16, సెప్టెంబర్ 2024, సోమవారం

18-21-11.40

 18-21-11.40
భండారు శ్రీనివాసరావు 

అమెరికా అనేది అగ్ర దేశమే కాదు వింతలు విడ్డూరాల గడ్డ అనిపిస్తుంది కొన్ని కొన్ని వింటుంటే. విన్నవాటిలో నిజమెంతో కానీ, నిజమా అనిపించక మానదు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థల మాదిరిగా ఇక్కడ మనిషి జీవితంలో ప్రతి దశకు కొన్ని వయసు నిబంధనలు. అన్ని రాష్ట్రాలలో వీటి తీరు ఒక్కతీరుగా వుండక పోవడం మరో విడ్డూరం. దేనికి దానికి నిబంధనలు ప్రత్యేకం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి కనీస వయసు 21. డ్రైవింగ్ లైసెన్స్ కు 18. కొన్ని చోట్ల 16 ఏళ్లు సరిపోతాయిట. ఇక్కడ కారు లేకపోయినా, కారు నడపలేకపోయినా జీవితం క్లిష్టతరం అవుతుంది కాబట్టి ఈ వెసులుబాటు అంటారు. అయితే 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ 21 ఏళ్లు వచ్చేవరకు అర్ధరాత్రుళ్ళు కారు నడపకూడదు. ఒకవేళ అలా నడిపి ఆక్సిడెంట్ చేస్తే నేరమే కాకుండా వెహికిల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయలేరు. 
కిందటి నెలలో మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు రాత్రి పదకొండున్నరకు ఎక్కడో డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వెడుతున్నారు. వాళ్లకు డ్రైవింగ్ కొత్త కాదు. అన్ని రకాల కార్లు నడపడంలో ప్రావీణ్యం వుంది. లైసెన్సులు కూడా వున్నాయి. కాకపోతే ఎవరికీ 21 నిండలేదు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుతారు అనే సమయంలో, అడవి మార్గం కావడం వల్ల రోడ్డు మీద అడ్డంగా వచ్చిన ఓ జంతువును తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారిపోయి తలకిందులు అయింది. కార్లో వున్న ముగ్గురు సీటు బెల్టులు పెట్టుకోవడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. అడవి కావడం వల్ల మొబైల్ సిగ్నల్స్ లేవు. కాకపోతే, ప్రమాదం ఇంపాక్ట్ కు ఎయిర్ బ్యాగ్   బెలూన్లు తెరుచుకున్నాయి. అలా తెరుచుకోవడంతో ఆటోమేటిక్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది అనే సమాచారం క్షణాల్లో పోలీసులకు  అందింది. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న  కార్లలో ఇలాంటి సాంకేతిక సదుపాయం వుందట. దాంతో ప్రమాదంతో పాటు లోకేషన్ కూడా తెలుసుకున్న పోలీసులు  వెంటనే అక్కడకు చేరుకోగలిగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలనందున,  మరో పోలీసు వాహనాన్ని నిమిషాల్లో పిలిపించి ఆ ముగ్గుర్నీ ఇంటికి క్షేమంగా చేర్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోవడంతో కధ సుఖాంతం అయింది. 
ఇదిగో ఇక్కడే ముందు చెప్పిన అంకెలు వాళ్లకు అక్కరకు వచ్చాయి. 
డ్రైవ్ చేస్తున్న పిల్లవాడికి 18 ఏళ్లు. కానీ 21 నిండలేదు. కాబట్టి అర్ధరాత్రి 12 తర్వాత కారు నడప కూడదు. అయితే ఆక్సిడెంట్ జరిగిన టైం 11.40. ఇరవై నిమిషాలు ముందే జరిగింది కాబట్టి కేసు అవసరం రాలేదు . అదొక అదృష్టం. లైసెన్స్ రద్దు అయితే అమెరికాలో బతుకు దుర్భరం. 
ఇక కారు ఇన్స్యూరెన్స్.
కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి కాబట్టి, వాటిని రిపేర్ చేయడం అసాధ్యంగా భావించిన, బీమా కంపెనీ వారు కొత్త కారు కొనుక్కోవడానికి గాను, అందుకయ్యే పూర్తి మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మూడు వారాల లోపే కొత్త వాహనాన్ని, తమకు ఇష్టం వచ్చిన మోడల్ ది, కాణీ అదనపు ఖర్చు లేకుండా కొనుక్కున్నారు. 
జరిగింది ప్రమాదమే అయినా,  రూల్స్ అన్నీ కలిసి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఇలాంటిదే మన దగ్గర జరిగితే పరిణామాలు ఎలా వుంటాయో  ఊహించడం కష్టమేమీ కాదు. పోలీసులనుంచి, బీమా కంపెనీల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కష్టాలు ఇన్నీ అన్నీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక్కడే ఒక విషయం చెప్పదలచుకున్నాను. 
మాన్యులకు, సామాన్యులకు చట్టాలు ఒకే విధంగా అమలు జరిగితే, 
మన దేశంలోనే కాదు,  ఏ దేశంలో కూడా  పౌరులు ప్రభుత్వాలు విధించే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించరు.
కాకపొతే, అవి అమలు చేసే/ జరిగే తీరు పట్లే వారి కినుక. 
(16-9-2024)

జీవనయానం

జీవనయానం - భండారు శ్రీనివాసరావు 

నడుస్తూనే వున్నాను
గత  డెబ్బయ్ ఏడేళ్లుగా,
వాగులు  వంకలు దాటుకుంటూ
దారులు డొంకలు వెతుక్కుంటూ 
నడుస్తూనే వున్నాను 
కొన్ని చోట్ల నా దారి రహదారి
పలు చోట్ల దారంతా వరద గోదారి
ముళ్ళకంపలు, చీకు మొక్కలు,
గుంటలు, గతుకులు.
పడుతూ లేస్తూ
నడుస్తూ వస్తుంటే అదోరకం  ఆనందం
అలా నడుస్తూ పోతుంటే మరో రకం విషాదం 
ఈ నడక ఎన్నాళ్ళో తెలియదు
పరుగులాంటి నడకకు చివరి మజిలీ ఏదో  తెలుసు
కానీ చేరేదేప్పుడో మాత్రం  తెలవదు
అయితే ఈ నడకలో నేను వొంటరిని కాను
నాతోపాటు కోటానుకోట్లమంది భుజం భుజం కలిపి నడుస్తూనే వున్నారు
వారిలో కొందరే తెలుసు, కొందరసలే తెలియదు
చాలా మంది ఎవ్వరో తెలియదు కానీ కలిసి నడవక తప్పదు
కొందరి భాష తెలుసు మరికొందరి యాస తెలుసు
చాలామంది ఊసే తెలవదు
నడిచి నడిచి ఒక్కోసారి అలసట అనిపిస్తుంది.
కానీ ఆగే పని లేదు,  ఆగడం మన చేతిలో లేదు
ఆగితే మాత్రం ఆగినట్టే
ఇక అక్కడితో నడక ఆగినట్టే
అదే ఆఖరి అడుగు
అదే చివరి మజిలీ 
కలిసి నడుస్తున్న వాళ్ళు లిప్తపాటు ఆగి చూస్తారు
అంతే!
మళ్ళీ నడక మొదలెడతారు.
నన్ను దాటుకుంటూ ముందుకెడతారు
నేను అక్కడే ఆగిపోతాను  
అయినా ఈ జీవన యానం అంతటితో  ముగిసేది కాదు 
ముగిసినట్టు అనిపించినా నిజానికి అది ముగింపు కాదు
తెలియని మరో ప్రయాణానికి కొనసాగింపు.

Note: Courtesy Image Owner

15, సెప్టెంబర్ 2024, ఆదివారం

సృష్టి జననం

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం 2003 సెప్టెంబర్ 15 వ తేదీన మా పెద్ద కుమారుడి చిన్న కుమార్తె సృష్టి, రెంటన్ లోని వ్యాలీ మెడికల్ సెంటర్ లో జన్మించింది. అందుకోసమే నేను మా ఆవిడ నిర్మల ఇద్దరం పురిటి సమయానికి కొద్ది రోజులు ముందుగానే సియాటిల్ చేరుకున్నాము. ఆడపిల్ల అనగానే మా ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు. 
మళ్ళీ ఇన్నేళ్లకి మనుమరాలు పుట్టిన రోజున నేను అమెరికాలో వుండడం యాదృచ్చికం. 
వెనుక ఫోటోలో ఉన్న మా ఆవిడ తన ముద్దుల మనుమరాలికి ఆశీస్సులు అందిస్తోందని నా నమ్మకం. 
చిన్నారి (ఇక్కడి లెక్కల ప్రకారం ఇక ఎంతమాత్రం అది చిన్నది కాదు, వయోజనురాలు) సృష్టికి నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.

ఎలా తినాలి అంటే ఇలా



పెద్ద హోటలే! ఏమున్నాయో చెబితే పర్వాలేదు కానీ, ఏది ఎలా తినాలో కూడా బొమ్మలు గీసి మరీ చెబితే ఎలా, అన్నప్రాశన నాడు తినిపించినట్టు. ఇంకా నయం గోరుముద్దలు చేసి నోట్లో పెడతాం అనడం లేదు.
శుక్రవారం సాయంత్రం బెల్ వ్యూ డౌన్ టౌన్ లోని ఆ హోటల్ కు చేరుకునేసరికే అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బయట కూర్చోవడానికి చాలా సోఫాలు, కుర్చీలు వున్నాయి. మాకు పిలుపు రావడానికి దాదాపు గంట పట్టింది.
లోపల విశాలమైన అయిదారు హాల్స్ వున్నాయి. ప్రతి దాంట్లో గుండ్రటి టేబుల్స్. వాటి చుట్టూ కూర్చుని చాలామంది డిన్నర్ చేస్తున్నారు. బహుశా నా లెక్క ప్రకారం లోపల మూడు వందలకు పైగా వున్నట్టున్నారు. నిశ్శబ్దం పాటిస్తున్న జాడ లేదు. ఇరవై ఏళ్లకు పూర్వానికి ఇప్పటికీ  నాకు అమెరికా జీవన విధానంలో కొట్ట వచ్చినట్టు కనపడిన మార్పు ఇదే. మొబైల్  ఫోన్ల మహత్యం అనుకుంటా.  
మాకు ఒక టేబుల్ చూపించారు. దానిమీద 'ఎలా తినాలి ?' అని రాసి వున్న డిస్ ప్లే బోర్డు కనిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా తినాలో కూడా వాళ్ళే చెబుతారన్న మాట. 
బెల్ వ్యూ డౌన్ టౌన్ లో  DIN TAI FUNG అనేది ఓ పెద్ద చైనీస్ రెస్టారెంట్. చాలా అంటే చాలా ఖరీదైనది కూడా. 
XIAO LONG BAO అనే నోరు తిరగని వంటకం ఆ హోటల్ స్పెషాలిటీ.అది ఎలా తినాలి అని తెలియ చెప్పడానికే ప్రతి టేబుల్ మీద ఒక డిస్ ప్లే బోర్డు పెట్టారు.
ఇరవై ఏళ్ల చైనీస్ యువతి వచ్చి ఫుడ్ ఆర్థర్ తీసుకుంది. 21 ఏళ్లు దాటితే కానీ హాట్ డ్రింక్స్ సర్వ్ చేయరు. మా పక్క టేబుల్ మీద ఒక కుర్రాడు తన గుర్తింపు కార్డు చూపడం కనిపించింది. పైకి అంత వయసున్న వాడిలా లేడు. అందుకే వయసు ధ్రువ పరచుకోవడానికి సర్వరిణి అతడ్ని గుర్తింపు కార్డు అడిగింది. ఆ తర్వాతే డ్రింక్ ఆర్డర్ తీసుకుంది. మద్యం విషయంలో నిబంధనలను చూసీ చూడనట్లు వదిలేయకుండా పద్ధతిగా వ్యవహరించిన తీరు నన్ను ఆకట్టుకుంది.

