18, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (236) : భండారు శ్రీనివాసరావు

 

నో రిగ్రెట్స్
అరవై ఏళ్ళ క్రితం సంగతి ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి.
నాకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతోందని గ్రహించిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, నాకా విషయం గ్రహింపుకి రావడానికి తనదయిన పద్దతి ఎంచుకున్నాడు. అతి సామాన్యమైన చదువు మాత్రమే చదువుకున్న మా వదినెగారి చేత వైద్య విద్వాన్ ఆయుర్వేద పరీక్షకు కట్టించి ఫస్టున పాసయ్యేలా చేసి ‘శ్రద్ధ వుంటే చాలు లక్ష్యం సాధించడానికి ఆట్టే కష్టపడనక్కరలేద’ని నాకు పరోక్షంగా చెప్పాడు.
ఆయన పద్దతి ఆయనకుంటే ఆయన తమ్ముడిని, నా పద్దతి నాకూ వుంటుంది కదా! అంచేత అవేవీ చెవికి ఎక్కించుకోకుండా నా చదువును అధ్వాన్నపు బాటలోనే సాగించాను, ‘ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను’ అనే పాట పాడుకుంటూ. పైగా ‘పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి! ఉద్యోగం వద్దు ఉపాధి కావాలి’ అనే స్లోగన్లు. అంటే పెళ్లి పేరుతొ ఖర్చులు వద్దు, ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా, నలుగురికి ఉపాధి కల్పించే సొంత ఉపాధి ఏర్పాటు చేసుకోవాలి అని ప్రతిపదార్ధం చెప్పుకోవాలి. ఉడుకు రక్తం కదా! చల్లారడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
ఫలితం ఎనభయ్యవ ఏట ఇదిగో ఇలా మిగిలాను. నో రిగ్రెట్స్! ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?
మా రెండోవాడు సంతోష్ నా బాటే పట్టాడు. అంటే నా తోవన నడిచాడు అని కాదు. తనకు తోచిన విధంగా తానూ నడిచాడు అని చెప్పడం. పుష్కరం క్రితమే నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం వదిలిపెట్టి, యేవో ‘యాప్’ లు తయారు చేసే సొంత ఉపాధి ఎంచుకుని కుస్తీ పట్టడం మొదలెట్టాడు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు సంబంధించి వాడు ఒక యాప్ తయారు చేసిన సంగతి, హిందూ పేపర్ లో వేసిన ఆ వార్త క్లిప్పింగ్ ఎవరో నాకు ఫార్వార్డ్ చేసేవరకు తెలియదు. అదే విషయంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ గారికి పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చి వచ్చిన విషయం కూడా నాకు వాడి స్నేహితుల ద్వారానే తెలిసింది. గతంలో ఎంతోమందికి నేను మాట సాయం చేసి వుంటాను. డబ్బు సాయం చేసే శక్తి ఎలాగూ లేదు. కనీసం సొంత కుమారుడి విషయంలో మాట సాయం కూడా చేయలేకపోయాను. ఒక మాట ఎవరితో అయినా చెప్పొచ్చుకదా అని మా ఆవిడ అనేది. కానీ నేను ఎప్పటిమాదిరిగానే ఉలుకు పలుకు లేకుండా వుండిపోయాను. ‘నాన్నకు చెప్పవద్దమ్మా! నా తిప్పలు ఏవో నేను పడతాను’ అనే వాడని తర్వాత ఎప్పుడో తెలిసింది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....
మా అన్నయ్య కష్టజీవి. తాను కష్టపడ్డాడు. ఇంట్లోవాళ్ళని మరీ సుఖాల పల్లకీలో ఊరేగించక పోయినా కష్టాల పాలు చేయలేదు.
ఇక నా తరం. నేను కష్టపడలేదు, అలా అని మరీ సుఖపడ్డదీలేదు. మా ఇంట్లోవాళ్ళని మరీ కష్టపెట్టలేదు. అలా అని బాగా సుఖపెట్టిందీ లేదు. సో సో.... అందుకే మరోసారి, నో రిగ్రెట్స్.
ఇక మా వాడిది, మరీ కష్టపడకుండా బాగా సుఖపడాలని, తమ వారిని మరింత సుఖపెట్టాలని కోరుకునే తరం.
ముందే చెప్పాకదా!
మా వాడిది కూడా నా టైపే అని. బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నాలు చేయడం గురించి నాతో సహా ఇంట్లో బయటా జనాలు గొణుక్కోవడం గమనించినట్టున్నాడు. ఆరేళ్ల క్రితం ఒక రోజు తనకు వచ్చిన ఓ మెయిల్ ని నాకు ఫార్వార్డ్ చేసాడు. బెంగళూరులోని DEL (EMC) వాళ్ళు పంపిన ఆఫర్ లెటర్ అది. కాంపెంసేషన్ బ్రహ్మాండంగా వుంది.
ఎప్పుడు చేరాలి అంటే ఎందుకు చేరాలి అనే విధంగా జవాబు. ఈ పోటీ యుగంలో ఇంటర్వ్యూలకు వెడితే ఉద్యోగం వస్తుందా రాదా అనే సందేహాలు ఉన్న నా బోటివాళ్ళ అనుమానాలు తీర్చడానికి ఒక టెస్ట్ కింద ఈ ప్రయత్నం చేశానని వివరణ.
ఏం జరిగినా, అసలు ఏం జరగకున్నా నో రిగ్రెట్స్!
ఎందుకంటే పెద్దగా కష్టపడకుండా, పెద్ద పెద్ద ఆశలు లేకుండా బతుకు బండి నడిపే జీవితం నాది.
చివరికి మా వాడు ఒక మంచి ఉద్యోగంలోనే చేరాడు. ఇష్టంలేని ఉద్యోగం ఎందుకు అని పైవాడు అనుకున్నాడేమో, కొద్ది నెలలు కూడా ఉద్యోగ వైభవం అనుభవించకుండా ఆ పైవాడి దగ్గరికే వెళ్ళిపోయాడు.
కింది ఫోటోలు:
మా వాడు సంతోష్,
హిందూ పేపరు క్లిప్పింగ్






