు లేని ముఖ్యమంత్రిని చూడడం తన సర్వీసులో అదే మొదటిసారి’ అని గోపాలకృష్ణ పదే  పదే గుర్తుచేసుకుంటూ వుండేవారు.

(08-11-2013)

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 2


పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.
ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. ఉర్దూ లో అ ఆలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు కాని వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు. ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో జ్ఞాపకం.
కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు దక్కింది.

ఈ అనుభవాల సమాహారమే ఈ వ్యాస పరంపర. 
(08-11-2013)   

గాంధీగారి కోతులు


"చెడు కనం, చెడు వినం, చెడు మాట్లాడం" ఇది గాంధీ గారి కాలం నాటి కోతుల మాట.
కానీ ఇవి ఇప్పటి కాంగ్రెస్  కోతులు. వీటి రూటే సపరేటు.


'మాలో ఒకరు చెడు కనరు, మరొకరు చెడు వినరు, ఇంకొకరు చెడు మాట్లాడరు. అయితే నలుగురికీ తెలియని అసలు విషయం ఏమిటంటే -  మాలో చెడు కనని కోతి చెడు వింటుంది, మాట్లాడుతుంది. చెడు వినని కోతి చెడు  కంటుంది, మాట్లాడుతుంది కూడా.  చెడు  మాట్లాడని కోతి వింటుంది, కంటుంది. ఇక మేం ముగ్గురం కలసి విన్నది, కన్నది, మాట్లాడింది ఆ చెడునంతా సమానంగా పంచుకుంటాం. పంచిపెడతాం.
అసలు సిసలు కాంగ్రెస్ కోతులం అన్నమాట. నేటి కాంగ్రెస్ కు అసలైన వారసులం అన్నమాట."  (08-11-2013)

(NOTE: PHOTO CREDIT GOES TO THE OWNER)