25, డిసెంబర్ 2022, ఆదివారం

కుంభకోణాల భారతం – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 25-12-2022, SUNDAY)

 

దినపత్రిక తెరవగానే  ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, అక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే రాజకీయ ఆరోపణల వార్తలే.

వెనుక ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే రోజుల్లో తమిళనాడులోని కుంభకోణంలో సెటిలయిన, తెలుగు తెలిసిన ఒక పెద్దమనిషి నుంచి ఫోను వచ్చింది.

దేశంలో ఎక్కడ ఏ లాలూచీ జరిగినా, ఆర్ధికపరమైన గందరగోళాలు చోటుచేసుకున్నా, కుంభకోణం’ అంటూ మా వూరు పేరు ఎందుకు చెబుతారు? ఈసారి వార్తల్లో అల్లా చెప్పారంటే కోర్టులో కేసు వేస్తాను సుమా!’ అని సున్నితంగానే కాకుండా, సూటిగా కూడా హెచ్చరించాడు. దరిమిలా, నేను రేడియోలో పనిచేసినంత కాలం మళ్ళీ ఆ పదం వాడలేదు. కేసు వేస్తాడన్న భయం వల్ల కాదు, తన ఊరిపై అతగాడికి

వున్న వల్లమాలిన మమకారంవల్ల పెల్లుబికిన గౌరవంతో. కానీ, పత్రికలలో రాసేటప్పుడు తప్పడం లేదు. పత్రికల్లో ఆ పదం చదవగా తప్పడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఇతివృత్తం కుంభకోణాల మయం కనుక. కుంభకోణం పెద్దమనిషి పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తారని నమ్ముతున్నాను.

ఇంత సువిశాల దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుంది. అన్నీ వెలుగులోకి రావు. కొన్ని వస్తాయి. కానీ అవి జనాలకు పూర్తిగా తెలిసేలోగా చప్పున తెరవెనక్కి తప్పుకుంటాయి. వీటికంటే చిన్న విషయాలు కొన్ని నలుగురి నోళ్ళలో పడి నాలుగు రోజులు జనం నోళ్ళలో నాని పెద్దవవుతాయి. వాటిని గురించి చర్చలు మొదలవుతాయి. వాటి వెనుకనే ఆరోపణలు, వాటిని వెన్నంటి ఖండనలు. వెరసి చిన్న విషయం పెద్దగా రూపు దిద్దుకుంటుంది. ఒక కుంభకోణంగా మారుతుంది. ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి కూడా. కొండొకచో  ప్రభుత్వాలు పడిపోవచ్చు. లేదా ఎన్నికల్లో పాలక

పక్షం ఘోర పరాజయం పాలుకావచ్చు. ఇది మన దేశానికే కాదు, అమెరికా వంటి పెద్ద దేశాలకు కూడా అనుభవమే.

రాఫెల్.

ఇప్పుడు దేశంలో నలుగురి నోళ్ళలో నానుతున్న చిన్న మాట. ఇదొక యుద్ధ విమానం అనే అవగాహన లేని వాళ్ళు కూడా అదొక కుంభకోణం అనే నమ్ముతున్నారు.

అందుకే ఈ వివాదాన్ని తుదికంటా తీసుకువెళ్ళి రాజకీయ ప్రయోజనం పొందాలనేది కాంగ్రెస్ వ్యూహం. తప్పేమీ లేదు. గతంలో ప్రతిపక్షాలు కూడా ఇదే వ్యూహంతో బోఫార్స్ ఆయుధాన్ని వాడుకుని అప్పటి రాజీవ్ గాంధి ప్రభుత్వాన్ని చావుదెబ్బ కొట్టాయి. తేలిగ్గా తేలిపోతుందని మొదట్లో కాంగ్రెస్ భావించిన ఆ బోఫార్స్ యుద్ధ ఫిరంగుల కొనుగోలు వ్యవహారం, చిలికి చిలికి చివరకు కుంభకోణంగా మారి ఆ పార్టీ ఆయువుపట్టునే నిర్వీర్యం చేసింది. బోఫార్స్ చరిత్ర అయితే,  రాఫెల్ వర్తమానం. అంతే తేడా. కాకపొతే బోఫార్స్ మాదిరిగా రాఫెల్  కాంగ్రెస్ కు కలిసి వస్తుందా లేక దూదిపింజలా తేలిపోతుందా అనేదానికి సమాధానం కిందటి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అఖండ విజయం ద్వారా వెల్లడయింది. ప్రజలు పెద్దగా నమ్మలేదని తేలిపోయింది.

