30, జూన్ 2017, శుక్రవారం

కుటుంబ ఆదాయం ఏడాదికి ఒక రూపాయి – గిరిజాపతి ఎర్రంశెట్టి


“మాది భీమవరం పట్టణం. అప్పటికే మాది బాగా కలిగిన కుటుంబం.  తదనంతర కాలంలో మా కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది. నేను భీమవరం ఎస్. సి. హెచ్ బి. ఆర్. ఎమ్ హైస్కూలులో ఆరోతరగతి చదువుతున్నాను. ఆ దశలో మా మాతా మహులు మా కుటుంబాన్ని నరసాపురం మండలంలోని మల్లవరం గ్రామానికి తీసుకు పోయారు. అది 1968 సంవత్సరం. నన్ను ప్రక్కనే ఉన్న మత్స్యపురి గ్రామములోని జిల్లా పరిషత్తు హైస్కూల్ లో చేర్చారు. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఫీజులో రాయితీ ఉండేది. అందుకు తహశీల్దారు సర్టిఫికేట్ కావాలి. అది కావాలంటే మున్సబు లేదా కరణం ముందు సర్టిఫై చేస్తే ఆతర్వాత తహశీల్దారు సంతకం పెట్టేవారు. మల్లవరం మున్సబు ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు. ఆయనదంతా రాయల్ వ్యవహారం. ఆబాద్యతను కరణంగారికి అప్పగించారు. ఆ కరణం గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గ్రామములో మకాం ఎక్కువగా ఉండేవారు కాదు. కుటుంబం గ్రామములో ఉండేది కరణం గారు మాత్రం నరసాపురం టౌన్ లో ఉండేవారు. గ్రామ నౌకర్లు కూడా ఎక్కువగా ఆయన వెంటే ఉండేవారు. కరణంగారికి జీతముతో పని లేదు. ఆస్ధి పరుడు. టౌన్ లో ఉంటూ దర్జా అనుభవించే వారు. ఆయన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. తిరగ్గా తిరగ్గా దొరికే వారు. సరే! నేను అంత చిన్న వయసులోనే ఇన్కం సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. లక్కీగా నేను వెళ్ళే టప్పటికి నరసాపురంలో రూములో ఉన్నారు. ఇన్కం సర్టిఫికేట్ కావాలన్నాను. ఎవర్రా నువ్వు? అన్నారాయన. నేను మాతామహుని పేరు (ఆరేటి చల్లయ్య) చెప్పి, ‘ఆయన  మనవడిని’ అన్నాను. ‘ఎం కు కావాలిరా? అన్నారు. మాకు ఆదాయం ఏమి లేదని రాయమన్నాను. ‘ఓయ్! ఆదాయం వద్దంటే కుదరదు. ఎంతో కొంత రాస్తాను’ అన్నారు. అని సంవత్సరం ఆదాయం ఒక్క రూపాయి అని రాశారు. ఆయనది గొలుసు కట్టు రాత. ఆపైన అక్షరాలను విరగొట్టి రాసేవారు.ఫలితంగా ఆయన రాత ఎవరికీ అర్ధం అయ్యేది కాదు. సరే ఆ రాసిన కాగితం తీసుకొని నేను తాలూకా కార్యాలయానికి వెళ్ళాను. దఫేదారుకి ఇచ్చాను. ఆయన తహశీల్దారు వద్దకు సంతకం కోసం తీసుకు వెళ్ళినాడు. కాసేపటికి దఫేదారు వచ్చి లోపలికి రమ్మని అన్నాడు. తహశీల్దారు వద్ద నిలబెట్టినాడు. ‘ఏమయ్యా! మీ కుటుంబ ఆదాయం ఏడాదికి ఒక్క రూపాయా? అని అడిగారు. మాకు ఆదాయం లేదు అన్నాను. ‘వెళ్ళి మీ కర్ణాన్ని తీసుకొని రా’ అని ఆకాగితం నా చేతికి ఇచ్చారు. ఊసూరంటూ మరల కరణం గారి వద్దకు వెళ్లాను. ‘ఏరా మళ్లీ వచ్చావు ఏమిటి’ అన్నారు. తహశీల్దారు సంతకం పెట్టలేదు, మిమ్మల్ని తీసుకొని రమ్మని అన్నారు. సంవత్సరం ఆదాయం రూపాయి ఏమిటి? అని అడిగారు’ అని చెప్పినాను. దానితో మాకరణం గారు ‘వాడు సంతకం పెట్టడా? సరే నడు’ అని వడివడిగా బయటకు వచ్చారు. ఆయనకు నరసాపురంలో రిక్షా వాడు ఎపుడూ కూడానే ఉండేవాడు. కరణం గారు బయటకు రాగానే రిక్షావాడు ఆయన దగ్గరకు రిక్షాతో సహా వచ్చాడు. కరణం రిక్షా ఎక్కారు. తర్వాత ‘ఒరే రిక్షా ఎక్కరా’ అని కరణం గారు నాతొ అన్నారు. ఎక్కాను. ‘తాలూకాఫీసుకు పోనీయరా? అన్నారు రిక్షా వాడిని. అక్కడ దిగిన తర్వాత నా చేతిలో ఉన్న కాగితం తీసుకొని తహశీల్దారు వద్దకు వెళ్ళినారు. లోపల ఏం జరిగినది తెలీదు. కాసేపటికి బయటకు వచ్చి కాగితం నాచేతిలో పెట్టారు. ‘వెళ్లిపో’ అన్నారు. అందులో తహశీల్దారు సంతకం ఉంది. నేను ఎదిగే కొద్ది తెలిసినది కరణం గారి పవరేమిటో! కరణం గారి ఇంటి పేరు కాళ్ళకూరి వారు. ఆయన పేరు చిట్టి రాజు. చింతామణి నాటకం రాసిన కాళ్ళకూరి నారాయణరావు గారు వీరు జ్ఙాతులు. నారాయణరావు గారిది ప్రక్క గ్రామము మత్స్యపురి.జమీందారులు”

( ఇంతకి ఈ కధ ఎందుకు గుర్తు వచ్చినదంటే తహశీల్దారు సంతకం ఖరీదు 5 రూపాయిలని భండారు శ్రీ నివాసరావుగారు ఒక అనుభవం రాశారు. దానిపై ఇది గుర్తొచ్చింది.భండారు వారికి కృతజ్ఞతలతో - గిరిజాపతి ఎర్రంశెట్టి)

కామెంట్‌లు లేవు: