27, మే 2024, సోమవారం

నెహ్రూ స్మృతిలో



ఈరోజు (మే, 27)భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.
ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.
‘మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.
నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి. 
ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.
నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు) 
నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది. 
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే  అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు' 
ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.
1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం. 
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి. 
దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు. 
నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
చివరిగా ఒక మాట.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.
(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా  వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)


17, మే 2024, శుక్రవారం

గతం గుర్తులు



నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట.
ముఖ్యమంత్రి అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు తన పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ఆయన వెస్పా స్కూటర్ మీద చిక్కడ పల్లి నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి బాగా పొద్దు   పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఇప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్ వి.మురళి ఆ హెడ్డింగు పెట్టారు. అప్పట్లో ఆయన ఆ పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు)

16, మే 2024, గురువారం

ఏకాక్షర పద్యం

వెతుకులాటలో దొరికిన ఆణిముత్యం, ఏకాక్షర పద్యం - భండారు శ్రీనివాసరావు 

  సీతారామాంజనేయ సంవాదం 
నిజానికిది రామాయణంలోని కాదు. 
ఆధ్యాత్మిక రామాయణంలోని సంవాదానికి ఆనంద స్వరూపంగా తానిది రాసానని గ్రంధకర్త పరశురామ పంతుల లింగమూర్తి అను గురుమూర్తిగారే పేర్కొన్నారు. దీనికి రచయిత, వ్యాఖ్యాత, ఆనంద బంధువు ''లింగమూర్తి'' గురుమూర్తిగారే.  తదనంతరం కాలంలో వజ్ఘల నారాయణ శాస్త్రులుగారు, శ్రీ పరశురామ పంతులుగారి ఆనందానికి, బ్రహ్మానందంగా తమ వ్యాఖ్యానం జతచేసి భక్తులకు అందించారు.
రచయిత ఈ గ్రంధంలో కొన్ని సాహిత్యపరమైన చమక్కులు చేసారు. ద్వితీయాశ్వాసము 350 వ పుటలో ఒక కంద పద్యం వుంది. సంవాదంలో భాగంగా సీతమ్మ వారు ఆంజనేయునితో ఇలా అంటారు. ఈ కందం ఏకాక్షర పద్యం. కేవలం ‘న’ అనే అక్షరంతో ఈ పద్యం నడక సాగుతుంది.

 “నన్నన్నను నిన్నన్నను నిన్నేనని నేనన, నిను నేనెన్నను, నిన్నెన్నను, నిన్నే నన్నెన్నను, నిన్నే నన్నెన్నన్నా  నన్నేనను, నిను  నేనననన్నా " 

గతంలో ఆంధ్రసారస్వత పరిషత్ (ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్) వారు   ఈ గొప్ప రచయిత లింగమూర్తి అను గురుమూర్తి  జీవితమూ – సాహిత్యము పై ఒక గ్రంధాన్ని ప్రచురించారు. ఆచార్య దివాకర్ల వెంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి ఈ పుస్తకాన్ని రచించారు. వీరేశలింగ గ్రంధాలయంలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది. ఆన్ లైన్ లో కూడా లభ్యం అని కొందరు చెప్పగా విన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు తమ నవ జీవన వేదంలో కూడా ఈ రచయిత ప్రస్తావన చేసారు.
ఇంతకీ ఈ ఏకాక్షర పద్యం భావం యేమిటంటారా?
గరికపాటి గారి వంటి ఉద్దండ పండితులే చెప్పాలి.

విలేకరిగా జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు



1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా, నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే నీలం రంగు ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్ లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. పేరులోనే కాకుండా వేషభాషల్లో కూడా ఆయన ఆదిరాజే. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం విలేకరిగా వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి కనీసం ఎవరని కూడా అడగలేదు. వెలుగుతున్న సిగరెట్ చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ.
 ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి అన్న ట్యాగు లైను ఒకటి.

ఈ చిన్న పోస్టుకు కూడా ఒక చిన్ని తోక టపా వుంది. 
అదేమిటంటే.... 
సచివాలయంలో వార్తా సేకరణ పనులు ముగించుకుని మధ్యాన్నం  సరోవర్ హోటల్ బస్ స్టాప్ వద్ద సిటీ బస్సు ఎక్కి రేడియో స్టేషన్ స్టాపులో దిగిపోవడం నా రోజువారీ కార్యక్రమం. ఒకరోజు అలా బస్సు ఎక్కడానికి వెయిట్  చేస్తున్న సమయంలో నా పక్కన ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. తలపై రూమీ టోపీ (నవాబీ టోపీ) బంద్ గాలా కోటు ధరించిన ఆ ముస్లిం పెద్దమనిషిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎవరా అని పరికించి చూసేటప్పటికి ఆయన ఎక్కాల్సిన బస్సు వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకు వచ్చింది. ఆయన గతంలో రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసారు. పేరు సరిగా గుర్తు లేదు. మీర్ అహ్మద్  ఆలీ ఖాన్ అయి వుండాలి. అంతటి పెద్ద పదవులు నిర్వహించి కూడా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత అలా సామాన్యుడిలా సిటీ బస్సులో వెళ్ళడం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కలలో కూడా ఊహించలేము.