మన దేశంలో కుంభకోణాలకు కొదవేమీ లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ ఇవి వెలుగు చూస్తూనే వున్నాయి.

నిన్నటివరకు జనం చెప్పుకున్నది, ఇంకా చెప్పుకుంటోంది లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థాపకుడు విజయ్ మాల్యా వ్యవహారం.

లక్షాధికారుల ఇంట్లో పుట్టి, కోట్లసంపద నడుమ పెరిగి, అత్యంత

సంపన్నులలోఒకడిగా ఎదిగి, ఆ క్రమంలో అందిన చోటల్లా అప్పులు చేసి, ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అని పాడుకుంటూ  విదేశాలకు ఎంచక్కా ఎగిరిపోయిన విజయ్ మాల్యా గతంలోనూ, ఇప్పుడూ కూడా మీడియా వార్తలకు మంచి ముడిసరుకే.

బ్యాంకులకు అక్షరాలా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినట్టు అభియోగాలను ఎదుర్కుంటున్న చిద్విలాస పురుషుడు విజయ్ మాల్యా.

1947 లో దేశానికి స్వాతంత్రం రావడం తరువాయి, ఏకంగా మొదటి అడుగు పడింది జీపుల కుంభకోణంలో. భారత, పాకిస్తాన్ దేశాల నడుమ సంఘర్షణలకు కేంద్రం అయిన కాశ్మీర్ రాష్ట్రంలో సైనికదళాల కదలికలకు అక్కడి ఎగుడు దిగుడు మార్గాలు ప్రతిబంధకంగా ఉండేవి. దానితో అందుకు తగిన మోటారు వాహనాలు(జీపులు) దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పట్లో ప్రధాని నెహ్రూకు బాగా సన్నిహితుడయిన వీకే. కృష్ణమీనన్, బ్రిటన్ లో మన దేశం తరపున హై కమీషనర్ గా పనిచేస్తుండేవారు. ఎక్కడ, ఏ మీట ఎవరు నొక్కారో తెలియదు, చాలా తక్కువ నాణ్యత కలిగిన, నాసిరకం జీపులు దేశంలోకి దిగబడ్డాయి. ఆ జీపుల కుంభకోణాన్ని ఆరాతీయడానికి అనంత శయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక దర్యాప్తు సంఘం

ఏర్పాటయింది. ఇప్పట్లా కాదు కనుక ఆయన త్వరత్వరగా దర్యాప్తు పూర్తిచేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అది ఇంతవరకు వెలుగు చూసిన దాఖలా లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన పేరు కృష్ణమీనన్. దరిమిలా మొత్తం దేశానికే ఆయన రక్షణ మంత్రి అయ్యారు. అదీ కొసమెరుపు.

1949 లోఉత్తరాది రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా వున్న రావు శివ బహదూర్ సింగ్ కేవలం పాతిక వేలు లంచం తీసుకుని ఒక వజ్రాలగని లీజుని, తనకు

తెలిసిన వ్యాపారికి కట్టబెట్టారు. పాతిక వేలు ఎటుపోయాయో తెలియదు కాని, చట్టానికి దొరికిపోయిన మంత్రిగారు మాత్రం మూడేళ్ళు జైలు ఊచలు

లెక్కబెట్టాడు. పాలక పక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు జైలు పాలు కావడం అదే మొదలు.

1951 లో ఎస్ ఏ వెంకట్రామన్ అనే మంత్రి కేంద్రంలో పరిశ్రమల శాఖ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సైకిల్ విడిభాగాలను విదేశాలనుంచి దిగుమతి

చేసుకునేవారు. అలాటి ఒక లైసెన్సును మంత్రి మహోదయులు తనకు తెలిసిన కంపెనీకి గుండు గుత్తగా అప్పగించారు. ఫలితం, ఆరోపణలు, దర్యాప్తులు.

చివరకు అసలు వ్యవహారం బయట పడి ఆయన మూడేళ్ళు జైల్లో గడిపారు.