ఆర్డరు తీసుకున్న కాసేపటికి గుండ్రటి చెక్క పళ్ళేలలో ఆ నోరు తిరగని పదార్థాన్ని అందరికీ సర్వ్ చేశారు. తీరా చూస్తే చిన్న సైజు నూనెలో వేయించని పూర్ణంబూరెల మాదిరిగా వున్నాయి. వీటిని ఓవెన్ లో వేడి చేసి ఇస్తారు. అవి ఎలా తయారు చేస్తారో చూడవచ్చు కూడా. చిన్న చిన్న పిండి ముద్దలను చేతితో అదిమి అందులో ఏదో పదార్థం కూరను కూరి, వుండగా చుట్టి ఓవెన్ లో కాసేపు వుంచి చెక్క పళ్ళేలలో పెట్టి వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు.
అలాగే ఉడికించిన ఆకు కూరలు వగైరా.   చైనీస్ కదా తినడానికి చాప్ స్టిక్స్ ఇచ్చారు. 
ఈ తతంగాన్ని యావత్తూ నేను ఆస్వాదిస్తున్నాను కానీ, తినే తిండిని కాదని అర్థం చేసుకున్న మా కోడలు భావన ఇంటికి రాగానే వేడిగా అన్నం వండి వడ్డించింది.
అన్నదాతా సుఖీభవ!

నీతి: ఇంట్లో వండి పెట్టేవాళ్ళు వున్నప్పుడే బయట ఇలాంటి ప్రయోగాలు చేయాలి.

14, సెప్టెంబర్ 2024, శనివారం

భర్త గీత

భర్త గీత – భండారు శ్రీనివాసరావు 

పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని 'భర్త గీత' బోధించడం మొదలెట్టాడు.
'ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా!
'నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు కాఫీ కలిపి పట్రా అన్నాననుకో. ఎందుకనుకున్నావు. నీకు ఇబ్బంది అని తెలియక కాదు. ఆఫీసులో అలసిసొలసి ఇంటికొచ్చిన నాకు, నువ్విచ్చిన కాఫీ తాగగానే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక అప్పుడు ఎంచక్కా నువ్వు ఇరుగింటి, పొరుగింటి అమ్మలక్కల కబుర్లన్నీ ఏకబిగిన ఏకరువు పెట్టినా నాకేమీ అనిపించదు కనుక.
'నీతో కలిసి బజార్లో వెడుతున్నప్పుడు పక్కనుంచి ఓ అందమైన అమ్మాయి వెడుతుంటే నా చూపులు ఆటోమేటిగ్గా అటే తిరిగిపోతాయి. ఏం చెయ్యను చెప్పు మగాడ్ని కదా! అది చూసి నువ్వు కంగారు పడిపోతూ, మెలికలు తిరిగిపోతుంటావు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, నీ అందం ముందు ఎవ్వరి అందాలయినా దిగదుడుపే. ఆ విషయం ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకునేందుకే ఆడవాళ్లకేసి అలా చూస్తుంటాను. పిచ్చి మొహానివి. నీకు అర్ధం అయి చావదు.
'నీ చేతివంట చెత్త అని అప్పుడప్పుడు అంటుంటాను. నిన్ను తప్పు పట్టాలని కాదు. నా రుచిపచుల్లో ఏవన్నా తేడాపాళాలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని మాత్రమే అలా వంకలు పెడుతుంటాను.
'నిజమే. రాత్రి పూట నేను పెట్టే గురక కర్ణ కఠోరంగా వుంటుందని నాకూ తెలుసు. నేను అంత హాయిగా గురకపెట్టి నిద్ర పోతున్నానూ అంటే ఏమిటి అర్ధం. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను యెంత ప్రశాంతంగా వున్నానో నీకు అర్ధం కావాలనే.
'మొన్న నీ పుట్టిన రోజు మరచిపోయిన మాటా నిజమే. చిన్న కానుక కూడా కొనుక్కురాని మాటా నిజమే. ఇల్లెగిరిపోయేటట్టు నానా యాగీ చేసావు కానీ నీకు తెలియని విషయం చెబుతా విను. గిఫ్టుల మీద తగలేసే డబ్బు నేనేమన్నా కట్టుకుపోతానా చెప్పు. ఏది మిగిలినా అది నేను తాళి కట్టి కట్టుకున్న నీకే కదా!
'నేను చెప్పే ఈ భర్తగీత నీకు ఏమాత్రం నచ్చలేదన్న సంగతి నీ చేతిలో వున్న అప్పడాల కర్రే చెబుతోంది. ఇక ఆఖరుగా ఒక మాట చెబుతా. వినేసి, అప్పడాలకర్ర కింద పడేస్తావో, కింద వున్న కత్తిపీట చేతిలోకి తీసుకుంటావో అది నీ ఇష్టం.
'నన్ను నిలువునా నరికి ఉప్పు పాతర వేయాలని నీకు అనిపిస్తోంది. అయితే, హత్యానేరానికి, అందులోను మూడుముళ్ళు మెడలో వేసి, ఏడడుగులు కలిసి నీతో నడిచి నలుగురు ముందు పెళ్ళాడిన భర్తనే చంపడం అంటే అందుకు పడే శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ...........' 
(నెట్లో సంచారం చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో :

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అడ్డు కట్టలు



నిజమే! కొన్ని కొన్ని చాలా అత్యల్ప విషయాలే వినడానికి ఎంతో వింతగొలుపుతాయి అదేమిటో.
తెలుగు టీవీ సీరియల్స్ అంటే ఎలర్జీ. కొన్నాళ్ళు వాటిని చూస్తూ పొతే ఎలర్జీ అదే పోతుందన్నాడు ఒక ఉచిత సలహాదారు. ఆ మాటలు విని,  వరసగా రెండు రోజులు పనిగట్టుకుని సీరియళ్ళు చూసేసరికి ఆశ్చర్యంగా ఎలర్జీ మాయమయింది. కాకపొతే అవి అలవాటుగా మారుతుందేమో అన్న భయం పట్టుకుంది.
ఈ సీరియళ్ళలో నాకు నచ్చిన అంశం ఒకటి కనబడింది. టీవీ చర్చల్లో మాదిరిగా కాకుండా ఒక పాత్ర మాట్లాడుతుంటే మరో పాత్ర అడ్డం రాదు. ‘ఎంతపని చేసావు లక్ష్మీ’ అంటూ ఆమె మొగుడు ఓ అయిదు పేజీల డైలాగు మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చుకుంటూ, సగం కళ్ళతో మాట్లాడుతూ పోతుంటే ఆ భార్య పాత్ర పాపం కిమ్మనకుండా ఆసాంతం వింటుంది. అంతా అవనిచ్చి అప్పుడు మొదలు పెడుతుంది తన ఇన్నింగ్స్. ఇక ఆ మొగుడుగారు కూడా, టీవీ చూస్తున్న మనతో పాటు మరో శ్రోతగా మారిపోతారు. భార్య కడిగి గాలించి పారేస్తుంటే మౌనశ్రోతగా మిగిలిపోయి అప్పుడప్పుడూ క్లోజప్పులలో కళ్ళు విప్పార్చి చూస్తూ అలా ఒక శిలా విగ్రహంలా నిలబడి పోతాడు.
సంసారాల్లో మొగుడూ పెళ్ళాల నడుమ మాటామంతీ నడిచినా, అలాగే ఒకరి మాట మరొకరు ప్రశాంతంగా వినే వెసులుబాటు వున్నా ఇక ఆ సంసారంలో అపార్ధాల సీన్లకు అవకాశం ఉండదని, ఆ సంసార రధం నల్లేరు మీద బండిలా నడిచిపోతుందని ఓ సైకాలజిస్ట్ రాసిన గ్రంధంలో చదివిన జ్ఞాపకం.
అసలీ టెక్నిక్ పాండవోద్యోగ విజయాలు నాటకంలోనే వాడారని మా మేనల్లుడు అంటాడు. కృష్ణుడు పద్యం అందుకుని రాగయుక్తంగా పాడి చివర్లో పట్టుకున్న రాగాన్ని ఓ అరగంట సాగదీసి ముగించే వరకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడు కిరీటం సర్దుకుంటూ, మీసం దువ్వుకుంటూ వుండిపోతాడేకాని, తను పాడాల్సిన పద్యం వెంటనే ఎత్తుకోడు. అయినా ఆ నాటకానికి ఆ రోజుల్లో ‘రేటింగులు’ భేషుగ్గానే వున్నాయి.

టీవీ చర్చల్లో పాల్గొనే వాళ్లకి ఈ పాఠాలు ఎవరు చెబుతారు చెప్మా!


Courtesy Cartoonist Krishna garu

జ్ఞాపకాల రీలు

https://www.facebook.com/share/r/1AkAMoCjc3/?mibextid=D5vuiz

బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్

బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్

అమెరికాలో అందమైన ఆఖరి వారం నడుస్తోంది. 
ఈ నెల 17 న సియాటిల్ లో బయలుదేరి బాల్టి మోర్ వెళ్లి 22 న వాషింగ్టన్ డీ సీ నుంచి మేరా భారత్ మహా అనుకుంటూ విమానం ఎక్కడం. 
23 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చివరి వారం అంతా గిఫ్టులు కొనడంతోనే సరిపోయింది. ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ దొరికేవి అన్నీ అక్కడే రూపాయల్లో దొరుకుతున్నాయి.
కొద్ది సేపటి క్రితం మా వాడు పోస్టులో వచ్చిన ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. తెరిచి చూసాను. అందులో ఫ్రేం కట్టిన ఒక సర్టిఫికెట్ వుంది.

" 2 trees have been planted in a U.S. National Forest in memory of 
NIRMALA & SANTOSH BHANDARU "

నిజంగా ఇది నాకు జీవితంలో లభించిన బెస్ట్ గిఫ్ట్.
థాంక్స్ సందీప్, థాంక్స్ భావన.
Trees for a change 
Give a gift, Restore a Forest 
అనే నినాదంతో, 
చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం తలపెట్టిన పథకాల్లో ఇదొకటి. 35 డాలర్లు చెల్లిస్తే మనం చెప్పిన వారి పేరు మీద ఇక్కడి నేషనల్ ఫారెస్ట్ లో ఒక మొక్కను నాటుతారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను పోస్టులో భద్రంగా పంపుతారు. ఆ  మొక్క ఎక్కడ, ఏ ప్రాంతంలో నాటారో తెలిపే లోకేషన్ కూడా షేర్ చేస్తారు.
దేశం కాని దేశంలో మా ఆవిడ పేరుతో నా రెండో కుమారుడి పేరుతో రెండు చెట్లు పెరగడం కంటే కావాల్సింది ఏముంది? 
పైగా ఇక్కడ అడవుల్లో చెట్లు నరకడం నిషిద్ధం మాత్రమే కాదు, నేరం కూడా.
12-9-2024

12, సెప్టెంబర్ 2024, గురువారం

సీతారాం ఏచూరి ఇక లేరు

ప్రముఖ మార్క్సిస్టు కమ్యూనిస్టు యోధుడు శ్రీ సీతారాం ఏచూరి ఇక లేరు. 72 సంవత్సరాలు పెద్ద వయసేమీ కాదు ఈ రోజుల్లో. 
తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన కొద్దిమంది ఈ తరం రాజకీయ నాయకులలో ఒకరు. రేడియో విలేకరిగా అనేక సార్లు వారిని కలుసుకునే అవకాశాలు దొరికినప్పటికీ, కాసింత తీరిగ్గా కబుర్లు చెప్పుకునే వీలు 
డాక్టర్ గోపాల్ కుమారుడి వివాహసందర్భంగా ఇచ్చిన రిసెప్షన్ లో దొరికింది. ఆ రాత్రి కూడా ఆయన ఢిల్లీ వెళ్లే ఫ్లయిట్ అందుకునే హడావిడిలో ఉన్నారు. డాక్టర్ గోపాల్, సీతారాం ఇద్దరూ క్లాస్ మేట్స్.

