13, నవంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (243) : భండారు శ్రీనివాసరావు

సాయి గీత
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు రిటైర్ అయిన తర్వాత శేష జీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు.
హైదరాబాదులో వరుసగా అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా, సమాచార శాఖ డైరెక్టర్ గా పెద్ద హోదాల్లో పనిచేసిన ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నుంచి పుట్టపర్తి వెళ్ళాము.
ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను.
ఊరుఊరంతా ఎక్కడ చూసినా సత్య సాయిబాబా ఫోటోలు. చిత్రం! మా అన్నయ్య, వదిన వుంటున్న గదిలో ఒక్కటీ లేదు.
ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి పరమహంస గారితో సన్నిహిత పరిచయం. వారికి బాబాగారు సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు.
ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు.
ఇలా అవసరాలు తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి.
సాయంకాలం ఆశ్రమంలో భజనకు వెళ్ళే వాళ్ళు. ముందు వరసలో కూచునే వీలు వున్నా, కావాలని వెళ్లి చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు.
భజన సమయం మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని అనేక ఆధ్యాత్మిక పత్రికలకు వ్యాసాలు రాస్తుండే వాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండే వాడు. ఒకసారి ఆ షాపువాడు ఎవరితోనో అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.
“ఎవరండీ ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”
అసలు సాయిగీతతో కదా మొదలు పెట్టింది. పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య రాసిన అనేక రచనల్లో ఇదొకటి. దీనికి కొంత పూర్వ రంగం వుంది.
భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన అనేకానేక అనుగ్రహ భాషణల్లో జాలువారిన హితోక్తులను, సూక్తులను అంశాల వారీగా వడపోసి, ఒక్క చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట) తో సహా తయారు చేసిన బృహత్ గ్రంధం అది. నిజానికి బృహత్తర కార్యక్రమం. బాబా గారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి.
ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు హెచ్చుగా వున్నాయి.
బాబా గురించి లేదా ఇతరులు రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే వాటికి బాబా గారి ఆమోదం వుండి తీరాలి.
అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ పుస్తకాన్ని డీటీపీ చేయించి, కవర్ పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి మందిరంలోకి వెళ్ళే సమయంలో ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!
మళ్ళీ బాబా ఆ ప్రసక్తి తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు.
రోజులు గడిచిపోతున్నాయి కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని నిరుత్సాహ పడుతున్న సమయంలో, హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస గారికి ఇచ్చి, ‘వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్ చేద్దాం’ అన్నారు. ఆ విధంగా సాయి లీల పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు. సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస గారు చెప్పారు.
ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది కూడా.
విషాదం ఏమిటంటే, భౌతికపరమైన సంపదలను ఆయన కూడబెట్టలేదు, దాచుకోలేదు. అలాగే ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎన్నో చేసి వాటిని కూడా దాచుకోలేదు.
నేటి భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.
కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:
శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు! ‘సాయి’జ్య సాయుజ్య ప్రాప్తిరస్తు!
ఒకరోజు పరమహంస గారు వాళ్ళ ఇంటికి వచ్చారని మా అన్నయ్య కొడుకు రఘు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించి పలకరించాడు. నేను సహజంగానే గుర్తు పట్టలేదు. అతడు గతంలో సీ ఎం పేషీలో పనిచేసేవాడట. ‘పర్వతాలరావు గారు ఎలా వున్నారు. పెద్దవారై వుంటారు. బాగున్నారా’ అని అడిగాడు. చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు కావస్తున్నా, ఆయన చనిపోయిన సంగతే చాలామందికి తెలియదు. అంటే ఆయన మరణించలేదన్న మాట. అతడే ఈ వ్యాసానికి స్పూర్తి.
కింది ఫోటో :
మా ఇంటి ఇలవేలుపు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు



ఎన్టీఆర్ అంటే ఎవరు? – భండారు శ్రీనివాసరావు

 

‘NTR మీద కవర్ పేజీ స్టోరీ రాస్తాను

NTR ఏమిటి? అంటే ఏమిటది?’ అన్నారు ఇండియా టుడే  ఎడిటర్ అరుణ్ పురి.

NTR అంటే నందమూరి తారక  రామారావు. సినీ నటుడు. కొత్తగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని ఓడించబోతున్నారు’

ఇలా జవాబు చెప్పిన వ్యక్తి పేరు ఎస్. వెంకటనారాయణ. ఆయన  జ్యోతిష్కులు కాదు, సెఫాలజిస్టు కాదు. నిబద్ధత కలిగిన పాత్రికేయులు మాత్రమే.

‘చూడు మిస్టర్ వెంకట్. ఎన్టీఆర్ ఎవరో నాకే తెలియదు. ఇక మన పాఠకులకు ఎలా తెలుస్తారు?’

ఎన్టీఆర్ పై కవర్ పేజీ స్టోరీ రాయడానికి, ఆయన ఫోటో ముఖచిత్రంగా వేయడానికి ఎడిటర్ కు నచ్చచెప్పేందుకు ఆయన చాలా శ్రమ పడాల్సి వచ్చింది.