1956 లో దాల్మియా అనే వ్యాపార వేత్తకు అనేక వ్యాపారాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. దాల్మియా జైన్ ఎయిర్ వేస్ కు ఆయన చైర్మన్. భారత బీమా సంస్థ అనే ప్రైవేటు బీమా సంస్థకు యజమాని. ఏదో డబ్బు అవసరంపడి ఆ సంస్థలో రెండు కోట్ల రూపాయల నిధులు ఆరగించారు. విషయం బయటకు పొక్కడం, విచారణ జరగడం, దాల్మియాను రెండేళ్ళు జైలుకు పంపడం చక చకా జరిగిపోయాయి. ఆ దెబ్బతో దేశంలో బీమా వ్యాపారాన్ని ప్రభుత్వం జాతీయం చేసి చేతులు దులుపుకుంది.

1957 లో కాన్పూరులో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి వుండేవారు. వ్యాపారం అన్నాక డబ్బుల అవసరం తప్పదు. అందులో కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా వున్న టీ.టీ. కృష్ణమాచారి గారికీ, ఈ ముంద్రా గారికీ మంచి స్నేహం. మంత్రిగారు తలచుకుంటే ఎల్.ఐ.సి. (జీవిత బీమా సంస్థ) నుంచి రుణం ఇప్పించడం ఏమంత కష్టం? అందులోను అది ప్రభుత్వ రంగ సంస్థ. టీటీకే కార్యాలయం నుంచి ఫోను వెళ్ళగానే చిటికెలో ముంద్రా గారెకి కావాల్సిన కోటి రూపాయల రుణం మంజూరు అయిపోయింది. కానీ కధ అయిపోలేదు. పైగా కొత్తగా కేసు మొదలయింది. ముంద్రా ఇరవై రెండు నెలలు

జైల్లో వున్నాడు. సిఫారసు చేసిన పాపానికి టీటీ కృష్ణమాచారికి కృష్ణజన్మస్థానానికి వెళ్ళే ప్రమాదం రాలేదు కానీ, మంత్రి పదవికి నీళ్ళు

ఒదులుకోవాల్సివచ్చింది.

1962 లో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆర్ధికపరమయిన నేరాల్లో ఇరుక్కుంటే చక్కటి జీవితాలు కూడా ఎలాటి భయంకరమయిన మలుపులు తిరుగుతాయో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. ఆయన పేరు చూస్తే ఉత్తర భారతం అనిపిస్తుంది కాని, జయంతి ధర్మతేజ అనే ఈ పెద్దమనిషి పదహారణాల తెలుగువాడు. తన సొంత తెలివితేటలతో ఒక సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వున్న

భారత షిప్పింగ్ కార్పొరేషన్ ఆవిర్భావానికి పూర్వం, దేశ నౌకానిర్మాణ రంగం ధర్మతేజ గారి ఆధిపత్యంలోనే వుండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి

ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ధర్మతేజ తెలివితేటలు బాగా ఆకట్టుకున్నాయి. కేవలం రెండు వందల రూపాయల పెట్టుబడితో ఆయన సంస్థ ప్రారంభం అయిందని చెబుతారు. నెహ్రూ పుణ్యమా అని ఇరవై రెండుకోట్ల అప్పు పుట్టింది. ఇకనేం, ఆయన వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. కాలక్రమంలో ధర్మతేజ వ్యాపారంలో అనేక అధర్మ కోణాలు వెలుగు చూసాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని లండన్ లో అరెస్టు చేసి ఆరేళ్లు  జైల్లో ఉంచారు. ఆ పిదప ఆయన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జయంతి ధర్మతేజ మసకబారి కాలగర్భంలో కలిసిపోయాడు.

1964 ప్రాంతంలో అవిభజిత పంజాబు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రతాప్ సింగ్ ఖైరాన్ అనే కాంగ్రెస్ నాయకుడు ఏకచత్రాధిపత్యంగా పాలిస్తుండేవాడు.