13, మే 2024, సోమవారం

నిమేషకాలంలో పూర్తయిన పౌరధర్మం పాటింపు - భండారు శ్రీనివాసరావు

 


ఈరోజు ఉదయం పోలింగు ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి టీవీలు ఓటర్ల ఉత్సాహం గురించి కధనాలు ప్రారంభించాయి. పోలింగు కేంద్రాల ముందు  బారులు తీరిన ఓటర్లు, కిలోమీటర్ల మేర క్యూలు అంటూ  బుల్లి తెరలపై స్క్రోలింగులు బారులు తీరడం మొదలెట్టాయి. తయారై వెళ్ళబోయేవాడిని కాస్తా వాటిని చూసి  ఆగిపోయాను. మధ్యాన్నం వరకు సేం టు సేం స్క్రోలింగులు. మార్పు లేకుండా, అక్షరం పొల్లుపోకుండా. బయలుదేరడం, మళ్ళీ ఆగిపోవడం. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత,  ఓ వాటర్ బాటిల్ చేత  పట్టుకుని నడకకు ఎక్కువా, ఆటోకి తక్కువా అయిన పోలింగు కేంద్రానికి మధ్యాన్నం మూడు గంటలకి  మా కోడలు, నేనూ  వెళ్ళాము. దారిలో ఇరుపక్కల  దుకాణాలు అన్నీ మూసి వున్నాయి.  పెద్ద క్యూలు ఉంటాయని అనుకుని పొతే, పోలింగు కేంద్రం ఉన్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుంది. ఒక పోలీసు, ఇద్దరు మహిళా సిబ్బంది కనబడ్డారు. మొబైల్ ఉందా అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆ బాటిల్ అక్కడ పెట్టి అల్లా వెళ్ళండి, అన్నారు.  నన్ను చూసిన పోలింగు సిబ్బంది అమ్మయ్య ఎట్టకేలకు ఒకడు వచ్చాడు అని గుసగుసలాడుకున్నట్టు అనిపించింది. తలకిందుల సంతకం ఒకటి చేయించుకుని, ఎడమ చేతి చూపుడు వేలు మీద సిరా మరక అంటించి, పోయి ఓటు వేయండి అన్నారు. పోలింగు ఛాంబరులో పొడవాటి ఈవీఎం లు రెండు కనిపించాయి. ఇంతమంది పోటీలో వుంటే,  ఇదేమిటి ఇక్కడ  పరిస్థితి ఇలా వుంది అనుకున్నా. భారత పౌరుడిగా నా ప్రధమ కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని బయట పడ్డాను. మొత్తం ప్రక్రియ అంతా నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తయింది. ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్టు,  నా ఒక్కడి కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేశారేమో అనే భావన కలిగింది. పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరో కేంద్రంలో ఓటువేసి వచ్చిన మా కోడలు అప్పటికే కారు దగ్గర  నాకోసం ఎదురు చూస్తోంది. అంటే అక్కడ పరిస్థితి కూడా డిటో అన్నమాట.   ఇంటికి వచ్చి టీవీ పెడితే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో వేసిన  అవే స్క్రోలింగులు, అక్షరం పొల్లుపోకుండా,  బారులు తీరిన ఓటర్లు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్న ఓటర్లు అంటూ టీవీలు ఊదరకొడుతున్నాయి. ఎందుకిలా ఓటర్లని నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు.  

తర్వాత గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే, మన ఓటువున్నది సికిందరాబాదు. హైదరాబాదు నగరంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఓటు హక్కు గురించి ఇతరులకి చెప్పేవాళ్ళ శాతం మరీ  ఎక్కువ.  కానీ, ఓటు వేసే వాళ్ళ శాతం మాత్రం  అతి తక్కువ. ఇంకా  నయం. ఈరోజు పగటిపూట ఐ పి ఎల్ మ్యాచ్ లేదు. అందుకే ఈ మాత్రం అయినా.

ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో  ప్రధాన కార్యాలయాలు వుండే ప్రధాన టీవీ చానళ్ళ లోనే ఈ హడావిడి అంతా. ఇదంతా ఏపీ ఎన్నికలు గురించి అనుకోవాలేమో!

ఇతి వార్తాః !

(13-05-2024)           

11, మే 2024, శనివారం

విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి



 
 పేదవాడికి  విద్యాగంధం అంటేలా చూడండి. చదువుతోపాటు అతడిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ ప్రపంచంలో నెగ్గుకు రాగలననే ఆత్మవిశ్వాసం అతగాడిలో ఇనుమడిస్తుంది. సమాజంలో తనకూ ఒక గౌరవప్రదమైన స్థానం లభించిందనే తృప్తినిస్తుంది.  సామాజిక పరమైన ఆత్మన్యూనతను అతడిలో  పోగొడుతుంది. ఇంతమందిలో తానూ ఒకడిననే న్యూనతా భావం సన్నగిల్లి, తనూ అందరివంటివాడిననే  ఆత్మాభిమానం పొటమరిస్తుంది. విద్యవల్ల వినయం ఒకటే కాదు ఆత్మబలం కూడా మనిషిలో పెరుగుతుంది. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసా, ముందు ముందు మంచి సమాజ నిర్మాణానికి చక్కటి, దృఢమైన పునాది వేస్తుంది. ఇది చరిత్ర చెప్పే సత్యం.  
అలాగే వైద్యం. రాను రాను ఇది  సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోంది. ప్రభుత్వంలో ఈ అంశాన్ని పర్యవేక్షించే విభాగాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అంటారు. ప్రజారోగ్యం దెబ్బతింటే వైద్యం అందించే బాధ్యత ఈ విభాగానిది. ఆరోగ్యం బాగా వుంటే వైద్యంతో అవసరమే వుండదు. నిదానం కంటే నివారణ మేలు. తాగే నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముందు అందరికీ పరిశుభ్రమైన మంచి నీరు లభించేలా చూడండి. సగం రోగాలు తగ్గిపోతాయి. అలాగే, సుగరూ, రక్తపు పోటు. పల్లెల్లో నివసించే పేదవారికి ఈ రోగాలు వున్నట్టు కూడా తెలవదు. సుగరు ఒంట్లో వుంటే అది వెయ్యి రోగాల పెట్టు. దాన్ని అదుపులో ఉంచడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. హెచ్చు తగ్గుల్ని బట్టి మందులు మారుస్తూ వుండాలి. అదే విధంగా బ్లడ్ ప్రెషర్. అదుపులో వుంటే సరి. విషమిస్తే పక్షవాతం వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతుంది. దీనికీ క్రమం తప్పని పరీక్షలు అవసరం. తీవ్రతను బట్టి మందులు మారుస్తూ వాడడం మరింత అవసరం. పెద్ద రోగాల  బారిన పడకుండా ఈ చిన్న రోగాలను అదుపులో ఉంచాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు. లేని వాళ్ళకే కాదు, ఉన్నవాళ్ళకి కూడా సుగరు, రక్తపు పోటు పెద్ద సమస్యలే. పరీక్షలు చేయించుకోవడంలో అశ్రద్ధ కొంత, అవకాశాలు లేక కొంత, వెరసి జనాల్లో ఈ వ్యాధులు ఇలవేల్పుల మాదిరిగా తయారయ్యాయి. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ఈ రెండింటినీ అదుపు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
రోగం రొష్టూ లేకపోతె రాళ్ళు తిని హరాయించుకోవచ్చు. రాళ్ళు కొట్టుకుంటూ అయినా బతుకుతెరువు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యవంతమయిన శరీరానికి విద్యతో శోభించే మెదడు కూడా వుంటే ఇక ఆ మనిషికి అడ్డే వుండదు.     
అంచేత ఎన్నిక కాబోయే ప్రభువులూ! ఈ రెంటి మీదా కాస్త దృష్టి మళ్ళించండి.
ధర్మో రక్షిత రక్షితః ! ధర్మాన్ని మీరు కాపాడితే  ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. 
అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తే, మంచి ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన సమాజాన్ని ప్రజలే నిర్మించి ఇస్తారు.
ఇది సత్యం.