దేశవ్యాప్త పాఠకాదరణ కలిగిన ఆ నేషనల్ మేగజైన్ ముఖచిత్రంగా ఎన్టీఆర్ ఫోటోతో వెలువడిన ఆ సంచికలో, తన వ్యాసాన్ని ఆయన ఇలా ముగించారు.

‘ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అనేది తప్పకుండా జరుగుతుంది’

ఆ సంచిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడని ప్రాంతాల వారికి కూడా ఎన్టీఆర్ అంటే ఎవరో తెలిసింది.

వెంకటనారాయణ అంచనా తప్పకుండా ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో గెలిచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

మరో చిత్రం ఏమిటంటే ఇండియా టుడే ఎన్నికలకు మూడు వారాల ముందు అభిప్రాయ సేకరణ జరిపింది.  ఆ ఫలితాలు తద్విరుద్ధంగా వచ్చాయి.

ఎన్నికలు జరిగాయి. ఎన్టీఆర్ గెలిచారు. ఇండియా టుడే అంచనా తప్పినా  వెంకటనారాయణ అంచనా నిజమైంది.

ఇలాంటిదే మరో వృత్తాంతం.

ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోర పరాజయం, దరిమిలా ఏర్పడ్డ జనతా ప్రభుత్వ పతనం, మళ్ళీ ప్రజాతీర్పు కోసం ఇందిర దేశ వ్యాప్త ప్రచారం. ఈ నేపధ్యంలో ఎస్. వెంకటనారాయణ ఇందిరతో కలిసి పర్యటిస్తూ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ప్రచురితమైన ఆ వ్యాసం ముగింపు ఇలా సాగుతుంది.

‘అధికారం కోల్పోయి మళ్ళీ గద్దె ఎక్కిన ఉదాహరణలు చరిత్రలో మూడే వున్నాయి. విన్ స్టన్ చర్చిల్, నెపోలియన్ బోనాపార్టే, ఛార్లెస్ బిగార్.  అయితే ఈ ముగ్గురూ మళ్ళీ అధికార పీఠం ఎక్కడానికి పది సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పట్టింది.  కానీ ఇందిరాగాంధీ అనే మహిళ కేవలం ముప్పయి నెలల లోనే తిరిగి అధికార అందలం ఎక్కబోతోంది

ఆ రోజుల్లో ఆ పత్రికను కాంగ్రెస్ (ఇందిరా గాంధీ) వ్యతిరేక పత్రిక అని చెప్పుకునే వారు. అలాంటి పత్రికలో ఇలాంటి కధనం.

ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని వెంకట నారాయణ పూర్తిగా అర్ధం చేసుకున్నారు అనడానికి ఆయన ఒక దృష్టాంతం పేర్కొన్నారు.

ఇందిరతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీలో లాండ్ అయింది. ఆ సమయంలో ఆమె ప్రాముఖ్యత లేని వ్యక్తి. ఎక్కడో దూరంగా పార్క్ చేశారు. కిందకు దిగడానికి నిచ్చెన కోసం ఎదురు చూస్తున్నారు. అరగంట అయినా నిచ్చెన ఏర్పాటు జరగలేదు. ఇందిరాగాంధీ ద్వారం దగ్గరికి వెళ్లి యష్ పాల్ కపూర్ ని పిలిచారు. ‘ఇక్కడ నుంచి కింద గ్రౌండ్ ఎంత కిందికి వుంటుంద’ని అడిగారు. ‘రెండు మూడు గజాలు అయినా వుంటుంది’ అని జవాబు.

‘మీరు నెమ్మదిగా నిచ్చెన వచ్చిన తర్వాత రండి అని అంటూ ఆమె తటాలున విమానం నుంచి కిందికి దూకి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు’

ఎస్. వెంకట నారాయణ వంటి దిగ్గనాధీరులైన పదిమంది సీనియర్ పాత్రికేయుల  ఆసక్తికర అనుభవాలతో కూడిన రచనల  సంకలనాన్ని ‘అనుభవాలు- జ్ఞాపకాలు అనే పేరుతో  వయోధిక పాత్రికేయ సంఘం ప్రచురించింది.

జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారికి ఈ పుస్తకం ఒక కరదీపిక.  ఈ రంగం పట్ల గౌరవం, అభిరుచి వున్నవారు  చదవదగిన పుస్తకం.

పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని, దీనితో పాటు వరిష్ట పాత్రికేయులు, కీర్తి శేషులు, కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న జీ కృష్ణ రాసిన ‘అప్పుడు – ఇప్పుడు గ్రంధాలను ఈ నెల పదహారో తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాదు బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో ఆవిష్కరిస్తారు.

 

Who is NTR? – Bhandaru Srinivasa Rao

“I will write a cover story on NTR.”

“NTR? What is that?” asked India Today editor Arun Puri.

“NTR means Nandamuri Taraka Rama Rao. He is a film actor who recently started a political party. For the first time in Andhra Pradesh history, he is about to defeat the Congress Party and Indira Gandhi.”