ఎదురులేని పాలన అయినా, ఎదురు దెబ్బలు మాత్రం తప్పలేదు. అధికారంతో పాటే సంక్రమించిన అవినీతి తెగులు దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశం అయింది. దాస్ కమీషన్ ఆయనపై అభియోగాలను నిర్ధారించడంతో ఖైరాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

1971 లో నగర్ వాలా కేసు ఒక విచిత్రం. ఢిల్లీలోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న చీఫ్ క్యాషియర్ కి ఓరోజు ఫోన్ వచ్చింది. ‘నేను ప్రధాని

ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను’ అని అవతల నుంచి వినిపించింది. ఇవతల అధికారి భయంతో బిక్కచచ్చిపోయాడు. కానీ, ప్రధాని తనకు ఫోన్ చేయడం ఏమిటని క్షణం కూడా సందేహించలేదు. “నగర్ వాలా అని నా తరపున ఒకతను వస్తాడు. అతడికి వెంటనే అరవై లక్షలు ఇచ్చి పంపేయండి’ అని చెప్పేసి అవతల ఫోన్ కట్టయింది. చెప్పినట్టే రుస్తుం సోరబ్ నగర్ వాలాగారు విచ్చేశారు. ఆ నగర్ వాలాజీ ఒక మాజీ సైనికాధికారి. బ్యాంకు అధికారి అక్షరాలా అరవై లక్షలు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టాడు. అతగాడు లెక్కబెట్టుకోకుండానే దర్జాగా ఆ డబ్బు తీసుకుని అంతకంటే దర్జాగా వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద దుమారంగా, సంచలనంగా మారింది. ప్రధాని పేరు వినరావడంతో దర్యాప్తులు, విచారణలు ముమ్మరంగా సాగాయి. అయితే, కధ మరీ సాగిపోకుండా ఆగిపోయింది, నగర్ వాలా ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.

1974 లో పుదుచ్చేరికి చెందిన కొందరు వ్యాపారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిని కలిసి తమకు దిగుమతి లైసెన్సు ఇవ్వాలని కోరుతూ ఒక మహజరు అందచేసారు. దాన్ని గట్టిగా సిఫారసు చేస్తూ ఇరవై ఒక్కమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసారు. తీరా లైసెన్సులు జారీ చేసిన తరువాత తెలిసినదేమిటంటే ఆ సంతకాలన్నీ ఫోర్జరీవని.

మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అనే కాంగ్రెస్ నాయకుడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంటే అంతులేని అభిమానం. అంచేత ఇందిరా ప్రతిభా

ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థను పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి తెచ్చి అంతులేని విరాళాలు సేకరించి అందులో పెట్టారని ఆయనపై అభియోగాలు

వెల్లువెత్తాయి. ఫలితం ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన.

ఆర్ధిక కుంభకోణాల్లో జనం ఇప్పటికీ మరిచిపోలేనిది హర్షద్ మెహతా షేర్ల భాగోతం. సరళీకరణ ఆర్ధిక విధానాలు ఆరంభదశలో ఉన్నకాలంలో అవకాశాలను అంది పుచ్చుకుని పైకి ఎదిగిన ఈ షేర్ సింగ్ అనతికాలంలోనే అడ్డదార్లలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశాడు. ఇతడి దెబ్బకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చిగురుటాకులా అల్లల్లాడిపోయింది. దాన్ని ఒడ్డున పడెయ్యడానికి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన ధనాన్ని 4,800 కోట్ల మేరకు వాడాల్సివచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితా చేంతాడు అంత అవుతుంది. నకిలీ స్టాంపుల

తెల్గీలు, కృష్ణ యాదవ్ లు, పశువుల దానా లాలూ యాదవ్ లు, షేర్ మార్కెట్లతో

గోలీ ఆటలు ఆడుకున్న చేతన్ పరేఖ్ లు.......ఒకటా, రెండా..... ఎన్నెన్నో

కుంభకోణాలు, ఒకళ్ళా, ఇద్దరా.... ఎందరెందరో మహానుభావులు, తమ వికృత

చేష్టలతో చరిత్రను సృష్టించి చరిత్రలో కలిసిపోయారు.

అయినా నేటి చరిత్ర చూస్తుంటే గత కాలము మేలు అనే అనిపిస్తోంది కదూ.



 

24, డిసెంబర్ 2022, శనివారం

జార, చోర, హంతక శిఖామణి ఛార్లెస్ శోభరాజ్

 


ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్ భావ్నాని ఎవరో తెలుసా అంటే ఉహు అనే జవాబు వస్తుంది.

అదే ఛార్లెస్ శోభరాజ్ అంటే?

1970 ప్రాంతాల్లో ప్రాయంలో ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ ‘తెలియకేం అతడో సీరియల్ కిల్లర్ అనేస్తారు. అంతే కాదు, శోభరాజ్ ఓ గజదొంగ,  మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో గొంతుకోసే రకం అని కూడా అంటారు. కమల్ హసన్ నటించిన ఎర్రగులాబీ సినిమాలో హీరోయిక్ విలన్ మాదిరిగా ఆడవాళ్ళను అనుభవించి కడతేర్చే టైప్ అన్నమాట.  కమల్ ఆ సినిమాలో పెట్టుకున్న టోపీ కూడా ఛార్లెస్ మోడల్ టోపీనే.

1944 లో వియత్నాం లోని సైగాన్ లో జన్మించాడు. తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం దేశస్తురాలు. తర్వాత ఆవిడ భర్తనుంచి విడిపోయి ఓ ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లాడింది. ఈ నేపధ్యంలో పెరిగిన శోభరాజ్ భావి జీవితంలో మంచితనం మచ్చుకు కూడా కానరాని కర్కోటకుడిగా మారాడు. 1963 పారిస్ లో దొంగతనం చేసి పట్టుబడి జైలు ఊచలు లెక్కబెట్టడంతో ఇతడి నేర చరిత్రకు అంకురార్పణ జరిగింది. దానితో జైలు అంటే భయం లేకుండా పోయింది.

 ఆడపిల్లలను కట్టిపడేసే అందాన్ని అడ్డుపెట్టుకుని, తేనె పూసిన కత్తిలా  ఎందరెందరో పర్యాటక అతివలను ఆకట్టుకుని అనంతరం వారిని హతమార్చేవాడు. అందుకే బికినీ కిల్లర్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు.

దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కనీసం ఇరవైమంది పర్యాటకులను  హత్య చేసినట్టు ఇతడిపై అభియోగాలు వున్నాయి. ఒక్క థాయ్ లాండ్ లోనే పద్నాలుగుమందిని హతమార్చాడట. అతడు నేరాలకు పూనుకున్న దేశాలను వేళ్ళమీద లెక్కించడం కష్టం.  ఫ్రాన్స్, గ్రీసు, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, నేపాల్, ఇండియా, థాయ్ లాండ్, మలేసియా మొదలయిన దేశాల్లో ఇతడి నేర సామ్రాజ్యం విస్తరించింది. దొరికినట్టే దొరికి తప్పించుకుని పోయే ఒడుపు తెలిసిన శోభరాజ్ కి సర్పెంట్ (నాగుపాము) అనే మారుపేరు వుంది. ఆ పేరుతో ఎంతటి ప్రాచుర్యం పొందాడు అంటే ది సర్పెంట్ అనే పేరుతొ  బీబీసీలో  (నెట్ ఫ్లిక్స్) ఏకంగా ఒక టీవీ సీరియల్ వచ్చింది. ఇతడి జీవిత కధ ఆధారంగా పుస్తకాలు,  డాక్యుమెంటరీలు, మై ఔర్ ఛార్లెస్ అనే  సినిమా కూడా వచ్చాయి.  

ఇండియన్ పోలీసులకు చిక్కి 1976 నుంచి 1997 వరకు జైల్లో గడిపాడు. తర్వాత పారిస్ కు వెళ్లి 2003 లో నేపాల్ చేరుకున్నాడు. అక్కడ అరెస్టు అయి కోర్టు విచారణ ఎదుర్కుని జీవితకాల  ఖైదు శిక్షకు గురయ్యాడు.  ఇరవై ఏళ్ళ జీవిత ఖైదు శిక్షలో ఇంకా ఒక ఏడాది మిగిలి వుంది అనగా, నేపాల్ సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఒకటో తేదీన, 78 ఏళ్ళ వయసులో  అతడిని విడుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. దరిమిలా అతడిని డిసెంబరు ఇరవై మూడున ఫ్రాన్సుకు తిరిగి పంపారు.

కొసమెరుపు :

ఛార్లెస్ శోభరాజ్ గురించిన ఒక ఆసక్తికర విశేషాన్ని ఇండియా టుడే వంటి ప్రసిద్ధ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసిన  ప్రముఖ పాత్రికేయులు ఎస్. వెంకట నారాయణ గారు తెలియచేసారు.  ఆయన మాటల్లోనే సంక్షిప్తంగా:

“ఇది జరిగి రెండు దశాబ్దాలకు పై మాటే. అరెస్టు చేసిన ఛార్లెస్ ని పోలీసులు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు తీసుకువచ్చారు.  ఎవరినో కలవడానికి వెళ్ళిన నాకు అక్కడ  ఛార్లెస్ తారసపడ్డాడు. ఇంటర్వ్యూ అడిగాను. వెంటనే ఒప్పుకున్నాడు కానీ, కొన్ని షరతులు పెట్టాడు. నేను అడిగే ప్రశ్నలను లిఖితపూర్వకంగా  ఆయన న్యాయవాదికి ఇవ్వాలి. వాటికి జవాబులు రాసి తన లాయర్ కి ఇస్తాడు. అదీ ఒప్పందం.

