5, జులై 2024, శుక్రవారం

సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు ఇక లేరు

 

 


ఈరోజు సాయంత్రం చిల్కూరు లోని బాలాజీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుంటే సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు గారు ఇకలేరంటూ మితృలు శ్రీ పారుపల్లి శ్రీధర్ మెసేజ్ పెట్టారు. ఆ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. ఉపేంద్రబాబు గారితో నా పరిచయం సుదీర్ఘమైనది ఏమీ కాదు. కేవలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. కానీ అది వంద సంవత్సరాలు గుర్తుంచుకోవాల్సిన పరిచయం.

వెనక్కి వెడితే.

 పందొమ్మిది వందల  డెబ్బయి ఒకటి, ఆగష్టు నెల, ఇరవయ్యవ తేది. విజయవాడలబ్బీపేటలోని ' ఆంధ్రజ్యోతికార్యాలయం.

అందులో అడుగు పెట్టి, కింద ఛాంబర్ లో కూర్చుని పనిచేసుకుంటున్న  ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా నావైపు  చూసినా పరిచయం కనుక్కుని, 'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పుఅన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్టతొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్రగారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. పీ.టీ.ఐ.యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం. ఆ విధంగా  ఉపేంద్రబాబు జర్నలిజంలో నా మొదటి గురువు. జర్నలిజంలో చమత్కారం ఏమిటంటే గురువులతో స్నేహం చేయవచ్చు.  ఆ క్రమంలో నేనే కాదు, ఆయనతో పనిచేసేవాళ్ళం అందరం ఆయనకు స్నేహపాత్రులం కాగలిగాం. నేను మరికొంత దగ్గరగా. అప్పటివరకు  శరత్ నవలలు చదివి  బాబు అనే పేరుపై మక్కువ పెంచుకున్నాను. (శరత్ బాబు  ‘భారతి’  నవలలో కథానాయకుడి పేరు అపూర్వబాబు)

ఆఫీసులోని మొదటి అంతస్తులో  గుర్రపునాడా ఆకారంలో ఒక పొడవాటి  బల్ల వుండేది. సబ్ ఎడిటర్లు అందరూ, అందరూ అంటే ఎందరో  అనుకునేరు, ఆరుగురు అంటే ఆరుగురు వుండేవారు. మళ్ళీ అందులో ఒక న్యూస్ ఎడిటర్, వీరభద్రరావు గారు నడి మధ్యలో. ఆయనకు అటూ ఇటూ సబ్ ఎడిటర్లం అందరం పరివేష్టితులమై పనిచేసుకుంటూ వుండేవాళ్ళం.

 

ఆ రోజుల్లో జర్నలిష్టుల జీతాలు మరీ నాసిరకంగా ఉండేవి. ఈ రోజుల్లో మరీ బాగా వున్నాయని కాదు. జీతాలకి, జీవితాలకి పొంతన లేని రోజులు అవి. నెలలో మొదటి వారానికే డబ్బు అవసరాలు వచ్చి పడేవి. ప్యూన్ నాగేశ్వరరావుతో ఒకరికొకరం  చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్కతప్పని అవసరాలు.

అందరిదీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి, దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవారు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్నిమరింత  గట్టిగా నిలిపి వుంచేది. అందరం అదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు. అలా అందరికీ ఉపేంద్రబాబు అనే పెద్దమనిషి, ఏటీఎంలు లేని ఆ రోజుల్లోనే ఏటీఎం మాదిరిగా, పెద్దమనసుతో  అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు చేసేవారు.  అదీ ఆయనతో మొదటి పరిచయం.

లబ్బీపేటలో మా ఇద్దరి ఇళ్ళు కూడా దగ్గరదగ్గరలో ఉండేవి. మా ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే సిలిండరు వెంటనే తెప్పించుకోగల పరపతి ఉద్యోగం ధర్మమా అని వుండేది. కానీ సిలిండర్ ధర ఇరవై మూడు రూపాయలు ఎవరివ్వాలి? ఎవరిస్తారు ఒక్క ఉపేంద్ర బాబు గారు తప్ప. ఆ రోజుల్లో కాల్ గ్యాస్ కనెక్షన్ తేలిగ్గానే దొరికేది. సిలిండర్లు కూడా. కానీ  డబ్బులో.  దానికి ఉపేంద్ర బాబే గతి. అంచేత నిశ్చింతగా వుండేవాళ్ళం. అడగగానే చేబదులు ఇచ్చేవారు. గ్యాస్ కోసం ఎందుకు చింత? ఉపేంద్ర ఉండగా మీ చెంత అని పాడుకునే వాళ్ళం. ఇంటా బయటా కూడా మంచి మనిషి అనిపించుకోవడం మాకష్టం. కానీ ఉపేంద్రబాబు ఆ విషయంలో గొప్ప మినహాయింపు.