The person who gave that answer was S. Venkatanarayana. He was neither an astrologer nor a psephologist, but a dedicated journalist.

“Look, Mr. Venkat, I don’t even know who NTR is. How will our readers know him?” said the editor.

Venkatanarayana had to work hard to convince the editor to write a cover story on NTR and feature his photo on the magazine’s front page.

That issue of the national magazine, widely read across the country, was published with NTR’s photo on the cover. Venkatanarayana concluded his article with these words:
“Unless a miracle occurs, NTR will certainly become the Chief Minister of Andhra Pradesh.”

After that issue hit the stands, even people who did not speak Telugu came to know who NTR was.

Venkatanarayana’s prediction came true. NTR won that election and became the Chief Minister of Andhra Pradesh.

Interestingly, India Today conducted an opinion poll three weeks before the elections, and its results predicted the opposite.
When the elections were held, NTR won. India Today’s forecast failed, but Venkatanarayana’s prediction proved right.

There is another similar incident.

After the Emergency, Indira Gandhi suffered a crushing defeat in the elections. Later, the Janata government collapsed, and Indira began a nationwide campaign seeking a renewed mandate.
During this time, S. Venkatanarayana traveled with her and interviewed her. The concluding lines of his published article read:

“In history, only three people have regained power after losing it: Winston Churchill, Napoleon Bonaparte, and Charles de Gaulle. Each of them took more than ten years to return to power. But Indira Gandhi is about to reclaim her position in just thirty months.”

At that time, the magazine was known for its anti-Congress stance. Publishing such an article in that magazine was remarkable.

To show how well Venkatanarayana understood Indira Gandhi’s personality, he shared an incident.

He was traveling with Indira Gandhi on a flight that landed in Delhi. At that time, she held no position of importance, so the plane was parked far from the terminal. They waited for a ladder to disembark, but even after half an hour, none arrived.

Indira Gandhi called Yashpal Kapoor and asked, “How far is the ground from here?” He replied, “At least two or three yards.”

She said, “You come down leisurely after the ladder arrives,” and then she jumped from the plane herself and walked away briskly.

The Association of Veteran Journalists has published a compilation titled Anubhavalu–Jnapakalu (Experiences and Memories), which includes fascinating stories from ten senior journalists like S. Venkatanarayana.

For those working in journalism, this book serves as a guide. Anyone who respects or loves this profession should read it.

Former Vice President M. Venkaiah Naidu will release this book, along with Appudu–Ippudu (Then and Now) written by senior journalist and self-described “pen worker” G. Krishna, on Sunday, the 16th of this month, at 11 a.m. at Deshoddaraka Bhavan, Basheerbagh, Hyderabad.




11, నవంబర్ 2025, మంగళవారం

ఓటు వేసే విధము మార్చండి

 

 


ఎల్లారెడ్డి గూడా మా ఇంటి నుంచి జూబిలీ హిల్స్ లోని మా అన్నయ్య ఇంటికి వెళ్ళడానికి ఉబెర్/రాపిడో బుక్ చేస్తే కాసేపు డ్రైవర్ల వెతుకులాటతో పొద్దు పుచ్చి, మీ కెప్టెన్ వస్తున్నాడు, పికప్ పాయింటు దగ్గర రెడీగా వుండండి’ అని మెసేజ్ వస్తుంది. రూట్ మ్యాప్  చూస్తే ఆ వచ్చే కారు ఫిలిం నగర్ లో బయలుదేరినట్టు కనిపిస్తుంది. ఆ కారు బొమ్మ కాసేపు ముందుకు, కాసేపు వెనక్కు తిరిగి కొంత దూరం కూడా రాక మునుపే ఆ డ్రైవర్ కేన్సిల్ చేసుకుని మరో డ్రైవర్ వస్తున్నట్టు ఇంకో  మెసేజ్. ఇక ఇతగాడు వచ్చేది మాదాపూర్ నుంచి. నేను వెళ్ళాల్సింది జూబిలీ హిల్స్ కి. ఈనాటి ఐ ఏ శకంలో కూడా కారు బుక్ చేసినప్పుడు దగ్గర లోని వెహికిల్ డ్రవర్ ను కనెక్ట్ చేసే విధానాన్ని కనుక్కోలేక పోవడం విచారకరం.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఈరోజు వెళ్లి ఓటు వేయాలి. మా ఇంటికి పాతిక గజాల దూరంలో ఒక పోలింగ్ కేంద్రం వుంది. నాకు అలాట్ చేసింది దూరంగా వున్న కేంద్రం. నడకకు ఎక్కువ, ఆటోకి తక్కువ. ఆటోలో పొతే సగం దూరంలో ఆపి ‘నడిచి వెళ్ళండి, ముందుకు పోవడానికి వీల్లేదు’ అన్నాడు రోడ్డుకు అడ్డంగా కట్టిన బారికేడ్లు చూపిస్తూ.  ఉసూరుమంటూ ఎండలో నడిచి వెళ్లాను. ఓటు వేసి వచ్చేటప్పుడు అదీ దొరకలేదు.