“ఆ ఇంటర్వ్యూ  అనేక జాతీయ పత్రికల్లో వచ్చింది. దాని తెలుగు అనువాదాన్ని స్వాతి తెలుగు వారపత్రికలో కూడా విపులంగా ప్రచురించారు. తర్వాత ఓ నెల రోజులకి నేను మళ్ళీ ఛార్లెస్ ని కలిసాను. నన్ను చూడగానే థాంక్స్ నారాయణ గారూ అన్నాడు. నాకు అర్ధం కాలేదు. అదే అడిగాను.

“స్వాతి తెలుగు వార పత్రికలో నాతో  మీరు చేసిన ఇంటర్వ్యూ చదివి నన్ను పెళ్ళాడాలని వుందని ఆ తెలుగు రాష్ట్రం నుంచి వంద ఉత్తరాలు వచ్చాయి. ఒక్కసారి నేను జైలు నుంచి బయట పడనివ్వండి. వాళ్ళలో ఒకరిని పెళ్ళాడుతాను. భారతీయ పౌరసత్వం తీసుకుంటాను.  ఈ దేశంలో హాయిగా శేష జీవితం గడుపుతాను

“ఇదీ ఛార్లెస్ సమాధానం. నేను నవ్వి గుడ్ లక్ చెప్పేసి వచ్చేశాను.

“అదే ఆఖరిసారి నేను ఛార్లెస్ శోభరాజ్ ని చూడడం.  తర్వాత అతడ్ని నేపాల్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పత్రికల్లో చదివాను.  ఛార్లెస్ ని పెళ్ళాడుతామని ఉత్తరాలు రాసిన యువతులు, ఈ పాటికి  పెళ్ళిళ్ళు చేసుకుని, అమ్మలై, బామ్మలై హాయిగా జీవితాలు గడుపుతూ వుంటారు.

“అలాంటి వాళ్ళలో ఎవరైనా తటస్థపడితే ఒక ప్రశ్న అడగాలని వుంది. ‘ ఇప్పుడు ఛార్లెస్ విడుదల అయ్యాడు. మరి ఛార్లెస్ గురించి ఏమనుకుంటున్నారు?’ (పెళ్ళాడే ఉద్దేశం అలాగే వుందా? మారిపోయిందా?)

ముగించారు నారాయణగారు.

కింది ఫోటో:

జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెడుతున్న ఛార్లెస్ శోభరాజు



(24-12-2022)

22, డిసెంబర్ 2022, గురువారం

నా గురించి నేను – భండారు శ్రీనివాసరావు



మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు...
నా గురించి నేను అని మొదలు పెట్టి మళ్ళీ ఇదేమిటి అనుకోనక్కర లేదు. మా భండారు వారింట ఆయన ప్రసక్తి లేకుండా చెప్పుకోవడానికి ఏమీ వుండదు.

ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) చీఫ్ పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.

సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింట రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు.

అప్పుడు ఆయన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఉన్నతాధికారి. ఆయన దగ్గరకు వచ్చేది బడా నిర్మాతలు. ఎవరిని చేబదులు అడిగినా ఇంటికి తీసుకువచ్చి చేతిలో పెట్టేవారు. కానీ అలాంటి మనిషే అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఏముంటుంది?

‘అరకొర పెన్షన్ డబ్బులతో ఈ హైదరాబాదులో జీవనం కష్టం అనుకుని పుట్టపర్తి వెళ్లి ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నారు. ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేయడం కొనసాగించారు.

2006వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం

తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.

కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.
‘మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.

గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.

మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.

ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.
సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.

కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది.

కింది ఫోటో: అలనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ కు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు (ఎన్టీఆర్ కి కుడి వైపు కూర్చున్న వ్యక్తి)