కింది ఫొటో:
 వేదిక:  సికిందరాబాదు సెయిలింగ్ క్లబ్   
ఎడమ నుంచి కుడికి : నేను, జ్వాలా నరసింహా రావు (అప్పట్లో తెలంగాణా సీఎం సీపి ఆర్వో),  సీతారాం ఏచూరి (ప్రత్యేక పరిచయం అవసరం లేదు) డాక్టర్ గోపాల్, డాక్టర్ భరత్, గీత రామస్వామి( హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చైర్ పర్సన్)


ఫొటో కర్టసీ:
 Bharath BabuDr

11, సెప్టెంబర్ 2024, బుధవారం

బిగ్ డిబేట్



అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ప్రస్తుతం జరుగుతున్న టీవీ డిబేట్ ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తిలకిస్తున్నారని అంచనా. 
ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా ఆధిపత్య భావాలు కలిగివుండే అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నవంబరులో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనడం అతి సహజం. 
అమెరికన్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ ఘడియ రానే వచ్చింది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం,  డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి Ms. కమలా హారిస్ (59) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వేదిక పైకి వచ్చి చెరో వైపు నిలబడ్డారు. రాగానే,  కమలా హారిస్ మందహాసం చేసుకుంటూ, ట్రంప్ నిలబడిన వైపు చకచకా నడుచుకుంటూ వెళ్ళి కరచాలనం కోసం చేయి చాపి, (అయామ్) కమలా హారిస్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు. ఒకప్పుడు ఆమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమలా హారిస్ ఇలా ఎదురు పడిన సందర్భం ఇదే మొదటి సారి అని తెలుస్తోంది.
డిబేట్ ఇంకా కొనసాగుతోంది. ప్రజాభిప్రాయాన్ని మలుపు తిప్పడంలో ఈ డిబేట్ అత్యంత క్రియాశీలకం అని అంటారు. అభ్యర్థులు మాట్లాడుతున్న తీరు, వారి హావ భావాలు, తమ విధానాలను వివరించే విధానం కూడా కీలకం అంటారు. 
రెండు గంటలకు పైగా సాగే ఈ కార్యక్రమంలో ఇంతవరకు చర్చ ప్రశాంతంగానే జరుగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు ట్రంప్ కేంద్ర బిందువు అనే పేరు వుంది కనుక వీక్షకులకి ఈ డిబేట్ పట్ల ప్రత్యేక ఆసక్తి.
ట్రంప్ మాట్లాడుతున్నప్పడు కమలా హారిస్ ఆయననే చూస్తూ వుండడం, ట్రంప్ మాత్రం ఆవిడ వైపు చూడకుండా తనదైన ధోరణిలో మాట్లాడడం ఇంతవరకు నేను గమనించిన విశేషం.
(7 PM, Seattle)

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

దరిద్రం ఎలా వుంటుంది?



(2012 లో  హిందూ పత్రికలో వచ్చిన కధనానికి నా స్వేచ్చానువాదం)

చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ  కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు  ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్  హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల  కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి  ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టం లేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా  రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం ?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన  వారికి కలిగిన మరో  ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని  బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500  రూపాయలు. అంటే రోజుకు  నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు.  దేశ జనాభాలో 75  శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం  వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి  మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించు కోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి,వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయం పాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే  పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు.  అయిదు కిలోమీటర్లకు  మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు.  అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట  వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే  చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండి పోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని  ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26  రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ,  ఇవే వారి రోజువారీ ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా  వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే  వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.                   

అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం,ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు  ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల  మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భ దారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితులనడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.     
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం  మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా? మానవ కల్పితమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు  మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మేమే. అంటే  మనమే. అన్నింటికన్నా  ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న  ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడం. (12-08-2012)

9, సెప్టెంబర్ 2024, సోమవారం

అరాచకోపాఖ్యానం

అరాచకోపాఖ్యానం - భండారు శ్రీనివాసరావు 

" నువ్విక్కడ మాట్లాడకుండా బతక లేవు. రేపక్కడ ( మాస్కోలో) మాట్లాడితే బతక లేవు. ఎలా మరి?"
37 సంవత్సరాల క్రితం రేడియో మాస్కోలో పనిచేసేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరే ముందు నా తత్వం బాగా తెలిసిన మిత్రుడు ఒకడు అన్న మాట. (సోవియట్ యూనియన్ అంటే ఇనుపతెర దేశం అనే  విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ చెప్పిన మాట అది)
కానీ నా తత్వం గురించి చెప్పాను కదా! రూల్ అంటే అతిక్రమించడం. రూలు పాటించక పోతే ఎలా బతుకుతావు అనేది నా మిత్రుడు సున్నితంగా చేసిన హెచ్చరిక సారాంశం. 
అక్కడకు అంటే మాస్కో చేరిన తర్వాత చూస్తే పరిస్థితులు అలాగే వున్నాయి. మెట్రోల్లో, బస్సుల్లో, ట్రాముల్లో ఎక్కడ చూసినా నీరవ నిశ్శబ్దం. ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. మెట్రో ఎక్కగానే ఏదో పత్రికో, పుస్తకమో పట్టుకు కూర్చుంటారు. తమ స్టాపు రాగానే నిశ్శబ్ధంగా దిగిపోతారు. 
మేము నివాసం వుండే భవనంలో మాస్కో రేడియోలో పనిచేసే ఇతర భారతీయ భాషల న్యూస్ రీడర్స్ కూడా కాపురాలు వుంటారు. మొదట్లో అందరం కలిసే ఆఫీసుకు వెళ్ళే వాళ్ళం. వాళ్ళందరూ నియమాలు తు చ తప్పకుండా పాటించే రకం. పదింటికి ఆఫీసులో వుండాలి అంటే ఓ అయిదు నిమిషాలు ముందే వెళ్ళే వాళ్ళు. అందరం చేయాల్సిన పని ఒక్కటే. రేడియో అధికారులు బులెటిన్ ఇంగ్లీషులో తయారు చేసి తలా ఒక కాపీ ఇస్తారు. ఎవరి భాషల్లో వాళ్ళు దాన్ని తర్జుమా చేసి, స్టూడియోకి వెళ్లి చదవాలి. ఓ అరగంట వార్తలు, మరో అరగంట సర్కారు వారి విధివిధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి సుదీర్ఘ వివరణలు. ఈ గంట ప్రోగ్రాముకు మూడు గంటలు ముందు పోవడం ఎందుకు అనిపించి వార్తల టైముకి గంట ముందు పోయేవాడిని. దీనికి రెండు కారణాలు. ఒకటి ఆలస్యంగా లేచే అలవాటు. రెండోది ఇంటి భోజనం తప్ప బయట తినలేని బలహీనత. రేడియో క్యాంటీన్ లో మంచి భోజనం దొరుకుతుంది. కానీ నాకు సయించేది కాదు. నిజానికి ఇవన్నీ నా సమస్యలు. రేడియో వారికి ఏం సంబంధం? 
కానీ నా పద్ధతి నాది.
గీర్మన్ అని నాకు ఒక రష్యన్ సహాయకుడు వుండే వాడు. పది గంటలకు నేను సీట్లో కనబడకపోతే కంగారుగా ఇంటికి ఫోను చేసే వాడు. 
" మీరు ఇంకను రేడియోలో ప్రవేశించ లేదు. సమయము అవధి దాటుతుంది " అనేవాడు వచ్చీరాని తెలుగులో.
 " నేను టైముకి రావాలా? లేక టైముకి వార్తలు ప్రసారం కావాలా? " అని ఎదురు ప్రశ్నించే వాడిని.
కొన్నాళ్ళకు అతడికే బోధ పడింది, నేను ఎంత ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళినా అనువాదం పని పూర్తి చేసుకుని కరక్టుగా టైముకి వార్తలు చదవగలనని.
బెజవాడ ఆంధ్ర జ్యోతిలో కాలాలకు కాలాలు, పేజీలకు పేజీలు అనువాదం చేసిన అనుభవం రేడియో మాస్కోలో నాకు ఉపయోగపడింది.
నాకు అర్ధం కానిది ఒక్కటే, రూలు ప్రకారం నడిచే ఆ దేశంలో నా అరాచకాన్ని ఎలా అనుమతించారని.