ఎన్నికల సంఘం మంచి ఏర్పాట్లే చేసింది. అయితే, ఇంటికి దగ్గరలో పోలింగు కేంద్రం వుంటే వృద్ధులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి  ఉత్సాహం చూపుతారు. నియోజక వర్గం ఒకటే అయినప్పుడు ఆయా ఇళ్లకు దగ్గరలోని పోలింగు కేంద్రాలను కేటాయించడం ఈ కంప్యూటర్ యుగంలో గొప్ప విషయం ఏమీ కాదు.

‘రండి. మీ ఓటు హక్కు ఉపయోగించుకోండి. ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనండి అని’ విజ్ఞప్తులు చేసే ఎన్నికల అధికారులు ఈ విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపితే బాగుంటుంది.

(11-11-2025)       

10, నవంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (242 ) : భండారు శ్రీనివాసరావు

 నేను జీవితంతో సమాధాన పడలేదు. పరిస్థితులతో కూడా రాజీ పడలేదు. నన్ను నేను మార్చుకున్నాను. అదీ నాకోసం. అంతే!

శ్రీనివాసరావు ఈ మధ్య చాలా మారిపోయాడు, అతడు మాత్రం ఏమి చేస్తాడు. మారిన రోజులతో మారక తప్పదు కదా’ అనేవారికి లేదా అనుకునేవారికి నా జవాబు ఇదే!

డెబ్బయి తొమ్మిది సంవత్సరాలకు పైగా నా జీవన శైలి ఒక రకంగా గడిచింది. అలాంటి దాన్ని గత కొద్ది నెలలుగా నాకు నేనై మార్చుకున్నాను. అయితే నా ఆహార పానీయాలు, అలవాట్లు ఏవీ మార్చుకోలేదు. మారింది నా నడత మాత్రమే. ఇతరులతో నా వ్యవహార శైలి మాత్రమే.

నా ఈడు వాళ్ళతో పోలిస్తే నా ఆరోగ్యం చాలా మెరుగైన పరిస్థితి లోనే వుంది. రెండేళ్ల క్రితం శారీరక పరిస్థితి కొంత ఆటుపోట్లకు గురయింది. షుగర్, బీపీ బాగా ఇబ్బంది పెట్టాయి. చిన్నా చితకా వాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తే అలవాటు లేని నేను తరచుగా స్పెషలిస్టులను సంప్రదించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, వాటిని డాక్టర్లకు చూపించి వాడే మందుల్లో మార్పులు చేసుకోవడం ఇలా కొన్నాళ్ళు సాగింది. పని వాళ్ళపై, వంట మనిషిపై చీటికీ మాటికీ చీకాకు పడడం, డ్రైవర్లతో లేనిపోని వాగ్వాదాలు ఇలా శారీరక మానసిక ఇబ్బందులతో ఏమిటో అంతా అస్తవ్యస్తంగా వుండేది. భార్య మరణం, ఎదిగొచ్చిన కొడుకు ఆకస్మిక కాలధర్మం, ఎవరి మీదా ఆధారపడకుండా జీవించలేని అశక్తత ఇవన్నీ కొన్ని కారణాలు అయినా, అసలు మర్మం ఇవేవీ కాదనీ, కారణం నా మనసే అని నెమ్మదిగా బోధపడింది.

కొంత మార్పుకోసం ఈ ఏడాది జూన్ లో రెండు మాసాలు అమెరికా వెళ్లి పెద్దవాడు సందీప్ దగ్గర వుండి వచ్చాను. ఒక ఏడాది వ్యవధిలో వెళ్ళడం అది రెండో పర్యాయం. అంతకు ముందు చాలా సార్లు వెళ్లాను కానీ మా ఆవిడ తోడుగా వుండేది. గత రెండు పర్యాయాలు అది పెద్ద లోటుగా అనిపించి కొన్ని వారాల్లోనే తిరిగి వచ్చేశాను. అయితే ఈసారి తిరిగి వచ్చింది నేను కాదు. మారిపోయిన మరో నేను. కారణం నా పెద్ద కోడలు భావన. భావన బోధించిన భగవద్గీత.

హైదరాబాదులో నాకే లోటు లేదు. మూడు గదుల ఇల్లు. వంటమనిషి, పని మనిషి. తిరగడానికి కారు. పెన్షన్ డబ్బులకు తోడు ప్రతినెలా మా వాడు పంపించే డబ్బులు.

మరి ఏమిటి సమస్య. నేనే నాకు సమస్య.

ఒక్కోరోజు వంటావిడ చెప్పాపెట్టకుండా మానేస్తుంది. నాకు స్టవ్ వెలిగించడం కూడా రాదు.

ఎక్కడికో పోవాలి. డ్రైవర్ సమయానికి రాడు.

అందరి గుమ్మాల ముందు రంగవల్లులు. మా పనిమనిషి రాదు.