(ఇంకావుంది)

16, అక్టోబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (235) : భండారు శ్రీనివాసరావు

 

సభకు నమస్కారం
నేను మాటకారిని కావచ్చేమో కానీ వక్తను కాను.
హెచ్ ఎం టీ వీ వాళ్ళు, చాలా ఏళ్ళ క్రితం యువతలో ప్రసంగ పాటవాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో వక్త అనే పేరుతో అనుకుంటా, ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ, అందుకోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేవారు. ఆ క్రమంలో ఒక రోజు నన్ను ఆ శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించమని ఆహ్వానించారు. బహుశా టీవీ చర్చల్లో నా విశ్లేషణలను చూసి నన్ను పిలిచి వుంటారు.
మాట్లాడడం ఎలా అనే విషయంలో యువతకు అంతటి ఆసక్తి వుందని వెళ్ళేంత వరకూ నాకూ తెలియదు. అప్పుడు సమైక్య రాష్ట్రం. అనేక జిల్లాల నుంచి చాలామంది రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ మహా సమావేశంలో ప్రసంగించడం ఎట్లా అనే భయం కూడా పట్టుకుంది. మూడు నాలుగు వాక్యాల తర్వాత ఏం మాట్లాడాలో మరచిపోయే మతిమరపు నాది.
అంచేత ఒకటి రెండు ముక్కలు చెప్పి, మీరు ప్రశ్నలు అడగండి, నేను జవాబు చెబుతాను అన్నాను. ఏదైనా ఎవరైనా అడుగుతుంటే వాటికి చమత్కారంగా సమాధానం చెప్పడం నాకు వెన్నతో పెట్టిన విద్య, ఆ విధంగా ఆ పూటకు నా పని పూర్తి చేసుకుని, టీవీ వాళ్ళు కప్పిన శాలువా, ఇచ్చిన మొమెంటోతో బతుకు జీవుడా అని బయట పడ్డాను.
2005లో హైదరాబాదు దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున వీడ్కోలు ప్రసంగం చేయాల్సిన అవసరం పడింది. షరా మామూలుగా ప్రసంగ పాఠం సిద్ధం చేసుకున్నాను.
‘అందరికీ నమస్కారం...
‘జాతస్య మరణం ధృవం అన్నట్టు, సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు, 'ఈనాడు ' అనేది రాక తప్పదు.
‘నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.
‘చూస్తుండగానే రేడియోలోను, ఇక్కడా ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల, చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు. పైగా ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.
‘అసూయ తెలియని పై అధికారులు, ఆత్మీయత కనబరిచే సాటి సిబ్బంది, నిజానికి ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
‘అందుకే, అత్తలేని కోడలులాగా అందరిలోను, అందరితోను కలిసిపోయి, కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగాననే అనుకుంటున్నాను.
‘అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరినో ఒకరిని వృత్తి ధర్మంగా నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే ‘సారీ’ చెప్పేసి, మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనా వుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం, పరమార్ధం.
‘నాకు ‘సరిగా’ మాట్లాడడం రాదు. ఇది నా మాట కాదు. మా ఆవిడ ఉవాచ. ముఖ్యంగా మనసు ఆర్ద్రం అయిన ఇలాటి సందర్భాలలో.
‘అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.
‘మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట.
‘నిజమే! కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...
‘అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం’
తర్వాత, మరో పదేళ్లకు కాబోలు ఒక కళాశాల వార్షికోత్సవంలో పాల్గొనే ఒక అరడజను విశిష్ట, పరమ విశిష్ట అతిధుల జాబితాలో నన్ను చేర్చారు. రేడియోలో పనిచేశాడు కదా ఎంతో కొంత మాట్లాడకపోతాడా అనే నమ్మకంతో.
సరే! కారు పంపించారు కదా అని వెళ్లాను.
హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవం.
చాలామంది మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వచ్చింది.
‘సభకి నమస్కారం’ అంటూ నా ప్రసంగం మొదలు పెట్టాను. ప్రసంగ పాఠం చేతిలో వుంది కనుక మొత్తం మీద కధ నడిపించాను. అది ఈ విధంగా సాగింది.
‘సభకు నమస్కారం అనే ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లన్నీ వరుసగా ప్రతి వక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
‘సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడక పోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పది నిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
‘అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.
‘మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
‘పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి, మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
‘గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.
‘అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయి వుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
‘విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి.
ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అప్పుడు, అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది.
అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే, ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది.
ఇందులో ఇంత విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
‘షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు చెప్పి, యేవో కొన్ని ఉద్బోధలు చేసి వెళ్లిపోవచ్చు.
కానీ, మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.
‘చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
‘మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ నా ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
‘మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
‘ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
‘నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
‘సభకి మరో మారు నమస్కారం'
అంటూ రాసుకొచ్చిన ప్రసంగ పాఠాన్ని రేడియో వార్తల మాదిరిగా గడగడా చదివి, సభికుల హర్షధ్వానాల మద్య బయటపడ్డాను.
తోకటపా:
మరో చేదు అనుభవం చెప్పాలి.
లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో, అన్నట్టు నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నట్టు నటిస్తున్న రోజుల్లో, నా మాటలు, ముచ్చట్లు చూసిన మా లెక్చరర్లు ముచ్చట పడి, వక్తృత్వ పోటీల్లో ఏదో పొడుస్తాడు అని భ్రమ పడి, జగ్గయ్యపేటలో జరిగే అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలలో పాల్గొనడానికి నన్ను ఎంపిక చేశారు.
సరే! అప్పుడు లయోలా కాలేజీలో చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావుని తోడు తీసుకుని జగ్గయ్యపేట వెళ్లాను. పోటీలు మొదలయ్యాయి.
అణ్వస్త్రాలు అవసరమా కాదా అనేది టాపిక్.
నేను స్టేజి మీదకు వెళ్లి మైకు ముందు నిలబడ్డాను.
“సభాధ్యక్షా! సదస్యులారా!’ అని మొదలు పెట్టాను.
“ఇప్పుడు ప్రపంచ ప్రజలకి కావాల్సినవి అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు’
సమావేశంలో చప్పట్లు మోగాయి ఈ మొదటి మాటతో.
ముందే చెప్పినట్టు తర్వాత నా ప్రసంగం ఒక్క ముక్క ముందుకు సాగితే ఒట్టు.




(ఇంకావుంది)

15, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (234) : భండారు శ్రీనివాసరావు

 