క్వాలిటీ ఒకటే ధరలే వేరు

 

మొన్న మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, ఓటీటీ లో ఓ అర్థం కాని సినిమా చూసిన తర్వాత బయటకి పోదాం అన్నారు. కారు డిక్కీలో చాలా సామాను సదిరారు. 
ఇంటికి తిరిగి వచ్చేసరికి పొద్దు పోతుందేమో అనుకున్నా. పైగా శుక్రవారం సాయంత్రం కూడా.
నేరుగా ఒకచోటికి వెళ్ళాము. అక్కడ వరుసగా కార్లు ఆగి ఉన్నాయి. వాటి నుంచి ఏవో సామాన్లు దింపుతున్నారు.
మా వంతు వచ్చింది. డిక్కీ నుంచి ఇంటి నుంచి తెచ్చిన సామాగ్రి అంటే అంతగా వాడని షూస్, కోట్లు, దుస్తులు, పిల్లల బొమ్మలు, డెకొరేటివ్   గాజు వస్తువులు ఇలా ఎన్నో రకాలు.
తర్వాత పక్కనే వున్న GOOD WILL మాల్ లోకి వెళ్ళాము. అక్కడ లేని వస్తువు అంటూ లేదు. అవన్నీ నగర పౌరులు తమకు అట్టే ఉపయోగపడని, అవసరంలో వున్నవారికి ఇవ్వడానికి వీలుగా డొనేట్ చేస్తారు. గుడ్ విల్ కంపెనీ వాటిని శుభ్రం చేసి, కొత్త వాటికి ఏమాత్రం తీసిపోకుండా వున్న క్వాలిటీతో, అవసరం వున్నవారికి అతి తక్కువ ధరకి విక్రయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఈ ఏర్పాటు. కంపెనీకి వచ్చిన ఆదాయాన్ని ఛారిటీకి ఇస్తారు. చాలా చౌకగా దొరికే ఈ షాపులో కొనుగోళ్లు చేయడానికి విరగబడతారని అనుకున్నా కానీ నా అభిప్రాయం తప్పయింది. 
బయటకు వస్తున్నప్పుడు మా వాడు ఒక మాట చెప్పాడు, ఇన్నేళ్లుగా ఇక్కడ వుంటున్నా కూడా ఈ మాల్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అనీ, మీరు రాసుకోవడానికి ఏదైనా మ్యాటర్ దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో తీసుకు వచ్చాను అని. 
తరువాత మార్షల్స్ అనే ఓ పెద్ద దుకాణానికి వెళ్ళాము. సైజులో కానీ, వస్తువుల లభ్యతలో కానీ, నాణ్యతలో కానీ, సిబ్బంది వ్యవహార శైలిలో కానీ రెండు మాల్స్ లో ఎలాంటి తేడా కనపడలేదు, ఒక్క ధరవరల విషయంలో తప్పిస్తే.

తోక టపా:
ముప్పయ్యేళ్ళ క్రితం మేము మాస్కో వెళ్ళినప్పుడు రేడియో మాస్కో వాళ్ళే ఇల్లు, ఇంటికి కావాల్సిన సామాను అన్నీ సమకూర్చారు. కొంత కాలం గడిచిన తర్వాత ఎంత కాలం ఈ పాత సామాను అనుకుని ముందు ఒక ఫ్రిజ్ కొన్నాము. మాస్కో పోయేంతవరకూ మాకు ఫ్రిజ్ లేదు. అక్కడ ప్రతీదీ కారు చవకే కాబట్టి అలా వెళ్లి ఇలా కొనేసాము. కొన్న తర్వాత పాత ఫ్రిజ్ ఏం చేయాలనే మీమాంస ఎదురయింది. మాస్కో రేడియో వాళ్ళు రిటర్న్ చేయక్కర లేదన్నారు. ఆ అపార్ట్ మెంట్లో ఏదైనా సమస్యలు ఎదురయితే వచ్చి బాగు చేయడానికి ఒక మనిషి వున్నాడు. అతడిని పిలిచి ఫ్రిజ్ తీసుకోమని అంటే అతడు మమ్మల్ని ఎగాదిగా చూసి, డస్ట్ బిన్ లో  పడేయమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఎంత ఖరీదు అయిన వస్తువు అయినా కూడా ఉచితంగా ఇస్తే ఎవరూ తీసుకోరని అర్థం అయింది.