కోపం వస్తుంది. చీకాకు వేస్తుంది. గయ్యిమని అరవాలని అనిపిస్తుంది. ఏమిటీ జీవితం అనే నైరాశ్యం. శరీరం త్వరగా అలసి పోయేది. నిస్సత్తువ ఆవరించేది. పడుకుని లేవాలంటే నీరసం. ఆకలి పూర్తిగా మందగించింది. రకరకాల టాబ్లెట్లు. గంట గంటకు బీపీ చెక్ చేయాల్సి వచ్చేది. డాక్టర్లకే అర్ధం కానంత దారుణమైన రీడింగులు. విపరీతమైన హెచ్చుతగ్గులు. పనివాళ్ల మీద అరవడాలు.

చెప్పాకదా మార్పుకోసం అమెరికా వెళ్లాను. నిజానికి ఆరోగ్యం బాగా లేనప్పుడు పొరపాటున కూడా వెళ్లకూడని దేశం ఏదైనా వుంటే అది అమెరికానే. అక్కడ ఆరోగ్యానికి ఏదైనా అయితే ఇక అంతే సంగతులు.

సియాటిల్ విమానాశ్రయంలో దిగిన నన్ను చూడగానే భావన అంది, మీరు బాగా చిక్కిపోయారు పాపా! అని. అబ్బే అదేమీ లేదు దూరప్రయాణం కదా అని సర్ది చెప్పాను. తను అలా అడగడానికి కారణం ఇంటికి వెళ్ళిన తర్వాత మాటల్లో చెప్పింది. అంతకు కొద్ది నెలల క్రితమే నేను అమెరికా వచ్చి వెళ్లాను. అప్పుడు నా సైజుకు సరిగ్గా సరిపోయే ప్యాంటు చొక్కాలు కొన్నారు. అవే దుస్తులు వదులుగా వుండడం, ప్యాంటు కిందికి జారిపోవడం గమనించి అడిగిన మాట అది.

అయిదు వారాలు వున్నా. ఇంట్లో అమర్చినట్టు అన్నీ వున్నాయి. బ్రష్ చేసుకోవడం తరువాయి ఒక పెద్ద జార్ లాంటి కప్పులో ఎన్స్యూర్ కలిపిన పాలు ఇచ్చేది. వేడి నీటి టబ్బులో ఒక గంటకు పైగా జలకాలాడిన తర్వాత వేడివేడి ఇడ్లీ సాంబారు, దోశలు ఇలా రోజుకో తీరుగా చేసిపెట్టి వాళ్ళిద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోయేవారు. ఒటీటీ లో సినిమాలు. పెద్ద మనుమరాలికి కూడా ఉద్యోగం. చిన్నదానికి గ్రాడ్యుయేషన్ పూర్తయింది. నిజానికి ఆ కార్యక్రమం కోసమే నేను మళ్ళీ అమెరికా వెళ్లాను. భోజనం అయిన తర్వాత కారులో నన్ను ఊరంతా తిప్పేది. తను వెళ్ళే పెద్ద పెద్ద లైబ్రరీలకు తీసుకు వెళ్ళేది. కారు పార్కింగులో పెట్టి మెట్రోలో ఒక గమ్యం లేకుండా అటూ ఇటూ తిరిగే వాళ్ళం. స్టార్ బక్స్ లో కూర్చుని కాఫీ తాగేవాళ్ళం. మేము ఇంటికి చేరేసరికి ఆఫీసుల నుంచి మిగిలిన ముగ్గురూ వచ్చేవారు. తర్వాత సినిమాకో షికారుకో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. రాత్రి భోజనం సిద్ధం చేసే లోపు ఒటీటీ సినిమా చూస్తూ నా సాయం కాలక్షేపం పూర్తి చేసుకునే వాడిని. పడక ఎక్కగానే అలెక్సాలో ఘంటసాల పాత పాటలు.

నిజానికి హైదరాబాదులో నా దినచర్య కూడా కొంచెం ఇంచుమించు ఇదే. కాకపోతే అక్కడ థర్డ్ ఏసీ, ఇక్కడ అమెరికాలో ఫస్ట్ ఏసీ వాతావరణం.

హైదరాబాదులో నా శారీరక, మానసిక వైపరీత్యాల గురించి కొంత సమాచారం అమెరికాలోని మా కొడుకు కోడలికి కూడా చేరింది.

నా హైదరాబాదు ప్రయాణం దగ్గర పడడానికి రెండు రోజుల ముందు భావన, ‘ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తాను మీరు బ్లాగులో రాసుకోవడానికి బాగుంటుంది’ అని బెల్ వ్యూ లోని ఒక పెద్ద పార్కుకు తీసుకు వెళ్ళింది. చాలా విశాలమైన పార్కు. దాన్ని గురించి రాయాలంటే చాలా వుంది. అది కాదు నా ఉద్దేశ్యం. నా లోని మార్పుకు అక్కడే బీజం పడింది.

ఏడాది నిండని పసిపిల్లల నుంచి ఎనభయ్, తొంభయ్ ఏళ్ళ ముదివొగ్గుల వరకు అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. బాగా వృద్ధులైన వారు చేతికర్ర సాయం లేకుండా చురుగ్గా వాకింగ్ చేస్తున్నారు. సాయంకాలపు నీరెండలో నడవలేక నేను ఒక చప్టా మీద కూలపడ్డాను. భావన చేతి సంచీ నుంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇచ్చింది. అది తాగిన తర్వాత కొంత అలసట నుంచి తేరుకున్నాను.