అభిమానధనం
‘ఇన్నేళ్ళుగా ఇంతమంది ముఖ్యమంత్రులకు పీ ఆర్ వో గా పని చేస్తూ వచ్చారు. హైదరాబాదులో ఇల్లు ఏమైనా కట్టారా?’ అని అడిగాడు ఓ పెద్దమనిషి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారిని.
‘కట్టాను, ఈ నెల అద్దె’ మా అన్నయ్య జవాబు.
సమాచార శాఖ డైరెక్టర్, సిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేసి, రిటైర్ అయి చివరికి సొంత ఇల్లు ఏర్పరచుకోకుండానే దాటిపోయాడు.
మొన్నీమధ్య నాకూ అలాంటి ప్రశ్నే ఎదురయింది.
‘ఇంతమంది పెద్ద పెద్దవాళ్ళతో సన్నిహిత పరిచయాలు వున్నాయి, ఏమైనా పోగేసారా?’ అని.
‘అవును పోగేసాను, లెక్కపెట్టలేనంత’ నా సమాధానం.
ఆ పోగేసిన దాంట్లో కొంత మచ్చుకు చెబుతాను.
ఉష నాకు రేడియోలో సహోద్యోగి మాత్రమే కాదు. కుటుంబ స్నేహితురాలు. గురుతుల్యులైన తురగా జానకీరాణిగారి ముద్దులపట్టి. పిన్నవయసులోనే పెద్ద పెద్ద కష్టాలను భరిస్తున్న మనిషి. ఉషకు తెలిసీ తెలియని వయసులోనే తండ్రి కృష్ణమోహనరావు గారు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అండగా వుంటాడు అనుకున్న జీవనసహచరుడు అర్ధాంతరంగా ఆమె జీవితం నుంచి అదృశ్యమైపోయాడు. తండ్రి పోయినప్పటినుంచి కనురెప్పలా కనిపెట్టుకుని చూస్తూ వచ్చిన కన్నతల్లి కూడా కనుమరుగైంది.
పుట్టెడు కష్టాలను పంటిబిగువన సహిస్తూ, పెద్ద ఆరిందాలా 2019 లో నా భార్య చని పోయినప్పుడు ఉషారమణి వచ్చి నన్ను ఓదార్చింది చూడండి. అదీ నేను సంపాదించుకున్న అభిమాన ధనం.
ఉషా! నీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదమ్మా!
ఆ రోజుల్లో ఆమె నాకు రాసిన ఈ ఉత్తరం చదవండి. నేను ఎంతగా పోగేసుకున్నానో అర్ధం అవుతుంది.
"నేను మహా దుఃఖంలో ఉన్న రోజుల్లో నన్ను చూసి చాలా మంది ఆందోళన పడేవారు. నీ కళ్ళు ఖాళీగా ఉన్నాయి...నాకు భయమేస్తోంది నిన్ను చూస్తుంటే అనేవాడు ఒక ఫ్రెండ్. మనసులో వ్యాకులత physicalగా కనిపిస్తుంది అని ఎవరు చెప్పినా నాకు అప్పుడు తెలీలేదు.
.
" అలాంటి ఒక మహా దుఃఖాన్ని మళ్ళీ చూశా. అది కూడా ఎప్పుడూ చిరునవ్వు చెదరకుండా, చీకు చింతా లేకుండా...కాదు, కనిపించకుండా ... ఉండే ఒక మనిషిలో.
.
"భండారు నిర్మలగారు వెళ్లిపోయారు. వెళ్ళిపోతూ భండారు శ్రీనివాసరావు గారిని చాలా ఒంటరిని చేశారు. అసలు ఆవిడ వెళ్లిపోవాల్సిన వయసు కాదు. టైం కాదు. పధ్ధతి కాదు. కానీ, లాజిక్ అనేది లేని విషయం మృత్యువు ఒకటే అని స్వానుభవం మీద తెలుసు కనుక, బాధపడ్డా 'ఇంతే కదా జీవితం' అనుకున్నా.
.
"శ్రీనివాసరావుగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా అమ్మకి కొలీగ్. మా నాన్నగారి పేరు మీద ఆయనకి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చే గౌరవం మాకు దక్కింది. నేను కూడా ఆయనతో కలిసి రేడియోలో పని చేశాను.