జ్యోతిలో నేను ఆయనతో కలిసి పనిచేసింది కేవలం నాలుగున్నర సంవత్సరాలే. తోటి ఉద్యోగులను సాటి మనుషుల మాదిరిగా చూసే మంచితనం ఆయనది. మరికొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి వుంటే మరికొంత మంచితనం నా సొంతం అయ్యేదేమో.

నిన్న రాత్రి 86వ ఏట మరణించిన ఉపేంద్ర బాబు గారికి నా అశ్రునివాళి!

తోకటపా:

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి వర్ధంతి సందర్భంలో, ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం ఒకటి ప్రచురితం అయింది. అది చదివి శ్రీ ఉపేంద్ర నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదే ఇది.  

“ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.





(శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు)


(05-07-2024)

 

 

3, జులై 2024, బుధవారం

నిజంగా తప్పే - భండారు శ్రీనివాసరావు



చిన్నప్పుడు మా వూరికి దగ్గరలో ఓ చిన్న రైలు స్టేషన్ వుండేది.

చిన్నప్పుడు వుండేది, ఇప్పుడు లేదా అంటే నిజంగానే లేదు. ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని ఎత్తేశారు. అదన్నమాట. ఆ స్టేషన్ ని ఆనుకుని ఒక ఎత్తయిన భవనం వుండేది. నిజానికి అది అన్ని వసతులువున్న భవంతి కాదు. రైల్వే వాళ్ళ సిగ్నల్ కేబిన్. అక్కడ పనిచేసేవాళ్ళని మచ్చిక చేసుకుని ఇనుపమెట్ల మీదుగా పైకెక్కి చూసేవాళ్ళం. తుపాకులు వరసగా తిరగేసిపెట్టినట్టు ఇనుప కమ్మీలు ఉండేవి. వాటిని గట్టిగా లాగి పెడితే ఎక్కడో దూరంగా వున్న రైలు పట్టాలు విడిపోవడమో, కలుసుకోవడమో జరిగేది. రైలు వెళ్ళే మార్గాన్ని మార్చడానికి అదో ఏర్పాటు. ఇప్పటికీ అలాగే ఉండవచ్చు. అక్కడ పనిచేసేవాళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తూ ఆ దోవన వెళ్ళే రైళ్ళు, ఒకదానితో మరొకటి డీ కొట్టుకొట్టుకోకుండా, సరయిన ప్లాటుఫారాలమీదికి చేరేలా చూసేవాళ్ళు. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఇక అంతే సంగతులు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో చాలామందిమి రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాము. రైల్వే వాళ్ళు ఇచ్చిన రగ్గులు కప్పుకుని, బెర్తులపై ఎంచక్కా ముడుచుకుని పడుకుని, కింద పట్టాలపై రైలు పరుగెడుతున్న చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటాము. ఏదైనా రైలు స్టేషన్ దగ్గర పడ్డప్పుడు, రైలు వేగంగా ఊగిపోతూ దడదడ లాడుతూ పట్టాలు మారుతున్న చప్పుడు విన్నప్పుడు గుండె కూడా అలాగే దడదడ లాడడం కద్దు. అర్ధరాత్రి వేళ జనం, అలా హాయిగా, వెచ్చగా ఏం భయం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు అంటే అలాటి కేబిన్ లలో పనిచేసే సిబ్బంది తమ నిద్ర మానుకుని పనిచేయడమే కారణం.

పొద్దున్నే లేచి వేడివేడి కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తాం. మనకోసం ఎవరో ఒకరు, డబ్బులకే కావచ్చు, తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, తెలతెలవారుతుండగానే, పాల ప్యాకెట్లు, పత్రికలు తెచ్చి, మన గుమ్మం ముందు వేయడం వల్లనే మనకీ వైభోగం అన్న సంగతి ఆ క్షణంలో గుర్తు రాదు.

ఇలా ఎందరో మహానుభావులు, వారి వారి జీవిక కోసమే కావచ్చు, కానీ వారి సుఖాలను ఒదులుకుని వేరేవాళ్ళు సుఖంగా బతకడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. అదంతా మర్చిపోయి, హాయిగా కాలు మీద కాలు వేసుకుని, ‘ఈ దేశంలో ఎవ్వరూ కష్టపడడం లేదు, నేను తప్ప’ అనే తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం నిజంగా తప్పే కదా!

2, జులై 2024, మంగళవారం

చిట్కా - భండారు శ్రీనివాసరావు



“మీరు ఏదో తీవ్రమైన సమస్యతో బాధ పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్య. తల గోడకేసి కొట్టుకోవాలని అనిపిస్తుంది. ఛీ, ఈ బతుకు బతికేం లాభం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలనే నిర్వేదం కలుగుతుంది. లేదా మీ సమస్యకు కారణమైనవారిపై అకారణ ఆగ్రహం కలుగుతుంది”

ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఇలాంటివి అనుభవైకవేద్యమే.
ఈ స్తితి నుంచి బయట పడడానికి ఓ చిట్కా వుంది.
మీ మనసులో సుళ్ళు తిరిగే ఈ ఆలోచనలు అన్నింటినీ ఒక కాగితం మీద రాసుకోండి. ఆ కాగితాన్ని మీ తలగడ కింద పెట్టుకోండి. ఓ వారం పోయినతర్వాత తీసి చదువుకోండి. మీ పెదవులపై చిరునవ్వు చిందడం తధ్యం.
ఇంత చిన్న సమస్యకోసమా ఆ రాత్రి నిద్ర రాని ఆలోచనలతో సతమతమయ్యాను, ఈ చిన్ని సమస్యకోసమా ఆ రాత్రి తల పగలగొట్టుకుని బాధ పడ్డాను అని మీలో మీరే అనుకుని స్వాంతన పొందడం ఖాయం.

1, జులై 2024, సోమవారం

వున్నంతలో మానవ సేవ – భండారు శ్రీనివాసరావు


నిన్న ఆదివారం (30-6-24) వినుకొండ రైల్వే స్టేషన్ వందలాదిమంది జనంతో కిక్కిరిసిపోయింది. వారెవరూ ప్రయాణీకులు కాదు. ఆ స్టేషన్ లో చిరకాలం పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఓ చిరుద్యోగికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు వారు. ఓ రైల్వేఉద్యోగి, అదీ బుకింగ్ క్లర్క్ స్థాయి నుంచి సూపర్నెంట్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పడానికి ఇంతమంది జనం రావడం ఏమిటి? మేళతాళాల సందడి ఏమిటి?

ఇంతకీ ఎవరితగాడు? ఏమా కధ.  తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్ నలభయ్ ఏళ్ళు వెనక్కి పోవాలి.

స్టేషన్ లో నైట్ డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చాడు. ఇంటికి పోవడానికి రిక్షా కోసం చూసాడు. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ప్రాంగణంలో ఒకే ఒక రిక్షా కనబడింది. వెళ్లి ఎక్కాడు. రిక్షా మనిషి లాగలేక లాగుతున్నట్టు అనిపించింది. ఆరా తీసాడు. రెండు రోజులుగా జ్వరం. రిక్షా లాగకపోతే బతుకు గడవదు. అదొక్కటే ఆధారం. చేతకాకపోయినా బండి బయటకు తీశాడు. విషయం తెలియగానే మనవాడు వెంటనే రిక్షా దిగాడు. రిక్షా మనిషిని వెనక కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ అతడ్ని ఇంటికి చేర్చాడు. జేబులో వున్న డబ్బు లెక్కపెట్టకుండా తీసి అతడి చేతిలో పెట్టాడు. అతడితో చెప్పాడు, మర్నాడు ఉదయం మళ్ళీ వస్తానని, కొద్ది రోజులు రిక్షా తొక్కవద్దని. అంతవరకూ అతడి బాగోగులు తానె చూసుకుంటానని.

అన్నాడే కానీ, తను కూడా ఓ చిరుద్యోగి. ఉద్యోగం అప్పటికి పర్మనెంట్ కాలేదు. చేతికి వచ్చేది చాలా తక్కువ. మరి రిక్షా మనిషికి తోడు పడడం ఎలా. నిద్ర పోకుండా ఆలోచిస్తున్న అతడికి ఓ ఆలోచన స్పురించింది. అలా చేస్తే అందరూ ఏమనుకుంటారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇక అడుగు ముందుకు పడదు అని నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయంలో బాగోగులు కంటే రిక్షా మనిషి బాగోగులు ముఖ్యం అనుకున్నాడు.