అప్పుడు మొదలు పెట్టింది భావన భగవద్గీత.

పాపా ! అక్కడ మీరొక్కరు ఒంటరిగా వుండడం మాకు బాగా లేదు. మా దగ్గర పరిష్కారం వుంది కానీ నిర్ణయం మీది. ఒకటి మీరు వచ్చి వుంటాను అంటే గ్రీన్ కార్డుకు అప్లయి చేస్తాము. కానీ కొంత టైం పడుతుంది. అప్పటివరకు ఆరు మాసాలకోసారి వచ్చి కొంతకాలం వుండి వెడుతుండాలి. కానీ మీ టెంపర్ మెంటు మాకు తెలుసు. మీకు మీ స్నేహితులు వుండాలి. నిషాకు చిన్నపిల్ల జీవిక సమస్య. మీరు దాన్ని ఆడించగలరు, దాంతో కాలక్షేపం చేయగలరు కానీ దాన్ని పెంచ లేరు. అత్తయ్య వుండి వుంటే ఆ పరిస్థితి వేరు. నిషాకు ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువ వుంటుంది. కేర్ టేకర్ ని పెట్టినా జీవిక పెద్దవాళ్ల ఆపేక్షకు దూరం అవుతుంది. ఈ వయసులో దానికి అమ్మమ్మ తాతయ్యల అవసరం ఎక్కువ. తనకు వర్క్ ఫ్రం హోం కాబట్టి కటక్ లో వుంటే జీవికకు పెద్దవాళ్ల ప్రేమ దొరుకుతుంది. ఇది మీరు అర్ధం చేసుకోవాలి.

కాబట్టి ముందు వున్నవి రెండు ఆప్షన్స్. మీరు అమెరికాలో వుండడం. లేదా హైదరాబాదులో వుండడం.

మీరు రెండోదానికే ప్రాధాన్యత ఇస్తే ముందు నేను చెప్పినట్టు చేయగలగాలి. లేకపోతె మీ ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.

మీ సమస్యలు వంట మనిషి, పనిమనిషి హఠాత్తుగా రాకపోతే ఎలా. నిజానికి ఇవి సమస్యలు కావు ఇబ్బందులు. రాకపోతే ఏమౌతుంది ఏమీ కాదు అనుకోండి. అదే పరిష్కారం. ఫిగ్గీ వుంది. చేతిలో కారు వుంది, అలా వెళ్లి బయట మంచి హోటల్లో మీ స్నేహితులతో కలిసి భోజనం చేయండి. ఎందుకు రాలేదని మర్నాడు ఆమె మీద అరిస్తే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిజానికి అదే పెద్ద సమస్య. డబ్బుకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మేమందరం ఉన్నాము. ఈ లోపల గ్రీన్ కార్డు వచ్చింది అనుకోండి. అసలు సమస్యే లేదు. కానీ ఈ లోపల మీ ఆరోగ్యం, అది జాగ్రత్తగా కాపాడుకోండి. దీనికి ఒకటే చిట్కా. ఏం కాదు, కొంపలు అంటుకు పోయే సమస్య కాదు అని మనసులో గట్టిగా అనుకోండి. అది మంచులా కరిగిపోతుంది."

ఇలా చెప్పుకుంటూ పోయింది. నేను వింటూ పోయాను.

తిరిగి వచ్చిన తర్వాత ఇంతవరకు డాక్టర్ ని చూడలేదు. అసలు వైద్య పరీక్షల అవసరమే పడలేదు.

మరో సంగతి. ఎవరి మీదా నోరు పారేసుకోలేదు. కోపం పూర్తిగా పోయిందని చెప్పలేను కానీ చాలావరకు తగ్గింది.



(ఇంకావుంది)

6, నవంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (241) : భండారు శ్రీనివాసరావు

 