.
"ఆయన అంటే నాకు గౌరవం అన్నది మామూలుగా చూపించినా, నాకు ఎంత admiration అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదు. కులాసాగా పని చేసుకోవడం, efficientగా టైం manage చేసుకోవడం, ఇంకోళ్ళ నెత్తిన pressure పెట్టకుండా సరదాగా కబుర్లు చెప్తూ పని పూర్తి చేయడం...ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. రేడియో ఒక్కటే breaking news గా ఉన్న రోజుల్లో ఆయన చేసిన రిపోర్టింగ్ ఈరోజు జర్నలిజం schoolsలో ఒక కోర్సు కావాలి. సరసంగా మాట్లాడడం, సరళంగా విషయం చక్కబెట్టడం, ఆత్మీయంగా అందరితో కలిసిపోతూనే తనదైన unique వ్యక్తిత్వం...శ్రీనివాసరావు గారు నిజంగా కోటిమందిలో ఒకరు.
.
"Smart appearance, హాయిగా నిదానంగా నడుస్తూ, కళగా కనిపించే ఆయన, అప్పుడు కలిసినప్పుడు వివర్ణంగా ఉన్నారు. భుజాలు వొంగిపోయాయి. ఏంటో దిక్కుతోచని చిన్నపిల్లాడిలా, అదే సమయంలో సడన్ గా తన వయసు గుర్తొచ్చినట్లుగా ఉన్నారు.
.
"నిర్మలకి వేరే పుట్టిల్లు లేదు, నేనే అన్నీ... అన్నారు ఆయన. దాదాపు 50 ఏళ్ళ సాంగత్యం. అసలు వాళ్లిద్దరూ వేరే ఇద్దరు వ్యక్తులంటే ఎలా నమ్మడం? ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ, వారి స్నేహం, సంసారంలో సరిగమలు... జగద్విదితమే. ఒక రకంగా చెప్పాలంటే, అలా ప్రేమ పొందుతూ, ఒంటరితనం తెలీకుండా ఆవిడ వెళ్లిపోవడం ఆవిడకి అదృష్టమే. నాకు తెలుసు.
.
"ఇవాళ నేను నీ స్థానంలో ఉన్నా, ఉషా!’ అన్నారు ఆయన. స్వరం గద్గదం అయిపోయి, కళ్ళల్లో తడితో మాట్లాడుతున్న ఆయనని చూస్తే సీతావియోగ దుఃఖం అనుభవిస్తున్న శ్రీరాముడు గుర్తొచ్చాడు.
.
"శ్రీనివాసరావుగారు నాకు అన్ని విధాలా గురుతుల్యులు. మా అమ్మా నాన్న మీద అభిమానంతో పాటు నేనంటే ఎంతో ఆత్మీయంగా నాకు ఎన్నో సార్లు life advice ఇచ్చారు.
.
"కానీ, జీవితంలో మన సర్వస్వం అనుకున్న వ్యక్తి హఠాత్తుగా విడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అన్న ఎరుకలో నేను సీనియర్ ని కనుక, ఆయనని చూస్తూ ఎంతో దుఃఖపడుతూనే, 'అయ్యో...ఇంకా జీవితం ముందుంది.. ఈయన ఎలా ఉంటారు ఆవిడ లేకుండా?' అని కళవెళ పడ్డాను.
"జీవితమే నేర్పిస్తుందిలే ఆ పాఠం కూడా. రోజుకో చాప్టర్ చొప్పున"
నిజమే ఉషా! జీవితం నేర్పుతోంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కో పాఠం నేర్చుకుంటూనే వున్నాను.
ఇలా పోగుపడుతున్న అభిమానధనాన్ని లెక్కించడానికి ఎన్ని కౌంటింగ్ మిషన్లు కావాలి?
కింది ఫోటో:
ఉషారమణి మంచి న్యూస్ రీడర్, మంచి జర్నలిస్టు, పైగా ఆంగ్లంలో సమర్దురాలయిన పత్రికా రచయిత్రి. అన్నింటికీ మించిన మరో కోణం చక్కటి ఫోటోగ్రాఫర్. రేడియో స్టేషన్ లో జరిగిన ఒకానొక కార్యక్రమంలో ఆమె నాకు తెలియకుండా తీసి పంపిన ఫొటో ఇది.



(ఇంకావుంది)

13, అక్టోబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (233) : భండారు శ్రీనివాసరావు

 ముగింపుకు ప్రారంభం

‘నాన్నా, నాకో వాగ్దానం చేయండి!

‘నాన్నా,

‘ముందుగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను,  మీరు నాకు హీరో. చిన్నప్పటి నుంచీ మీరు నాకు  ఆరాధ్యులు,  నాకు  ప్రేరణ. జీవితంలో మీరు సాధించిన ప్రతి విషయం గురించి నా స్నేహితులకు  చెప్పేటప్పుడు నాకు గర్వంగా ఉంటుంది. కుటుంబంలోనే కాకుండా, సమాజంలో కూడా మీరు సంపాదించిన ప్రేమ, గౌరవం అసమానమైనవి. మేమందరం గర్వపడే విషయాలు అవి.

‘అయితే ఒక మాట నేను చాలా రోజులుగా మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను. నా జీవితంలో చూసిన అత్యంత శక్తివంతమైన మహిళ, అంటే మీ భార్య, నా అమ్మ. ఆమె కళ్లలో కన్నీళ్లు చూడటం నాకు అసహ్యం. నేను భరించలేని విషయం. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి, పత్రిక తిరగేస్తూ వుంటే, ఆమె కంట్లో నీరు చిప్పిల్లే మాటలు మీ నోటి నుంచి వచ్చేవి కావేమో.

‘కోపంగా ఉన్నప్పుడు మనసులో లేని మాటలు కూడా బయటకు వస్తాయి. ఆ సమయంలో ఎదుటివారిని బాధ పెట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా మారిపోతుంది. నేను తెలుసుకున్న ఒక విషయం — కోపంలో చెప్పిన మాటలతో అసలు భావం వ్యక్తం కాదు. శాంతంగా మాట్లాడినప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటివారికి స్పష్టంగా చేరుతుంది. మీకు తెలియని విషయాలు ఏవో మీకు చెప్పాలని ఈ మాటలు చెప్పడం లేదు. మీరు నాకు గురువు. అనుభవం, జ్ఞానం, ఓర్పు అన్నింటా మీరే నాకంటే మిన్న.