అతడి ఇంటికి వెళ్ళాడు. రిక్షా తన చేతిలోకి తీసుకున్నాడు. పగలల్లా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు అతడి చేతిలో పెట్టి  నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇలా వారం రోజులు పగలు రిక్షా తొక్కి,  రాత్రీ ఉద్యోగం చేసీ, రిక్షా మనిషి ఆరోగ్యం కుదుటపడేవరకు శ్రమించాడు. ఈ విషయం మూడో మనిషికి తెలియదు.

తన నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఇలాంటి స్వచ్చంద సేవలు ఎన్నో చేశాడు. సాయం చేసిన తనకూ, సాయం పొందిన వారికీ తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

అందుకే పదవీ విరమణ రోజున అంత జనం. వినుకొండలోని ఆటో రిక్షాల వాళ్ళు అతడ్ని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద ప్రదర్శనగా తీసుకువచ్చారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి, ఉద్యోగ రీత్యా ఎక్కడో దూరంగా ఉన్న వినుకొండను తన స్వస్థలం చేసుకుని, నలుగురికీ తలలో నాలుకలా ఉంటూ, ప్రజాసేవ చేయడానికి పెద్ద పదవులు ఏమీ అక్కర లేదని, వున్నంతలో కూడా  అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చని నిరూపించాడు.

అతడి పేరు చామర్తి భవానీ శంకర్, మేమందరం శ్రీధర్ అని పిలుస్తాము. మాది బాదరాయణ సంబంధం కాదు. శ్రీధర్ ఎవరో కాదు,  స్వయానా మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు గారి బావమరది.


(01-07-2024)

29, జూన్ 2024, శనివారం

‘ఇదేమి సినిమా?‘

 


‘అదేమరి! మీ వయసు వాళ్ళు చూసే సినిమా కాదది.’

‘అవును. ఏమిటో ఆ యుద్ధాలు. ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కాలేదు. అదృష్టం ఏమిటంటే థియేటర్లో రుధిరం పారలేదు, అధునాతన మారణాయుధాల పుణ్యమా అని. ఆ యుద్ధాలు చూసిన తర్వాత సినిమాలో ఒక పాత్రకే కాదు, ఎవ్వరికీ చావు లేదేమో అనిపించింది.

‘ఇంకా

‘ ఒక్కో టిక్కెట్టు నాలుగు వందలు. యాభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి ఉద్యోగంలో మొదటి జీతం రెండువందల యాభయ్. మరి మండదా! ఆరువందల కోట్ల సినిమా అంటున్నారు. వారి డబ్బు బూడిదలో పోసినా, వారికి పన్నీరే దక్కుతోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలా వున్నాయిట భారీ స్థాయిలో  కలెక్షన్లు ఇంటా బయటా కూడా.  హైదరాబాదులో ఏ థియేటర్ లో కూడా మరో సినిమా లేదు, ఇది తప్ప, ఒకే దేశం ఒకే సినిమా లాగా. తీసిన వాళ్ళు సరే,  కానీ నా నాలుగు వందలు బూడిద పాలే కదా!’

‘తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే సినిమాకి ఆ మాత్రం డబ్బు ఖర్చు చేస్తే తప్పేమిటి’

‘’పోరాటాలు, యుద్ధాలు హాలీవుడ్ స్థాయిని మించిన మాట నిజమే. కానీ కధ సంగతి ఏమిటి? రివ్యూలు చదివి, చూసిన వాళ్ళు  కూడా ఏమీ అర్ధం కాలేదు అనేవాళ్ళు బోలెడుమంది.  అలాంటి కళ్ళు చెదిరే సన్నివేశాలు చూడడానికి ఇంగ్లీష్ సినిమాలు ఎలాగు వున్నాయి. అవతార్ లు, స్టార్ వార్స్ చూడలేదా! పైగా ఇందులో లేని యాక్టర్ లేడు అన్నట్టు బిల్డప్. అమితాబ్, ప్రభాస్, బ్రహ్మానందం ఇలా కొందర్ని తప్పిస్తే మేకప్ ముసుగులో ఎవర్నీ గుర్తు పట్టేట్టు లేరు. ఎవరో అంటుంటే వినబడింది, సినిమా మొదట్లో కనబడిన ఒక  పాత్రలో  నటించిన మనిషి రాజేంద్రప్రసాద్ లాగా అనిపించాడు అని. చివరికి, చివర్లో కనపడ్డ కమల్ హసన్ కూడా అంతే. జగన్నాధ రథచక్రాలు అనే డైలాగ్ ని బట్టి కొందరు గుర్తు పట్టారు. ఏదైనా అంటే ఈ చిత్రంలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కనిపించరు అని. ఈ మాత్రం దానికి అంత స్టార్ కాస్ట్ ఎందుకు, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి తప్పిస్తే    