కింది ఫోటోలు:
మొదటి రెండు GOOD WILL MALL
చివరి రెండు
MARSHAL'S MALL

జేసీబీ



ఈ మధ్య  ఎక్కువగా వినపడుతున్న పదం జేసీబీ. (JCB). మట్టి గుట్టలను తవ్వే ఒక భారీ యంత్రం. కానీ ప్రస్తుతం దీన్ని అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చడానికి ఉపయోగిస్తున్నారు. అదిగో పులి అంటే జనాలు భయపడినట్టు, జేసీబి కనపడగానే హైదరాబాదులో కొందరు కాలనీ వాసులు ఉలిక్కి పడుతున్నారు. 
ఇంతకీ జేసీబీ అంటే ఏమిటి అర్థం? 
ట్రాక్టర్ అంటే పొలాలు దున్నే యంత్రం. మరి జెసీబీ అంటే కూల్చే యంత్రమా! ప్రస్తుతానికి అదే అర్థంలో ఈ పదాన్ని అర్థం చేసుకుంటున్నారు.
నిజానికి JCB అంటే: 
Joseph Cyril Bomford 

ఈ పేరు కలిగిన ఒక ఆంగ్లేయుడు ఇంగ్లాండ్ లో 1945 లో ఈ యంత్రాలు తయారు చేసే కర్మాగారాన్ని తన పేరుతో నెలకొల్పాడు.
ఆ పేరుతోనే ఈ యంత్రాలు ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలోకి వచ్చాయి.
ఒక్కొక్కటి సుమారు నలభై, యాభయ్ లక్షలు ఖరీదు చేసే ఈ జేసీబీలు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి.

ఫోనుంటే తోడున్నట్టే..

ఫోనుంటే తోడున్నట్టే..

కాలం ఎంత మారింది. ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు నా కాలక్షేపం కోసం తెలుగు టీవీ ఛానెళ్లు వచ్చేలా డిష్ టీవీ పెట్టించారు. ఇప్పుడు అలాంటి ప్రయాసలు ఏమీ అక్కర్లేదు. 
అయినా మొబైల్ తోనే సర్వస్వం అన్నట్టు తయారయింది నేటి పరిస్థితి. 
పెద్ద పెద్ద టీవీలు ప్రతి గదిలో వున్నాయి కానీ ఓటీటీలకే పరిమితం.

8, సెప్టెంబర్ 2024, ఆదివారం

జోడు గుళ్ళ పిస్తోలు ఠా!

జోడుగుళ్ళ పిస్తోలు ఠా! - భండారు శ్రీనివాసరావు 

ట్రిగ్గర్ నొక్కగానే వాయువేగంతో తూటా దూసుకుపోయే చిన్న పిస్తోళ్ళ నుంచి, పేల్చగానే గుళ్ళ వర్షం కురిపించే ఏకే 47 తుపాకుల వరకూ పెద్ద సంఖ్యలో గోడకు వేలాడుతూ కనిపించాయి.
బెల్ వ్యూ లో వున్న అనేక మారణాయుధాల దుకాణాల్లో (WADE) ఒకటి. కౌంటర్ మీద అమ్మే షాపే కానీ, వెంటనే డెలివరీ ఇవ్వరు. పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన పిదప ఇస్తారు. అంతా ఆన్  లైన్ వ్యవహారమే కాబట్టి ఈ తతంగానికి ఎక్కువ సమయం పట్టదు. 
ఈ దుకాణంలోనే ఫైరింగ్ రేంజ్ వుంది. కొంత రుసుము చెల్లిస్తే నిజమైన పిస్తోలుతో/ తుపాకీతో కాసేపు ఢమఢమలాడించి రావచ్చు.
అప్పటికే షాపులో ఇద్దరు ముగ్గురు యువకులు ఆయుధాలు కొనుక్కునే పనిలో ఉన్నారు. 
వారం రోజుల క్రితం కుమారుడి పుట్టిన రోజు కానుకగా పిస్తోలు ఇవ్వడం,  ఆ పిల్లాడు అది పట్టుకుని స్కూలుకు వెళ్ళి టపటపా నలుగుర్ని కాల్చి చంపడం టకటకా జరిగి పోయింది ఈ దేశంలోనే.
ఇది స్ఫురణకు రాగానే ఇది మనం మసిలే ప్రదేశం కాదని ఫొటోలు తీసుకుని బయట పడ్డాము.
7-9-2024











7, సెప్టెంబర్ 2024, శనివారం

మిచ్ఛామి దుఃఖడం

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు

పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ‘సారీ’ అనే పదం ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చేసిన తప్పులను దేవుడికి నివేదించి క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారంలోకి వచ్చింది. (Courtesy : Dr. Balaji Utla )
 దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖఃడం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
దుఖఃడం అంటే దుష్కృ త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వకాలంలో ఎనిమిదో రోజున , భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘ నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.

అమెరికాలో ఈరోజు చవితి. 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ పండుగ, పూజ ఘనంగా జరిపాము. ఈసారి చేయలేదు. కారణం గత ఫిబ్రవరిలో మా రెండో వాడి ఆకస్మిక మరణం.

5, సెప్టెంబర్ 2024, గురువారం

నా తొలి గురువుకు వందనం



చిన్నప్పుడు నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు.

తెలిసినదల్లా మాష్టారంటే శివరాజు అప్పయ్య పంతులు గారు.

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా.

మాచిన్నప్పుడు,  గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంధ్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. వూరు మొత్తానికీ అదే పేపరు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

అప్పయ్య  మాస్టారు  ఇప్పుడు లేరు, ఆయన జ్ఞాపకాలు ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న మా వంటి వారిదగ్గర పదిలంగా వున్నాయి.
గరుభ్యోనమః 🙏


ఈ లోకమే ఒక అద్దె ఇల్లు


“ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను
ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు. 

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ,
రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్
కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను.
గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని
స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి
మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు
వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే
దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు
వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే
అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు
చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని
అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను
గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి
వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది. 

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని.
అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు,
ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే  కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన
వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు. 

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా 
ఆర్డర్ వచ్చింది. 

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము. 

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా పని చేసి రిటైర్ అయిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు సొంత ఇల్లు లేకుండానే దాటి పోయారు.
తన ఉద్యోగ పర్వంలో కోట్ల రూపాయల ఇంటి రుణాలు మంజూరు చేసి స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారికి అమెరికాలో వుంటున్న అబ్బాయి కొనేంతవరకు సొంత ఇల్లు లేదు.
ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద  పదేళ్ళకు పైగా సీపీ ఆర్వో గా పని చేసిన మితృడు జ్వాలా నరసింహారావు కు కొడుకు కొనే దాకా స్వంత ఇల్లు అమరలేదు.
ఇంకా నేనెంత?
అసలు ఈ లోకంలో అందరూ నివసిస్తోంది అద్దె ప్రపంచంలో. పై వాడు ఎప్పుడు ఖాలీ చేయమంటే అప్పుడు తట్టాబుట్టా సదురుకోకుండానే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి.

టపాని మించిన తోక టపా:
ఇది రాయడం కోసమే అసలు టపా.
78 ఏళ్ల వయసులో హైదరాబాదుకు వేల మైళ్ళ దూరంలో ఎక్కడో అమెరికాలో పశ్చిమ కొసన వున్న సియాటిల్ నగరం బెల్ వ్యూ లో MADRONA PARK కాలనీలో మా పెద్దవాడు కొనుక్కున్న ఇంటిలో  విశ్రాంతి తీసుకుంటూ వున్నప్పుడు ఈ పాత విషయాలు అన్నీ సినిమా రీలులా కళ్ళ ముందు తిరిగాయి. ఏది ఎప్పుడు ప్రాప్తమో అప్పుడే దొరుకుతుంది.
అమెరికాలో అందరి ఇళ్లు ఇంచుమించు ఇలాగే అనేకంటే ఇంతకంటే గొప్పగానే వుంటాయి. ఇండియా మధ్య తరగతి కళ్ళతో చూసే నా బోంట్లకి  ఇదే గొప్ప అనేలా వున్న మాట నిజం. 
నా పడక గది చాలా విశాలం. ఆనుకునే హోమ్ థియేటర్ హాలు, కాఫీ బార్, దీనికి తోడు అసలు బార్, మసాజు చైర్, బాత్ టబ్ వున్న రెస్ట్ రూమ్, అన్నింటికీ మించి నా మంచం పక్కనే గోడకు నాకు తోడుగా మా ఆవిడ ఫొటో.
ఇంతకంటే ఏం కావాలి?

చివరాఖరులో ఒక చిన్న మాట:
ఒక తరం జర్నలిస్టులు రిటైర్మెంట్ తర్వాత కొంత ఆర్థికంగా స్థిరపడడానికి కారణం వారి ప్రయోజకత్వం కాదు. వారి పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకుని జీవితంలో పైకి ఎదగడం.

2, సెప్టెంబర్ 2024, సోమవారం

అయిదే అయిదు నిమిషాలు

అయిదే అయిదు నిమిషాలు. నా విషయంలో ఇంకా తక్కువే. అదీ నా తెలివి తక్కువతనం వల్ల. 

ఈసారి అమెరికా వచ్చేముందు ఓ విషయం గట్టిగా అనుకున్నాను. ఏమైనా సరే, ఈ వయస్సులో పిల్లలను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయరాదని. 

లాంగ్ వీకెండ్ లో లెవెన్ వర్త్ నగరం వెళ్లి వద్దామని మావాడు అన్నాడు. పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు వెళ్ళాము. మా ఆవిడతో అప్పుడు కలిసి తిరిగిన ప్రదేశాలు మళ్ళీ చూసి రావాలని మనసులో కోరిక. 
సియాటిల్ నుంచి రెండున్నర గంటలు ప్రయాణం చేసి లెవెన్ వర్త్ చేరుకున్నాము.
 జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి. వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి. అలాగే జర్మన్ బీర్. ఎందుకో నిన్న ఆదివారం ఎండ మండి పోతోంది. ఎండలో కూడా బీరు ప్రియులు రోడ్ల మీద క్యూల్లో నిలబడి వుండడం ఆశ్చర్యం కలిగించింది.

 

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి, తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు.  వైన్  రుచి  చూడడం  పరవాలేదు  

 గతంలో తిరిగిన ప్రదేశాలే. అయితే ఈసారి మావాడు అడ్వెంచర్ పార్కు టిక్కెట్లు ముందుగానే బుక్ చేశాడు. ఇలాంటి అడ్వంచర్ లు చేయడం అవసరమా అని మనసులో ఓ మూల పీకుతోంది. భయం కంటే ఏదైనా జరగరానిది జరిగితే అవస్థలు పడేది నేనే కాదు పిల్లలు కూడా. కొండలు, లోయల మీద సాగే అడ్వెంచర్. వద్దనుకుంటూనే లోపలకు వెళ్ళాను. సందర్శకులతో కిటకిట లాడుతోంది. పెద్ద క్యూ. చివరికి మా వంతు వచ్చింది. అతడెవరో చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అడ్వెంచర్ మొదలయింది. ముందు వాహనంలో మా మనుమరాలు సృష్టి. తర్వాత నేను, ఆ తర్వాత మా అబ్బాయి, కోడలు. కంట్రోల్ మన చేతిలోనే వుంటుంది. ముందుకు నొక్కితే స్పీడ్ పెరుగుతుంది. వెనక్కి లాగితే వేగం తగ్గుతుంది అని ముందే చెప్పారు.
పట్టాలు నిలువుగా పైపైకి కనపడుతున్నాయి. పైకి చేరిన తర్వాత నిటారుగా కిందికి జారిపోతాం. అలాగే గుండ్రంగా మలుపులు తిరుగుతూ అగాధమైన లోయల్లోకి... మధ్యలో ఓ కంట్రోల్ టవర్ నుంచి పరిశీలిస్తున్న ఓ అమ్మడు నా వైపు చేతులు ఊపుతూ సైగలు చేస్తోంది. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని వేగం పెంచాను. అపరిమితమైన స్పీడుతో అనేక వంకర్లు తిరుగుతూ లోయలు, కొండల మీదుగా జారి పోతూ ఎట్టకేలకు గమ్యం చేరింది. 
ఆ తరువాత కాసేపటికి మా పిల్లలు వచ్చి, ఇంత త్వరగా ఎలా వచ్చావు అని అడిగేవరకూ నేను చేసిన పొరపాటు నాకు అర్ధం కాలేదు.
ఈ అడ్వెంచర్ గురించి మన ఫొటో ఒకటి వాళ్ళే తీసి పది డాలర్లకు అమ్ముతున్నారు. ఎండ తగలకుండా పెద్ద టోపీ తగిలించు కోవడం వల్ల గుర్తు పట్టేలా లేదు.

 ఈ అడ్వెంచర్ పార్క్ గురించి యూ ట్యూబ్ లింక్:

https://youtube.com/shorts/Cv_LD0l5YeM?si=VUqLbpvDF2vAump1