బ్రహ్మరాత
ఇప్పుడంటే నా రాత, తలరాత ఇలా తగలబడ్డాయి కానీ చిన్నప్పుడు నా చేతి రాత చాలా చక్కగా, పొందికగా వుండేది. ‘వీడికి రాతలో వున్న కుదురు బుద్దిలో వుంటే బాగుండేది’ అనేది మా బామ్మ.
బ్యాంకు కార్డులు వచ్చి బతికించాయి కానీ, లోగడ డబ్బు డ్రా చేయడానికి, 1975 నుంచి నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ కు వెళ్ళిన ప్రతిసారీ, ‘మీరు మీరే కానీ ఈ సంతకం మీది కాదు’ అనేవారు గ్లాసు విండో వెనుక వున్న ఉద్యోగులు. ఒకసారి ఇలాంటి తకరారే వస్తే నాకు చర్రున కోపం వచ్చి, ఒక కాగితం అడిగి తీసుకుని దానిమీద వరసగా డజను సంతకాలు చేసి, ‘మీ ముందే సంతకం చేశాను కదా! వీటిల్లో ఏ ఒక్కటైనా మరోదానితో సరిపోలితే అప్పుడు అడగండి. నా రాతే అంత! వంకర టింకర ఓ’ అన్నాను. ఇందులో సెన్సాఫ్ హ్యూమర్ ఏం కనిపించిందో ఏమో కానీ, వెంటనే టోకెన్ బిళ్ళ చేతిలో పెట్టి వెయిట్ చేయమంది.
నా రాత సరే! ఒకసారి బ్రహ్మరాత లాంటి చేతి వ్రాత చూశాను.
ఒక పట్టాన అర్ధం అయ్యేలా లేదు. మరో విషయం, అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు పైనే.
జీవితం అన్నాక మన విషయాలే కాదు, ప్రపంచానికి చెందిన అనేక సంగతులు కొన్ని చెవిన పడుతుంటాయి. మరికొన్ని కంట పడుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి.
వెనుకటి రోజుల్లో పాత కాగితాలు, దస్తావేజులు భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, ఇప్పటిలా కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ అప్పటికి ఏర్పడక పోవడం వల్ల, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి. అటకల ఇళ్ళతో పాటు అవీ కొంతకాలానికి కనుమరుగు అయ్యాయి.
రేడియోలో కలిసి పనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు కొన్నేళ్ళ క్రితం పాత దస్తావేజు ప్రతి ఒకటి వాట్సప్ లో పంపారు. చెప్పాను కదా! ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది.
ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారి పేరు కూడా గంగన్న గారే!
ఆర్వీవీ గారి ముత్తాత గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదు వందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట.
ఈ రోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. వెసులుబాటు అయినప్పుడు తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది.
గంగన్న గారు వుండేది గోదావరి జిల్లా రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు. (ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ అంటున్నారు)
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతి రాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రెండు రూపాయలు విలువ చేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891....... తణ్క్(ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యింద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తణ్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీ రోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గంన్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. చేసింది ఎంత పెద్ద అప్పయితే చట్టం నుంచి తప్పించుకునే అవకాశాలు అంత ఎక్కువగా వుంటాయి.
కింది ఫోటో :
130 ఏళ్ళ నాటి రుణ పత్రం నకలు





(ఇంకా వుంది)

3, నవంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (240) : భండారు శ్రీనివాసరావు