‘నా ఉద్దేశ్యం ఒక్కటే నాన్నా!  మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదో మీరనుకున్నది కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంట్లో ఏదో ఒక వస్తువు రిపైర్ కి వస్తుంది. ఎవరో చెప్పాపెట్టకుండా అనుకోని సమయంలో వచ్చి ఏదో అడుగుతారు. ఒక్కోసారి తినే తిండిలో రుచి ఉండక పోవచ్చు. కొన్ని సందర్భాలలో అమ్మ మీకంటే భిన్నంగా ఆలోచించవచ్చు. లిఫ్ట్ పనిచేయకపోవడం, విద్యుత్ అంతరాయం, BSNL లైన్ కట్ అవడం, డ్రైవర్ ఆలస్యం, ల్యాప్టాప్ లేదా ఇంటర్నెట్ సమస్యలు, రోడ్లపై ట్రాఫిక్, ఇవన్నీ జీవితాన్ని అమాంతం మార్చి వేసేంత పెద్ద విషయాలు కావు.

‘జీవితంలో నిజంగా ముఖ్యమైంది,  మనం చేసిన తప్పును అంగీకరించి, నమ్రతతో క్షమాపణ చెప్పగల ధైర్యం కలిగి ఉండటం. అలాగే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నాకు తెలుసు,  నా కోపం వల్ల నేనే ఎన్నో తప్పులు చేశాను. నాకు అత్యంత సన్నిహితులైన వారిని  నా మాటలతో గాయ పరిచాను. ఆ బాధ ఇంకా నా మనసులో ఉంది.

‘నాన్నా,

‘ఈ లేఖ రాయడంలో నా ఉద్దేశ్యం మీకు నొప్పి కలిగించడం కాదు. నా మనసులోని భావాలను మీతో పంచుకోవడమే. మీపై ఉన్న ప్రేమ, గౌరవం ఇలాంటి చిన్న చిన్న సంఘటనల కారణంగా ఏనాటికి తగ్గదు.

జీవితాన్ని ప్రేక్షకుడిగా చూస్తేనే దాని సౌందర్యం తెలుస్తుంది. చుట్టూ జరిగే ప్రతిదీ చూడొచ్చు, కానీ మనపై ప్రభావం చూపేది ఏది అనేది మనమే నిర్ణయించుకోవాలి.

‘నా చిన్న అనుభవం నాకు చెబుతోంది. జీవితంలో ఇతరులతో మనం చేసే వాదనల్లో తొంభయ్ శాతం తేలిగ్గా తప్పించుకోవచ్చు. ఎందుకంటే చివరికి, వాదనలో ఎవరు  గెలిచినా ఓడినా, అందులో ముఖ్యంగా భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య జరిగే వాదోపవాదాల వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు.

‘నాన్నా, మీరు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నట్లే, నేను ఎప్పటికీ మీ వెనుక నిలబడుతాను. ఈ రోజు నేను ఉన్న స్థానం, నేను జీవిస్తున్న జీవితం  ఇవన్నీ మీరు ఇచ్చినవే!

‘మళ్ళీ చెబుతున్నాను. ఇక ఎప్పుడూ అమ్మకంట నీరు తిరిగేలా మీ ప్రవర్తన వుండకుండా చూసుకోండి. నేను కోరేది ఇదొక్కటే! అందరం కలిసి వీలైనంతగా అమ్మను సుఖపెడదాం. సుఖ పెట్టలేకపోయినా కనీసం ఆమె మనసుకు కష్టం కలగకుండా చూద్దాం. ఇప్పటికే తన జీవితంలో అధిక భాగం మన కోసమే కష్టపడింది. ఇక దానికి ఫుల్ స్టాప్ పెడదాం. కాదనకండి.

ఈ ఒక్క వాగ్దానం చేయండి చాలు.

మీ సంతోష్!

(2016 లో ఒకరోజు)

ఒక పదేళ్ల క్రితం సంతోష్ పుణేలో ఉద్యోగం చేస్తున్న మా రెండో కుమారుడు సంతోష్ మమ్మల్ని చూద్దామని హైదరాబాద్ వచ్చాడు. ఆ రాత్రి మా దంపతుల నడుమ ఏదో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది.

‘కోపం వచ్చినప్పుడు పది ఒంట్లు లెక్కపెట్టుకో, అసలే నీకు కోపం జాస్తి, ఎవర్ని ఎంతమాట అంటావో నీకే తెలియదు’ అనేది మా బామ్మ. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు ఒంట్లు  లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారా ఎవరైనా, అందులో  ముఖ్యంగా, కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా వంటి దూర్వాసులు. అలాగే ఆ రోజు మా ఆవిడపై మాట తూలాను, పిల్లలు ఇంట్లో వున్నారన్న సోయి కూడా లేకుండా. ఆడది ఏం చేస్తుంది. ఎదురు తిరిగి ఏమీ అనలేదు. అదే వారి బలహీనత. అదే మగవాడి బలం. కంటనీరు తుడుచుకుంటూ పిల్లలను పలకరించింది. నేను షరా మామూలే. మొండి ఘటాన్ని.  రెండు రోజులు వుందామని వచ్చిన వాళ్ళు, మర్నాడే ఈవినింగ్ ఫ్లయిట్ కు వెళ్లి పోయారు. వెడుతూ వెడుతూ నాకు రాసి పెట్టిపోయిన ఉత్తరమే మీరింత వరకు చదివింది. ఇన్నేళ్ళుగా ఈ ఉత్తరం నా వద్ద పదిలంగా వుంది. నా లోని మరో మనిషి లేచినప్పుడు, నన్ను నేను అదుపు చేసుకునే ఆయుధంగా పనికి వస్తోంది. అలాగని నేనేదో గౌతమ బుద్ధుడిగా మారిపోయాను అని కాదు. కొంతలో కొంత ప్రవర్తనను మార్చుకోవడానికి పనికి వస్తోంది. నిజానికి ఈ ఉత్తరాన్ని వాడు ఇంగ్లీష్ లో స్వదస్తూరీతో రాశాడు. దాన్ని తెనుగు చేయడానికి నేను చాలా కష్ట పడ్డాను. ఈ కాలపు పిల్లల ఇంగ్లీష్ తో నాకట్టే పరిచయం లేదు. అలాగే వాళ్లకు నా తెలుగు రాతలు అంతగా అర్ధం కావు.   

‘మీరు ఎలా జీరో అవుతారు’ అని ఈ ఎపిసోడ్స్ రాయడం మొదలు పెట్టినప్పటి నుంచీ చాలామంది అడుగుతున్న ప్రశ్న. చివర్లో చెబుతాను అని తప్పించుకుంటూ వస్తున్నాను. ఇప్పటికే 232 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా వున్నాయి. ఇంత చిన్న జీవితం, ఇంత విస్తృతమైనదా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.

ముగింపు ముందే రాయడానికి ఒక కారణం వుంది.  

ఒక వారం అయిందనుకుంటా.

తెల్లవారుఝామున నిద్రలో నేను చనిపోయాను. ఇంట్లో ఒక్కడినే. నిద్రలో కనుక ఈ విషయం ఎవరికీ తెలియదు. పొద్దున్నే పనిమనిషి వచ్చి బెల్లు కొట్టింది. రాత్రి బాగా పొద్దుపోయిందేమో నిద్ర లేవలేదు అనుకుని వెళ్ళిపోయింది. తరువాత వచ్చిన వలలి వనితకు కూడా అదే అనుభవం. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇంట్లో నా అలికిడి లేదు. ఫోన్ చేశారు తీయలేదు. మర్నాడు అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళతో మా అన్నయ్య కు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ సందేహమే నిజమైంది. వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవులతో తలుపు  తెరిచి చూస్తే, ఏముంది పడక గదిలో  విగత జీవిగా మంచం మీద పడివున్న నేను.

ఆ రోజు తెల్లవారుఝామున నాకు వచ్చిన కల ఇది.  ఆ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు. కానీ అంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా  ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడానికి అంతటి పుణ్య కార్యాలు ఏమీ చేయలేదు.

కానీ ఈ కల నాకొక సత్యాన్ని ఎరుకపరిచింది.

ఇలాగే రాసుకుంటూ పొతే ఇక నేను చివర్లో చెప్పాలని అనుకున్న విషయం చెప్పే అవకాశం వుండకుండా పోతుందేమో! ఇదేమీ డిటెక్టివ్ త్రిల్లర్ కాదు, చివరి వరకూ సస్పెన్స్ లో వుంచడానికి.

ముందు చెప్పాల్సింది చెప్పేద్దాం! తరువాత సంగతి తరువాత.  ముగింపుకు ప్రారంభం అన్నమాట.