8, మే 2024, బుధవారం

అర్ధరాత్రి జ్ఞానోదయం - భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో బ్లాకౌట్ అనే మాట వినపడేది. శత్రుదేశపు యుద్ధవిమానాలు ఆకాశవీధి నుంచి, కింద భూతలంపై తమ  లక్ష్యాలను గుర్తించకుండా ఆ రోజుల్లో అధికారులు, రాత్రివేళల్లో అనేక నగరాల్లో  బ్లాకౌట్ ప్రకటించి ప్రజలచేత స్వచ్చందంగా కరెంటు దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీధి దీపాలు వెలగకుండా చూసేవారు. ఆ యుద్ధసమయంలో ప్రజలనుంచి కూడా స్వచ్చంద సహకారం లభించేది. అత్యవసరంగా దీపాలు వాడాల్సిన పరిస్థితి వస్తే, ఆ వెలుగు బయటకి ప్రసరించకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసేవారు. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పని చేస్తుండేవాడిని. దేశం కోసం కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులని కష్టంగా భావించేవారు. సర్దుకుపోయేవారు.

అందరికీ సుపరిచితం అయిన దివి సీమ తుపానుకు ముందు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో   ఒక తుపాను వచ్చింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ తుపాను సృష్టించిన భీభత్సం కారణంగా వందలాది గ్రామాల్లో రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి  ఇంతగా లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు.

అప్పుడు వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే, వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆ రాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ, కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు, వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. అప్పటికి ఇప్పటిలా జంట రైలు మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి.  రైలు ప్రయాణీకులకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్కచచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  తెలవదు.

నిన్న మళ్ళీ హైదరాబాదులో మేము ఉంటున్న ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలో రాత్రి ఏడుగంటల సమయంలో కరెంటు పోయింది, భీకరంగా కురిసిన వర్షం కారణంగా. కరెంటు పోయినా ఊరు చల్లపడింది అదే పది వేలు అనుకున్నాం. ఇంట్లో ఇన్వర్టర్ కారణంగా చాలాసేపటి వరకు కరెంటు లేదన్న సంగతి తెలియలేదు. పుష్కర కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉన్నామన్న కసితో అది పగ తీర్చుకుని ఉండేదే. ఎందుకో ఏమో తెలియదు, రెండు రోజుల కిందటే మా కోడలు నిషా, ఎర్రటి ఎండలో బయట బాల్కనీలో వున్న ఇన్వర్టర్ లో  కొని తెచ్చిన డిస్టిల్ద్ వాటర్ నింపిన కారణంగా కలిగిన అల్ప సంతోషంతో అది పనిచేసిన ఫలితంగా మేము కొన్ని గంటలు సుఖపడిన మాట వాస్తవం. ఈ లోపున తెలివి తెరిపిన పడి, ఇన్వర్టర్ స్థాయి, స్థోమత గుర్తుకు వచ్చి,  ఉన్న మూడు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి అందరం ముందు హాల్లో చేరి ఒక లైటు, ఒక ఫ్యానుతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాము. ముందు వాకిలి తెరిస్తే చల్లటి గాలి వచ్చింది. దాంతో చంటి పిల్ల మా మనుమరాలు జీవిక భయపడకుండా లైటు ఒక్కటి వుంచి ఫ్యాను ఆపేసాము. రైస్ కుక్కర్  కరెంటుది కావడంతో అటక ఎక్కించిన ప్రేస్తీజ్ కుక్కరే దిక్కయింది. సరే ఏదో విధంగా భోజనాలు అయ్యాయి అనిపించాము. రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారి  వరండాలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. ఇలా జరిగితే కరెంటు త్వరగా వస్తుందని సూతుడు శౌనకాది మునులతో చెప్పినట్టు చిన్నప్పుడు మా వూళ్ళో కరెంటు డిపార్ట్ మెంట్ హెల్పర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, ఎవరి గదుల్లో వాళ్ళం ఇన్వర్టర్ తో నడిచే ఫ్యాన్లు వేసుకుని ధీమాగా పడుకున్నాము. ఓ రెండు గంటలు ఇన్వర్టర్ ముక్కుతూ మూలుగుతూ పనిచేసి సెలవు తీసుకుంది. అప్పటికి కరెంటు లేని జీవితం కొంత అలవాటయి అలాగే పడుకున్నాము. తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో హఠాత్తుగా  కరెంటోదయం అయింది. అదే సమయంలో జ్ఞానోదయం కూడా అయింది.

ఇంట్లో కరెంటు పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ కరెంటు వాళ్ళు ఇల్లు, సంసారాన్ని వదిలి, ఆ నిశీధిలో, వర్షంలో బద్దకించకుండా పనిచేయబట్టే కదా మనకు మూడు గంటలకో , నాలుగు గంటలకో కరెంటు వచ్చింది. ఈ స్పృహ కలగగానే అంతవరకూ వాళ్ళమీద పెంచుకున్న అసహనంతో పాటు, పడ్డ ఇబ్బందులు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.

ముందే చెప్పినట్టు సుఖదుఖాలు సాపేక్షాలు.



(08- 05-2024)