పరుగు ఆపడం ఒక కళ
ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు జీవిత చరిత్ర పుస్తకానికి పెట్టిన పేరు ఇది. సినీ నటుడిగా మంచి అవకాశాలు వున్నప్పుడే, ఆయన నటనకు భరతవాక్యం పలుకుతూ సినిమా రంగం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. చనిపోయే వరకు ఆయన దీనికి కట్టుబడే వున్నారు.
ఆయనతో పోలిక కాదు కానీ గత కొన్నేళ్లుగా నేను టీవీల్లో రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దీనికి ప్రధాన కారణం మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణం. అంతకు ముందు దాదాపు పుష్కరం పాటు రోజుకు మూడాటలు, ఆదివారం, పండుగలకి నాలుగాటలు అన్న లెక్కన టీవీ చర్చలతోనే కాలం గడిచిపోయింది.
కొంత తేరుకున్న తర్వాత, అంతకు ముందు నుంచి అంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా కొన్ని పత్రికలకి క్రమం తప్పకుండా వారం వారం రాసే రాజకీయ వ్యాసాల రచనా వ్యాసంగాన్ని మళ్ళీ తలకెత్తుకున్నాను. కొన్ని వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. కొంతకాలం తర్వాత వాటికి కూడా స్వచ్చందంగా స్వస్తి చెప్పాను. కారణం ట్రోలింగు పేరుతొ ఈ మీడియాలో భయంకరంగా, అవిచ్చిన్నంగా సాగుతున్న వ్యక్తిత్వ హననం. సంపాదన పట్ల దృష్టి పెట్టకుండా, సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా, కప్పు కాఫీ కూడా ఆశించకుండా ఈ చర్చల్లో పాల్గొంటూ, చివరాఖరులో ఇలాంటి మాటలు పడలేక, పత్రికల్లో రాతలకు, ఛానళ్లలో ఇంటర్వూలకు ఒకేసారి మంగళం పాడాను.
తరువాత పత్రికల వాళ్ళు రాయమన్నా రాయలేదు. ఛానల్స్ వాళ్ళు అడిగినా వెళ్ళలేదు.
బహుశా, నా ప్రేమ వివాహం విషయంలో తీసుకున్నట్టే, నా జీవితంలో నాకై నేను చేసుకున్న మంచి నిర్ణయాలలో ఇదొకటి అనుకుంటున్నాను.
ట్రోలింగు చేసే వారికి నేను చర్చించే అంశాల మంచి చెడులతో నిమిత్తం లేదు. మర బొమ్మలకు వారికి తేడా లేదు. తాము మంచి అనుకున్న దానిని మనం గట్టిగా నొక్కి చెప్పాలి. చెడు అని వారు భావించేదాన్ని మరింత విడమరచి, వారికి అనుకూలంగా చెప్పాలి. అంతే! లేశ మాత్రం తభావతు వచ్చినా మనపై తాటి ప్రమాణంలో విరుచుకు పడతారు. ఇన్నేళ్ళుగా నాతో స్నేహవాత్సల్యాలతో మెలుగుతూ వచ్చిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు సయితం మౌనంగానే వుండిపోతారు తప్ప, కనీసం ఇలా చేయకండి అని వారి అనుచరగణాలతో నోటిమాటగా కూడా చెప్పేవారు కాదు. ఘడియ తీరిక లేకుండా, గవ్వ రాబడి లేకుండా ఇక ఎందుకీ కంచి గరుడ సేవ అని నేనే తప్పుకున్నాను. నిజం చెప్పొద్దూ, దరిమిలా దైహిక, మానసిక ఆరోగ్యాలు రెండూ కుదుటపడ్డాయి. (సావిత్రి గారూ! Savitri Ramanarao వింటున్నారా?)
జీవితం అంతా ముడిపడిన వ్యాపకాన్ని వదులుకున్న తర్వాత జీవితమే ఖాళీ అయినట్టు అయింది. రోజంతా ఖాళీనే. రిటైర్ అయిన తర్వాత ఇలా ఇంట్లో ఎక్కువ సమయం వుండే జీవితాన్ని కోరుకున్న నా సహచరి, తన జీవితాన్నే ముగించుకుని వెళ్ళిపోయింది. ఇల్లూ మనసూ ఒకేసారి శూన్యం. పొద్దు గడవడం, పొద్దుపుచ్చడం ఎలా అనే ప్రశ్న నా ముందు నిలిచింది.
ముందు తట్టిన ఆలోచన ఈ జీరో రచన. రెండు వందల ఎపిసోడ్లు దాటిన తర్వాత, నడిచి వచ్చిన దారి ఇంతటి సుదీర్ఘమైనదా? ఎప్పటికి తెమిలేను అనే సందేహం పట్టుకుంది.
దాంతో టీవీలో ఏ ఛానల్లో పాత నలుపు తెలుపు సినిమా కనపడ్డా చూడడం మొదలుపెట్టి, వాటిల్లో ఆ రోజులనాటి నా జీవన ఛాయలను వెతుక్కోవడం మొదలు పెట్టాను. అలా ఛానల్స్ మారుస్తుంటే ఒకసారి ఏదో క్రికెట్ మ్యాచ్ కనపడింది. నిజానికి నాకు క్రికెట్టు అంటే ఏబీసీడీలు తెలవ్వు.
1970 ప్రాంతాల్లో కొత్తగా బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు, కాలేజీ నుంచి తాజాగా ఇక్కడ అడుగుపెట్టాడు, ఎంతో కొంత క్రికెట్ పరిజ్ఞానం వుండక పోతుందా అని క్రికెట్ పోటీకి సంబంధించిన పీటీఐ వార్త ఒకటి నా ముందు పెట్టి అనువాదం చేయమన్నారు. మొదటి వాక్యమే ఫర్ ది లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ అని వుంది. క్రికెట్ మైదానంలో కనబడేవి మూడు వికెట్లు, మరి నాలుగు వికెట్లు ఏమిటనే సందేహం పొటమరించి, దాని నివృత్తి కోసం సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుగారిని ఆశ్రయించాను.
విషయం అర్ధమై ఆయన చిన్నగా నవ్వి, ‘పోనీ లెండి, అది వదిలేసి ఇవి చూడండి’ అని కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్, లియోపాల్డ్ విల్లీ, కాంగో యుద్ధం, పాట్రిస్ లుముంబా వంటి ఐటమ్స్ చేతిలో పెట్టారు అనువాదం చేయమని. అదీ అప్పట్లో క్రికెట్ గురించి నా అవగాహన.
ఇప్పటికి అది పెరిగింది లేదు కానీ, చూడగా చూడగా ఆసక్తి మాత్రం పెరిగింది. క్రికెట్ గురించి నాలుగంటే నాలుగు ముక్కలు రాయడానికి అది చాలు అనుకుని అప్పుడప్పుడూ అర్ధరాత్రి వేళ మేలుకుని చూస్తూ కామెంట్లు పెడుతుంటాను.
తోక టపా:
మితృలు, జేవీపీఎస్ సోమయాజులు గారు ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూసి,
“Cricket was never my first choice. I never wanted to be a sportsperson” అంటున్న ఈవిడ ఎవరండీ అని అడిగాను, నా అజ్ఞానం, అమాయకత్వం బయటపడుతుందని తెలిసి కూడా.
ఆయన చెప్పిన జవాబు విని నాకు మతి పోయింది. భారత మహిళల జట్టుకు సారధ్యం వహించి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంను ప్రపంచానికి పరిచయం చేసిన మిథాలీ రాజ్. మూడేళ్ల క్రితం ఆమె మీద ఒక సినిమా కూడా తీసారట.
కింది ఫోటో: (Courtesy: shri Jvps Somayajulu )



(ఇంకా వుంది)