(కింది ఫోటో)




(ఇంకావుంది)

12, అక్టోబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (232) : భండారు శ్రీనివాసరావు

 

సిగరెట్లు మానడం ఎలా!
‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి. (ఈ రోజుల్లో అయితే ఒక పూటకు సరిపోవు)
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు, నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. ఉదాహరణకు 20 సిగరెట్ల ఇండియా కింగ్స్ ప్యాకెట్ కేవలం ఒక్క రూపాయి. కొన్న ప్రతిసారీ చిల్లర సమస్య రాకుండా డజనో, ఆరడజనో కార్టన్లు కొనేసేవాడిని. ఇంగ్లీష్ భాష ఎంతమాత్రం తెలియని ఆడామగా రష్యన్ సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి ఈ సిగరెట్లు చక్కగా అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు సిగరెట్ ప్యాకెట్ల నుంచి ఏకంగా కార్టన్ల స్థాయికి పెరిగడం జరిగింది.
2004లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా గోల్డ్ ఫెక్ కింగ్ సైజ్ సిగరెట్ల కార్టన్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు.
వెళ్లే ముందు, ముందు జాగ్రత్తగా ఎర్రమంజిల్ కాలనీలో మా క్వార్టర్ ఎదురుగా వున్న రెడ్ రోజ్ రెస్టారెంట్ దగ్గరి పాన్ షాపులో బండిల్స్ కొద్దీ సిగరెట్ ప్యాకెట్లు కొంటుంటే, ఆ షాపు వాడు ‘ఏం సార్ మీరు కూడా దుకాణం ఏదైనా పెడుతున్నారా’ అన్నట్టు నా వైపు విచిత్రంగా చూసాడు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు, నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
హైదరాబాదులో మా ఇల్లే ఒక పెద్ద యాష్ ట్రే. నేను ఊది పారేసే సిగరెట్లకు ఇల్లు నిర్దూమధామంగా తయారయ్యేది. మా ఆవిడ ఓపిగ్గా ఆ చెత్త అంతా పనిమనిషి చేత ఎత్తి పోయించేది.
రాత్రి పూట సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారిపోయినప్పుడు తగలడి పోయిన తలగడల సంఖ్య మా ఆవిడే చెప్పాలి.
“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన రింగు రింగుల పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే, జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా చేరుకున్నాను. మిగిలిన జాతీయ ఛానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.
మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి ఆ రెండు పార్టీల నాయకుల నడుమ ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి.
బయట ఫుట్ పాత్ మీద చెట్ల నీడన, నిలబడి కొందరం, కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం.
ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ఇల్లు నిమ్స్ పక్కనే కనుక కబురు తెలిసి వచ్చారు.
ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు. ఇది అయ్యే పనా అని మా ఆవిడ చిన్నగా నవ్వి ఊరుకుంది.
కళ్ళు తెరిచి ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా ముందుకు వొంగి, ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి, నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో ఇంతమందిని చూసాను’ అంటూ, ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ, నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, ‘రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత నీ మొగుడు నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.
కింది ఫోటోలు:
మాస్కోలో మా ఇంట్లో సాయం కాలక్షేపాలు, కొండొకచో మధ్యాహ్న ముచ్చట్లు.






(ఇంకావుంది)

11, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (231) : భండారు శ్రీనివాసరావు

 

మనసు కోతి

ఇంటి జాగాలోనే మొక్కకోసమో, పాదు కోసమో ఓ జానెడు బెత్తెడు నేల తవ్వుతాం. బొచ్చెడు మట్టి బయటకు వస్తుంది. మళ్ళీ ఆ గుంటను అదే మట్టితో పూడ్చినా ఇంకా చాలా మన్ను మిగిలే వుంటుంది.
జీవితం అంతే! తవ్వుతూ పొతే బోలెడు బోలెడు అనుభవాలు, తరచుకుంటూ పొతే ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని మరచియేవి. మరికొన్ని మరచిపోలేనివి.
2003 లో ఒక రోజు. అంటే ఇరవై రెండేళ్ల నాటి మాట.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము.
నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్డుపై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మకుమారీల ప్రధాన కార్యస్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పురాణ సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మకుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమందిమి, జర్నలిష్టులకు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందంలో వున్నారు. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.
శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది.
కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ, దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరు చెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడికంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో, రీలు కెమెరాలో తీసిన ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూలో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి.
గురుశిఖరానికి వెళ్ళే దారిలో పది పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళు మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది. అక్కడ మాకు హైదరాబాదు నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు.
కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత చేసే పనిపట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మకుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి దాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి. మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మబంధాలలో చిక్కుపోయిన ఆత్మ, తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మకుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యానముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో, ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మకుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అమృత ఘడియలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే, నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానంలో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మకుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాధునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
ఉపశ్రుతి:
చారిత్రక ప్రదేశం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం, ఆసక్తి వుంటే మాత్రం ఆ యాత్ర పరిపూర్ణం అవుతుంది. లేని పక్షంలో ఇలా లేనిపోని ఊసులు రాసుకోవడానికి తప్పిస్తే, ఇలా వెళ్లాం, అలా చూశాం, ఇదిగో వచ్చాం బాపతు అవుతుంది.





(ఇంకా వుంది)