‘అదే చెప్పేది, ఆ డబ్బు ఎవరికి పోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మనవే కదా! ప్రపంచ స్థాయి సినిమా తీసిన వారిని అభినందించాలి కానీ, ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా?

‘నేను చెప్పేది అదే. కోట్లాది డబ్బులు కోట్లాది డబ్బులు గుమ్మరించి ఇలా తీసే  అర్ధం పర్ధం లేని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, మరి కొందరు బడా నిర్మాతలు ఇదే దారి పట్టి, తెలుగు సినిమా ఖర్చును హాలీవుడ్ స్థాయికి పెంచుతారు. సినిమా స్థాయి సంగతి మరచిపోతారు. నిజమే! పెద్ద సినిమా ఒకటి బాగా ఆడితే పరిశ్రమను నమ్ముకుని బతుకు బండి లాగించే వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కానీ అందుకోసం లక్షలాదిమంది ప్రేక్షకులు చెల్లించుకునే మూల్యం మాటలేమిటి? ఇంతంత మొత్తాల్లో  డబ్బులు వాళ్ళూ, వీళ్ళూ తగలేయడం సమంజసమేనా!’

‘ఇక మీకు చెప్పడం నా తరం కాదు. మీ మనుమల్ని అడగండి, సినిమా ఎలావుందని, వాళ్ళు చెబుతారు మీకు సరైన సమాధానం.’  

(29-6-2024)  

 

26, జూన్ 2024, బుధవారం

అయస్కాంతం గా మారిన రాజకీయం - భండారు శ్రీనివాసరావు



రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. కాదు కూడదని మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం అనుకోండి. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేశాం అనుకోండి. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం వుండి కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు, అది ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి  ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన 

‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తను వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు, ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.

ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.

ఆప్తవాక్యం:  నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం  ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు, పదవులు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.
చాలా మంది అలా చేసి చూపిస్తున్నారు కూడా.

24, జూన్ 2024, సోమవారం

ఆధునిక సీతాపహరణం

 

డోర్ బెల్ మోగుతుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఆడమనిషి వెళ్లి తలుపు తీస్తుంది.
‘అమ్మా! ఆకలి. ఏదైనా వుంటే పెట్టండి, మీ పేరు చెప్పుకుని తింటాను’
‘అయితే లోపలకు రా అన్నం పెడతాను’
‘లేదు, మీరే బయటకు రండి’
‘అయితే ఓకే!’
‘హ!హ! నా చేతికి చిక్కావ్. నేనెవర్నో తెలుసా? లంకాధిపతి రావణుడిని’
‘హ!హ! నేను సీతని కాను, వాళ్ళింట్లో పనిమనిషిని’
‘హ!హ! పనిమనిషివా? మరీ మంచిది. సీతను పట్టుకెడితే మండోదరికి కోపం వస్తుంది. పనిమనిషిని తెచ్చానని చెబితే ఎంతో సంతోషిస్తుంది. పాత పనిమనిషి మానేసినప్పటి నుంచి బాగా ఇబ్బందిగా వుంది’
‘హ!హ! నేను సీతను అయితే నా కోసం రాముడు ఒక్కడే వెతుక్కుంటూ నీ వెంట పడతాడు. నన్ను ఎత్తుకెళ్ళావని తెలిసిందంటే హోల్ మొత్తం అపార్ట్ మెంటులోని జనాలందరు వెతకడానికి బయలుదేరతారు, జాగ్రత్త!’
‘అలానా! అయితే వస్తా!’
(నువ్వు హ! హ!! అంటే నేనూ హ! హ!! అంటా)